సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, ఆగస్టు 2009, సోమవారం

ఈ ‘...చక్కని పాడియావు’ ఎవరిది?



రంగనాయకమ్మ గారు రాసిన కొత్త పుస్తకం ఇది! తాజాగా విడుదలైంది.

విశేష ప్రాచుర్యం పొందిన ఈ ‘భరత ఖండంబు...’ పద్యం ఎవరు రాశారనే దానిపై ఈ మధ్య వివాదం రేగిందని చాలామందికి తెలుసు.

దీని గురించి వెలువడిన రెండు పక్షాల వాదనలనూ పరిశీలించి, రంగనాయకమ్మ గారు ఈ చిన్న పుస్తకం రాశారు!

ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారని మనమందరం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. కానీ నిజానికి ఆయన రాయలేదనీ, చెన్నాప్రగడ భానుమూర్తి గారు ఈ పద్యం రాశారనే వాదన- వివాదానికి కేంద్రం.

విశేషమేంటంటే....చిలకమర్తి గారూ, భానుమూర్తి గారూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఊళ్ళో, ఒకే బళ్ళో కలిసి చదువుకున్నారు కూడా. చిలకమర్తి గారు రాసిన ఒక నవలను భానుమూర్తి గారు నాటకంగా మార్చారు. భానుమూర్తి గారు చిన్నప్పట్నుంచీ పద్యాలు రాసేవారనీ, ఆయన్ను చూసే తను కవిత్వం రాయడం మొదలుపెట్టాననీ చిలకమర్తి గారు స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

అసలు ఈ పద్యం ఎవరిదనే విషయం గురించిన వివాదం ఈ ఇద్దరి జీవించి ఉన్నపుడు రాలేదు. కాబట్టి ఈ వివాదంతో వారిద్దరికీ సంబంధం లేదు. భానుమూర్తి గారు 1947లో చనిపోతే; చిలకమర్తి గారు అంతకంటే ఏడాది ముందే కన్నుమూశారు.

1959లో ఈ వివాదానికి బీజం వేసింది పోతుకూచి సూర్య నారాయణ గారు. అప్పట్లో ఆయన ‘సాహితీ కౌముది’ అనే పత్రికకు రాసిన ఉత్తరంలో దీన్ని ప్రస్తావించారు. కానీ ‘ఉపపత్తులు’ (ఆధారాలు) చూపమని ఆ పత్రిక వారు అడిగితే... ఇప్పటిదాకా మౌనం వహించి, ఉండిపోయారు.

ఈ సంవత్సరం మార్చిలో కరణం సుబ్బారావు గారి ‘ఈ పద్యాన్ని వ్రాసిందెవరు?’ పుస్తకం తో ఈ వివాదం ఇన్నేళ్ళ తర్వాత మొదలయింది.

‘‘వంద సంవత్సరాల నాటి పద్యం నా కంట పడింది. అంతే. దాని వెంట పడ్డాను. నా పంట పండింది.’’ అన్నారాయన.

ఆయన వాదనను ఖండిస్తూ ఈ పద్యం చిలకమర్తిదే అని వాదించేవారి ప్రతినిధిగా దివాన్ చెరువు శర్మ గారు నిలబడ్డారు.

ఈ సంవత్సరం మే, జూన్ నెలల్లో రాజమండ్రిలో రెండు వర్గాల వారూ పోటాపోటీగా సభలు జరిపారు. తర్వాత ఈ రెండురకాల వాదనలను చెపుతూ పుస్తక రూపంలో రాని అచ్చు, రాత ప్రతులు కూడా విడుదలయ్యాయి.

ఈ వివాదం మీద ఆసక్తితో రంగనాయకమ్మ గారు ఆ సమాచారాన్నంతా సంపాదించి పరిశీలించారు. చిలకమర్తి, భానుమూర్తి గార్ల రచనలు కూడా ఈ సందర్భం కోసం చదివారు.

