సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, ఆగస్టు 2010, మంగళవారం

ఏళ్ళు గడిచినా వెంటాడుతున్న ‘చందమామ’ పాట!

బ్లాగులో ‘చందమామ’ అని  ప్రస్తావిస్తే ‘చందమామ పత్రిక’ గురించి రాస్తున్నానని చాలామంది నిర్ధారణకు వచ్చేస్తారని ఓ అనుమానం. అందుకే ఈ పాట   టపా  రాయాలని ఎప్పట్నుంచో అనుకుంటూ కూడా జాప్యం చేసేశాను!

 నా చిన్నప్పుడు ఎప్పుడు మొదటిసారి విన్నానో గానీ, ‘చక్కనయ్యా చందమామా’పాట నా మనసుకు  పట్టేసింది. బాల్యంతో పెనవేసుకున్న పాటలు స్మృతి పథంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి కదా!

‘భార్యాబిడ్డలు’ లోని ఆ పాట సన్నివేశం నాకు చాలా సంవత్సరాల దాకా తెలియదు. కానీ  గాఢమైన వేదన, అపరిమితమైన దు:ఖం నాకు ఆ పాట బాణీలో, పాడిన తీరులో  స్ఫురించాయి.

దీంతో  నాకు తోచిన సందర్భమేదో ఊహించుకున్నాను.


ఆత్మీయులైన వ్యక్తి ఎవరో  దూరమై (చనిపోయారనే నా ఉద్దేశం) తల్లడిల్లుతూ తీరని పరివేదనతో పాడుకున్న పాట అని భావించాను. వాళ్ళ స్థానంలో నన్ను ఊహించుకుని, ఆ శోకాన్ని పంచుకున్నాను. అలా ఆ పాట మీద అనుకోకుండానే  బంధం పెంచుకున్నాను.

అప్పట్లో సినిమా పాటలు వినాలంటే రేడియోనే కదా ఆధారం! వివిధ భారతిలోనో, విజయవాడ  ఆకాశవాణి కేంద్రంలోనో   అనౌన్సర్  ‘.. చిత్రం పేరు ‘భార్యా..’ అని చెప్పగానే ‘భార్యాబిడ్డలు’ ఏమో, నా కిష్టమైన ఈ పాట వస్తుందేమోనని ఆత్రుతగా ఎదురుచూసేవాణ్ణి.

కానీ 90 శాతం ఆ సినిమా ‘భార్యాభర్తలు’  అయ్యేది. ‘జోరుగా హుషారుగా’ అంటూ సరదా పాట మొదలై, విషాదగీతం కోసం ఆత్రంగా ఎదురుచూసే  నాకు తగని నిరుత్సాహం కలిగేది. :) 

టీవీలు వచ్చాక, ఆ పాట సన్నివేశం చూశాను. సినిమాలోని సందర్భమూ, నేను ఊహించుకున్నదీ  వేర్వేరు  అని అర్థమైంది. చిన్నపిల్లలు తండ్రి ఆచూకీ కోసం వెతుకుతూ  చేసే  ఈ గానం హృదయాన్ని కదిలిస్తుంది. ‘ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో ..’ అనే వాక్యం ప్రేక్షకుల కోసం అనిపిస్తుంది. ఆ భావం పిల్లల స్థాయిలో లేదేమో అనుకుంటాను.          

ఈ పాటలో సుశీల గొంతులో కంటే వసంత స్వరంలో నాకు విషాదం చాలా కనపడుతుంది. ఆత్రేయ రాసిన ఈ పాటకు  కె.వి.మహదేవన్ స్వరాలు కూర్చారు.

‘నీవు లేక’ తర్వాత ‘దిక్కులేని’ అని ఉంటుంది కదా! కానీ నేనైతే  ‘దిక్కు లేక’ అని అప్రయత్నంగా పాడేసుకునే వాణ్ని. తర్వాత నా పొరపాటు  గమనించి సరిచేసుకున్నా.


పాట ఇక్కడ వినండి...

     Get this widget |     Track details  |         eSnips Social DNA   



చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీ  ఒడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయామూ.. గొల్లుమన్నాము   /చక్క/

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ                                                      /చక్క/

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో ..                                                        /చక్క/
 

                                  ****

పాట  పల్లవిలోని విషాదం ‘చందమామ పత్రిక’ను తల్చుకున్పపుడు కూడా వర్తిస్తుందనిపిస్తోంది. అలనాటి పత్రికను తల్చుకుంటూ ‘చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ’ అనుకోవాల్సిందే!

