సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?



‘భారతదేశంలో  రామాయణాన్ని గానీ, మహాభారతాన్ని గానీ  తొలిసారే ఎవరూ చదవరు’ అంటారు సాహితీవేత్త ఏకే రామానుజన్. (మొదటిసారి చదవటానికి ముందే ఆ కథలు తెలిసివుంటాయని అర్థం.) .

ముఖ్యంగా మహాభారత కథను  తొలిసారే ఎవరూ చదవరు కానీ, తర్వాతయినా చాలామంది అరకొరగానే  చదువుతారనీ, మూలగ్రంథంలో ఏముందో పట్టించుకునేవారు చాలా తక్కువమంది అనీ ఈ వ్యాఖ్యను పొడిగించవచ్చు. 

వినికిడి పరిజ్ఞానంతోనో, కళారూపాలు చూడటం వల్లనో మాత్రమే ఎక్కువమందికి భారత కథ తెలిసివుంటుంది.. 

నాకైతే  భారత కథ కొంచెం వివరంగా  ‘చందమామ’ మాసపత్రిక ద్వారానే తెలిసింది. ముఖ్యంగా మహా ప్రస్థాన,  స్వర్గారోహణ ఘట్టాలను అంతకుముందెప్పుడూ వినలేదు.  చందమామలో 1952-64 సంవత్సరాల్లో  మొదటి వెర్షన్;  1969-74 సంవత్సరాల్లో రెండో వెర్షన్ సీరియల్ గా వచ్చాయి. 


 చందమామలో నేను చదివిన మహాభారతం (రెండో వెర్షన్) ఆరంభ సంచికలోని పేజీ  ఇది.   పాఠకులను ఆకట్టుకునేలా  ఈ సీరియల్ ని  రాసింది  కొడవటిగంటి కుటుంబరావు గారు.

నలబై సంవత్సరాల క్రితం  ‘రామాయణ విషవృక్షా’న్ని సమీక్షిస్తూ ఆయన సమాజ పరిశీలనకు రామాయణం పనికి రాదు కానీ, భారతం పనికివస్తుందన్నారు.

ఆ పరిశీలన ఆయన చేయలేదు కానీ, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ  అది రంగనాయకమ్మ గారి ద్వారానే జరిగింది ....  ‘ఇదండీ మహా భారతం’ ద్వారా!  ఈ పుస్తకం మహాభారత క్లుప్త పరిచయమైనప్పటికీ ఆ రచనాకాలపు సమాజ పరిశీలన కూడా దీనిలో ఉంది.  



ఈ పుస్తకం 2014 డిసెంబర్లో  విడుదలైనపుడు నేనో  పోస్టు రాశాను. అది ప్రివ్యూ లాంటి ‘కర్టెన్ రైజర్’మాత్రమే. ( ఆ  పోస్టుతో పాటు ఈ బ్లాగులో  ఇచ్చిన పాండవుల మహాప్రస్థాన చిత్రాన్ని ‘ఇదండీ మహా భారతం’ రెండో ముద్రణలో వెనక అట్ట మీద ఉపయోగించారు!) 

మరిప్పుడు ఈ  తాజా పోస్టు  ఏమిటి?  నా పఠనానుభవం  జోడించి రాస్తున్న  టపా ఇది!

మహా భారతానికి  పరిచయం

మహాభారతంపై  తరతరాలుగా పొగడ్తలు కురుస్తూనే ఉన్నాయి.  కానీ దీనికి భిన్నంగా ఆ గ్రంథంలో అసలేముందో చెప్పే పుస్తకం ‘ఇదండీ మహా భారతం’.  కథను చెపుతూనే బ్రాకెట్లలో రచయిత్రి  సందర్భాన్ని బట్టి  కటువుగానే  విమర్శలు చేశారు.  ఈ గ్రంథ సంగ్రహార్థాన్నీ, పరమార్థాన్నీ చర్చించారు.

‘ఆమె వ్యాఖ్యానాల్లో న్యాయం ఉందా, లేదా?’   అనేది  చదివేవారు గమనించాలి. 

కానీ- ఈ పుస్తకంలో ఏం రాశారో  చదవకుండానే ‘ఇది భారతాన్ని వక్రీకరించిన రచన’ అనేస్తున్నారు కొందరు,  టీవీ కార్యక్రమాల్లో!  ( ఎక్కడ వక్రీకరించారో నిర్దిష్టంగా  చెప్పగలగాలి. అదేమీ లేకుండా ఇలాంటి  ఆరోపణలు చేస్తే  ఆ  మాటలకు విలువ  ఏమీ ఉండదు).    

ఈ పుస్తకం గురించి  రంగనాయకమ్మ గారి  ఇంటర్ వ్యూ  ఫిబ్రవరి 15న మొదట టీవీ నైన్ లో  ప్రసారమైంది.  ఈ పుస్తకాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు వ్యాఖ్యలతో కలిపి మర్నాడు మరో కార్యక్రమం వచ్చింది.

తర్వాత ఎన్ టీవీలో  ఫిబ్రవరి 17న మరో ఇంటర్ వ్యూ వచ్చింది.

దీంట్లోంచి తీసిన రెండు నిమిషాల భాగాన్ని ఇక్కడ చూడొచ్చు. 



‘‘అట్టను చూస్తే  కోపమొస్తుందేమో.  లోపలికి వెళ్ళండి. న్యాయం లేకుండా, చర్చ లేకుండా,  పరిశీలించకుండా కోప్పడితే  అది తప్పవుతుంది కదా?’’  అంటున్నారు రచయిత్రి.

 * * *

పుస్తకం  మొదటి ముద్రణ (డిసెంబరు 2014) ప్రతులు 1500 విడుదలైన కొద్దిరోజుల్లోనే  అయిపోయాయి.

రెండో ముద్రణ (జనవరి 2015) ప్రతులు 2,000  కూడా ఇంకా వేగంగా  దాదాపు  అమ్ముడయ్యాయి.

మూడో ముద్రణ ప్రతులు కొద్దిరోజుల్లో మార్కెట్లోకి వస్తున్నాయి.
kinige లో విడుదలైన దగ్గర్నుంచీ  టాప్ టెన్ పుస్తకాల జాబితాలోనే  ఉంటూ వస్తోంది ఈ-బుక్! 

తక్కువ ధరకు  ఇవ్వటం వల్లా,  ‘చర్చనీయాంశం’ అవటం వల్లా పుస్తకాల విక్రయాలు కొంత పెరిగివుండొచ్చు. కానీ పుస్తకంలో  ‘విషయం’ లేకుండా ఇంత ఆదరణ సాధ్యం కాదు.  

తర్కాన్నీ, చర్చనూ, విమర్శనూ  స్వాగతించే పాఠకులు ఎక్కువ సంఖ్యలోనే  ఉన్నారనటానికి  ఇది నిదర్శనం.

 * * *

చిన్నప్పటినుంచీ  మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం!

నేలమీద  ద్రౌపదీ,  తమ్ముళ్ళూ పడిపోయి ప్రాణాలు కోల్పోయినా  వారిని  చూడకుండా...  అసలేమాత్రం పట్టించుకోకుండా-  వెంట నడిచే  కుక్కతో పాటు ధర్మరాజు ముందుకు సాగిపోతున్న దృశ్యం...  వ.పా. చిత్రం

చందమామలో...  శంకర్,  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య గార్ల అద్భుతమైన వర్ణ చిత్రాలు చూస్తూ ఆ కథను చదవటం -

రేడియోలో... ఉషశ్రీ గారి గంభీరగళంతో  భారత యుద్ధఘట్టాలను వినటం - 


తెలుగు పౌరాణిక సినిమాల్లో...  మహాభారత సన్నివేశాలను  చూడటం - 

ఇవన్నీ సంతోషకర అనుభవాలే !

ఆ కథలోని ఆసక్తికరమైన మలుపుల వల్లా, వీర-రౌద్ర- భయానక- బీభత్స- అద్భుత రసాలతో కూడిన ఘట్టాల వల్లా ఈ గ్రంథాన్ని అంతగా ఇష్టపడ్డానని అనిపిస్తోంది.

అయితే ఇన్నేళ్ళుగా మూల గ్రంథాన్ని (కనీసం సంగ్రహ వచన అనువాదాన్ని అయినా)  మాత్రం చదవటానికి ప్రయత్నించలేదు.
  
వ్యాస మహర్షి   సంస్కృతంలో రాసిన మహా భారతం  క్రీస్తుపూర్వం నాటి రచన.   క్రీ.శ. 11-14 శతాబ్దాల మధ్య ఇది  పద్య కావ్యంగా తెలుగులోకి వచ్చింది. కవిత్రయం రాసిన ఈ ‘శ్రీ మదాంధ్ర మహాభారతము’ సంక్షేపించిన (కుదించిన) రచన. కానీ వారు  ఏ ఘట్టాన్నీ అనువదించకుండా  వదిలెయ్యలేదు. 

అయితే...  తెలుగులో - ఆ మాటకొస్తే హిందీలో కూడా  ప్రతిపదార్థ- తాత్పర్యాలతో యథాతథ అనువాదం ఇన్ని వందల- వేల సంవత్సరాల తర్వాత కూడా వెలువడలేదంటే ఎంతో ఆశ్చర్యం!  

‘ఇదండీ మహా భారతం’ చదవటం  నాకు మూడు రకాలుగా ఉపయోగపడింది.
1)  మహా భారత మూలంలోని కథాంశం మొత్తాన్నీ (సంగ్రహంగా)  చదవగలిగాను. 
2)  చాలా పాత్రలపై అప్పటివరకూ ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి.
3)  ఈ ఇతిహాస సారంపైనా, దాని లక్ష్యంపైనా స్పష్టత వచ్చింది.

హాస్య వ్యంగ్యాలతో  చురకలు

రంగనాయకమ్మ గారి ఏ రచనలోనైనా హాస్య వ్యంగ్యాలు బోనస్. ‘ఇదండీ మహాభారతం’చదువుతుంటే అక్కడక్కడా  వేసే చురకలు చిరునవ్వులు పూయిస్తాయి.   