‘‘ప్రారంభంలో నేను, ఇటూ అటూ ఎటూ కాదు. కానీ, చివరికి నేను కూడా ఒక అభిప్రాయానికి వచ్చాను’’ అంటూ రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో చెపుతారు. వివాదానికి కేంద్రమైన పద్యానికి ఉన్న దీర్ఘ చరిత్రను ఐదారు ఘట్టాలుగా చెపుతూ పరిశీలన సాగించారు.

కూలంకషంగా ఈ వివాదాన్ని చర్చించారు... ఒక్కొక్కరి వాదనలోని వైరుధ్యాలనూ, లోపాలనూ బట్టబయలు చేస్తూ!

‘‘ఏ ఆధారాలూ లేని మార్పుల్ని చూసి సందేహాలు పడి మౌనాలు వహిస్తే, ఆ మౌనాలే ఆధారాలా?’’

‘‘నాలుగు రాళ్ళు విసిరితే, ఏదో ఒక రాయి తగలకపోతుందా- అనే ఆశ ఇది! కానీ ఇక్కడ డజను పైగా రాళ్ళు విసిరినా, ఏదీ లక్ష్యాన్ని తాకకుండానే కిందపడ్డాయి’’.

సీరియస్ వాదనకు కూడా అక్కడక్కడా హాస్య గుళికలను జత చేయటం రంగనాయకమ్మ గారి ముద్ర. పుస్తకంలో రెండు మూడు చోట్ల ఇది కనిపిస్తుంది.

చర్చ కొనసాగిస్తూనే... దానిలో భాగంగా చిలకమర్తి, భానుమూర్తి గార్ల ఊహాత్మక సంభాషణలు రాశారు. వాటిని చదువుతుంటే తెగ నవ్వొచ్చేస్తుంది!

ఇలాంటి పరిశీలనా వ్యాసాన్ని శ్రద్ధగా రాయటం ఒక ఎత్తయితే, స్పష్టంగా ఆసక్తిగా కూడా మలచటం మరో ఎత్తు. రంగనాయకమ్మ గారు ఇదంతా అలవోకగా సాధించగలరని మరోసారి నిరూపిస్తుందీ పుస్తకం.

ఇంతకీ- రంగనాయకమ్మ గారు ఆ పద్యం ఎవరిదని అభిప్రాయపడ్డారు చివరకు ? ఇదే కదా మీ సందేహం?
అది తేల్చుకోవాలంటే... చదవాల్సిందే ఈ పుస్తకం!

20 రూపాయిల వెల ఉండే ఈ పుస్తకం కాపీలు విశాలాంధ్ర లాంటి పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. అక్షరాల ఫాంట్ రెగ్యులర్ సైజులో కాకుండా కాస్త పెద్దగా ఉండటం వల్ల చదవటం తేలిగ్గా అనిపిస్తుంది.

ఈ పుస్తకం షాపుల్లో దొరకనివాళ్ళు - అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ- 520 002 (ఫోన్: 0866-2431181) వారిని సంప్రదించొచ్చు!

తాజా కలం:    ఇది చిన్న  పుస్తకం కదా? అందుకే  దీన్ని ‘అసమానత్వంలో నించి అసమానత్వంలోకే’  పుస్తకంలో కలిపేశారు. 

కినిగెలో  ఈ-బుక్ కొనుగోలు చేయాలంటే ఈ లింకు చూడండి-  

 http://kinige.com/kbook.php?id=1010&name=Asamanatvamlo+Ninchi+Asamanatvamloke

6, ఆగస్టు 2009, గురువారం

మధుర స్వరాల ‘మధువొలకబోసిన’ వి. కుమార్!

‘చిత్ర తరంగిణి’ మొదలైతే చాలు... ఆకాశవాణి తరంగాల్లో తేలి వచ్చే ఆ పాట కోసం అప్రయత్నంగానే రోజూ ఎదురుచూసేవాణ్ణి. విజయవాడ రేడియో కేంద్రం వాళ్ళు నన్ను నిరాశపరిచేవారు కాదు.
తరచూ ఆ పాట ప్రసారం చేసి, నా నిరీక్షణ సార్థకం చేసేవాళ్ళు. అది కన్నవారి కలలు సినిమా లోని ‘మధువొలకబోసే... ఈ చిలిపి కళ్ళు...’ పాట!

