సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

17, ఫిబ్రవరి 2010, బుధవారం

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!


నకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత...
 జానపద కథల మాంత్రికుడు..
 దాసరి సుబ్రహ్మణ్యం గారు!

దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.

1954లో  ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన   ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం  1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ  విజయవంతంగా  కొనసాగింది.
చందమామ  అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి. 

ఆయన  అక్షరాలను మంత్రిస్తే..అవి  అవధుల్లేని   కథాకల్పనలయ్యాయి. వీర, బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో  అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై  పరుగులు పెడితే అసంఖ్యాక  పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో  ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.

ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని  తలపోసుకుంటూనే ఉన్నారు.

 ఊహల  విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ   వింత  వింత లోకాల్లో   విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.

కానీ...ఆయన  మాత్రం  పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో  ఆ   పాఠకులకు కూడా తనెవరో  తెలియని అజ్ఞాత రచయితగానే  ఉండిపోయారు!


ఉద్యోగ విరమణ చేసి, చెన్నై నుంచి విజయవాడ చేరుకుని, అన్నగారి కుమార్తె ఇంట్లో  విశ్రాంత జీవితం గడిపేటప్పుడు  మాత్రమే  ఆయన గురించి కొద్దిమంది పాఠకులకైనా తెలిసింది.

చివరిదాకా తాను నమ్మిన హేతువాదం నుంచి పక్కకు పోని, స్థిర సంకల్పం ఆయనది.



 న్మానాల ,సత్కారాల, బిరుదు ప్రదానోత్సవాల్లో, పొగడ్తల దండల శాలువాల హడావుడిలో బడా  సాహిత్య సంస్థలు  ఎప్పుడూ బిజీనే. నాలుగు కాలాల పాటు నిలిచే నిజమైన సాహితీ  కృషి చేసిన వారిని తల్చుకోవటానికి

వాటికి తీరికెక్కడిదీ? పైగా దాసరి సుబ్రహ్మణ్యంగారు  ఏ నాటి రచయిత? ఇలాంటివారిని   పట్టించుకునే తీరిక వారికేం  ఉంటుంది చెప్పండి!

ఇలాంటి పరిస్థితుల్లో -

జనవరి 27న కన్నుమూపిన  దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోవటానికి హైదరాబాద్ లో ఎవరైనా  చిన్న సభ పెట్టటం సంతోషకరమే కదా?



 దాసరి వెంకటరమణ, అట్లూరి అనిల్, వాసిరెడ్డి నారాయణరావు, రామవరపు గణేశ్వరరావు, చొక్కాపు వెంకటరమణ గార్లు.

ఆ పని ‘బాలసాహిత్య పరిషత్’ వారు చేశారు.
 
నిన్న  (ఫిబ్రవరి 16) సాయంత్రం  హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో  ఈ ప్రోగ్రాం జరిగింది.


 సమావేశ మందిరంలో అడుగు పెట్టగానే  సభ బ్యానర్ కనపడింది.గుమ్మం దగ్గరే టేబుల్ మీద దాసరి గారి రచనల పుస్తకాలు,చందమామ కథలు, ఆయన  దస్తూరితో ఉన్న కథల రాత ప్రతులు కనిపించాయి.

వీటన్నిటికంటే ముందు 1947 జులై చందమామ తొలిసంచిక దగ్గర్నుంచి కొన్ని నెలల సంచికల  బైండు  కనిపించింది. ఈ సంచికలన్నీ ఇంతకుముందు  పీడీఎఫ్ లుగా చూశాను గానీ, పుస్తకాలుగా ప్రత్యక్షంగా చూడటం ఇదే

మొదటిసారి. ఆ అనుభూతితో చందమామ   పేజీలను ఆత్మీయంగా స్పర్శించి, తిరగేస్తుంటే చాలా సంతోషమనిపించింది. సుబ్రహ్మణ్యం గారి గురించి పత్రికల్లో వచ్చిన రచనలు అక్కడున్న  గోడ మీద డిస్ ప్లే చేశారు.

వీటిని ఏర్పాటు చేయటం వెనక నిర్వాహకుల శ్రద్ధ అభినందనీయం.

పుస్తకాలను  ఫోటో తీస్తుంటే అక్కడే ఉన్న దాసరి వెంకటరమణ గారు పలకరించారు.(ఆయన సేకరణే ఈ పుస్తకాలన్నీ).