‘‘కొడుకులే కావాలి. వందమంది, వెయ్యిమంది, కొడుకులే, కొడుకులే కావాలి’’- కానీ,  ఆ కొడుకులందరికీ పెద్దయ్యాక సానులు కావాలి.

‘గొడుగు దానం చేస్తే  సంతానవంతులవుతారు’- (ఏ రంగు గొడుక్కి , ఏ సంతానం?)

ఆదిపర్వంలో- హిడింబుడు చెల్లెలి మీద అరిచినపుడు ఆమె భీముడి వెనకాల నక్కిన సందర్భంలో- రాక్షసుల్లో కూడా మగవాళ్ళ పెత్తనాలే అన్నమాట!

కొన్ని వ్యాఖ్యలు చదువుతుంటే మనం అసలు ఊహించని కోణంలో వ్యాఖ్య దూసుకొస్తుంది.

అరణ్యపర్వంలో- ద్వైత వనంలో ధర్మరాజు ‘భూదేవి లాగ క్షమాగుణం గలవాడికి ఎప్పుడూ జయమే కలుగుతుంది’ అంటాడు. నిజమే కదా? అనిపిస్తుంది. కనీసం అక్కడ ఆక్షేపించదగ్గది ఏదీ  తోచదు. కానీ  రంగనాయకమ్మ గారు ఇక్కడ చేసిన వ్యాఖ్య చూడండి ...

 ‘భూదేవికేం క్షమ ఉంది? జన నాశనం చేసి, బరువు తగ్గించమని కోరింది కదా? అదేనా భూదేవి క్షమ?’  

భీష్మపర్వంలో- భీష్ముడు లేని కౌరవసేన, భర్త లేని భార్యలా అయిపోయింది. (భీష్ముడికి బ్రహ్మచారితనం వదిలి, భర్తతనం వచ్చింది. సంతోషం).


దోషారోపణం..అనుచిత సంభాషణం
ఆనుశాసనిక పర్వంలో  భీష్ముడూ, ధర్మరాజూ  స్త్రీలను దారుణంగా అవమానించే వ్యాఖ్యలతో మాట్లాడుకుంటారు.

ద్వితీయాశ్వాసంలో  ధర్మరాజు  ‘పాపాలన్నిటికి మూలం స్త్రీలే కదా?’ అంటూ దాన్ని వివరించమంటాడు.

‘స్త్రియోహి మూలం దోషాణాం’ అని వ్యాసుడు సంస్కృతంలో చాటినా,


‘యోషిజ్జనంబులు దోషంబులకు నెల్ల మూలంబు’ అని తిక్కన  తెలుగులో పద్యరూపంలో చెప్పినా.. విషయం మాత్రం ఒకటే!

(ఈ సందర్భంగా ఇదండీ మహాభారతంలోని  చిన్న భాగం...) 


ఇదే ఘట్టం  పురిపండా అప్పలస్వామి గారి ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ లో ఎలా ఉంది?  ఇక్కడ కొంచెం చూడండి.



‘స్త్రీ  అనేది మండే నిప్పు! పదునైన కత్తి. ఘోర విషం! మహా సర్పం! అన్నీకలిసినదే ఆడది’
  అంటూ భీష్ముడు బోధలు చేస్తాడు మనవడికి.


పరిశీలనలో పదును
‘ఇదండీ మహా భారతం’లో  ఆలోచించదగ్గ మౌలిక అంశాల చర్చ కనిపిస్తుంది. (బోల్డ్ లెటర్స్ లోనివి రంగనాయకమ్మ గారి వాక్యాలు. )

1)   దుర్యోధనుడి పుట్టుక కారణం:   మహాభారతంలో ప్రధాన వైరుధ్యం గురించి రచయిత్రి వ్యాఖ్య ఇక్కడ-


2) అమృతం, అశుచిత్వం:  ఆదిపర్వంలో ఉదంకుడు ఎద్దు పేడ తింటాడు.  అది పేడ కాదనీ, అమృతమనీ తర్వాత  గురువు చెప్తాడు. ఈ సందర్భంలో రచయిత్రి విశ్లేషణ-  ‘‘మాయలతో మంత్రాలతో తయారుచేసే కట్టు కథలు కూడా అందులో పెట్టుకునే హద్దులకే లోబడివుండాలి. అమృతాన్ని పవిత్రమైనదని ఒక పక్క చెపుతూ, అది తినడం వల్ల అశుచి అయినట్టు ఇంకో పక్క చెపితే , ఆ అతకనితనం కట్టుకథకి కూడా పనికి రాదు.’’

3) కౌరవులు ఓడిపోయుంటే:   మాయాజూదం ఆడి పాండవులను అడవులపాలు చేశారని  కౌరవుల మీద చాలామందికి వ్యతిరేకత ఉంటుంది.  ‘‘(జూదంలో) ధర్మరాజే  గెలిస్తే , అప్పుడు కౌరవుల రాజ్యం ధర్మరాజుకి రావలసిందే కదా? అప్పుడు కౌరవులైనా అడవికి పోవలసిందే కదా?’’

ఇది  ఈ పుస్తకంలో  చదివినపుడు ‘ఈ కోణం  మనకు తట్టలేదేమిటి?’  అనిపిస్తుంది.

4)  కురుక్షేత్ర యుద్ధం తర్వాత :  ధర్మరాజు , మొత్తం కౌరవ-పాండవ రాజ్యాలకు మహారాజు అయ్యాడు. వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?  

ఈ రకమైన  తర్కంతో  ధర్మరాజు  చర్యలోని  లోపాన్ని వెల్లడించటం అనూహ్యం అనిపిస్తుంది.  


5) ధర్మరాజు గమ్యం ఏమిటి :  ధర్మరాజు మహాప్రస్థానంలో ఇంద్రుడు ఎదురొచ్చాడు. ముందు నిలిచాడు.. ధర్మరాజు ఆగిపోయి ఇంద్రుడికి నమస్కరించాడు.  ‘‘ఇతడి మహాప్రస్థానం ఇంద్రుడు కనపడేవరకేనా? ఇతడి గమ్యం, ఇంద్రుడి దర్శనమేనా? భార్యనీ, నలుగురు తమ్ముల్నీ ( నేలమీద పడిపోయినా వెనుదిరిగి) చూడకుండా నడిచిపోయినవాడు ఇంద్రుణ్ణి చూడకుండా వెళ్ళిపోతూవుండాలి. కానీ ఆగిపోయాడు!’’ 

నేలమీద  ద్రౌపదీ,  తమ్ముళ్ళూ పడిపోతున్న సంగతి తెలిసి కూడా వారిని చూడకుండా.. అసలేమాత్రం పట్టించుకోకుండా-  పైగా వాళ్ళ తప్పులను భీముడితో  ఎత్తి చెపుతూ ధర్మరాజు ముందుకు సాగిపోవటానికి  కారణం ఏమిటో చదివేవారికి అంతుపట్టదు.


6)  గీతకు వ్యతిరేకంగా  ఫలశ్రుతి :   కృష్ణుడు, ఏ కర్మ చేసినా ‘ఫలితాల మీద దృష్టి పెట్టవద్దు’ అన్నాడు కదా? అలాంటప్పుడు ఈ ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  ఎందుకు? ఈ కవి కృష్ణుడి బోధన పట్టించుకోలేదు. కృష్ణుణ్ణి సృష్టించి ఆ పాత్రతో అలా చెప్పించింది కవే.  ఆ కవే ఫల శ్రుతి చెప్పాడంటే... తను రాసినదాన్ని తనే పట్టించుకోలేదని అర్థం.


* * *

‘సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో’ అంటాడు బుద్ధుడు. 

అమానుషమైన కుల విధానాన్ని (చాతుర్వర్ణాశ్రమ ధర్మాలను) నిలబెట్టడమే ఈ గ్రంథ లక్ష్యం అని తెలిశాక;

స్త్రీలను సజీవంగా కాల్చెయ్యడాన్ని (సతీ సహగమనం)  పవిత్ర పుణ్యకార్యంగా ప్రబోధించిందని గ్రహించాక...

అప్పుడు కూడా...
‘మహాభారతం’పై  అప్పటివరకూ పెంచుకునివున్న ఇష్టం, అభిమానం-

అలాగే..
అదే స్థాయిలో నిలిచివుంటాయా?!

48 కామెంట్‌లు:

కాయ చెప్పారు...

తమరి అజ్ఞానానికి తామే బలి అవుతుంటారు జనులు. భారతదేశానికి ఆ పేరు వచ్చిందే భరతుడనే రాజు స్వంత కొడుకుని కాదని అర్హుడైన వ్యక్తికి రాజ్యాన్ని కట్టబెట్టడం వలన. ధర్మానువర్తన గురించి భారతాన్ని విశ్లేషించుకోవాలి కానీ ఇలా పిడకల వేటకి బయలుదేరితే అప్పుడెప్పటివో కథనాల వరకెందుకు.. దినపత్రికలు చదువుతూ, నేటి ఫక్తు బ్లాగులు చదువుతూ కాలక్షేపం చేయండి.. కొంతకాలం తరువాత ముసలివారై ఆ తరువాత అది కూడా ఉండకుండా వెళ్ళి పోతారు.

ఏది ప్రథమం ఏది అథమం అని చూడకుండా కమ్యూనిస్టు కోడి సాయంత్రం కూతకి నిద్ర లేచి ఇప్పుడెలా అంటే ఇలానే బుద్ధి లేదా అని తిట్లు వినవల్సి వస్తుంది.

అప్పటి కథనాల్లో స్త్రీలు అంటే స్త్రీలేనా ? భూదేవిని స్త్రీ అంటే భూదేవి అంటే ఒక మనిషా ? స్త్రీ గుణం, పురుష గుణం, నపున్సక గుణాలు అనేవి మూలాలు, వాటిని ఉపయోగిస్తూ ప్రపంచ వ్యవహారాల్ని కవులు విశ్లేషిస్తారనేది మూలం చేసుకుని చదవండి. (బ్రహ్మాండం అంటే జీవులు పుట్టడానికి అనువైందని అండం అన్నారు అలాంటివే ఈ కథలోని విశేషాలు).

