సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, ఏప్రిల్ 2011, మంగళవారం

రాజా మినీ కవితల మెరుపులు!


‘‘కొందరివి యతి ప్రాసలు
కొందరివి కుతి ప్రాసలు ’’


బాగుంది కదూ! 

ఈ మినీ కవిత రాసింది ‘హాసం’ రాజా.  దీనికి శీర్షిక  ఏమిటో చూడండి...  ‘ఇదీ ఆ జాతే’.


రాజా మినీ కవితల చిరు పుస్తకం ‘కదన కుతూహలం’. దీని గురించి  రాయాలనే కుతూహలం నాకెందుక్కలిగిందంటే- ఈ  కవితలను పాతికేళ్ళుగా నేను మర్చిపోకపోవటమే;  ఎన్నో సందర్భాల్లో అవి  కోటబుల్ గా గుర్తుకురావటమే!


కవితల్లోని పదాలూ, భావాలూ కదం తొక్కుతూ చమత్కారాలతో,  చమక్కులతో, భాషా విరుపుల మెరుపులతో ఆకట్టుకుంటాయి!  ‘ఎమ్వీయల్’ రచనల్లాగా  ఆ అక్షరాలు క్రీడా విన్యాసం చేస్తాయి.

కీ.శే. పెండ్యాల నాగేశ్వరరావు గారి మాటల్లో- ‘నిరంతర సత్యాల లోతులను అతి చిన్ని మాటలలో చేతికందివ్వడం రాజాకే చెల్లిందనిపించింది’. 

కీ.శే. రావుగోపాలరావు గారి ప్రశంస చూడండి- ‘.. అందమూ, ఆనందమే కాక ఈ కవితల్లో ‘ఆలోచించండి ప్లీజ్!’అనే తియ్యటి ఆజ్ఞాపన ఉంది’. 

య(మ)స్పీ(డు)  బాలసుబ్రహ్మణ్యానికి (ఈ ప్రయోగం రాజాదే) అంకితమిచ్చిన ఈ కవితలు  పి. సుశీల,  జానకి గార్ల అభినందనలు కూడా అందుకున్నాయి. 


‘కదన కుతూహలం’ 1982 అక్టోబర్లో విడుదలైంది. ఇదెంత ‘మినీ’పుస్తకమంటే  అరచేయంత  సైజు కూడా ఉండదు. A 4 పేపర్ లో పావువంతు కంటే కూడా చిన్నదన్నమాట.  పేజీకో కవిత  ఇవ్వాలనే కారణం వల్ల .. కవిత  బుల్లిది కాబట్టి   పేజీ సైజు కూడా అనివార్యంగా తగ్గిపోయింది. 

‘హాస్య ప్రియ’ మాసపత్రిక లో ‘పదాల పాలవెల్లి’ పూర్తిచేసి పంపినందుకు ఈ పుస్తకం నాకు కానుకగా వచ్చింది, 1985 మార్చిలో!

గళ్ళ నుడికట్లు నింపే  అలవాటు నాకుండేది. కానీ ఎప్పుడూ ఒకటో రెండో పదాలు తెలిసేవి కావు. మొదటిసారిగా ఇలాంటి పోటీలో విజేతగా నిలిచానప్పుడు. పైగా పుస్తకం బహుమతిగా రావటం థ్రిల్లింగ్ గా అనిపించింది.  అప్పుడు తొలిసారిగా  చదివాను రాజా కవితలు.

ఈ పుస్తకంలో  50 మినీ కవితలున్నాయి.  





వాటిలో నాకు నచ్చినవి కొన్ని...