 సభలో రామవరపు గణేశ్వరరావు గారు, వాసిరెడ్డి నారాయణరావు గారు, అట్లూరి అనిల్ గారు  దాసరి గారితో  వ్యక్తిగతంగా తమ చిరకాల  అనుబంధాన్నీ,జ్ఞాపకాలనూ గుర్తుచేసుకున్నారు. దాసరి వెంకట రమణ , చొక్కాపు వెంకట రమణ, మరికొందరు మాట్లాడారు.

 జనాలతో ఎవరితోనూ కలవని అంతర్ముఖుడైన దాసరి గారి ఆత్మగౌరవం గురించీ, సాహితీ సభలకు వెళ్ళటంపై ఆయన అనాసక్తి గురించీ ప్రస్తావించుకున్నారు. గట్టివాడూ, మొండివాడుగా కనిపించే ఆయన సున్నిత స్వభావం గుర్తు చేసుకున్నారు.


చిన్నపిల్లల రచనలే కాకుండా దాసరి గారు రాసినవి  ‘ఇంద్రాణి’ అనే కథాసంపుటి, పులిగోరు, భూతాల రాయుడు అనే పుస్తకాలున్నాయి. చందమామలోనే శంభుదాసు అనే పేరుతో కొన్ని కథలు రాశారు. ఇంకా  దాసు, సుజాత, భవానీ ప్రసాద్ అనే కలం పేర్లతో కూడా రచనలు చేశారు.

తెలుగులో రచయితలు తమ జీవితకాలంలో  స్వయంగా పట్టించుకోకపోతే వారి రచనల సేకరణ ఎప్పటికీ అసమగ్రంగానే ఉండిపోతుంది. కొ.కు. రచనల సంగతి అలాగే అయింది. ఎంతో క్రమశిక్షణతో రచయితలకు వారి రచనల గురించి  శ్రద్ధగా లేఖలు రాసే సుబ్రహ్మణ్యం గారి రచనల విషయమూ అలాగే అవటం విచిత్రం! సుబ్రహ్మణ్యంగారు సొంతపేరుతో, కలం పేర్లతో రాసినవీ,అజ్ఞాతంగా  ఇతర పత్రికల్లో చేసిన రచనలూ ఇంకా సేకరించాల్సేవుంది. 

ఈ సంస్మరణ సభ మూలంగా  కొన్ని  విశేషాలు తెలిశాయి.

 రచన శాయి గారు దాసరి గారి సాహిత్యాన్ని సేకరించటానికి చేసిన ప్రయత్నంలో శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. మరికొన్ని సేకరించాల్సినవి ఉన్నాయి.

ఇక శాయి గారు దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వేయాలనే సంకల్పాన్ని  వ్యక్తపరిచారు. చందమామ చిత్రకారులు వేసినట్టే  ఆ కథకు బొమ్మలు వేయించాలనుకుంటున్నానని చెప్పారు. ‘రచన’ ఏప్రిల్ సంచికను దాసరి గారి ప్రత్యేక సంచికగా తీసుకురాబోతున్నారు.  

ఇక వ్యక్తిగతంగా నాకు సంతోషం కలిగించిన మరో విషయం- ‘బొమ్మరిల్లు’లో నా అభిమాన ధారావాహిక ‘మృత్యులోయ’ రచయిత ఎవరో ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను; ఈ సభ కారణంగా!
 

కొసమెరుపు: ఆత్మల ఉనికినే నమ్మని నాస్తికుడైన  దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘ఆత్మశాంతి’కోసం సభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. కొందరు వక్తలైతే- అలవాటుగానేమో,ఆయన ‘స్వర్గస్థు’లయ్యారంటూ
మాట్లాడేశారు!

సభలో వక్తల ప్రసంగాలను ఇక్కడ చూడొచ్చు.



విజయవాడలో మరో్ సభ!

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ ను విజయవాడలో్ ఫిబ్రవరి 21న (ఆదివారం)
సాయంత్రం 6 గం.లకు నిర్వహిస్తున్నారు.

వేదిక- చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.


చందమామ అభిమానులు,  దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై తమ మనోభావాలను పంచుకోవచ్చు.

వివరాలకు -  కొత్తపల్లి రవిబాబు -+919490196890 e mail: ravibabu@yahoo.co.in


దివికుమార్ -+919440167891, 0866-2417890: divikumar1949@yahoo.com