కమ్యూనిస్టులు ఎద్దులు మాత్రమే మనుషులు కారు. దీన్నెలా అర్థం చేసుకుంటారు ?

శ్యామలీయం చెప్పారు...

ఏ విధమైన చర్చచేసే ఉద్దేశమూ లేదు. నాకు గుర్తుకు వస్తున్న ఒక్క విషయం చెబుతాను. జడభరతుడనే ఋషి కారణంగా భారతదేసం అన్న పేరు వచ్చిందని చెబుతారు. పరిశీలించి నిర్థారించుకోండి.

Unknown చెప్పారు...

మత గ్రంథాల్లో ఏముందో బయటపెట్టినంతమాత్రాన మతం పోదు. ఒక native Arabic speakerకి కురాన్ 85% వరకు అర్థమవుతుంది. సూర్యుణ్ణి అల్లాహ్ తూర్పు నుంచి పడమటికి పంపుతాడు అనేది అబద్దమని తెలిసినా అతను కురాన్‌ని నమ్ముతాడు. భూమి గుండ్రంగా ఉందనీ, అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందనీ కురాన్ వ్రాసినవాళ్ళకి తెలియదు. కురాన్ చదివేవాళ్ళకి ఆ నిజం తెలిసినా వాళ్ళకి కురాన్‌ని ప్రశ్నించే ధైర్యం ఉండదు. మహాభారతం చదివేవాళ్ళైనా అంతే, గడ్డి మీద వీర్యం పడడం వల్ల గడ్డికి మనుషులు పుట్టడం సాధ్యం కాదని తెలిసినా వాళ్ళు ఆ కథని నమ్ముతారు. ఈ అద్భుత కథలని మనం చెపితే ఎవరూ నమ్మరు కానీ కవులు చెపితే మాత్రం నమ్ముతారు.

hari.S.babu చెప్పారు...

యెందుకంటే అవి కేవలం ఫాంటసీలు కాబట్టి!ఫాంటసీకి చరిత్రకి,కల్పిత వ్యక్తులకి నిజ జీవిత వ్యక్తూలకి తేడాలు తెలియని వాళ్ళకి వుండే మూర్ఖత్వం మాకు లేదు గనక?

ఒక చిన్న వాస్తవికమైన వుదాహరణ చెప్తాను, ఈ పోష్టు రచయితకీ తక్కిన వారికీ అర్ధమవుతుందో లేదో గానీ.సమర సింహా రెడ్డి సినిమాలో బట్తనెత్తి బాలయ్య విగ్గుపెట్టి "కత్తులతో కాదురా కంటి చూపుతో చంపుతా" నని పంచ్ డయలాగు కొడీతే పిల్లలూ పెద్దలూ కూడా అదే డయలాగు రిపీటు చేస్తారు సరదాకి,అవునా?కానీ క్లయమాక్సులో మరి హీరో విలన్లని చట్టం,న్యాయం యేమీ చూడకుండా చంపేస్తే చూసిన వాళ్లలో టీనేజి కుర్రాడు కూడా చెయ్యడే?చేస్తే బొక్కలో తోసి మక్కె లిరగ దెస్తున్నారు కదా!మరి అవి కధలని చదివే వాళ్ళకి తెలుసు!కుంతిని చూసి యెంత మంది ఇవ్వాళ్టి అదపిల్లలౌ పెళ్ళికి ముందు గర్భం దాలుస్తున్నారు?ధర్మరాజుని చూసి యెంతమంది జూదమ ఆడుతున్నారు?ద్రౌపదిని చూసి యెంతమంది ఆడవాళ్ళు బహుబర్తృత్వాన్ని పాటిస్తున్నారు?

అక్కడ యేది నేర్చుకోవాలో,యేది నేర్చుకోకూడదో స్పష్టంగానే ఉంది."ప్రపంచ సాహిత్యంలో కాలాలు దాటి నిలిచిన కళారూపాలు అవి శాశ్వతంగా నిలబడటానికి కారణం ఆ కధలలోని యే పాత్రా నేల విడిచి సాము చెయ్యకుండా పూర్తి వాస్తవికత వుట్టిపడుతూ నిజమైన వ్యక్తులని భ్రమింప జేసే రచయితల ప్రతిభ వల్ల కొన్ని తప్పులూఒ కొన్ని ఒప్ప్పులూ వున్న సంవిధాన(Drametic Excellency) కళ ఆ రచయితలలో వుండటమే" అని!అయినా సరే ఒక్కొక్కొసారి ఒక్కొక్క వ్యక్తి మళ్ళీ అదే పాట పాడిస్తున్నారు నాతో - బోరుగా వుందిం,విసుగ్గా వుంది, చీ!ఉ


"హంచ్ బాక్ ఆఫ్ నాస్త్రదాం కెధడ్రల్" కధ తెలుసా?తెలుగులో "ఘంటారావం" అనే పేరుతో వచ్చింది.అందులో అందరికీ దయామయుడిగా కనిపించే ఒక చర్చి ఫాదర్ కంజిర పట్టుకుని వీధుల్లో నాట్యం చేసి డబ్బులు సంపాదించే ఒక అమ్మాయి మీద పగబట్టి తను పెంచుతున్న గూనివాడితో కిడ్నాప్ చేయించటం దగ్గిర్నుంచి ఆ అమ్మాయిని ప్రభుత్వం చేత భయంకరమయిన శిక్షకి గురయ్యేలా చేస్తాడు!మెరి విక్టర్ హ్యూగో చర్చి ఫాదర్లందర్నీ బద్నాం చెయ్యడానికే అట్లా రాశాడని అనగలరా?చా,పాపం యెంతయినా చర్చి ఫాదరు గదా పశ్చాత్తాప పడినట్టుగా చూపిస్తే పోయేదిగా అనఓ యెవరో ఒక దొమ్మరి పిల్లకి యేదో కొంచెం అపకారం చేశాడు,మిగతా వాళ్ళందరితో బాగానే వున్నాడుగా అని సమర్ధించడమో చేస్తారా?మీరు మరోలాగా ఆ కధని తిరగ రాయాలని చూస్తారా?

రెండూ కధలే,రెంటిలోనూ రచయితలు ఆయా పాత్రల్ని తీర్చిదిద్దిన ప్రతిభ వల్ల వాళ్ళు వాస్తవ వ్తక్తులేమో అని భ్రమిస్తున్నాం!బాగా ఆలోచించి చూడండి,అర్ధమవుతుంది?
@MarksisT Hegeliyan
ఇంతకీ తమరి పోశ్టులో మార్క్సిజం లోని పిట్టకధల్ని గురించి వేసిన చివరి ప్రశ్నలకి ఇంకా కవాబు రాలేదు?

GKK చెప్పారు...

వేణు గారు :
రంగనాయకమ్మ గారు likes to stir up hornet's nest. media thrives on and laps up controversies. she is well within her right to question male chauvinism in her own inimitable style. మహాభారతం లో ఇటువంటి జుగుప్సాకరమైన విషయాలున్నాయన్నమాట. కానీ universal acceptance పొందిన విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, విదురనీతి - కూడా భారతంలో అంతర్భాగాలే. మంచిని మెచ్చుకుంటూ చెడుగును కడిగితే బాగుంటుందేమో. శారీరిక బలం వల్ల పురుషాధిక్యం కొనసాగుతున్నది అన్నమాట అప్పటికీ ఎప్పటికీ నిజం. క్రూరంగా ప్రవర్తించటంలో స్త్రీలు తక్కువేమీ తినలేదు. అనైతికంగా ప్రవర్తించటానికి genderకు ఎటువంటి సంబంధమూ లేదు.
రాం గోపాల్ వర్మకు ఈ పుస్తకం విపరీతంగా నచ్చిందట. సినిమాగా తీస్తాడట. హత విధీ. రంగనాయకమ్మ గారికి సైద్ధాంతిక బలం ఉంది. రాముకి ఈ పుస్తకాన్ని కూడా కుళ్ళబొడిచేయగల సామర్థ్యం ఉంది.
Wanted to know : సాటి స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే ఆడవారి గురించి రంగనాయకమ్మ వ్రాశారా?

Unknown చెప్పారు...

కృష్ణుడు పిట్ట కథలోని పాత్ర అని తెలిసి కూడా అతనికి గుడి కట్టేవాళ్ళకీ, చిరంజీవి సినిమా పోస్తర్‌ల దగ్గర జంతు బలులు ఇచ్చే అభిమానులకీ మధ్య తేడా ఉండంటావా? మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాస్తికుల్లో కూడా మార్క్సిజమ్‌ని వ్యతిరేకించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మతం విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉండవు.

Unknown చెప్పారు...

రాంగోపాల్ వర్మ కేవలం పబ్లిసితీ కోసం ఆ పుస్తకం పేరు చెప్పుకుని ఉంటాడు కానీ వయొలెన్స్ సినిమాలు తీసేవానికి మార్క్సిజంతో పని ఉండదు. రంగనాయకమ్మ గారు మరణశిక్షలకి వ్యతిరేకం. ఆవిడ మరణశిక్షలకి వ్యతిరేకంగా వ్రాసే వ్యాసాలు, హత్యల్ని emphasise చేసి సినిమాల్లో చూపించే రాంగోపాల్ వర్మకి నచ్చుతాయా?

hari.S.babu చెప్పారు...

?మతం పేరుతో చెప్పే పిట్ట కథల్ని నమ్మొచ్చు కానీ మార్క్సిజమ్‌ని నమ్మకూడదు అనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను.
:-<>)
మతం పేరుతె దాన్ని నమ్మేవాళ్ళు పిట్టకధల్ని నమ్మినట్టుగానే మార్క్సుఇస్టులు కూడా వాళ్లకి నచ్చిన మూఢనమ్మకాల్ని నమ్మొచ్చు అనే కమ్యునిష్టుని నిన్నే చూస్తున్నాను?!