ఆర్ట్ బీట్
స్టెతస్కోప్ కీ
ఇయర్ ఫోన్ కీ
తేడా పెద్దగా ఏం లేదు
రెండూ జనాల
గుండెలతో ఆడుకునేవే

రూట్
పాతిపెడితే  మరో రూపంలో
మొలకెత్తగలిగేవి
విత్తనం, ఉడుకు మోత్తనం

వా (మను) డే (మహ) వీ (రు) డు
భూ ఆక్రమణోద్యమంలో
నేటి మానవుడికి ప్రేరణ
నాటి వామనుడే

Appendix
నిఘంటువులో మొదట
చూసేదెప్పుడూ చెడు మాట
ఆంక్షలున్న చోట
కాంక్షలూరు ఊట


(చివరి రెండు లైన్లూ నాకు మరీ మరీ నచ్చాయి. ఒక జీవిత సత్యాన్ని ఎంత అందంగా చెప్పారో కదా! )


ఎదుటి మనిషికి
చెప్పేటందుకే...
ఉచిత సలహాలు
ఉమ్మెత్త పూవులు
కృషి లేకనే
రూపు దిద్దుకుంటాయి
మొదట ఉంటాయి సున్నితంగా
పోనుపోను మారుతాయి కంటకంగా

(ఎవరికైనా సలహా ఇవ్వాల్సివచ్చినపుడు ఈ కవితే నాకు హెచ్చరికగా గుర్తొస్తుంటుంది. )


అందుబాటులో లేవు...
ఇలాంటి పుస్తకాలు పాఠకులకు ఎప్పడూ అందుబాటులో ఉంటే బాగుంటుంది. కానీ ఈ ‘కదన కుతూహలం’ తర్వాత మళ్ళీ పుస్తకంగా రాలేదు.

రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిని ముఖ్య పాత్రధారిగా చేస్తూ రాజా  రాసిన  ‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’  నవల అప్పట్లో సంచలనం!  ‘పల్లకి’ వీక్లీ లో వచ్చిన  ఈ సీరియల్ ను  పద్మాలయ పబ్లికేషన్స్ వారు పుస్తకంగా వేశారు.  మూడు ప్రింట్లుగా  వచ్చాయి.  ఆ తర్వాత ఆ ప్రచురణ కర్త  ఎమెస్కో ని కొని ఈ పబ్లికేషన్స్ ని క్లోజ్ చేసేశారు. కాబట్టి ఇది కూడా మార్కెట్లో దొరకదు. 


మ్యూజిక్ జర్నలిజంలో  కృషి చేసిన రాజా ‘మ్యూజికాలజిస్ట్’గా  పేరు పొందారు.  ఆయనకు 40,000 పైగా పాటల లైబ్రరీ ఉందట. 2,000 కు పైగా   సినిమాలు, 1,000 కి పైగా రెఫరెన్సు పుస్తకాలు కూడా ఆయన దగ్గరున్నాయట.  ‘వార్త’ దినపత్రికలో రాసిన ‘ఆపాత మధురం’ శీర్షికను  సినీ సంగీత ప్రియులు ఎంతగానో ఇష్టపడ్డారు.   దూరదర్శన్లో  తొలి తెలుగు ధారావాహిక 'బుచ్చిబాబు' కు  స్క్రిప్ట్ రాసింది రాజానే!

ఆయన బ్లాగు తెలుసుగా? మ్యూజికాలజిస్ట్ రాజా .  


12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఈ బొమ్మను చూసి థ్రిల్లయిపోయాను!

చందమామ జులై 1978 సంచికలో 
‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్   ప్రారంభ చిత్రం. 
 (నాకు నచ్చిన బొమ్మ...  ఇది కాదు :-))

నాకు  చందమామలో   చిత్రా, శంకర్ ల బొమ్మలు బాగా  ఇష్టమే కానీ,  మరో ఆర్టిస్టు  ‘జయ’ బొమ్మలు కూడా నచ్చేవి.

‘చిత్రా’ బొమ్మల్లో కనిపించే  స్వేచ్ఛ గానీ, కదలిక గానీ వీటిలో  ఉండకపోవచ్చు గానీ,

 ఇవి ‘పద్ధతి’గా  ఉండేవి. 

కట్టడాలన్నీ స్కేలుతో గీసినట్టు  సౌష్ఠవంగా  కనిపించేవి. 

J   అక్షరం  ఎడమవైపునున్న వంపును పైకి  గీసి, Jaya తన సంతకం చేయటం అందంగా తోచేది.  