పన్నెండేళ్ళ వయసులో .. నాటి నా బాల్యంతో పెనవేసుకునివున్న మధుర గీతమది.

మా ఇంటికి చాలాదూరంగా ఉండే మా ‘తోట’ లో పనిచేయటానికి ఉదయాన్నేవెళ్ళినపుడు పని మీద కంటే పక్కింట్లోంచి వినిపించే రేడియో పాటల మీదే ధ్యాస ఉండేది నాకు. దాదాపు ప్రతిరోజూ ఈ పాట హాయిగా పలకరిస్తూ ‘మధువొలికిస్తుంటే ’ నా చెవులప్పగించేసి తోట పని వదిలేసి, పాట పని పట్టించుకునేవాణ్ణి. మా అన్నయ్యల చీవాట్లు... పాట పూర్తయ్యేదాకా చెవులకెక్కేవే కాదు!


ఈ పాట చాలామందికి ఇష్టం. కానీ దీన్ని స్వరపరిచిందెవరంటే చెప్పగలిగేవాళ్ళు తక్కువమందే! ఎవరిదాకో ఎందుకూ? ఇంతగా ఈ పాటను ఇష్టపడ్డ నేను కూడా బాణీ కట్టిందెవరో సీరియస్ గా నిన్న మొన్నటి దాకా పట్టించుకోలేదు. ఆ సంగీత కర్త... వి.కుమార్ గారు.

కన్నవారి కలలు
(1974) పాటలన్నీ బావుంటాయి. ‘మధువొలకబోసే’ తో పాటు ‘ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు’, ‘సారీ.. సో సారీ- నా మాట వినుంకొకసారి..’ , ‘ అందాలు కనువిందు చేస్తుంటే... ఎదలోన పులకింత రాదా’ ఇవి. బాలు ఈ సినిమాలో పాడిన ఏకైక పాట ‘చెలి చూపులోన’ కూడా మరోటి.

మరి ఈ సంగీత దర్శకుడు ఇంకా ఏమేం తెలుగు సినిమాలకు పనిచేశారని వెతికితే... మరో అద్భుతమైన పాట కూడా కుమార్ సుస్వరాలఖాతాలో ఉన్నట్టు తెలిసింది. ఆనందాశ్చర్యాలు కలిగాయి.

‘మామా చందమామా’ పాట అది. సంబరాల రాంబాబు (1970) సినిమాలోది.

సుశీల గారు పాడిన అరుదైన కామెడీ సాంగ్ ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ..’ దీనిలోదే. ఇంకా ‘జీవితమంటే
అంతులేని
ఒక పోరాటం..’ పాట కూడా.

ఇక నా ఆసక్తి మంద్ర స్థాయిని దాటింది. మధ్యమాన్నీ.. ఆపై తార స్థాయినీ చేరుకుంది.

నెట్
లో అన్వేషించాను. వికీపీడియాలోనూ పొడిపొడిగానే వివరాలు కనిపించాయి.తెలుగు ఫాంట్ సాయంతో వెతికాక, ఇక ఇంగ్లిష్ ఫాంట్ తో !

కుమార్ సంగీతం సమకూర్చిన మరో సినిమా అందరూ మంచివారే (1975) కనిపించింది. దానిలో ‘కట్టింది ఎర్రకోక..పొయ్యేది యాడదాక’ అనే పాట ఉంది.