Unknown చెప్పారు...

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు నువ్వు నా బ్లాగ్‌లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వ్రాస్తే నేను వాటిని స్పామ్ లిస్త్‌లో పెట్టాను, గుర్తుందా? కమ్యూనిజం సాధ్యం కాదు అని చెపితే అది ఒక భౌతికవాది చెప్పాలి కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మేవాళ్ళు చెప్పక్కరలేదు. కార్ల్ మార్క్స్, ఫోయర్బాఖ్‌పై చర్చించాడు కానీ బైబిల్‌పై చర్చించలేదు. మతవాదులతో చర్చించడం కంటే భౌతికవాదులతో చర్చించడమే ఎక్కువ ఉపయోగకరం. "రామాయణ విషవృక్షం" చదివినప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించేది, 'ఇవి కట్టు కథలని తెలిసి కూడా వీటిని నమ్మేవాళ్ళు ఉంటారు, వీళ్ళతో చర్చ అవసరమా' అని.

వేణు చెప్పారు...

Marxist Hegelian &
Hari Babu Suraneni :

పరస్పర సవాళ్ళను వదిలెయ్యండి. వ్యాఖ్యలు రాసేటపుడు సంయమనం పాటించాలనీ, పోస్టు విషయానికి పరిమితం అవ్వాలనీ నా సూచన.

Unknown చెప్పారు...

మహాభారతాన్ని వ్రాసినది ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు. సభా పర్వాన్నీ, అరణ్య పర్వాన్నీ వేర్వేరు వ్యక్తులు వ్రాసారు. సభా పర్వంలో జూదశాలలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదికి చీరలు అందిస్తున్నట్టు వ్రాసుంది. అరణ్య పర్వంలో కృష్ణుడు పాండవుల దగ్గరకి వెళ్ళి తాను పది నెలలు పాటు సాల్వునితో యుద్దూం చేస్తూ ఉండడం వల్ల జూదశాలకి రాలేకపోయాననీ, జూదం తప్పని చెప్పలేకపోయాననీ అంటున్నట్టు వ్రాసి ఉంది.

బైబిల్‌లో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. వీటిని apocrypha అంటారు. అవి వ్రాసినది ఎవరో తెలియదని చెప్పి చర్చ్ అధికారులే వాటిని దాచి ఉంచడం జరుగుతుంది. బర్నబాస్ సువార్త, అరబ్బీయుల బాల్య సువార్త కూడా ఇలాంటివే.


hari.S.babu చెప్పారు...

వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?
?
రామాయణం అంతా విని సీత రాముది కేమవుతుంది అని అదిగిన వాడు ఈ ప్రస్న వేసిన మనిషి కన్నా ఖచ్చితంగా తెలివైన వాదే ఆరుద్ర ఒక పుస్తకం గూడా రాశాదు గాబట్టి!

సాక్షాత్తొ తనని అందరూ యువరాజుగా ఒప్పుకున్నాకనే ద్ర్తరాష్త్రుదు మావాదితో గొదవగా వుంది నువ్వు ఇంద్రప్రస్థానికి వెళ్లమంతే బుధ్ధిగా వెళ్ళి తన బతుకు తను బతుకుతుంతే రెందుసార్లు మాయాద్యూతమతో దాన్ని కూడా లాక్కుని సాక్షాత్తొ శ్రీకృష్ణుణ్ణే రాయబారిగా పంపించి అయిదూళ్ళు ఇచ్చినా చాలంటే సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వననడం వల్ల జరిగిన యుధ్ధానికి బల్లే రీజనింగు లాగిందిగా?

Unknown చెప్పారు...

నాకు ఇంకో సందేహం ఉంది. ధర్మరాజు ద్రౌపదిని ఏకపక్షంగా పందెంగా పెట్టాడా, ద్వైపాక్షికంగా పందెంగా పెట్టాడా? అది ద్వైపాక్షిక పందెం అయితే దుర్యోధనుడు కూడా తన భార్య భానుమతిని పందెంగా పెట్టినట్టు అవుతుంది. ఆ పందెంలో ధర్మరాజు గెలిచి ఉంటే భానుమతికి పరాభవం ఎదురయ్యేది. ధర్మరాజు పందెంలో గెలిచినా ఒక స్త్రీకి అన్యాయం జరిగి ఉండేదే కదా! ఆడవాళ్ళని పందెంగా పెట్టి ఆడడం తప్పు కాదని చెప్పేది ఏ రకంగా పుణ్య కథ అవుతుంది?

వేణు చెప్పారు...

@ కాయ : మీకు నచ్చనిది రాస్తే, ప్రశ్నిస్తే అది ‘పిడకల వేట’ అయిపోతుందా? భారతంలో ధర్మానువర్తన ఎక్కడుందో విశ్లేషించాకే ఇన్ని ప్రశ్నలు. వాటికి కావాలి జవాబులు, చెప్పగలిగితే!

అప్పటి కథనాల్లో స్త్రీలు అంటే స్త్రీలు కాదా? అంటే ఆనుశాసనిక పర్వంలో భీష్ముడూ, ధర్మరాజూ తప్పు పట్టినవారెవరు?

మీ చివరి వాక్యం ఏమాత్రం బోధపడకుండా ఉంది.


@ శ్యామలీయం: భారతదేశం ఏ భరతుడి పేరుమీద వచ్చిందో గానీ, భారత గ్రంథానికీ ఈ చర్చకూ సంబంధం లేదు. అందుకే నేను ఆ వివరాల పరిశీలనలోకి వెళ్ళటం లేదు.

వేణు చెప్పారు...

@ Marxist Hegelian: >> మత గ్రంథాల్లో ఏముందో బయటపెట్టినంతమాత్రాన మతం పోదు >> పోతుందని ఎవరూ అనలేదుగా? వాటిలో వాస్తవాలు తెలియటం అవసరమే కదా.

కట్టుకథల్లో ‘రూపం’ గురించి కాకుండా వాటి వెనకున్న ‘విషయం’ గురించి ఆలోచించాలి; ప్రశ్నించాలి.

వేణు చెప్పారు...

@ Hari Babu Suraneni: ‘కాలాలు దాటి నిలిచిన కళారూపాల’ మూలగ్రంథాల్లో ఏముందో తెలియకుండానే తరాలు గడిచిపోతున్నాయి. కానీ అంతులేని కీర్తులూ, తరగని పొగడ్తలూ ఆ గ్రంథాలకు దక్కుతున్నాయి. అందుకే ఇతిహాసాల్లో అసలేముందో పాఠకులు చదవాలి. తెలుసుకోవాలి.

భారతం అసలు జరిగిందా లేదా అనేది అప్రస్తుతం. ఆ రచన బోధించిన విలువలేమిటో చూడాలి. కులవ్యవస్థ ఎడతెగని సమర్థనా, సతీ సహగమనాలకు ఈ గ్రంథం నీరాజనాలూ పలికిందా లేదా అనేది ప్రశ్న.

మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. ఈ వాదనలో తర్కమే కాదు, న్యాయం కూడా ఉంది. మాయాద్యూతం, దుర్యోధనుడి దుష్టత్వాలతో సంబంధం లేకుండా జవాబు చెప్సాల్సిన ప్రశ్న ఇది.

మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: యూనివర్సల్ అక్సెప్టెన్స్ పొందినవి అనుకున్నవాటిని కూడా పూర్తిగా పరిశీలిస్తే తప్ప వాటి లోతుపాతులు తెలియవు. మీరు ప్రస్తావించిన ‘విదుర నీతి’ అంత ప్రాచుర్యం పొందింది కదా? ‘సప్త సముద్రాల్లో మునిగినా తేలగలడు గానీ, సప్త వ్యసనాల్లో పడ్డ వాడు చచ్చాక కూడా తేలలేడు’ అని ధృతరాష్ట్రుడికి చెప్తాడు విదురుడు. కానీ ధర్మరాజుకు సప్త వ్యసనాల్లోని జూదం అలవాటున్నప్పటికీ సద్గుణాలున్నవాడు అని పొగడి, వాళ్ల రాజ్యం వాళ్ళకి ఇచ్చెయ్యి అంటాడు. (అలా రాజ్యం ఇవ్వటం న్యాయమే కానీ.. విదురుడి మాటల్లో వైరుధ్యం గమనించాలి).

>> సాటి స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే ఆడవారి గురించి రంగనాయకమ్మ వ్రాశారా>> ఔను. ఉదాహరణకు నాటి బలిపీఠం, ‘జానకి విముక్తి’, మొన్నటి ‘కళ్ళు తెరిచిన సీత’ల్లో ఇలాంటి స్త్రీల గురించి రాశారు.

వేణు చెప్పారు...

@ Marxist Hegelian: మీ సందేహం గురించి- ధర్మరాజు వరసగా ఓడిపోయాడు కాబట్టి తమ్ముళ్ళనూ, భార్యనూ పందెంగా ఒడ్డాడు. దుర్యోధనుడు అసలు ఓడలేదు కాబట్టి అలాంటి సందర్భమే రాలేదు. రెండోసారి జూదంలో ఎవరు ఓడినా అరణ్యవాసం, అజ్ఞాతవాసం పాటించాలని నిబంధనలు పెట్టుకున్నారు.

Unknown చెప్పారు...

ఆ పందెం ఏకపక్షమా, ద్వైపాక్షికమా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఏక పక్ష పందేలకి దిగితే (అది వరస ఓటములలో అయినా, కాకపోయినా) ఆ పందేనికి ఒప్పుకున్నవాని కంటే తెలివి తక్కువవాడు ఉండడు. ఆ లెక్కన ధర్మరాజు దుర్యోధనుని కంటే తెలివితక్కువవాడు అవుతాడు. అది ద్వైపాక్షిక పందెం అయితే ధర్మరాజూ, దుర్యోధనుడూ ఒకే రకం తెలివితక్కువవాళ్ళు అనుకోవాలి.

hari.S.babu చెప్పారు...

