సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, అక్టోబర్ 2011, శుక్రవారం

మనుషులూ... మతాలూ... దేవుళ్ళూ!

మధ్య నేను ఎక్కువగా చదివినవి రచయితల స్వీయ కథలూ,  యదార్థ గాథలే.  ఈ  పరంపరకు భిన్నంగా వైజ్ఞానిక దృక్పథంతో సాగిన ఓ రచనను కొద్దిరోజుల క్రితం చదివాను.

ఈ వ్యాస సంకలనం  పేరు ‘మనుషులు చేసిన దేవుళ్ళు’. శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత  కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన.  ఈ- పుస్తకం లభించే  కినిగె లింకు- http://kinige.com/kbook.php?id=397&name=Manushulu+Chesina+Devullu

ఈ పుస్తకం పేరు విన్నపుడు వందేళ్ళ క్రితం గురజాడ రాసిన కథ శీర్షిక – ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?’ గుర్తొస్తుంది.

‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునుఅని  ఆ మహాకవి ఎందుకు ఆకాంక్షించాడో  స్పష్టమవుతుంది.

మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషణ చేసిన పుస్తకమిది.  ఆస్తికులుగానో, నాస్తికులుగానో ఉండకుండా తటస్థంగా ఉన్నవారికి ఈ రచన ఎక్కువ ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా హేతువాద దృక్పథం ఉన్నవారు తమ భావాల శాస్త్రీయ ప్రాతిపదిక కోసం ఇది తప్పనిసరిగా  చదవదగ్గది. 

‘మరి భక్తి విశ్వాసాలున్నవారు ఈ  పుస్తకం చదవకూడదా?’ అంటే చదవొచ్చు.   

ఈ ప్రపంచం మనిషి కోసమే ఉందనీ, మానవులుగా  పుట్టటం ఎంతో ఉత్కృష్టమైన విషయమనీ నమ్మేవారికి ఈ భూగోళమ్మీద మనిషి ఎంతో జూనియర్ అనీ, అతడి ప్రమేయం లేకుండా ఎంతో సుదీర్ఘకాలం గడిచిందనీ చెప్పే సైన్స్ వివరణ అంత తేలిగ్గా మింగుడుపడకపోవచ్చు.  ‘‘చావు విషయంలో మనకూ, ఊరకుక్కలకూ, బొద్దింకలకూ తేడా ఏమీ ఉండదని నమ్మడం ఏ మనిషికైనా చాలా కష్టమే’’  అంటారు రచయిత ఈ పుస్తకంలో. 

తాము విశ్వసిస్తూ పాటిస్తున్న భావాలకు మూలాలేమిటో  వేరే కోణంలో చదవటం- మత విశ్వాసాలున్నవారికి భిన్నమైన అనుభవమే అవుతుంది కదా?

పుస్తకంలో ప్రస్తావించినవాటిలో దేని గురించి అయినా వివరాలు కావాలంటే రచయిత ఈమెయిల్ rohiniprasadk@yahoo.com  ద్వారా సంప్రదించే అవకాశముంది.
 

 ‘ఏ మాత్రమూ ఆవేశానికీ, ఉద్వేగాలకూ, ముందే మనసులో ఉన్న మార్క్సిజం వంటి సిద్ధాంతాలకూ లోబడకుండా మతాల గురించి విశ్లేషణ చేసుకోవచ్చు. కాస్త ప్రాథమిక విజ్ఞాన వైఖరి ఉంటే చాలు’ అంటారు ఉపోద్ఘాతంలో రచయిత.

ఈ పుస్తకం గురించి అక్టోబరు 23 ఈనాడు సండే మ్యాగజీన్ లో చిన్న పరిచయం రాశాను.


రచయిత మాటల్లో...
ఈ పుస్తకంలో ఆలోచనాత్మకంగా, ఆసక్తికరంగా ఉన్న కొన్ని అంశాలను యథాతథంగా ఇస్తున్నాను.