వి.కుమార్ చాలా తమిళ సినిమాలకు సంగీతం సమకూర్చారనీ, ఆయనకు 'మెలడీ కింగ్’ అనే పేరుందనీ, ఆయన వివరాలు కొన్ని తెలిశాయి. కుమార్ ... కె.బాలచందర్ డిస్కవరీ. తనను తమిళ సినిమా రంగానికి పరిచయం చేసింది బాలచందరే. ‘కవితాలయ’ ‘జెమినీ’ సంస్థలకు ఎక్కువ పనిచేశారు. 16తమిళ సినిమాలకు స్వరాలు కూర్చారు. వీటిలో కమల్ హాసన్ సినిమా ‘అరంగేట్రం’ (1973 ) కూడా ఉంది.
1934 జులై 28న కేరళలో జన్మించారట. మే7 1996 లో చనిపోయారని తెలిసి ‘అయ్యో’ అనిపించింది.

అప్పుడొచ్చింది అసలైన సందేహం....ఈ తెలుగు, తమిళ కుమార్ లు ఇద్దరూ .. ఒకరేనా అని!

వెంటనే సినీ సంగీతంపై అథారిటీ ‘రాజా’ గారు గుర్తొచ్చారు. (వార్తలో కాలమ్ ఆ పాత మధురాలు తెలిసిందే కదా?) ఆయన సంగీత విశేషాలను తెలిపే బ్లాగు. కూడా నడుపుతున్నారు.
రాజా గారికి మెయిల్ చేస్తే వెంటనే స్పందించారు. ఇద్దరూ ఒకరేనని తేల్చారు.

అంతే
కాదు, వి.కుమార్ 'కలెక్టర్ జానకి ' అనే మరో తెలుగు సినిమాకి కూడా సంగీతాన్ని అందించిన సంగతీ గుర్తు చేశారు. ఆ సినిమాకి మూలం తమిళం లో బాలచందర్ తీసిన ' ఇరు కోడుగళ్ ' అనీ, ఆ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించినది వి. కుమార్ గారేనని చెప్పారు.

కలెక్టర్ జానకి (1972)లోకూడా మంచి పాటలున్నాయి. ‘పాట ఆగిందా... ఒక సీటు గోవిందా’ అంటూ బాలు పాడే హుషారైన సరదా పాట దీంట్లోదే !

వి. కుమార్ పాటలు మృదుత్వానికీ, శ్రావ్యతకూ పేరు. భారతీయ, పాశ్యాత్య వాద్యాలను మాధుర్యం ఒలికేలా సమ్మిళితం చేసి, శ్రోతలకు గొప్ప రసానుభూతిని కలిగిస్తారాయన. సినీ సంగీత శిఖరాలైన ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్ ల శైలికి భిన్నమైన స్వతంత్ర శైలి కుమార్ ది.

ఇంతా చేసి, కుమార్ గారి ఫొటో ఒక్కటి కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు. ఎంత బాధాకరమో కదూ?

‘మధువొలకబోసే... ’ ఉన్న ‘కన్నవారి కలలు’ సినిమా 1974లో విడుదలైంది. ... 35 సంవత్సరాల క్రితం! అంటే కనీసం 32 సంవత్సరాల క్రితం నేనీ పాటను తొలిసారిగా వినివుండాలి. వినగానే ఆకట్టుకునే ఈ పాట సాహిత్యం గురించి నేను మొన్నటిదాకా పట్టించుకోలేదు. (అసలు నచ్చిన పాట అంటే- చాలా సందర్భాల్లో నా ఉద్దేశం అది బాణీ పరంగానే! పాట అంటే ట్యూనే. పాడుకోవాలంటే ‘ఆధారం’ కావాలి కాబట్టి ‘లిరిక్’ అవసరమనిపిస్తుంది.)

ఇదో ప్రేమ గీతం. ఈ పాటలో సాహితీ విలువలు గొప్పగా ఉన్నాయని కాదు. కానీ పల్లవిలో తొలి పదమే ‘మధువొలకబోసే’ వినగానే ఆకట్టుకుంటుంది. ‘మూగ భాషలో బాస చేయనీ’ అనే చమత్కారాలు లేకపోలేదు. ‘ఈనాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ’ అనటం మాత్రం వింతగా తోచింది. సాధారణంగా నూరేళ్ళు అనాలి కదా, వెయ్యేళ్ళు అనెందుకు అనాల్సివచ్చింది? బహుశా హాయి- వెయ్యి... ఈ పదాల సామరస్యం కోసం అలా రాసివుండాలని తోస్తోంది.


