సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
బ్లాగులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బ్లాగులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఇళయనిలా! మనసును... తాకెనిలా!

 
కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!

దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను. 

‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘అమర గీతం’ (1982).  



వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన ఘట్టాలు  నన్ను  ముగ్ధుణ్ణి చేశాయి.

నిజానికిది పాత వీడియో. ఇళయరాజా 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం సమకూర్చిన సందర్భంగా తమిళనాడులో జరిగిన ఉత్సవాల్లో చిన్న భాగం. 

దీన్ని నేను చూడటమే చాలా లేటు.

అప్పటికి ఇళయరాజా- బాలు  సత్సంబంధాలతోనే ఉన్నారు.

 
కమల్ హాసన్, గౌతమి కూడా కలిసేవున్నారు.


ఈ వీడియో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.  ప్రేక్షకులు ఉర్రూతలూగుతూ  కరతాళధ్వనులు చేస్తూ స్పందించారు.  మమైకమై పాట ఆసాంతం ఆస్వాదించారు.

వేదికపై  ఇళయరాజా,  కమల్ హాసన్,   ప్రేక్షకుల్లో ప్రకాష్ రాజ్, గౌతమి, బహుశా ఖుష్బూ కూడా ఉన్నారు. వీళ్ళూ,  చాలామంది ప్రేక్షకులూ  ఉత్సాహం చూపిస్తూ హుషారుగా కనపడతారు. 

ఏముందీ వీడియోలో?

ప్రత్యక్షంగా వేల మంది...  టీవీల్లో చూస్తున్న లక్షల  మంది ప్రేక్షకులు.  సినీ సంగీత ప్రియులు!

పాట హృద్యంగా  సాగుతోంది. తన్మయులై వింటున్నారు జనం.  వాద్యసమ్మేళనంలోని  ఓ కళాకారుడికి  అనుకోకుండా  పొరపాటు దొర్లింది. అంతా రసాభాస అవుతోందనే బాధ.. అవమానంతో చేష్ఠలుడిగి  ఏం చేయాలో పాలుపోని  స్థితి. 

అలాంటి విపత్కర తరుణంలో.. సాధారణంగా ఎవరికైనా ఏం చేయాలో తోచదు. కానీ  పాట పాడుతున్న బాలూ చక్కటి సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.  లోపం బయటపడకుండా తన గానంతో పరిస్థితిని వెంటనే సవరించగలిగాడు. 

ఆపద్బాంధవుడయ్యాడు!

అంతేనా? అంతకంటే మించే చేశాడు.

ఏమిటది? చూడండి.





( కొత్త చేర్పు-  on  29.10.2018 )

ఈ రెండు  వీడియోల్లో కిందది  విజువల్స్  స్పష్టతతోనూ,  ఎక్కువ నిడివితోనూ  ఉన్నది.  కానీ  ఆ వీడియో పెట్టినవాళ్ళు  నిబంధనలు ఉల్లంఘించారంటూ  యూ ట్యూబ్  దాన్ని తీసేసింది.  దాంతో  మరో  వీడియో  (పైన ఉన్నది) పెట్టాను.  దీనిలో  అంత స్పష్టంగా విజువల్స్ లేవు. పైగా  నిడివి తక్కువ.  కానీ  ఏం చేస్తాం...?  దీంతోనే సరిపెట్టుకోవాలి, ప్రస్తుతానికి!   

సరికొత్త చేర్పు  on 30.5.2019

హాట్ స్టార్ లో  పూర్తి వీడియో ఉంది.

ఇదిగో లింకు


***

పాటల విశిష్టతలను  ఆసక్తిగా  వివరించే విషయంలో బాలును మించి మరెవరూ ఉండరేమో.  ‘ఇళయనిలా’ పాట గురించీ , ముఖ్యంగా ఆ పాటలోని గిటార్ ప్రత్యేకత గురించీ , దాని కంపోజిషన్ గురించీ బాలు తమిళంలో వివరించినా... తెలుగు మాత్రమే తెలిసినవారికి కూడా సారాంశం బాగానే అర్థమవుతుంది.

ఈ పాట ఒరిజినల్  గిటారిస్ట్ చంద్రశేఖర్.   ఈ వీడియోలో కనిపించే గిటారిస్ట్  ప్రసన్న.  


 
రెండోసారి  అరుణ్ మొళి (నెపోలియన్) సరైన నంబర్ ఫ్లూట్  ఉపయోగించి,  వేణువాద్య బిట్ ను శ్రావ్యంగా వాయిస్తున్నపుడు ... ఆ కళాకారుడి విజయాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ  బాలు  ఆనందపడటం చాలా బాగుంటుంది. అతడి సహృదయతకు  మనసంతా సంతోషభరితం అయిపోతుంది.


పొరపాటుకు బాధపడి కుంగిపోయిన కళాకారుడు కొద్ది సమయంలోనే తన ప్రతిభ చూపిస్తూ తిరిగి కెరటంలా ఎగసినపుడు -  

ఆ విజయానికి  సంతోషిస్తూ .. తమ ఆమోదం తెలుపుతూ ప్రేక్షకులు చేసే  కరతాళ ధ్వనులు సముద్ర కెరటాల్లా ఎగసిపడతాయి!

ఇళయరాజా, ప్రకాష్ రాజ్ ల  హావభావాలు ప్రత్యేకం. ఇదంతా  చూడటం గొప్ప అనుభవం. 


* * *

సక్తి ఉన్నవారు ఈ వీడియో కూడా చూడండి..





గిటార్, వేణువుల ధ్వనులను నోటితో పలుకుతూ, ఇళయరాజా ‘జీనియస్’ను ప్రశంసిస్తూ..  బాలు  ఆ పాట గొప్పదనం ఎలా వివరించాడో గమనించండి.

‘ఇళయనిలా’ పాట  మాధుర్యాన్ని  వివరంగా వర్ణిస్తూ  ఇంగ్లిష్ లో   రాసిన ఓ   బ్లాగ్ పోస్ట్   కూడా చూడండి. ఆ  బ్లాగర్ పేరు సృజన.    


* * *

బాలు ఓ ఇంటర్ వ్యూలో తనను గొప్ప చేసుకుంటూ  చేసిన ఓ వ్యాఖ్యను విమర్శిస్తూ  గతంలో ఓ పోస్టు రాశాను.  ‘మీ గొప్పలు మీరే చెప్పుకోవాలా? ’ అంటూ.

అది అదే;  ఇది ఇదే!

తియ్యటి  గానంలో ఏ కాస్త  అపశ్రుతి వినిపించినా...  మనసు చివుక్కుమంటుంది.  సమంజసం కాని  వ్యాఖ్యను విమర్శిస్తాం.   

అంతమాత్రాన  ఆ వ్యక్తి  చూపిన  సహృదయతను  విస్మరిస్తామా?  దాన్ని  మనస్ఫూర్తిగా  ప్రశంసించకుండా ఎలా ఉంటాం !

30, ఏప్రిల్ 2018, సోమవారం

జంధ్యాల సాహిత్యం... రమేశ్ నాయుడు గానం

 

క వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత  ఆ  వ్యక్తి  బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక   తెలిస్తే... ?

నాకైతే...

ఆ కళాకారుణ్ణి   వ్యక్తిగతంగా  కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.  

అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు. 
 
సినీ సంగీత దర్శకుడు  రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన  పాటలన్నా  నాకు చాలా ఇష్టం. 

ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా ఆయన కళా ప్రతిభ గురించి తెలుసు. కానీ ఆయన చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాతే   ఆయన పాటల్లోని మాధుర్యం  నాకు సంపూర్ణంగా  అవగతమయింది.  అందుకే ఆయన్ను చూడలేకపోయాననీ, మాట్లాడలేకపోయాననీ  బాధ వేస్తుంటుంది.

 ఆయనతో  అత్యధిక చిత్రాలకు పనిచేయించుకున్న ముగ్గురు దర్శకుల్లో ...  జంధ్యాల,  దాసరి నారాయణరావులు ఇప్పుడు సజీవంగా లేరు.

మిగిలిన దర్శకురాలు విజయనిర్మల.  ఆమెను కలిసి,  రమేశ్ నాయుడి గురించీ, ఆయన బాణీల  విశేషాల గురించీ చాలా వివరాలు   తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది.

ఇది సాధ్యం కాని విషయమేమీ కాదు కూడా!


*  *  *

రమేశ్ నాయుడు పాడిన  పాటల్లో  రాధమ్మ పెళ్ళి (1974)  సినిమాలోని  ‘అయ్యింది రాధమ్మ పెళ్లి ’,
 
చిల్లరకొట్టు చిట్టెమ్మ ( 1977) లోని  ‘తల్లి గోదారికి ఆటు పోటుంటే’ ..

ఇవి  శ్రోతలకు బాగా  తెలుసు.

మరో పాట కూడా ఉందని   ఇవాళే  నాకు  తెలిసింది.  
మరి  సినీ అభిమానులైన  పాఠకులకు  ఈ పాట సంగతి  తెలుసో లేదో నాకు తెలియదు.

ఆ పాట -
‘సూర్యచంద్రులు ’ (1978)  సినిమాలోది.



 ఇదే  సినిమాలోని  ‘ఒకే మనసు... రెండు రూపాలుగా..’  పాట కోసం నెట్ లో   వెతుకుతుంటే  ఈ విశేషం తెలిసింది. 

లిరిక్  ఇది... చూడండి.  (చిత్రభూమి బ్లాగ్  సౌజన్యంతో). 


జంధ్యాల మాటల రచయితగా, దర్శకునిగా అందరికీ తెలుసు.  సినిమా పాట కూడా రాశారనేది కొత్త విషయం. పైగా దాన్ని రమెశ్ నాయుడే  స్వయంగా పాడటం!

జంధ్యాల- రమేశ్ నాయుడి  ద్వయం భవిష్యత్తులో  ఎన్నోమంచి   సినిమాలు కలిసి పనిచేయటానికి  ఈ పాట కూడా  ప్రాతిపదిక అయివుండవచ్చు.  

ఈ పాట బాణీ  ఇంకా దొరకలేదు, వినటానికి .


ఇంతకీ నేను  ఈ బ్లాగులో ప్రస్తావించాలనుకున్న  అసలు పాట ఇది- 


‘అన్నదమ్ములుగా జన్మిస్తే అది చాలదు చాలదు అంటాను
కవలలుగా జన్మించే జన్మ కావాలి
కావాలంటాను’

ఈ పాటలో  ఈ   సెంటిమెంట్  నచ్చిందో... భావం నచ్చిందో చెప్పలేను.  కానీ రమేశ్ నాయుడి  బాణీ మాత్రం  అద్భుతంగా నచ్చింది.

బాలుతో పాటు కలిసి  పాడిన గాయకుడు జి. ఆనంద్ అనుకున్నాను, ఇవాళ్టి వరకూ.  కానీ ఆ గాయకుడి పేరు చిత్తరంజన్.  ఈయన రేడియోలో  ప్రతి ఆదివారం  'ఈ మాసపు పాట'  శీర్షికతో  అస్సామీస్, ఒరియా, తమిళ్, సింధీ లాంటి వివిధ భాషల పాటలు నేర్పించేవారు. 





 *  *  *

రమేశ్ నాయుడు  సంగీతం సమకూర్చిన  పాటల్లో  చాలా ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి.

ఓ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  దీనిలో కూడా  నేను నమ్మని  పునర్జన్మల  సంగతి ఉండటం కాకతాళీయం కావొచ్చు.

జీవితం (1973) అనే సినిమాలోది ఈ పాట.   సినారె రాసిన  ఈ పాటను  సుశీల, రామకృష్ణ పాడారు.

పాట లిరిక్ ఇది-

ఇక్కడే కలుసుకొన్నాము..  ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో..  ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము
 
నీలనీల గగనాల మేఘ తల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా 
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి

ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము

నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఏమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం

ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము 



మనసుకు దగ్గరైన  వ్యక్తులనూ,  ఆత్మీయులైనవారినీ   ఇక్కడే కాదు,  గతంలోనే  ‘ఎప్పుడో  కలుసుకున్నాము’  అనుకోవటంలో  ఎంతో తృప్తి ఉంటుంది.   అదొక అనిర్వచనీయమైన భావం.

ఈ పాటలో   ‘చరణ దాసి’ లాంటి వ్యక్తీకరణలు నేను ఇష్టపడనివి.   కానీ  దాన్ని పట్టించుకోకుండా,  పదేపదే వినాలనిపించేంత  మాధుర్యం  బాణీలో ఉంది. 

 * *  *


రమేశ్ నాయుడి  పాటల  గురించి   ఇంతేనా?  ఇంకేమీ లేదా రాయటానికి..  అనకండి.

ఇంకో  పోస్టు  రాస్తాను, మరెప్పుడైనా!

కొన్నేళ్ళ క్రితం ఆయన గురించి  ఈ  బ్లాగులో  ‘విన్నారా అలనాటి వేణుగానం’ అనే పోస్టు రాశాను. 

అలాంటి పోస్టులు ఎన్నో రాసి,  ఇష్టంగా  గుర్తు చేసుకోదగ్గ విశేష  ప్రతిభావంతుడాయన!
 

30, నవంబర్ 2017, గురువారం

ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ ‘మ్యాజిక్!’



సినిమాల్లో  పాత్రధారుల సంభాషణల మధ్యా,  డైలాగులు లేని సన్నివేశాల్లోనూ  వినిపించేది... నేపథ్య సంగీతం-  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ( బీజీఎం).

దీన్ని సినిమా చూస్తూ  గమనించడం, బాగుంటే ఆస్వాదించటం నాకు ఇష్టం. 

ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా  ప్రాణం పోసి,   పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి,  చూసేవారికి  సన్నివేశం హత్తుకునేలా చేసే శక్తి ఈ బీజిఎంకు ఉంది కాబట్టే  దానిపై నాకు అంత  ఆసక్తి!  

అందుకే... ఈ బీజీఎం ల ప్రస్తావన  ఈ బ్లాగులో కనీసం రెండు పోస్టుల్లో ఇప్పటికే వచ్చేసింది  కూడా.  