@venuvu
1).మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది.

Ans:

అసలు గుడ్డివాడికి రాజ్యార్హత లేదు.అక్కడి క్రైటేరియాలు:ఇతర్ల మీద అధార్పది బతికేవాడు,దీర్ఘరోగం వుంది యెప్పుదు చస్తాడో తెలియని వాడు ప్రభువుగా వుందటానికి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా యెవరూ వొప్పుకోరు.పెద్దవాడు కుళ్ళి చస్తాదని జాలి పడి ఇప్పటి మన దేశపు రాష్త్రపతి లాగా హానరరేఎ పోష్తు మాత్రమే ఇచ్చాడు దయదల్చి.అది కధలో స్పష్తంగానే వుంది!

తనకి రాజ్యం అర్హతగా లేదు కాబ్ట్టే దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ సక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపదతాను,భీషుడూ ద్రోనుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా అని యెక్కదీయతం కూడా కధలో స్పష్తంగానే ఉంది.తనకి అయిదూళ్ళు కూడా ఇవ్వనన్న్నాక యుధంలో గెలిచింది హస్తినాపురాన్నే.అది ఒకనాడు హక్కుగా దఖలు పడినా మంచితనంతో వదులుకున్నదే.

రాజ్యార్హ్త లేనివాడికి తనకి హక్కుగా వున్న రాజ్యాన్ని ఇవ్వదమేమిటి?సాంకేతికంగా తనకి హక్కు లేని దాన్ని కబళించడానికే రెండు సార్లూ ద్యూతం నడిపాడు దుర్యోధనుడు!

2). మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!
Ans:

మీ అభిమాన రచయిత్రి కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి వూరుకోలేదుగా?అబధ్ధాలు రెందు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో లేనిది కల్పిస్తే తిరిగి తనకే తిట్లు రావదంతో ఇక్కడ మరొక ట్రిక్కు - వున్నదాంట్లో తను వెక్కిరించటానికి పనికొచ్చేవి మాత్రమే వున్నాయని చెప్పటం?

వ్యాసుడు ఒక విషయం గురించి పది మాతలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా?

మీకు నచ్చిన వాళ్ళు యెట్లాగయినా మాట్లాదవచ్చు గానీ మీకు నచ్చని వాల్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాదాలి,బాగుంది మీ వరస?!

Unknown చెప్పారు...

ప్రజాస్వామ్యం లేని రోజుల్లో గుడ్డివానికి రాజ్యార్హత లేదని ఎలా చెపుతాం? తండ్రి ఆస్తి కొడుక్కి చెందాల్సిందే కదా? ఇప్పుడు కూడా కొడుకు తాగుడుకీ, వేశ్యలకీ డబ్బులు పారబోసే రకమైనా అతని తండ్రి చనిపోయిన తరువాత "తాగుబోతుకి తండ్రి ఆస్తి ఎందుకు" అని అడగడానికి అవ్వదు, అతను తన తండ్రి ఆస్తిని అమ్ముకుని మరీ తాగుడుకి ఖర్చులు పెడతాడని తెలిసినా.

వేణు చెప్పారు...

@ Hari Babu Suraneni:

ధర్మరాజు యుద్ధం చేసి గెల్చింది అర్థ రాజ్యం కోసమే గానీ పూర్తి రాజ్యం కోసం కాదు. గెలిచాక సగ భాగం మాత్రమే తీసుకోవటం ధర్మమా కాదా అనేది ఇక్కడ చర్చనీయాంశం. ‘నాకొద్దు, నువ్వే పాలించు’ అని ధృతరాష్ట్రుడు అంటే మొత్తం రాజ్యం తీసుకోవటం వేరు. ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది.

>> తనకి రాజ్యం అర్హతగా లేదు కాబ్ట్టే దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ సక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపదతాను,భీషుడూ ద్రోనుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా అని యెక్కదీయతం కూడా కధలో స్పష్తంగానే ఉంది. >> స్పష్టంగానే ఉందంటున్నారు కాబట్టి ఇది మహాభారతంలో ఏ పర్వంలో, ఏ ఆశ్వాసంలో ఉన్నదీ నిర్దిష్టంగా చెప్పండి. నిర్థారించుకోవచ్చు.

>> వ్యాసుడు ఒక విషయం గురించి పది మాతలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా? >> తను విమర్శిస్తున్నవాటిని పూర్వపక్షం చేసే విషయం అక్కడ ఉంటే దాన్ని వదిలేశారా? ‘ఇదండీ మహాభారతం’లో అలాంటి సందర్భం ఎక్కడుందో మీరు కనిపెిడితే మంచిదే, పాఠకులంతా తెలుసుకోవచ్చు. చెప్పండి-ఏమిటా విషయం?

వ్యక్తుల పట్ల మర్యాదను పాటిస్తూ వ్యాఖ్యలు రాయగలిగితే రాయమని నా సూచన. ఇతరేతర కారణాలు (అవి సకారణమా, అకారణమా అనేది వేరే చర్చ) చూపుతూ దీన్ని ఉల్లంఘించి రాస్తానంటే అది మీ ఇష్టం. కానీ అలాంటి వ్యాఖ్యలను మాత్రం ఈ బ్లాగులో ప్రచురించను.

అన్నట్టు- ధర్మరాజు అర్థ రాజ్యం చేసింది, మీరు రాసినట్టు- ఇంద్రప్రస్థంలో కాదు; ఖాండవ ప్రస్థంలో!

hari.S.babu చెప్పారు...

@venuvu
ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది.
ans:
దృతరాష్త్రుడికి రాజ్యార్హత వుందా లేదా అనేది వొదిలేసినా అది వేరే విష్యమ యినా ఈ పాయింటు పట్తదం కూడా అనవసరమే అవుతుంది,అది తెలుసా?అసలు ముఖ్యమయిన పాయింటే అది!

ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు.దృతరాష్త్రుడు మంచితనం కొద్దీ వొదిలేసే ప్రసక్తి లేదు అక్కడ!నేను రాజుని కాలేకపోయాను,నువ్వు రాజు కావతానికి యేది చేసినా నా సపోర్టు వుంటుందని యెక్కేసిన దృతరాష్ట్రుదు అంత న్యాయంగా ఆలోచించగలడా? తనకి హక్కుగా వున్నదాన్ని కూడా పెదతండ్రి అనే గౌరవంతో వొదులుకున్నా అక్కద కూడా ప్రసాంతంగా తన బతుకు తను బతకనివ్వకుండా ద్యూతమ పేరుతో తరిమితే తిరిగి తన రాజ్యాన్ని తను ధీమాగా యుధ్ధం చేసి సాధించుకుంటే ఇంక దృతరాష్త్రుదు తనకి ఇవ్వడం తను దృతరాష్ట్రుడికి ఇవ్వటం యేమితి అర్ధం లేకుండా?

hari.S.babu చెప్పారు...

@venuvu
స్పష్టంగానే ఉందంటున్నారు కాబట్టి ఇది మహాభారతంలో ఏ పర్వంలో, ఏ ఆశ్వాసంలో ఉన్నదీ నిర్దిష్టంగా చెప్పండి. నిర్థారించుకోవచ్చు.
ans:
లాక్షాగృహ దహనం తర్వాత పాందవులు ద్రౌపదీ స్వయంవరంలో బయట పదతారు.దానికి భీష్ముదు ఇప్పతికే చాలా నీచమయిన పని జరిగింది అనద్రూ నిన్నే తప్పు పదుతున్నారు నీ తమ్ముది కొదుకులు చావు తప్పించుకున్నారు.నీ అంతట నువ్వే పిలువు తప్పు బయటపదకుండా వుంటుంది అంటే పిలుస్తాదు.దానికి దుర్యోధనుదు తంద్రిని అ భీష్ముదూ వాళ్ళ ముందు ఒకలా మాట్లాది తనముందు ఒకలా మాట్లాదటం గురించి నిలదీసినప్పుదు దృతరాష్ట్రుడు అట్లా అంటాడు.ఆ భాగం యెక్కద వుందో ఈజీగానే తెలుసుకోవచ్చును గదా!

hari.S.babu చెప్పారు...

@venuvu
తను విమర్శిస్తున్నవాటిని పూర్వపక్షం చేసే విషయం అక్కడ ఉంటే దాన్ని వదిలేశారా? ‘ఇదండీ మహాభారతం’లో అలాంటి సందర్భం ఎక్కడుందో మీరు కనిపెిడితే మంచిదే, పాఠకులంతా తెలుసుకోవచ్చు. చెప్పండి-ఏమిటా విషయం?

Anas:

స్వర్గారోహణ పర్వం అని ఆ పర్వం పేరు?వాళ్ళు చేస్తున్నది మహాప్రస్థానం!కాలక్షేపానికి చేస్తున్న తిరుగుడు కాదు.శిఖరం కొసకి చేరినాక ఇంకా ముందుకు యెట్లా వెళ్తాడు?యే స్వర్గానికి చేరుకోవాలని అనుకున్నారో ఆ స్వర్గాధిపతి ఇక్కడి నుంచి విమానంలో రావాలి అని పిలుస్తుంటే ఆగకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి?

బయలు దేరే ముందు వెనక్కి తిరక్కుండా ఆగకుండా వెళ్ళాలి,చివరి వరకూ వెళ్లగలిగిన వాళ్ళు మాత్రమే అర్హులు అనే నియమం వుండటం,అందుకనే తనతో పాటూ రాగలిగిన కుక్కని కూడా యెక్కించాలని పట్తుబట్టటం గురించి మీ అభిమాన రచయిత్రి చేప్పారా చెప్పలేదా,యెందుకని?

వేణు చెప్పారు...

@ Hari Babu Suraneni

1) >> ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు. >> కదా? తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి.