ఈ యుగళగీతం పాడింది రామకృష్ణ, సుశీల గార్లు . గీత రచయిత ఎవరనేది కచ్చితంగా తెలియటం లేదు. చాలాచోట్ల రాజశ్రీ అనీ, కొన్నిచోట్ల సినారె అనీ కనిపిస్తోంది. ఆ పాట పూర్తి పాఠం కింద ఇస్తున్నాను.


మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ

తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ

బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ


మనసు మనసుతో ఊసులాడనీ

మూగభాషలో బాస చేయనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ


గగనముతో .... ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ

జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ


కలలు తీరగా కలిసిపొమ్మనీ

కౌగిలింతలో కరిగిపొమ్మనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ


మధువొలకబోసే .. హా ..
ఈ చిలిపి కళ్ళూ ఆ ఆఆ ఆ ...

అవి నాకు వేసే .. హా ఆఆ...
బంగారు సంకెళ్ళూ



పాట ఎత్తుగడలోనే... ‘మధువొలకబోసే’ లో ‘బోసే’ దగ్గర కట్ చేయటంలో అందం కనిపిస్తుంది. ‘కళ్ళు’- ‘సంకెళ్ళు’ అనే పదాలను కొంచెం ఎక్కువ వ్యవధి తీసుకునేలా ట్యూన్ చేయటం మధుర తరంగా తోస్తుంది.

పల్లవి తర్వాత ఇంటర్లూడ్ లో వీణావాదన హాయిగా సాగి, తొలి చరణానికి సొగసైన దారి కల్పిస్తుంది.

మొదటి చరణంలో రెండో భాగం ‘మనసు మనసుతో..’ దగ్గర స్వరకల్పన మెట్టుమెట్టుగా మాధుర్య సోపానాలను అధిరోహిస్తుంది. వెంటనే ‘ఊసులాడనీ’ తర్వాత సితార బిట్ చటుక్కున పలకరించి, తేనెని చిలకరించేస్తుంది.

‘మూగభాషలో’ దగ్గర కూడా ‘లో’ అనే చోట స్వర సోపానాలను గమనించొచ్చు.

రెండు చరణాల మధ్య ఇంటర్లూడ్ లో వేణువూ, వీణా స్వర మైత్రీ యాత్ర చేస్తూ వరసగా విచ్చేస్తాయి. వీనుల విందు చేస్తాయి. తొలి చరణంలాగానే స్వరాల పూలు గుబాళిస్తాయి.

‘ఈ నాటి హాయి’ దగ్గర ‘హాయి’ ని (రెండో చరణం చివర్లో) సుశీల గారు తన గళంలో అనుపమానంగా , పాట భావం వ్యక్తమయ్యేలా ఎంత బాగా పలికించారో విని తీరాల్సిందే!

ముగింపులో పల్లవి మళ్ళీ వస్తుంది కదా? రామకృష్ణ గళం నుంచి జాలువారే పల్లవీ, దానికి జతగా సుశీల అద్భుత ఆలాపనలూ పాట మాధుర్యానికీ, భావానికీ పరాకాష్ఠ గా అనిపిస్తాయి.

తీయని పాట విన్న అనుభూతి మాత్రం మనకు మిగులుతుంది!

ఈ పాటను వినండి.



ఇంతకీ... ఈ సినిమాను ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను చూడటం కుదర్లేదు.

ఈ టపా రాద్దామనే ఆలోచన వచ్చాక ‘దిశాంత్ సైట్’లో 'మధువొలకబోసే..’ పాట వీడియో కనిపించి, చూశాను. చిత్రీకరణ నాకేమీ నచ్చలేదు!