సన్నివేశాన్ని ఒక్కసారి చూసి, దానికి సరిపోయే నేపథ్య సంగీతాన్ని ఎంతో వేగంగా అందించటం  ఇళయరాజాకు అలవాటు.  ఆ ప్రక్రియను గమనిస్తే  అదెంతో అబ్బురంగా అనిపిస్తుంది.

దీని గురించి  కిందటి సంవత్సరం మే నెల్లో ఓ పోస్టు రాశాను. ఆసక్తి ఉంటే ... ఇక్కడ క్లిక్ చేయండి.  
  
* * *


ళయరాజా బీజీఎంల ప్రత్యేకతను వివరించే వీడియోలు యూ ట్యూబ్ లో చాలానే ఉన్నాయి.  

వాటిలో  రెండు  వీడియోలను యూ ట్యూబ్ లో  ఈ మధ్య పదేపదే చూశాను.  వాటిని ఆ సినిమాల దర్శకులే స్వయంగా వివరించటం ఓ విశేషం.

ఆ ఇద్దరూ ఒకరు  భారతీరాజా.  రెండోవారు బాల్కి.  

భారతీ- రాజా 
ముదల్ మరియాదై అనే తమిళ సినిమా 1985లో వచ్చింది. దీన్ని తెలుగులో ఆత్మబంధువుగా అనువదించారు. ఆత్రేయ పాటలు, ఇళయరాజా సంగీతం చాలా బాగుంటాయి.

ఈ సినిమాలో ఓ సన్నివేశం.. దానికి  బీజీఎం జోడింపులో ప్రత్యేకతను ఆ చిత్ర దర్శకుడు భారతీరాజా ఈ వీడియోలో  బాగా వివరించారు. చెప్పింది తమిళంలో అయినప్పటికీ  భావం తేలిగ్గానే అర్థమవుతుంది. 



ఈ సన్నివేశంలో కనిపించే దుర్ఘటనా, ఆపై  చకచకా వచ్చే  వివిధ దృశ్యాలూ, ఆకాశం నుంచి కిందకు జారిపడుతున్న వేణువూ..ఆ దృశ్యాల గాఢతనూ, విషాదాన్నీ తెలిపేలా క్లుప్తమైన ఫ్లూట్ బిట్స్ తో  ఇళయరాజా  ఎంత బాగా బీజిఎం కూర్చారో కదా!


దర్శకుడు  బాల్కీ మాటల్లో...
ఇక 2009లో హిందీ సినిమా పా  వచ్చింది. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లు నటించిన ఈ చిత్రం దర్శకుడు బాల్కీ. ఆయన ఇళయరాజా బీజీఎంల ప్రత్యేకతను ఇంగ్లిష్ లో  చక్కగా వివరించిన వీడియో ఇది.




 తను తీసిన  పా చిత్రంలో ఒకటిన్నర నిమిషం సన్నివేశాన్ని శబ్దం లేకుండా చూపించారాయన. తర్వాత ఆ సన్నివేశానికి  ఇళయరాజా కూర్చిన బీజీఎం ను  విడిగా వినిపించారు.  ఆ పైన..   నేపథ్య సంగీతంతో జతకూడి  ఆ సన్నివేశం ఎంత కళగా, ఎంత చక్కగా మారిపోయిందో చూపించారు. 

ఇళయరాజా కూర్చిన నేపథ్యసంగీతంలో .. ఆ వాద్యాల సమ్మేళనంలో మనసుకు హాయి కలిగించే  శ్రావ్యతను గమనించవచ్చు.  ఆ బీజీఎంలనుంచి చాలా పాటలకు బాణీలు వస్తాయని బాల్కీ అనటంలో అతిశయోక్తి ఏమీ కనపడదు మనకి.  నిజానికి  ఆయన బీజిఎంల నుంచి పుట్టిన ఆయన  పాటలు చాలామందికి తెలిసినవే! 

స్వర్ణ సీతను చూసినప్పుడు...
2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం వీనుల విందు చేస్తుంది. వనవాసం చేసే సీత ... వాల్మీకి అనుగ్రహంతో  అయోధ్య రాజమందిరం చేరుకుని- స్వర్ణసీత విగ్రహం చూస్తున్న సందర్భంలో ఆమె హావభావాలు, మనో సంఘర్షణ, చివరకు సంతోషం, మైమరపు .. వీటి నేపథ్యంలో  వచ్చే సంగీతం ఎంత బాగుంటుందో గమనించండి-
 


ఇళయరాజా బీజిఎంల ప్రత్యేకతలను తెలుగు సినిమాలకే పరిమితమై క్లుప్తంగా చెప్పాలన్నా అది ఒక పట్టాన తేలే పని కాదు. ఎందుకంటే..  సితార, గీతాంజలి, మౌనరాగం (అనువాద చిత్రం), శివ, సాగర సంగమం, స్వర్ణ కమలం... ఇలా ఎన్నో సినిమాల్లోని చాలా సన్నివేశాలను చూపించాల్సివుంటుంది మరి!

* * *
సంగీతాన్నీ, నేపథ్య సంగీతాన్నీ సందర్భోచితంగా, శ్రావ్యంగా,  మనసుకు హత్తుకునేలా సమకూర్చడంలో ఇళయరాజాకు దగ్గరగా వచ్చే సంగీత దర్శకులు ఉండేవుంటారు.  ఇళయరాజా  వెయ్యి సినిమాలకు సంగీతం సమకూర్చటం ఘనతే కానీ, అంతకంటే ముందే.. ఎమ్మెస్ విశ్వనాథన్ 1200 సినిమాలకు సంగీతం అందించారు!

పాటలూ, బీజిఎంలకు మించి ఇళయరాజాలో ఇంకా చాలా విషయాలు నాకు నచ్చుతాయి.

ఆయనలో, ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం.. నిరాడంబరత్వం.  అది తెచ్చిపెట్టుకున్న వినయంతో వచ్చినది కాదు.  ఆయన స్వభావమే అంత. 

వేదికలమీద తనపై పొగడ్తలు కురిపిస్తుంటే ఆయనకు నవ్వులాటగా ఉంటుందట.  వక్తలు తనను కీర్తిస్తుంటే తన  పూర్వ సంగీత దర్శకులైన  సి. రామచంద్ర, సీఆర్ సుబ్బరామన్, ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్, మదన్ మోహన్, ఎస్ డీ బర్మన్, ఎమ్మెస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళ పేర్లు చెపుతారు.  వాళ్లు ప్రయాణించిన బాటలోనే నేనూ ప్రయాణిస్తున్నాను అని  చెపుతారు.

ఆయన తరచూ చెప్పే కొన్ని మాటలు చూడండి- 
 
నాకు సంగీతం గురించి తెలియదు. కాబట్టే సంగీతం  చేస్తున్నాను. తెలిసుంటే హాయిగా ఇంట్లో కూర్చొనేవాణ్ణి.

ఒకరి భావాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర వ్యక్తీకరించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి. మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరించొచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదని చెబుతాను.


సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక ఆకాశం లాంటిది. ఒక భూమి లాంటిది. ఎంతో విస్తారమైనది సంగీత ప్రపంచం. సముద్రపుటొడ్డున కూర్చుని అక్కడ కనిపించే ఆల్చిప్పల్ని ఏరుకుని వాటిని మాలగా కూర్చి, దానికి మెరుగుపెట్టి అమ్మే పని చేస్తున్నాను నేను.  
  అయితే సంగీత సాగరంలో ఎక్కడెక్కడ ముత్యాలు దొరుకుతాయో, సంగీతాకాశంలో వీణ శ్రుతులెక్కడ ఆడుకుంటాయో, ఈ సంగీతం భూమిపై ఎక్కడెక్కడికి వ్యాపించి కళ్లకు కనిపించే దృశ్యాల రూపంలో ప్రభవిస్తుందో నాకు తెలుసు. 
 కానీ దీని గురించి ప్రజలకు వివరించే సందర్భాన్ని భగవంతుడు నాకు ప్రసాదించలేదు.’  (దైవం  మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ఇళయరాజా.  అలాగే.. రమణ మహర్షి తాత్విక చింతనను ఆయన అభిమానిస్తారు

బాల్కీ తీసిన మరో హిందీ సినిమా షమితాబ్(2015) విడుదల సందర్భంగా  హీరో ధనుష్  రాజా సర్ తన జీవితంపై ఎంత గాఢమైన ముద్ర వేశాడో వేదికపై ఇలా చెప్పాడు - " I draw my emotions from your music... all my happiness, my joys and sorrows, my love, my heart breakings, my pain, my lullaby...every thing is your music''. 
(‘‘నా  భావోద్వేగాలను మీ సంగీతం నుంచే పొందుతుంటాను.  నా  మొత్తం సంతోషం, నా  ఆనంద విషాదాలూ,  నా ప్రేమా,  నా హృదయ భగ్నతా,  నా పరివేదనా, నా  లాలి పాటా.. ప్రతిదీ మీ సంగీతమే’’)

ఇళయరాజా పాటలు వింటూ పెరిగిన కొన్ని తరాల  శ్రోతల మనసులోని మాటలు కదూ ఇవి!

20, మార్చి 2017, సోమవారం

ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!



నిషి కోరుకునేవీ;  అతడికి  సంతోషం, సంతృప్తి  కలిగించేవీ  ఏమిటి?

పోతన భాషలో - బలి చక్రవర్తి  వామనుడికి  చెప్పిన జాబితా చూస్తే....

‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమో...’  


వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ చర్చించబోవటం లేదు.

మిగిలినవాటినే చూస్తే...  మంచి వస్త్రాలూ, డబ్బూ, పండ్లూ, అటవీ సంపదా, ఆవులూ, గుర్రాలూ,  రత్నాలూ, రథాలూ, మంచి ఆహారం, ఏనుగులూ, బంగారం, భవనాలూ, గ్రామాలూ, పొలాలూ , భూ భాగం....

వీటిలో  గ్రంథాలు (పుస్తకాలు)  లేవు!
 
‘ నే జదివినవి గలవు పెక్కులు- చదువులలో మర్మమెల్ల జదివితి’ అన్న ప్రహ్లాదుడికి మనవడై వుండి కూడా బలి చక్రవర్తి ... ఈ జాబితాలో పుస్తకాలను చేర్చలేదెందుకో!

కోరుకోవాల్సిన జాబితాలో పుస్తకాలు ఉండకపోతే నాకు  నచ్చదు.

పుస్తకాలు అంటే సాహిత్యం...
ప్రధానంగా నాకైతే  కథలూ, నవలలూ!

‘పుస్తకాలంటే ప్రాణం!’ అంటూ  ఈ బ్లాగు హెడర్ కింద నా గురించి రాసుకున్నాను కూడా! 

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే...

చిన్నప్పుడు మూడొంతులు చదివి, చివరి పేజీలు లేక పూర్తిగా చదవలేకపోయిన ఓ నవల...

కథలోని  విషాదంతో  కళ్ళు చెమర్చేలా చేసిన నవల...


బాల్యం నుంచీ మరపు పొరల్లోకి  జారిపోకుండా... తరచూ గుర్తొస్తూ  వెంటాడిన నవల...


దాన్ని మళ్ళీ చదవాలని  ఎంతగానో కోరుకున్నాను.

అది  సెంటిమెంటల్ నవలే.  కానీ నా బాల్యంలో అమితంగా ఇష్టపడ్డాను కదా? అందుకే అది చదవాలనే తపనా,  దానిపై ఇంత  ఆసక్తీ!

దశాబ్దాలుగా వీలున్నపుడల్లా వెతుకులాడుతూ వచ్చాను...
మిత్రుల ద్వారా రకరకాల మార్గాల్లో  ప్రయత్నించాను...

ఇక  దొరకటం దాదాపు అసంభవమేమో అని నిరాశపడ్డాను కూడా!

అలాంటిది -
ఆచూకీ తెలిపీ  తెలపకుండా దోబూచులాడి...
చివరికి..
ఆ పుస్తకం

దొ
    రి
        కిం
              ది!     

అప్పటి నా మన: స్థితిని ఊహించండి!

నలబై సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం పూర్తిగా చదవగలిగాను.

*  *  *

ది జరిగి  కొద్ది రోజులే అయింది.

ఏమిటా నవల?
ఎవరు రచయిత?
ఇవేగా  మీ సందేహాలు!

ఇవేమీ నాకూ  తెలియవు  మొన్నమొన్నటి దాకా!

నవల పేరూ,  రచయిత పేరూ , ఆ నవల ముగింపూ తెలియకపోయినా ఇన్నేళ్ళుగా దాని సంగతి ఎప్పుడూ మర్చిపోలేదు.

కనీస ఆధారాలేమీ  తెలియకుండా వెతకటం అంటే చీకట్లో నల్లపిల్లి కోసం వెతకటంతో సమానమేగా?

మనసులోనే నిలిపివుంచుకుంటూ  మరెవరికీ  చెప్పకుండా... మౌనంగా, ఏకాంతంగా సంవత్సరాలుగా సాగించిన ఈ పుస్తకాన్వేషణ...

భౌతిక రూపంలో అక్షరాలుగా బయటపడింది మాత్రం  2014  జులై నెలాఖర్లో.

అప్పుడు ఓ బ్లాగు పోస్టును రాస్తూ ఈ పుస్తకం గురించి ప్రస్తావించాను.



నేను గుర్తుంచుకున్న పాత్ర పేరు ‘ విభూతి’  అని తర్వాత అర్థమైంది.

బెంగాలీ నవల  అంటే అది శరత్ రచనో,  బంకించంద్ర రచనో అయివుండొచ్చనుకున్నాను.
 

ఆ పుస్తకాన్ని  కృష్ణాజిల్లాలో  వెనకబడిన  ప్రాంతంలోని మా  ఊరు  చాట్రాయిలో మా ఇంట్లో చదివాను.
బహుశా 1977 ప్రాంతంలో...!

అంత నచ్చిన పుస్తకం పేరు గుర్తు పెట్టుకోలేదు.
రచయిత ఎవరో గమనించే దృష్టి అప్పటికి లేదు.
తర్వాత  ఆ పుస్తకం ఏమయిందో తెలియదు.  మళ్ళీ కనపడనే లేదు.

ఏళ్ళు గడిచాయి.

సరే,   2014లో  బ్లాగు పోస్టులో దాన్ని గురించి  రాశాక,  అది చదివినవారెవరైనా  ఆ నవల ఆచూకీని, కనీసం దాని పేరు అయినా చెపుతారని కొంత ఆశపడ్డాను కానీ,  దాని గురించి ఎవరూ  చెప్పలేకపోయారు.