2) >> దుర్యోధనుదు తంద్రిని అ భీష్ముదూ వాళ్ళ ముందు ఒకలా మాట్లాది తనముందు ఒకలా మాట్లాదటం గురించి నిలదీసినప్పుదు దృతరాష్ట్రుడు అట్లా అంటాడు. >> మహాభారతంలో ధృతరాష్ట్రుడి ద్వంద్వ వైఖరిని కొడుకు నిలదీసిన ఘట్టం లేదు. మీరు చదివివుంటే ఏ పుస్తకంలోదో చెప్పండి.

3) >> వ్యాసుడు ఒక విషయం గురించి పది మాతలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా>> ఇదీ మీ వ్యాఖ్య. ‘ఇదండీ మహాభారతం’లో అలా కావాలని వదిలేయటం ఎక్కడ జరిగిందో చెప్పమని అడిగాను. నా ప్రశ్నను వదిలేసి వేరే ఏదో రాశారు.

కాయ చెప్పారు...

వార్నీ!! కృష్ణుడు చేసిన ఏవో కొన్ని మ్యాజికల్ పనులు సహజంగానే ఎమోషనల్ అయిన కవులు ఇంకొంచెం మసాలా దట్టించి కవిత్వం లో రసాలు పారిస్తే విషయ అవగాహన లేని వారిలా బట్టలు ఎందుకు చించుకుంటున్నారు.

వేణు గారు, స్త్రీ గురించి ఇలా చెప్పాడు అంటే, వాళ్ళు చెప్పింది స్త్రీ తత్వం గురించి. మగవాళ్ళలో స్త్రీ తత్వం ఉన్నవాళ్ళ నుంచీ అదే విధమైన గుణ గణాలు ఉంటాయి అని ఆ పెద్దవారి ఉద్దేశ్యం. జనరల్ గా చేసి మాట్లాడినప్పుడు కూడా ఇలా చర్చలు పెడితే వ్రాసిన ఎంకమ్మ గారికి బుద్ధి ఉందా అనిపిస్తుంది.

జనరల్ గుణాలు + ఒక మనిషి తత్వం + ఆ మనిషి గుణాలు విశ్లేషిస్తే ఒక మనిషి గురించి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భీష్ముడు చెప్పింది ఆవిడ గారికి అన్వయించలేము. ఎందుకంటే ఆమె పురుష తత్వం కలది, ఇంకా ఒక విధమైన ఆస్తికురాలు కాదు, ఇంకోవిధంగా సమాన హక్కుల కోసం మాట్లాడుతుంది..

ఎవరైనా వాళ్ళు అర్థం చేసుకున్నది చెప్తారు అంతే కాని నువ్వు కూడ ఇదే ఫైనల్ అనుకో అని చెప్పరు..

ఇప్పుడు కమ్యూనిస్టులను ఎద్దులు అంటే ఎలా ఉంటుంది అన్నాను.. కష్ట పడి సంపాదించుకుని సమానత్వ సమాజం లో బ్రతకాలనుకుంటాడు కావొచ్చు కమ్యూనిష్టు. కానీ సమానత్వం మనుషుల ఎబిలిటీల్లో ఉందా ? వారి వారి శారీరక/మానసిక సామర్థ్యాల్లో ఉందా ? కమ్యూనిస్టులకు రసజ్ఞులా ?

కమ్యూనిష్టులు కేవలం బాడీ + చిన్న చిన్న లెక్కలు చేసేందుకు మైండ్ ఉన్నవారు మాత్రమే. వారికి మైండ్ ని మించి, ప్రేమలు + ధర్మము అనే వాటి గురించి తెలిసే చాన్స్ లేదు.. ఎందుకంటే వారి లెక్కలు ప్రేమ అనే కాన్సెప్టు ని ఒప్పుకోవు..

ఇంకోటి .. భూదేవి అంటాం ఎందుకంటే అమ్మలా మనకందరికి ఆశ్రయం ఇస్తుంది, ప్రేమగా రకరకాల ఫుడ్స్ పెడుతుంది, ప్రేమగా జీవులు జీవించటానికి కావల్సినట్లు ఉంటుంది, మనం ఎక్కువ చేస్తే సహనం చూపినా, ఎప్పుడో ఒకప్పుడు స్త్రీ తత్వం చూపిస్తూ కిందేసి తొక్కుతది.

కమ్యూనిష్టొకడు ఇద్దరి భార్యలూ పందెం పెట్టారేమో అన్నాడు.. కమ్యూనిస్టులకు ఇంకేం వస్తుంది ? ఇంతకంటే!

అందరూ ధర్మ రాజు అని ముద్దుగా పిలుచుకునే కుంక నిజ స్వరూపం చూపిద్దామని దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలలో ఇలా భార్యని పందెం పెట్టి దొరికి పోయాడు. ఏమైనా అంటే చూడు శాస్త్రాలు ఇలానే చెప్తున్నాయ్ అంటాడు. ఈ మొద్దు ధర్మ రాజట అని చెప్పాలన్నది దు. ప్రయత్నం. వారి వారి ప్రజ్ఞ అలా ఉంది అనుకోవటమే తప్ప మనమేం చేయలేం ఇప్పుడు.. ఎలాంటి విషయమైనా ఎవరి అనుభవాల్లో వారే తెలుసుకోవాలి అంతే కాని అట్లా చెయొద్దురా ధ. అంటే వింటాడా ఏమిటి.. ఎందుకు భయ్యా అంటాడు. ఎవరి మానసిక పురోగతి వారిది.. ఒక పెద్ద ఏనుగుని చంపి సింహాలన్నీ కలిసి కట్టుగా తింటాయి. కమ్యూనిస్టులూ అంతే అని నా ఫీలింగ్.. కలసి కట్టుగా సంపాదించి తిందాం అనే టైపని..

Unknown చెప్పారు...

వేణు గారు,

హరిబాబు గారు ఉదాహరించిన ఘట్టంలో దుర్యోధనుడు నిలదీయడం వుంది. కిసారి మోహన్ గంగూలీ గారి అనువాదంలో ఆ పేజీ ఇక్కడ(http://www.sacred-texts.com/hin/m01/m01204.htm మరియు http://www.sacred-texts.com/hin/m01/m01204.htm) చూడొచ్చు.

దుర్యోధనుడు:
What is this that thou hast, O monarch, desired to do? Dost thou regard the prosperity of thy foes as if it were thy own, that thou hast been applauding the Pandavas, O foremost of men, in the presence of Vidura?

ధృతరాష్ట్రుడు:
I desire to do exactly what you would recommend. But I do not wish to inform Vidura of it even by a change of muscle. It was, therefore, O son, that I was applauding the Pandavas in Vidura's presence, so that he might not know even by a sign what is in my mind.

అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు దుర్యోధనుడు తనకు రాజ్యాధికారం లేదని చెప్పిన ముక్క మాత్రం అక్కడ లేదు!

వేణు చెప్పారు...

@ కాయ: స్త్రీలందరినీ అంత నీచంగా చిత్రించిన మాటలు మీకు మసాలా దట్టించిన కవిత్వంలాగా కనపడుతున్నాయా? ఆ కవిత్వంలో పారే రసాల దుర్గంధం మాటేమిటి? నేరుగా- స్పష్టంగా చెప్పిన విషయాలను ‘అవగాహన’ చేసుకోండి.
అంతేగానీ దీన్ని గురించి ప్రశ్నిస్తే ‘విషయ అవగాహన లేని వారిలా బట్టలు ఎందుకు చించుకుంటున్నారు’అంటూ అనుచితంగా రాస్తే మీ సభ్యతే బయటపడుతుంది.

క్లియర్ గా అందరు స్త్రీల గురించి చెప్పిన విషయాలవి. వాటిని అన్వయాలతో కప్పిపుచ్చాలనీ, సమర్థించాలనీ ప్రయత్నిస్తే అది వృథా ప్రయాసే.

ఆనుశాసనిక పర్వంలో స్త్రీలను అవమానించే ఇలాంటి ఘోరమైన విషయాలున్నాయని గతంలో ఎంతమందికి తెలుసు? వాటిని పాఠకుల ముందు బయటపెట్టటమే ‘ఇదండీ మహాభారతం’ చేసిన పని.

అభిప్రాయం రాసేటపుడు ఇతరులను మర్యాదగా ప్రస్తావించటం సంస్కారం. అది లేని వ్యాఖ్యలను ప్రచురించటం సాధ్యం కాదు!

వేణు చెప్పారు...

@ శ్రీకాంత్ చారి: >> దుర్యోధనుదు తంద్రిని అ భీష్ముదూ వాళ్ళ ముందు ఒకలా మాట్లాది తనముందు ఒకలా మాట్లాదటం గురించి నిలదీసినప్పుదు దృతరాష్ట్రుడు అట్లా అంటాడు. >> ఇది కదా, హరిబాబు గారి వ్యాఖ్య.

భీష్ముడి ముందు ఒకలా, తమ ముందు మరొకలా మాట్లాడినట్టు భారతంలో ఎక్కడుందని అడిగాను. విదురుడి సముఖంలో ఉన్నపుడు చెప్పిన విషయాలకే దుర్యోధనుడు తండ్రిని నిలదీశాడని భారతంలో ఉంది.

కాయ చెప్పారు...

మసాలా అన్నది కృష్ణుడిని ఉద్దేశించి.. నేను అన్నది కవులు ప్రేమోద్రేకంలో ఆయనను ఒక మాయావి అని, దేవ దేవుడని పొగుడుకుంటారని. ఆ వ్యాఖ్యకీ, స్త్రీ తత్వానికి సంబంధం లేదు. ఇంక స్త్రీ తత్వాల గురించి భీష్ముడు చెప్పింది ధర్మరాజు తో, జనరల్ గా ఇవి స్త్రీ తత్వాలని ఇక తెలిసిన స్త్రీల గురించి, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారో అని ఎవరికి వారే విశ్లేషించుకోవాలి. అంతే గాని, కొన్ని సంధర్భాల్లో స్త్రీ తత్వం గల వారు ఎంతో నిష్ఠగా ఉండి హూందాగా ఎందరికో స్పూర్తిగా నిలుస్తారు. అప్పుడు కూడా ఆ వ్యక్తి (పురుషుడు కావచ్చు లేక స్త్రీ కావచ్చు) తత్వం స్త్రీత్వం నుండి పురుషత్వం వైపు పయనిస్తుంది అని అర్థం చెసుకోవలసి ఉంటుంది.