తాల గురించి విజ్ఞానపరంగా ఆలోచించడం సబబు కాదని చాలామంది అనుకుంటారు. వీరిలో మతాలలో నమ్మకం లేనివారు కూడా ఉండవచ్చు. మతాలు అకస్మాత్తుగా తలెత్తినవి కావనీ, మానవ సమాజం పరిణామ దశల్లో మొదలైనవేననీ గుర్తుంచుకుంటే మతాలనేవి ప్రజల మనసుల్లో ఎలా రూపు దిద్దుకున్నాయో అర్థమవుతుంది.

*   *    *

1400 కోట్ల ఏళ్ళ వయసు గల విశ్వంలో భూమి పుట్టి 500 కోట్ల ఏళ్ళు కూడా కాలేదు. జరుగుతున్నవి చూసి, అర్థం చేసుకోగలిగిన మానవజాతి మొదలై 2 లక్షల ఏళ్ళు కూడా గడవలేదు.

... భూమి వయసుతో పోలిస్తే మనవంటి జీవరాశి వయసు చాలా తక్కువన్నమాట. మొదటి 400 కోట్ల సంవత్సరాల కాలంలో ఎవరైనా గ్రహాంతర యాత్రికులు భూమిని సందర్శించినట్టయితే వారికి కనబడే  జీవపదార్థం కేవలం నాచు లాంటిది మాత్రమే అయివుండేది.

... జీవకణాలు పుట్టిన ఎంతోకాలానికి గానీ మానవజాతి రూపొందలేదు. అందుకనే ఈ ప్రపంచమంతా మనుషుల కోసమే అనే భావన అర్థం లేనిదిగా అనిపిస్తుంది. అంతేకాక మనిషీ, దేవుడూ, జీవాత్మా, పరమాత్మా అంటూ మనవాళ్ళు అల్లుకునే ఊహలు ఎంత సంకుచితమైనవో తెలుస్తుంది.

*   *    *

దేవుళ్ళూ, పూనకాలూ, దెయ్యాలూ, చేతబడులూ, ప్రేతాత్మలూ అన్నీ ఎంతో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న మూఢనమ్మకాలు.
*   *    *

తాలంటే కేవలం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టటమే కాదు.  పునర్జన్మలూ, బాబాల మహిమలూ, జాతకాలూ, చిలకజోస్యం అన్నీ కూడా కంటికి కనబడని అతీత శక్తిలోని నమ్మకాలకు దృష్టాంతాలే.  ఈ భ్రాంతికి కారణాలు-
కొన్ని చరిత్రాత్మకమైనవి,
కొన్ని సామాజికమైనవి,
కొన్ని బూటకపు మోసాల ఫలితాలు,
మరికొన్ని మన నాడీమండలం మనమీద కలిగించే ప్రభావాలు.


*   *    *

న శరీరంలో పెద్దపేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు మనకు పనికొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేకపోగా అప్పుడప్పుడూ అపెండిసైటిస్ వ్యాధిని కూడా కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.  

ఉపసంహారం
మెదడుపై జరుగుతున్న ఆధునిక పరిశోధనలవల్ల  తెలిసిన ఒక  విషయం గురించి రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావిస్తారు. 

అదేమిటంటే... 

ఉన్నవీ, లేనివీ కల్పించుకునే అనవసరమైన ఊహాశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణమట.  అందుకే పూర్తిగా హేతువాదవైఖరి కలిగినవారు చాలా అరుదుగా ఉంటారట.

అసలు మన సమాజంలో  హేతువాదులే  చాలా తక్కువమంది. ఆ తక్కువమందిలో కూడా పూర్తి హేతువాదులు  మరీ స్వల్పం!  దీనికి మెదడుకు  అలవడిన లక్షణం కూడా కారణమన్నమాట!

సమాజంలో హేతువాద భావనలు బలపడేందుకు కృషి మరింత పట్టుదలతో  జరగాలని ఆకాంక్షిస్తూ ముందుమాటలో ఇలా రాశారు టంకశాల అశోక్ -

‘మనిషిని, ప్రకృతిని, సమాజాన్ని, వ్యవస్థలను, ఇటీవలి చారిత్రక పరిశోధనలను తరచి చూసి రాసిన ఈ వ్యాసాల సంకలనం ఇప్పటికే హేతువాదులైనవారికి కూడా చదవదగినది అవుతున్నది’