దాంతో  యథాతథ స్థితి కొనసాగింది.

నవల పేరు ... తె  లి  సిం  ది!

2016లో... అంటే కిందటి సంవత్సరమే... అనుకోకుండా ఆ నవల పేరు తెలిసింది!

యద్దనపూడి సులోచనారాణి  ‘మీనా’ ప్రారంభ భాగాల కోసం యువ పాత సంచికల పీడీఎఫ్ లు తిరగేస్తున్నాను.  1968 జులై  ‘యువ’ సంచికలో అనుకోకుండా ‘ఎండమావులు’ అనే సంక్షిప్త నవల కంటపడింది. దానిలో మొదటి పేజీ మిస్సింగ్.  అయినా కథ చదువుతుంటే  నేను చిరకాలంగా  అన్వేషిస్తున్న కథాంశమున్న నవల ఇదేనని అర్థమైంది.


విషయసూచిక చూస్తే.. రచయిత గా  డా.  నీహార్ రంజన్ గుప్తా  పేరు కనపడింది. (అనువాదకుడి పేరు- మిస్సయిన మొదటిపేజీలో ఉందేమో తెలియదు)

ఈ ఆధారం చాలదూ?

గూగుల్ సహకారంతో తెలుగు , ఇంగ్లిష్ సెర్చి పదాలు ఉపయోగించి వెతికాను.  ఆ రచయిత రాసిన రచనల వివరాలు తెలిశాయి.

వాటిలో మద్దిపట్ల సూరి  తెలుగులోకి అనువదించిన ‘మాయామృగం’ నవల పేరు కనపడింది. నిజానికి నీహార్ రంజన్ గుప్తా రచన తెలుగులోకి వచ్చింది ఇదొక్కటే.


ఎండమావులకూ,  మాయామృగం  పేరుకూ చాలా సారూప్యత కనపడింది.

అంతే కాదు,  మాయామృగ/ మాయా మృగో  బెంగాలీ నవలను బెంగాలీ సినిమాగా తీశారు. దాన్ని‘అన్నై’ పేరుతో భానుమతి- షావుకారు జానకిలతో తమిళంలో తీశారు. దాన్ని తెలుగులో ‘పెంచిన ప్రేమ’గా డబ్ చేశారు.

‘పెంచిన ప్రేమ’ పాటలపుస్తకంలో కథాసంగ్రహం చూశాను.... నాకు తెలిసిన ఆ  కథే.  ఎండమావులు కథే.

అంటే-
నేను ఇన్నేళ్ళూ వెతుకుతున్న నవల - ‘మాయామృగం’ అన్నమాట.

ఇక నా  అన్వేషణకు స్పష్టత వచ్చింది.
ఈ వెతుకులాటలో ముఖ్యమైన ఈ మలుపు  సంభవించిన రోజు-  2016  సంవత్సరం  ఫిబ్రవరి 17!

ఆ రోజే  గుంటూర్లో ఉన్న  శ్యామ్ నారాయణ గారికి  మెయిల్ రాశాను.  తన దగ్గరున్న పుస్తకాల్లో   ‘మాయా మృగం’ ఉందేమో చూడమనీ,  అది  ‘బాల్యం నుంచీ  పేరు తెలియకుండా  నేను  తెగ అన్వేషిస్తున్న నవల ( నవల పేరు ఇవాళే  తెలిసింది.. )  అనీ’ రాశాను.

‘లేదు’ అని   సమాధానం.  కాస్త నిరాశ...

ఇంకా ఆ పుస్తకం గురించి తెలిసే అవకాశం ఉన్న- నాకు తెలిసిన కొద్దిమంది సాహితీవేత్తలకు మెయిల్స్ రాశాను.

అతి కొద్దిమంది మిత్రులకూ తెలియజేశాను.

నవల పేరూ, రచయిత పేరూ తెలియదు కాబట్టి, ఆ పుస్తకం నాకు  దొరికే ఛాన్సు దాదాపు లేదనే భావిస్తూ వచ్చాను.

కానీ అనుకోకుండా ఆ నవల పేరూ, వివరాలూ తెలిశాయి కాబట్టి  ఆ పుస్తకం దొరుకుతుందని నమ్మకం వచ్చేసింది.

ఆధారం దొరికింది కదా?  నవల పేరూ,  రచయిత పేరూ,  అనువాదకుడి  పేరూ ‘కీ వర్డ్స్’గా ఇంటర్నెట్లో  విస్తృతంగా వెతకటం మొదలుపెట్టాను.

dli.ernet.in,
ulib.org,

archive.org,
tirumala.org,

sundarayya.org..

ఇంకా ఇతర  సైట్లలో, చివరకు -
kathanilayam.com లో కూడా వెతుకుతూ వచ్చాను.

కానీ... ఆచూకీ ఏమీ  దొరకలేదు.

అయితే...  నీహార్ రంజన్ గుప్తా రాసిన బెంగాలీ నాటకం ‘మాయామృగ’ pdf  దొరికింది!

లిపీ, భాషా ఏమాత్రం తెలియకపోతేనేం... దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నాను.

హిందీ అక్షరాలతో పోలిక ఉన్న భాష  కాబట్టి పాత్రల పేర్లు  పోల్చుకున్నాను.

ఇప్పుడో  కొత్త సందేహం....
ఇంతకీ మాయామృగ  నాటకమా? నవలా? అని. 
బెంగాలీ నవల నెట్లో దొరకలేదు.   నాటకం ఎదురుగా కనపడుతోంది..

మరి మద్దిపట్ల సూరి నాటకాన్ని నవలగా మార్చి అనువదించారా?

సమాధానం దొరకలేదు  (ఇప్పటికీ).

రే,  నవల పేరు తెలియటం తప్ప...  నెలలు గడిచిపోతున్నా పుస్తకం దొరికే దిశలో అడుగు ముందుకు పడలేదు-
...  శ్యామల  పూనుకునేదాకా!

శ్యామల నా చిన్ననాటి స్నేహితురాలు.  నేను హైస్కూల్లో చదువుతున్నపుడు  తను నా సీనియర్.

తను సాహిత్యాభిలాషి మాత్రమే కాదు. అనుభూతివాద కవిత్వాన్ని అద్భుతంగా రాసే భావుకురాలూ,  తొలి తెలుగు గజల్ కవయిత్రీ! 

నా వెతుకులాట గురించి  ఓసారి యథాలాపంగా చెప్పాను.

‘ఆ  పుస్తకం కోసం ప్రయత్నిస్తాననీ,  తప్పకుండా సాధించి ఇస్తా’ననీ  తను వాగ్దానంలాగా చెప్పినపుడు మొహమాటంగా నా సంతోషం తెలిపాను.

అంతే.!  ఆశలైతే పెట్టుకోలేదు. నిజం చెప్పాలంటే... అది సాధ్యమవుతుందని నమ్మనే లేదు!

పుస్తకం దొరికే ఛాన్సు తక్కువ ఉండటం, తన సోర్సులు పరిమితమేనని అనుకోవటం, తన పట్టుదల సంగతి తెలియకపోవటం... దీనికి  కారణాలు.