అయినా బ్రహ్మచారి చెప్పిన స్త్రీతత్వం నిజముగా స్త్రీలకు సంబంధించే అనుకోవటం జనుల అమాయకత్వం.

వేణు చెప్పారు...

@ కాయ : స్త్రీల గురించి సుదీర్ఘంగా, ఉదాహరణలతో సహా మహాభారతంలో స్పష్టంగా చెప్పిన అనుచిత విషయాలకు ఈ కాలంలో కూడా సమర్థనలు! దురన్వయాలూ, దూరాన్వయాలూ చేసినంతమాత్రాన రాసిన విషయాలు ఎలా చెరిగిపోతాయి? వాటిని నెత్తినపెట్టుకున్న అపకీర్తి మాత్రమే ఆ సమర్థకులకు దక్కుతుంది.


>> అయినా బ్రహ్మచారి చెప్పిన స్త్రీతత్వం నిజముగా స్త్రీలకు సంబంధించే అనుకోవటం జనుల అమాయకత్వం. >> అవునా? అమాయకత్వమే అయివుంటుంది లెండి! బాగా తెలివి గలవాళ్ళు వచ్చి, ఉన్న విషయాలను కప్పిపుచ్చి- అనుకూలాన్వయంతో కొత్త అర్థం విప్పిచెప్పేదాకా ఆ అమాయకత్వం పోదనుకుంటాను.

మరి బ్రహ్మచారి కాని ధర్మరాజు.. స్త్రీల స్వభావం గురించి వాక్రుచ్చిన విషయాల సంగతి? వాటిని ఏ రకంగా అనుకుంటే అమాయకత్వం కాకుండా పోతుందో మరి!

వేణు చెప్పారు...

‘‘ ధర్మరాజు వరసగా ఓడిపోయాడు కాబట్టి తమ్ముళ్ళనూ, భార్యనూ పందెంగా ఒడ్డాడు. దుర్యోధనుడు అసలు ఓడలేదు కాబట్టి అలాంటి సందర్భమే రాలేదు. రెండోసారి జూదంలో ఎవరు ఓడినా అరణ్యవాసం, అజ్ఞాతవాసం పాటించాలని నిబంధనలు పెట్టుకున్నారు" అని ఓ వ్యాఖ్యకు జవాబుగా రాశాను కదా?

మరోసారి చదువుకుంటే నేను అంత స్పష్టంగా రాయలేదని అర్థమైంది.

దీనిపై ఓ మిత్రుడు తన అభిప్రాయం మెయిల్లో పంపారు. తగినంత స్పష్టతతో ఉన్న ఆ వ్యాఖ్యను చూడండి.

‘‘ జూద పందాలలో వాళ్ళు ధనాన్నీ, నగలనీ ఒడ్డడంతో మొదలు పెట్టారు ఆట. ధర్మరాజు అన్నీ ఓడిపోతూ వుండటం వల్ల రాజ్యాన్నీ, తర్వాత తమ్ముళ్ళనీ, తర్వాత భార్యనీ ఒడ్డాడు. కౌరవులు నెగ్గుతూ వున్నారు. అంటే, వాళ్ళు ప్రతీసారీ తమ ధనాన్నో, నగలనో ఒడ్డుతూ వున్నారు. అంత ఆస్తి వున్నవాళ్ళు, తమ భార్యలని ఎందుకు ఒడ్డుతారూ? ఏమీ లేకే, ధర్మరాజు ఒడ్డాడు. ఒకవేళ దుర్యోధనుడు ఓడినా కూడా, ఇద్దరూ తమ తమ భార్యలని ఒడ్డే సందర్భం ఎప్పుడూ రాదు. ఎవడో ఒకడే భార్యని ఒడ్డుతాడు. గెలిచేవాడు ఎప్పుడూ ధనాన్నే ఒడ్డుతాడు. ’’

hari.S.babu చెప్పారు...

Question 1).ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి.

Ans 1:
1).యెందుకు వొదిలెయ్యాలి.మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్తించుకుంటారా?

2). అక్కద ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోన కర్నాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేసారు?హస్తినాపురం తరపునే కదా?ధర్మరాజు గెలిచింది హస్తినాపురాన్నే కదా? అయిదూళ్ళిస్తే యుధ్ధం చెయ్యను అంతే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్తే కదా యుధ్ధం జరిగింది!ఇంకా దృతరాష్ట్రుడు దయతల్చి ఇవ్వడం అంటే యేమిటో ధర్మరాజు దృతరాష్ట్రుడు ఇస్తే తీకోవతం అంటే యేమిటో వివరిస్తారా?

Question 2; ‘ఇదండీ మహాభారతం’లో అలా కావాలని వదిలేయటం ఎక్కడ జరిగిందో చెప్పమని అడిగాను. నా ప్రశ్నను వదిలేసి వేరే ఏదో రాశారు.

Ans: స్వర్గారోహన పర్వం వుదహరన ఇచ్చి జవాబు చెప్తే నేను ఇంకేదో రాసాను అంతున్నారు.

స్వర్గారోహణ పర్వం అని ఆ పర్వం పేరు?వాళ్ళు చేస్తున్నది మహాప్రస్థానం!కాలక్షేపానికి చేస్తున్న తిరుగుడు కాదు.శిఖరం కొసకి చేరినాక ఇంకా ముందుకు యెట్లా వెళ్తాడు?యే స్వర్గానికి చేరుకోవాలని అనుకున్నారో ఆ స్వర్గాధిపతి ఇక్కడి నుంచి విమానంలో రావాలి అని పిలుస్తుంటే ఆగకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి?

బయలు దేరే ముందు వెనక్కి తిరక్కుండా ఆగకుండా వెళ్ళాలి,చివరి వరకూ వెళ్లగలిగిన వాళ్ళు మాత్రమే అర్హులు అనే నియమం వుండటం,అందుకనే తనతో పాటూ రాగలిగిన కుక్కని కూడా యెక్కించాలని పట్తుబట్టటం గురించి మీ అభిమాన రచయిత్రి చేప్పారా చెప్పలేదా,యెందుకని?

ఇంత స్పష్తంగా మీరు అడిగినదానికి వుదాహరన చెప్తే అది ఇంకేదో సుత్తి రాసినట్తు అనిపించింది మీకు,యెందుకని?

hari.S.babu చెప్పారు...

@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు దుర్యోధనుడు తనకు రాజ్యాధికారం లేదని చెప్పిన ముక్క మాత్రం అక్కడ లేదు!
ans:
అక్కద మీకు విదురుడి పరంగా చెప్పాడు అని మీరే ఒప్పుకున్నా అక్కడ యేమి అర్ధమయింది మీకు?.మన అలోచనలు యేవీ విదురుడికి తెలియకూడదని అట్లా ప్రవర్తిస్తున్నాను అనే కదా అంటున్నాడు.తనకి న్యాయంగా రాజ్యార్హత వుంతే ఆ దాపరికం అవసరమా?తనకి హక్కుగా రాజ్యాధికారం ఉంటే లక్కైంట్లో కాల్చి చంపాలని చూడటం లాంతి పన్లు చెయ్యాల్సిన అవసరం యేమిటి అనే అనుమానం మీకు గానీ ఇతర్ల కెవరికీ రానే లేదా?

వేణు గారు సరి చేసినట్టు ఖాందవ ప్రస్థానికి వెళ్ళమని దృతరాష్ట్రుడు ధర్మరాజుని అడీగే సన్నివేసానికి ముందే ధర్మరాజు కాబోయే రాజు అని రూఢిగా వుందతం వల్లనే అతన్ని రంగం నుంచి తప్పించటానికే ఆ ప్రతిపాదన చేసాడు దృతరాష్ట్రుడు.

Unknown చెప్పారు...

@ హరిబాబు

ఆ ముక్క అక్కడ లేదనే చెప్పాను. ఉంటే చూపించండి. అసలు రాజ్యాధికారం వుందా లేదా అన్న విషయం మీద వాదించే ఆసక్తి నాకు లేదు.

ఇంకెక్కడైనా ఉండొచ్చు, లేక పోవచ్చు. నాకనవసరం. మీరు అక్కడ వుందన్నారు కాబట్టి ఆ పేరాలు quote చేశాను. తండ్రిని నిలదీసే విషయంలో మీ వాదననే సమర్థిస్తూ, లేని దాన్ని లేదని చెప్పాను, అంతే.

వేణు చెప్పారు...

@ కాయ: మీరు రెండు వ్యాఖ్యలు రాసి పంపించారు. కానీ రెండిట్లోనూ అసభ్యకర పద ప్రయోగం చేశారు. అందుకే వాటిని ప్రచురించటం లేదు!

hari.S.babu చెప్పారు...

@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు దుర్యోధనుడు తనకు రాజ్యాధికారం లేదని చెప్పిన ముక్క మాత్రం అక్కడ లేదు!
Ans:
నేను గడ్డివామిలో సూది వెతికినంత జాగ్రత్తగా నా కామెంట్ల నన్నీ చదువుకున్నా నేను దుర్యోధనుడి పేరు ప్రస్తావించి అతడి రాజ్యార్హత గురించి యెక్కడా ప్రస్తావించలేదు.నా వాదన అంతా దృతరాష్ట్రుదికే రాజ్యార్హత లేదు అనే.అయినా నేను అనని ముక్కని నాకు అంటగట్టి హరిబాబు గారు చెప్పిన ముక్క అక్కద లేదు అంటున్నారు,మీకూ నాకూ ఈ లడ్డాయిలు తప్పేవి కావనుకుంటా:-)

నేను చదివి పదేళ్లయింది విదురుడికి బదులు భీష్ముడు అనే పేరు కలిసింది.అదీ సెకండరీ పాయింటు.అసలు సంభాషణ కరెక్తని మీరూ ఒప్పుకున్నారు, కృతజ్ఞుణ్ణి!