‘మాయా సరోవరం’బొమ్మలు గీయటం పూర్తిచేసి, చిత్రా అస్తమించాక  దాసరి సుబ్రహ్మణ్యం  గారి జానపద సీరియల్  ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి  చిత్రకల్పన చేసే అవకాశం Jaya నే వరించింది.

అప్పటికే చందమామలో  చాలా కథలకు తాను  వేసిన బొమ్మలతో జయ ప్రాచుర్యం పొందాడు. 

అయితే  ఆ  సీరియల్ గానీ, ఆ బొమ్మలు గానీ నన్ను పూర్తిస్థాయిలో  ఆకట్టుకోలేకపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... జయ కష్టపడి వేసినప్పటికీ  ఆ  బొమ్మలు  పాఠకులను అంతగా  ఆకర్షించలేదు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చిత్రా బొమ్మలతో పోల్చిచూడటం వల్లనే  ఇలా జరిగిందనుకుంటాను. 

 ఫలితంగా... ఈ సీరియల్ ముగియగానే చిత్రా బొమ్మలతో  రెండోసారి  ‘తోకచుక్క’ పొడవక తప్పలేదు. 

అయితే...

‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి జయ వేసిన  బొమ్మల్లో ఒక్కటి మాత్రం 30 ఏళ్ళుగా  నా స్మృతి పథంలో నిలిచిపోయింది. 

ఆర్టిస్టు చిత్రించిన  కోణం నన్నెంతో థ్రిల్ కు గురిచేసింది.

‘ఎంత బాగా వేశాడు’ అనిపించింది.
 

ఆ బొమ్మ గురించి  అందరితో  పంచుకోవచ్చని రెండు రోజుల క్రితం తట్టింది.

వెంటనే  ఆ బొమ్మ కోసం చందమామ వెబ్ సైట్లో  ఆర్కయివ్స్ లో వెతికాను.

కనపడింది!

మూడు  దశాబ్దాల తర్వాత...నాటి  నా  సంభ్రమాన్ని తలపోసుకుంటూ  చూశాను  మళ్ళీ! 

అదొక్కటే కాదు;

ఆ బొమ్మ కు పూర్వదశలు అనదగ్గ  మరో మూడు బొమ్మలు  కూడా ఆ సీరియల్లో   కనపడ్డాయి. 

ఈ బొమ్మలన్నిటినీ  వరుసగా  చూపిస్తే చాలా బాగుంటుందనిపించింది!

మరి  చూడండి... ఆ  చిత్రాలు!



 మనం కొంత  ఎత్తులోనుంచే  చూస్తున్నాం  కదూ  కోటను.  (ఏప్రిల్ 1979).


ఏనుగుల్నీ, భల్లూకాన్నీ తర్వాత చూడొచ్చు;   
కోట సింహద్వారాన్ని గమనించండి.  
మనం  మరి కాస్త ఎత్తు నుంచే  దీన్ని వీక్షిస్తున్నాం.   అవునా? (జూన్ 1979)
ఆర్టిస్టు జయ మనల్ని ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళి 
ఈ కోటను చూపిస్తున్నాడు 
 (సెప్టెంబరు 1979).  
బాగుంది కదా...   
   అందుకే,    తర్వాతి   నెలలో విహంగవీక్షణ చిత్రాన్ని 
 పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు  జయ!


  ఇదేనండీ... నన్ను మురిపించిన ఆ  బొమ్మ !  (అక్టోబరు 1979)

ఇంత ఎత్తు నుంచి చూపిస్తే-  

చంద్రశిలా నగర ద్వారం వద్ద మాయా మర్కటుడు గానీ,
అతణ్ణి అడ్డగిస్తున్న కాపలా భటులు గానీ ...

 మనకు  స్పష్టంగా  ఎలా కనపడతారు చెప్పండి!

కానీ అలా కనపడకుండా  విభిన్నమైన కోణంలో గీయటం వల్లనే కదా,  ఈ చిత్రం ఇంతగా బాగుందీ!