నా అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమవసాగింది.

పాత పుస్తకాల షాపుల్లో చూడటం,  ఆన్ లైన్లో వెతకటం తప్ప నాకుగా నేను  చెప్పకోదగ్గ ప్రయత్నం ఏం చేశాను?

కానీ శ్యామల సిన్సియర్ గా పుస్తకం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  సుప్రసిద్ధ వేటపాలెం గ్రంథాలయంలో ,  తెనాలి , గుంటూరు గ్రంథాలయాల్లో కూడా  ఈ పుస్తకం కోసం  వెతికింది, వెతికించింది. వాటిలో దొరకలేదు.

మద్దిపట్ల సూరి గారి వారసులను సంప్రదిస్తే  పుస్తకం దొరకవచ్చు కదా  అని సలహా ఇచ్చింది.
ఈ ఆలోచన అప్పటికే నాకూ  వచ్చింది కానీ...  అది చివరి ప్రయత్నంగా చేద్దామని ఊరుకున్నాను.

( సాహితీ వేత్తల వారసుల్లో చాలామందికి ఆ సాహిత్యంపై అనురక్తి  లేకపోవటం, వాటి విలువ తెలియనంత అనాసక్తి  ఉండటం నాకు తెలుసు. అందుకే ఈ మార్గం అంత సఫలం కాకపోవచ్చని అనిపించింది కానీ,  పూర్తిగా ఆశ వదులుకోలేదు.)

ఈలోగా శ్యామల తన ప్రయత్నం కొనసాగిస్తూనేవుంది.  రచయితా, అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యులూ అయిన పెద్ది సాంబశివరావు గారికీ, ఇతర సాహిత్యాభిమానులకూ  ఆ పుస్తకం గురించి చెప్పివుంచింది.

*  *  *


మాయామృగం ... పేరు తెలిసి ఊరించి -  నిరాశపరుస్తూ ఉన్నకాలంలో అనుకోకుండా మరో మలుపు.

నెట్లో యథాలాపంగా సెర్చి చేస్తుంటే.. ఆ లింకు వికీపీడియా సైట్ ద్వారా పిఠాపురంలోని వందేళ్ళ గ్రంథాలయ పుస్తకాల జాబితా -2కి తీసుకువెళ్ళింది.  మూడో వరసలో ఉన్న  పేరు చూడగానే ఆశ్చర్యానందాలు.

మయా మృగం...

మొదటి పదం మొదటి అక్షరంలో  దీర్ఘం లేకపోతేనేం... సుదీర్ఘమైన అన్వేషణ ఫలించే సూచనను ఆ  పదం అందించింది.

ఎంట్రీ నంబర్ తో సహా  పుస్తకం వివరాలు  కనపడ్డాయి. ప్రచురణ సంస్థ పేరూ, ప్రచురించిన సంవత్సరం కూడా !


ఇంత స్పష్టంగా పుస్తకం ప్రచురణ వివరాలు తెలియటం ఇదే మొదటిసారి.

ఆ లైబ్రరీలో తప్పకుండా పుస్తకం ఉంటుందని నమ్మకం. 

గట్టి నమ్మకంతో ...ఆశతో... అక్కడి లైబ్రేరియన్ ని ఫోన్లో సంప్రదించాను.

కొద్ది రోజుల్లో....  ఆయన సమయం వెచ్చించి మరీ వెతికారు గానీ దొరకలేదు.

లైబ్రరీలో  ఎంట్రీగా ఉండి కూడా పుస్తకం దొరకనందుకు  నిరాశ పడ్డాను.

*  *  *
వల పేరు తెలిసి సంవత్సరం కావొస్తోంది.

1962లో   తొలిసారి ముద్రితమైన  ఆ పుస్తకం రెండో ముద్రణ కూడా వచ్చినట్టు లేదు.  ఈ 55 ఏళ్ళలో వేసిన వెయ్యి కాపీలూ శిథిలమైవుండటమో,  కాలగర్భంలో కలిసివుండటమో జరిగివుండొచ్చు. ఫిజికల్ కాపీ దొరికే ఆశలను దాదాపు వదిలేసుకున్నాను.

హైదరాబాద్ తార్నాక లోని  స్టేట్ ఆర్కయివ్స్ వారి వద్ద డిజిటల్ రూపంలో ఉండవచ్చనే ఒక ఆశ ఇంకా మిగిలింది.

ఈ పరిస్థితుల్లో శ్యామల ద్వారా ఓ అనుకూల సమాచారం  విన్నాను.  అది పెద్ది సాంబశివరావు గారి ద్వారా తెలిసిన విషయం. వికీపీడియన్, సాహిత్యాభిమానీ అయిన రహమాన్ దగ్గర ఆ పుస్తకానికి సంబంధించిన భరోసా వార్త  ఉందని!

నేరుగా రహమాన్ నే సంప్రదించాను. ఆ పుస్తకం తన దగ్గర లేదనీ,  అఫ్జల్ గంజ్ లోని  స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ రూపంలో ఉందనీ , ఆ పుస్తకం సీరియల్ నంబర్ తదితర వివరాలు ఇచ్చారు.

ఆ లైబ్రరీ బాధ్యులతో మాట్లాడాను.  వారం రోజుల తర్వాత మళ్ళీ సంప్రదించమని చెప్పారు.

ఆ హామీతో  నిశ్చింతగా ఉండగా....

ఈ  అన్వేషణ మరో మలుపు తిరిగింది.


*  *  *


రోజు  డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ సైట్ లోకి ఎలాగో  వెళ్ళాను.  సెర్చి ఆప్షన్లో  నవల పేరును ఎంటర్ చేసి వెతికాను.

ఇలా కనపడింది.




వివరాల  కోసం view details  క్లిక్ చేశాను.

గుంటూరు రీజనల్ లైబ్రరీలో  ఈ పుస్తకం ఉందంటూ ఇలా కనపడింది.

 మళ్ళీ ఉత్సాహం...

పిఠాపురం లైబ్రరీ నిరాశపరిచాక...   ఫిజికల్ పుస్తకం దొరుకుతుందనే ఆశ మళ్ళీ  అంకురించింది.

కానీ అక్కడ వెతికాక   నిరాశే మిగిలింది.

2011లో  చివరిసారి ఎంట్రీ ఉన్న ఆ పుస్తకం ఆ లైబ్రరీలో  కనపడలేదు.

పుస్తకాలను భద్రంగా సంరక్షించాల్సిన గ్రంథాలయాల్లో  పరిస్థితి ఇలా ఉందన్నమాట!

ఇక చేసేదేముందీ... డిజిటల్ పుస్తకం మీదే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను.   

ఈ అన్వేషణ చివరికి వచ్చేసినట్టేననీ,  డిజిటల్ పుస్తకం దొరకటం మాత్రం తక్కువ సంతోషమేమీ కాదనీ  సర్దుబాటు ధోరణిలోకి వచ్చేశాను.

అయితే-

మరో  సంతోషకరమైన మలుపు నాకోసం ఎదురు చూస్తోందని అప్పటికి నాకు తెలియదు!

*  *  *

నవల అనువాదకుడు మద్దిపట్ల సూరి స్వగ్రామం  తెనాలి దగ్గరున్న  అమృతలూరు అని  వికీపీడియా సమాచారం.