వేణు గారు ధర్మరాజు వెళ్ళింది ఖాందవ ప్రస్థం అన్నారు నేను ఇంద్రప్రస్థం అన్నదానికి.ఖాందవప్రస్థం అనేది ఒక అరణ్యం.దాన్ని యెట్లా బాగు చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అగ్నిదేవుడు వీళ్ళ సాయంతో ఆ ఖాందవ వనాన్ని దహిస్తాడు.ఆ సమయంలో అక్కడ ఉన్న మయుణ్ణి అర్జునుడు రక్షించితే కృతజ్ఞతగా మాయసభ కట్టి ఇంద్రప్రస్థం యేర్పడుతుంది.ఇవన్నీ వడ్లగింజలో బియ్యపు గింజ లాంటివని నా ఉద్దేశం. యెవరివైపు నుంచి వచ్చినా పెద్దగా దోషం లేనివే!

Unknown చెప్పారు...

హరిబాబు గారు,

నేనూ ఇప్పుడే చూశాను. దుర్యోధనుడు అన్నది typo గా గుర్తించగలరు. నేను రాయాలనుకున్నది ధృతరాష్ట్రుడు అనే, పొరపాటుగా దుర్యోధనుడు అని రాశాను, సారీ.

వేణు చెప్పారు...

@ Hari Babu Suraneni: పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు.

పాండవుల మహాప్రస్థాన గమ్యం స్వర్గమని మీరంటున్నారు కానీ, భారత కథలో అది లేదు. తర్వాత రాబోయే పర్వానికి స్వర్గారోహణ అని కవి పెట్టాడు కాబట్టి ‘వారి గమ్యం స్వర్గం’ అనటం పొంతన లేని ఊహ మాత్రమే అవుతుంది.

>> బయలు దేరే ముందు వెనక్కి తిరక్కుండా ఆగకుండా వెళ్ళాలి,చివరి వరకూ వెళ్లగలిగిన వాళ్ళు మాత్రమే అర్హులు అనే నియమం వుండటం.. >> ఈ నియమం నేను చదివిన ఏ భారతంలోనూ కనపడలేదు. ఒకవేళ ఉంటే ఆ నియమం ఫలానా చోట (పర్వం- ఆశ్వాసం ) ఉందని చెపితే పాఠకులు కూడా తెలుసుకుంటారు.

కాయ చెప్పారు...

అసభ్యం ఏముందో ప్రచురిస్తే మిగతా వారు చెప్పాలని నేను కోరుతున్నాను.. అంత కష్టపడి తెలుగులో టైపు చేస్తే, ఏదో తిక్కతో వ్రాసినట్లు అర్థం లేకుండా వ్రాశానని మీరు ఆరోపిస్తున్నారు..దయచేసి ప్రచురించండి.. అసభ్య పదాలని వీలైతే మార్క్ చేయగలరు..

వేణు చెప్పారు...

@ కాయ: అంత కష్టపడి తెలుగులో టైపు చేశారు కాబట్టి మీరు రాసినదాంట్లో అసభ్యపదం ఏమిటో గుర్తుండేవుంటుంది. ఆ వ్యాఖ్యలను ప్రచురించే ప్రసక్తి లేదు. అభ్యంతరకర పదాలను మార్క్ చేయడం కూడానా?

hari.S.babu చెప్పారు...

@venu
పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు.
Ans:
అంటే దానర్ధం యేమిటి?
యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మతుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?

తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాదికి మీ అభిప్రాయాలు చెప్పంది,వాదించంది అని ఆహ్వానాలు యెందుకో?!

ఆ ముక్క ముందే చెపితే మాకీ చెతుల నెప్పులెందుకు?మీ అభిప్రాయాల్ని వాదనగా వినిపించందనే మాట యెందుకు?

ఈ జవాబు మీరు పబ్లిష చెస్తారో చెయ్యరో తెలియదు- ఒకటి మాత్రం అర్ధం చేసుకోండి!పాయింతు గట్తిగా వుందా లేదా అనేది తేల్చకుండా ఒకసారి చెప్పేసాను,మళ్ళీ మళ్ళీ చెప్పను అనదం సరయిన వాదనా పధ్ధతి యేనా?

వేణు చెప్పారు...


@ Hari babu : ఒకరు చెప్పిన వాదనలోని పాయింటును అవతలివారు గ్రహించనపుడు/ అంగీకరించనపుడు ఆ చర్చ ఇక కొనసాగదు. అలాంటి పరిస్థితి వచ్చిందనుకున్నపుడే ‘మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు’ అన్నాను. చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పటం వృథా కాబట్టి !

పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ లేదు. కానీ ఈ పాయింటును మీరసలు పట్టించుకోవటం లేదు/ అంగీకరించటం లేదు.

ధృతరాష్ట్రుడి రాజ్యార్హతతో సంబంధం లేని విషయాన్ని దానితో సంబంధం పెట్టి చూస్తున్నారు మీరు.

అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు? యుద్ధం గెలిచాక కూడా ధృతరాష్ట్రుణ్ణీ, గాంధారినీ పాండవులు గౌరవంగానే చూశారు. శత్రువుల్లాగా ఏమాత్రం చూడలేదు. పాండవుల తల్లి కుంతి చరమ దశ గాంధారితో పాటే గడిచింది.

hari.S.babu చెప్పారు...

@venuvu
అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?
ans/que;భీష్మ,ద్రోణ, కర్ణాదు లంతా హస్తినాపురం తరపున యుధ్ధం చేసారు!హస్తినా పురం సైన్యం ఓడిపోతే దృతరాష్ట్రుదు ఓడిపోయినట్టు కాదా?

గెలిచిన వాడు ఓడిపోయిన వాడు దయదల్చి ఇస్తేనే తీసుకోవాలనటం గొప్ప పాయింటా?

వేణు చెప్పారు...

@ Hari Babu: హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు. ఒకవేళ మీరు భారతంలో అలా చదివివుంటే మీరు చెప్పిన ఈ వ్యక్తీకరణలకు నిర్దిష్టంగా ఆధారం చూపండి.

Unknown చెప్పారు...

ఇక్కడ మహా భారతం గురించి చర్చ జరుగుతున్నదా లేక ' ఇదండీ భారత ' గురించి జరుగుతుందా? ఇదండీ భారతం గూర్చి చర్చ అయితే ఇక్కడ చర్చలో పాలొన్న వాళ్లు ఎంత మంది దాన్ని చదివారు? దానికి వ్యతిరేక చర్చలో ఉన్న వారు ఎవరూ చదవలేదనే తెలుస్తుంది. వారు జనరల్ ' భారతాని పట్టుకోని వాధిస్తున్నట్లు తెలుస్తుంది.
/‘భారతదేశంలో రామాయణాన్ని గానీ, మహాభారతాన్ని గానీ తొలిసారే ఎవరూ చదవరు’ అంటారు సాహితీవేత్త ఏకే రామానుజన్. (మొదటిసారి చదవటానికి ముందే ఆ కథలు తెలిసివుంటాయని అర్థం.) . /
ఈ మాట అక్ష్రరాల నిజం. అందుకే రంగనాయకమ్మంగారు 'ఇదండి భారతాన్ని" బయట పెట్టారు. అట్ట మీధ పేరు మాత్రమే చదివి చర్చ చేయకుండా లోపలికి వెళ్ళి చదివి చర్చ చేస్తే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక అర్ధం ఉంటుంది. ( ఉధా:- దౄతరాస్ట్రునికి రాజ్యాధి కార హాక్కు లేదు " అనడం. ఈ నిర్ధారణ ఏ న్యాయ ప్రాతిపదికన చేస్తున్నారు.దానికి ఉన్న కొల మానం ఏమిటి? - అంటే సాటి మనిషిని నువ్వు మనిషివే కాదు అన్న దోరణి కాదా? నీకు జీవించే హక్కే లేదు అని నిరాకరించడం కాదా? మాములు మాటల్లో చెప్పుకొంటే అవతలి వాడి హకకును వాడు ఎలా ఉపయోగించుకుంటాడో నన్న మీమాంస చేయడం ఏమాత్రం సరి కాదు. వాడికి దొరికి హక్కును వాడు కాపాడుకుంటాడా లేక గంగలో కలుపు తాడా అన్న సంశయం ధర్మ రాజుకి అవసరం లేదు. నాకు ఇక్క డ హే రాం ' సినిమాలో ఆ పాత్ర దారుడు ఉపయోగించిన గుర్రం పొర పాటున కింద పడ గానే దాన్ని కాల్చి చంపడం గుర్తొస్తుంది.

వేణు చెప్పారు...

@ Tirupalu P: ఏ పుస్తకాన్నయినా చదివాకనే వ్యతిరేకించటమో, విమర్శించటమో చేయాలి. మెచ్చుకోవాలన్నా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

అయితే- ‘ఇదండీ మహాభారతం’ వ్యాసుడు రాసిన ‘మహాభారత’ పరిచయమే. అందుకని మహాభారత చర్చ ఈ పుస్తక చర్చ కాకపోవచ్చుగానీ పరోక్షంగా దానికి ప్రాతిపదిక అవ్వొచ్చు.

మహాభారతాన్ని తెలుగు వచనంలో రాసినవాళ్ళలో పురిపండా అప్పలస్వామి లాంటి కొద్దిమంది తప్ప- చాలామంది వివాదాస్పద అంశాలను దాటవేయటమో, అనుకూలార్థం వచ్చేలా అన్వయించటమో చేశారు. అందుకే ఎన్నో విషయాలు స్థూలంగా తప్ప, సవివరంగా ఎక్కువమందికి తెలియకుండా పోయాయి.