‘చందమామ’ పూర్వవైభవం దశాబ్దాల క్రితమే కోల్పోయినప్పటికీ  ఈ మధ్య వస్తున్న  సంచికలు మరీ నిరాశను కల్గిస్తున్నాయి.

అసలు ప్రచురణ కేంద్రమే చెన్నై నుంచి ముంబాయి కి మారిపోయింది... తెలుగు నేల నుంచి మరింత దూరంగా!

ఫొటో వ్యాఖ్యల పోటీ పేజీని తీసెయ్యటంతో అసందర్భంగా, హఠాత్తుగా సంచికకు  ముగింపు వచ్చేసినట్టు అనిపిస్తోంది. అసలు బేతాళ కథ చివర (కల్పితం) అని లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి? ఆ మాట తీసేశారు.

వ.పా. ముఖచిత్రంతో తాజా సంచిక

చిత్రా, శంకర్ ల పేజీ నిడివి  బొమ్మలు ఇవే ( ‘చందమామ’ సౌజన్యంతో)
తాజా సంచికలో వ.పా. ముఖచిత్రం, లోపల చిత్రా, శంకర్ ల బొమ్మలు చూసి తృప్తిపడాల్సివస్తోంది.

అయితే- నాకు నచ్చిన ఒకే మార్పు.. పేజీ నిడివి పెద్ద బొమ్మలను పునరుద్ధరించటం. వాటిని చూస్తుంటే ఎంతో  సంతోషంగా ఉంటుంది!


                                   ****



నేటి ‘ఈనాడు’ పత్రిక చూశారా?  ఈ వార్త చదవండి!




పౌర్ణమి అయినప్పటికీ  ‘చిన్నబోయి’ కనపడబోతున్నాడట...  చంద్రుడు ఈ రాత్రి!

కాకతాళీయమైనప్పటికీ ఈ టపాలో అంశానికీ,  దీనికీ సారూప్యం కనపడింది! :)

5, ఆగస్టు 2010, గురువారం

రంగనాయకమ్మ గారు మాట తప్పారు!

శ్చర్యంగా ఉంది కదూ? నిజమే!

ఎందరో పాఠకులు ఏళ్ళ తరబడి ఎంక్వయిరీలు చేస్తూ చదవాలని ఎదురుచూస్తున్న నవల.. ‘కృష్ణవేణి’  కొత్త ముద్రణ 38 ఏళ్ళ తర్వాత   ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది!

మాట తప్పటం ఏమిటంటారా?

ఈ నవల ప్రచురణ నిలిపివేసి, ‘కృష్ణవేణి ఇక రాదు’ అని గతంలో ఆమె  ప్రకటించిన సంగతి చాలామందికి తెలుసు!

‘‘కృప్ణవేణి నవల మళ్ళీ చదివితే, దాన్ని మళ్ళీ, మళ్ళీ ప్రచురించవలసిన  అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చాను. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ- ఇదే అందులో కథా వస్తువు అయినా, ఆ వస్తువును చిత్రించడంలో, అందులో చాలా పొరపాట్లు జరిగాయి. చాలా తప్పు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

.. పాఠకులకు ఉపయోగకరంగా లేని రచనని ప్రచురించకుండా ఉండటమే చాలా న్యాయం. ఈసారి ‘కృష్ణవేణి’ చదివి, దాని ప్రచురణ ఆపాలనే అభిప్రాయానికి వచ్చాను.’’
‘కృష్ణవేణి’ రచనా కాలం నాటి రచయిత్రి ఫొటో

ఇలా ఆమె 1982లో ‘స్వీట్ హోమ్’ నవల ముందుమాటలో రాసిన దగ్గర్నుంచీ పాఠకుల అసంతృప్తులు మొదలయ్యాయి. ‘ఇదేం పని’ అంటూ పాఠకులు వాళ్ళ కోణంలో ఇన్నేళ్ళుగా ఆమెను అడుగుతూనే ఉన్నారు.  