రచయిత సొంత ఊళ్ళోని గ్రంథాలయంలో ఆ పుస్తకం ఉండొచ్చు కదా అనే ఆలోచనతో శ్యామల చేసిన ప్రయత్నం అద్భుతంగా ఫలించింది!

ఫిబ్రవరి 27న... ఆ పుస్తకం అమృతలూరు లైబ్రరీలో తనకు

దొ
రి
కిం
ది!


ఇదే  ఆ పుస్తకం !

కానీ  15వ పేజీ నుంచే ఉంది. ముగింపు  పేజీలూ లేవు.

అయితేనేం...!  డిజిటల్ ప్రతిలోంచి ఆ పేజీలను భర్తీ చేసుకోగలననే భరోసా ఉంది కాబట్టి  అది పెద్ద లోటు అనిపించలేదు.

పుస్తకం కొరియర్లో  పంపిస్తే మిస్ అవ్వొచ్చు కదా,  స్వయంగా వచ్చి  తీసుకుంటాననీ చెప్పాను.

ఈ లోపు  పుస్తకం  పేజీల  ఫొటోలు చూసి, చాలా  ఆనందపడ్డాను.

ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకం ప్రతిని మళ్ళీ చూడగలననీ, చదవగలననీ అనుకోలేదు.

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కళ్ళముందుకొచ్చి,  ఎంత సంతోషం వేసిందో!


  కథకు కొస మెరుపు కూడా ఉంది!

మరో ఐదు రోజుల తర్వాత-   మార్చి 5న...

ఆ ఆదివారం నాడు హైదరాబాద్ ఆబిడ్స్  ఫుట్ పాత్  దగ్గర  పరిచిన పుస్తకాలను చూస్తున్న రహమాన్ కు  ‘మాయా మృగం’ కనపడింది! ( ఈ పుస్తకం గురించిన వెతుకులాట గురించి అప్పటికే తనకు తెలిసివుండటం వల్ల  రహమాన్ దృష్టిని  ఆ నవల ఆకర్షించింది.)

పుస్తకం దొరికిన విషయం  వెంటనే నాకు ఫోన్ ద్వారా తెలిపి సంతోషపెట్టారు రహమాన్.

అంతే కాదు,  నవలకు అన్ని పేజీలూ ఉన్నాయని చెప్పారాయన. దాన్ని హైదరాబాద్ లోనే ఉన్న సాంబశివరావుగారికి అందజేస్తానని చెప్పారు. 

మరుసటి రోజు సాయంత్రం ...  సాంబశివరావు గారిని మాధాపూర్ లో కలుసుకున్నాను.
ఆయనిచ్చిన ఆ పుస్తకాన్ని పదిలంగా తీసుకున్నాను.

గట్టి అట్టతో ఉన్న కవర్ పేజీని  చూశాను.  నవల పేరూ,  మూల రచయిత పేరూ, ప్రచురణ సంస్థ పేరూ మురిపిస్తూ కనపడ్డాయి.
 




చిన్నప్పటి నుంచీ చదువుదామని తపించిన పుస్తకం..


నా జ్ఞాపకాల్లో ఏళ్ళ తరబడి నిలిచిన పుస్తకం..


ఆశా నిరాశల మధ్య ఊగిసలాడించిన, ఊరించిన పుస్తకం..


ఆచూకీ దొరికినట్టే మెరిసి.. అంతలోనే మాయమవుతూ వచ్చిన  ‘మాయా మృగం’

...  ఇలా చేతుల్లోకి వచ్చింది...

ఆత్మీయమైన పాత నేస్తం మళ్ళీ కలిసినప్పటి సంభ్రమంతో
సంతోషంతో
అపురూపంగా అందుకున్నాను!

1977లో ఆ నవల చదివివుంటాను.
2016లో  దాని పేరు తెలిసింది...
2017లో పుస్తకం  దొరికింది!


ఈ సందర్భంగా  రహమాన్ కూ,   పెద్ది సాంబశివరావు గారికీ  కృతజ్ఞతలు చెప్పుకోవటం నా ధర్మం.


రహమాన్ నాకు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ... మాయామృగం గురించి తనను అడగాలని తోచలేదు.  ప్రత్యక్షంగా సాంబశివరావుగారి ద్వారా,  పరోక్షంగా రహమాన్ ద్వారా ఈ పుస్తకం దొరికేందుకు  శ్యామల  దోహదపడింది. అసలు దొరకదనుకున్న పుస్తకాన్ని  స్వయంగా సాధించటంతో పాటు  మరో ప్రతి  కూడా  దొరకటానికి  కారకురాలయింది.

ఆ రకంగా ఈ చిరకాలపు  అన్వేషణ...  శ్యామల ద్వారా  అద్భుతంగా ఫలించింది!

తన  సంకల్పం,  శ్రద్ధా,  పట్టుదలా  లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు!

28, ఫిబ్రవరి 2017, మంగళవారం

తులసిదళం - నేనూ - గంజాయిదమ్ము విమర్శా!

ఆ  తెలుగు  నవలను  చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది.

ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను.

ఇంతలో... ఆ నవలపై  కఠోర  విమర్శ  కనపడింది.  అయిష్టంతో ...  అసహనంగా చదివాను  దాన్ని.
   
ఘన సమ్మోహనాస్త్రమనుకున్న  నవలను  ఆ విమర్శ గంజాయిదమ్ము  అని ఈసడిస్తుంటే ....  పట్టరాని ఉక్రోషం,  ఆ విమర్శ చేసిన వ్యక్తిపై కోపం కూడా వచ్చేశాయి.

అవి నా టెన్త్  రోజులు... దాదాపు ముప్పయి ఏళ్ళ  క్రితం నాటి ముచ్చట ఇది..  కథలూ, నవలల్ని అమితంగా ఇష్టపడటం అప్పటికే ఉంది మరి. 

అలా   కొద్ది కాలం  గడిచాక..

విచిత్రంగా...
ఆ నచ్చిన నవలపైనా,
ఆ  నచ్చని విమర్శపైనా 
నాకు  ఏర్పడిన  అభిప్రాయాలు  తలకిందులయ్యాయి!

నేనంతగా ఇష్టపడిన  ఆ నవలలోని  లోపాలను చూడగలిగే  ,  దాని  సైడ్ ఎఫెక్టులు గ్రహించగలిగే  చూపును-

నాకు దుర్భరంగా అనిపించిన అదే  ‘ విమర్శ’ నాకు  అందించింది. 

ఆ నవల  మారలేదు,  దానిపై  విమర్శా  మారలేదు.
మారింది  నేనే !


ఇదొక మరిచిపోలేని అపూర్వానుభవం నాకు!

* * *
నవల  ‘తులసిదళం’.
రచయిత- యండమూరి వీరేంద్రనాథ్.


 ఆ విమర్శ-  ‘తులసిదళం కాదు గంజాయి దమ్ము’

వ్యాసకర్త - రంగనాయకమ్మ.



* * *
 1980  నాటి నవల ‘తులసిదళం’.  ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో  సీరియల్ గా వచ్చింది. తర్వాత ఆ వారపత్రికలోనే  దాని కొనసాగింపుగా అదే రచయిత  ‘తులసి’ రాస్తున్నపుడు  సీరియల్ భాగాలు కొన్ని  చదివాను.