‘ప్రభ’లో సీరియల్ వచ్చిన కాలంలో నేను పుట్టనే లేదు. 16 ఏళ్ళు వచ్చేవరకూ  ఆమె పుస్తకాలతో పరిచయం లేదు. ఈలోగా  ‘కృష్ణవేణి’ ప్రచురణ ఆపేశారు. అలా ఆ పుస్తకం మిస్సయ్యాను. కానీ, ఆ పుస్తకంలో ఏం ఉందో చదవాలని ఉత్సుకత. ఎలా?  మొత్తానికి విజయవాడ లెనిన్ సెంటర్లోని పాత పుస్తకాల షాపులోనే ఈ నవల సంపాదించి, చదివేశాను.

కానీ, ఎక్కడెక్కడో  ఉన్న  మిగతా పాఠకుల సంగతి?  ‘కొత్త ముందుమాటలు’ రాసి అయినా సరే, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయమని వాళ్ళు తరచూ అడగటం మానలేదు.  ఇక పుస్తకాల ఎగ్జిబిషన్లలో అయితే, ప్రతి సంవత్సరం కొందరు పాఠకులైనా ‘కృష్ణవేణి’ నవల గురించి ఎంక్వయిరీ చేయకుండా  ఉండరు.

అయినా సరే, రంగనాయకమ్మ గారు  తన చెప్పిన మాట మీదే నిలబడ్డారు...ఇన్నేళ్ళూ!

చివరికి-  38 సంవత్సరాల  తర్వాత.. పాఠకుల వాదనే, వారి  అభీష్టమే నెగ్గింది! ‘కృష్ణవేణి’ పునర్ముద్రణకు సమ్మతించారామె.

అందుకే ... ‘మాట తప్పాను’  అని తాజా పుస్తకం కవర్ పేజీ పైనే ప్రకటించారు.

‘‘.. కానీ  ఇప్పుడు  ఇందులో (తాజా ముద్రణలో ) అనేక విమర్శలు చేర్చాను కాబట్టి, దీనివల్ల పాఠకులకు మేలే గానీ హాని లేదు. ఈ కథలో, పరిశీలించి నేర్చుకోవలసిన విషయాలు, చాలా ఉన్నాయి. ఆ అవసరం కోసమే నా మాట తప్పాను’’  అని ముందుమాటలో వివరించారామె.


1964లో వచ్చిన ఎడిషన్  ముఖచిత్రం


తొలి నవల ఇదే!

రంగనాయకమ్మ గారు రాసిన తొలి నవల ‘కృష్ణవేణి’. పందొమ్మిది ఏళ్ళ వయసులో 1959లో ఆమె ఈ నవల   రాశారు. 1960లో  ఆంధ్రప్రభ వారపత్రికలో ఇది సీరియల్ గా వచ్చినపుడు ఎంతో ఆదరణ పొందింది. వారం వారం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసి మరీ  చదివారు.







ఇది 1974 నాటి ముఖచిత్రం


1979లో వచ్చిన ఎడిషన్   ముఖచిత్రం

  
  ‘కృష్ణవేణి నవల ప్రచురితమవుతున్న రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థులు పత్రిక కాపీల కోసం వాల్తేరు స్టేషన్ కి పరుగెత్తేవార’ని  పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఓచోట రాశారు.

1961లో ఈ నవల తొలిసారి  పుస్తకంగా వచ్చింది. తర్వాత ఆపేసేవరకూ రెండు మూడేళ్ళ కోసారి పునర్ముద్రణ అవుతూ వచ్చింది.

‘‘ఈ కథ అంటే నాకు మొదటి నించీ ఇష్టమూ, భయమూ కూడా’’ అన్న రంగనాయకమ్మ గారే  ‘‘.. ఈ పుస్తకం అంటే ఇప్పుడు భయం తగ్గింది’’  అని కూడా  అంటున్నారు.

ఎందుకంటే...

నేనెందుకులెండి  చెప్పటం! పుస్తకం చదివేటప్పుడు మీకెటూ  తెలుస్తుందిగా!:)

ఈ  నవలను ఈ-బుక్ గా కినిగెలో చదవాలంటే...  లింకు-
 http://kinige.com/kbook.php?id=933&name=Krishnaveni

తాజా కలం: (30.8.10) 
ఈ నవల గురించి నిన్నటి ఈనాడు ఆదివారం మ్యాగజీన్లో సమీక్ష వచ్చింది. చూడండి...