పల్లెటూళ్ళలో అప్పుడప్పుడూ  జనం నోళ్ళలో  వినబడే  ‘చేతబడి’ని  కథా వస్తువుగా  చేసుకున్న రచనలు ఇవి.

అప్పటికి ఎవరూ వినవుండని ‘కాష్మోరా’ అనే క్షుద్ర దేవతను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన నవలలివి. 

‘తులసిదళం’ సీరియల్  సంచలనాత్మకమై. ఆంధ్రభూమి వారపత్రిక సర్క్యులేషన్ ను అమాంతం పెంచేసింది.

లోకజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిర్ద్వంద్వంగా ఖండించే మూఢ నమ్మకాలకు ‘ సైంటిఫిక్ రీజనింగ్’ ఇస్తూ  వాటి వెనక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిరూపించటానికి ప్రయత్నించింది.  

సీరియళ్ళు ముగిసి, పుస్తకరూపంలో వచ్చాకనే...  ఆ నవలలు పూర్తిగా చదివాను.  ఉత్కంఠగా  ‘భలే ఉన్నాయే’ అనిపించింది. 

ఈ అభిప్రాయం తర్వాత మారటానికి   ‘... గంజాయి దమ్ము’ విమర్శ నాకో ఉపకరణం అయింది.

 ‘‘పాఠకులకు కనీసం కూడా విమర్శ అనే ఆయుధం ఇవ్వకపోతే , ఇటువంటి సాహిత్యం మీద వాళ్ళ నమ్మకం ‘వైద్యం లేని జబ్బులాగా పెరిగిపోతూ ఉంటుంది’’ అంటారామె, ఆ విమర్శలో. ఆ రకంగా ఈ విమర్శ అనే ఆయుధం నాకు ఉపయోగపడింది.

‘దీంట్లో ఒక వెయ్యి మెలికలు ఉండటం వల్ల, దీని నిజ స్వభావాన్ని పాఠకులు గ్రహించలేకపోతున్నారు.. ఇది ఎంత క్షుద్రమైన, ఎంత అభివృద్ధి నిరోధకమైన పుస్తకమో చెప్పడానికే దీని మీద విమర్శ కావాలి. ఇది సైంటిఫిక్ దృష్టితో నడిచిందనే భ్రమల్ని పటాపంచలు చెయ్యడానికే దీని మీద విమర్శలు కావాలి’’ అంటారు రంగనాయకమ్మ తన విమర్శలో.

అలా గ్రహించనివాళ్ళలో నేనూ ఒకణ్ణి.

ఆ విమర్శా వ్యాసంలోని  ధర్మాగ్రహం,  భావ తీవ్రత,  తిరుగులేని తర్కం.. ఇవన్నీ నాకు  ఎంతో నచ్చాయి.

వీటితో పాటు  చెప్పదల్చిన పాయింట్లను యాంత్రికంగా ఏదోలా  పేర్చినట్టు కాకుండా-

ఆలోచనల్ని సానపెట్టేంత పదునుగా... ఆసక్తికరంగా, అనితర సాధ్యమనిపించేంత  శక్తిమంతంగా  రాయటం నాకు అబ్బురంగా అనిపించింది.

* * *

విమర్శ సుతిమెత్తగా, మృదువుగా ఉండాలని డా. ద్వా.నా. శాస్త్రి  ఆంధ్రభూమిలో ఓ వ్యాసం రాశారు.  దాదాపు 20 ఏళ్ళ క్రితం.  అంతటితో ఆగకుండా  విమర్శ అనేది తులసిదళంపై రంగనాయకమ్మ రాసిన  విమర్శలాగా ఉండకూడదని కూడా  చెప్పుకొచ్చారు.

స్పందించకుండా ఉండలేకపోయాను.   ‘దారుణాఖండల శస్త్ర తుల్యమైన రంగనాయకమ్మ విమర్శ వల్లనే ఆ నవల గురించి సరైన దృష్టిని నాలాంటివాళ్ళు  ఏర్పరచుకోగలిగారు’ అంటూ నన్నయ్య పద్యభాగాన్ని తోడుగా చేసుకుని,  ఆవేశంతో  నాలుగు ముక్కలు రాసి పంపాను.  పాఠకుల లేఖల్లో అది  వచ్చింది. 

ద్వా.నా. శాస్త్రి గారితో  తర్వాతి కాలంలో బాగానే పరిచయం పెరిగింది. కానీ ఆయన వ్యాసం గురించీ, దానిపై అప్పట్లో  రాసిన లేఖ గురించీ  చెప్పాలని తోచలేదు....ఇంతవరకూ!


* * *
 తులసిదళాన్ని ‘నవలాథ్రిల్లర్’ అని మెచ్చుకుంటూ  మరో రచయిత డా. కొమ్మూరి వేణుగోపాలరావు ఆ నవలకు  ముందుమాట రాశారు.

ఆ  నవలపై  రంగనాయకమ్మ  విమర్శా వ్యాసం  ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో  1981 డిసెంబరు 6 నుంచి ఏడు వారాలపాటు కొనసాగింది.

   Critique on Tulasidalam by Reader on Scribd


ఈ సుదీర్ఘ  విమర్శ ను పరిచయం చేస్తూ..  వచ్చిన  ఇంట్రో చూడండి-



రంగనాయకమ్మ విమర్శలో ఒక ప్రత్యేక లక్షణం .. ఇతరులు సాధారణంగా గమనించని  మౌలికమైన అంశాలను లేవనెత్తటం.

కొన్ని పదునైన  వాక్యాలూ, వాటిలో  తర్కం చూడండి....




‘‘పేషెంట్ కి గుండె ఆపరేషన్ చేయాలని అంతవరకూ ఉద్దేశమే లేకుండా , ఏ ఏర్పాట్లూ లేకుండా ఒక్క నిముషంలో, ఒక్క నిముషం అంటే ఒక్క నిముషమే, ఒక్క  నిముషంలో గుండె ఆపరేషన్ ప్రారంభిస్తారా ప్రపంచంలో ఎక్కడైనా? ’’

‘‘ఇది ఫలానా జబ్బు. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. ఇది 21 రోజులు ఉంటుంది. చివరి రోజున ఆపరేషన్ కూడా అవసరమవుతుంది. పిల్లకి వచ్చిన బాధలన్నీ ఈ జబ్బు వల్లే వచ్చాయి’ అని డాక్టరు ఒక జబ్బు పేరు చెప్పాలి. అలా ఎందుకు చెప్పలేదంటే  అలాంటి జబ్బేదీ ప్రపంచంలో లేదు గనక!’’

‘‘ఈ చెత్త చదవటం వల్ల వచ్చేఫీలింగ్ సస్పెన్స్ కాదు. జుగుప్స! రోత! చీదర! ’’ 

‘‘ఈ పుస్తకం వెకిలిగా, చౌకబారుగా, ఆటవిక కాలం నాటి అజ్ఞానంతో ఉందనే సంగతి నాకే కాదు, పాఠకులకు కూడా అర్థం కావాలి కదా? వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకే వాళ్ళు దీన్ని నెత్తిన పెట్టుకున్నారు..’’


ఇంత సీరియస్  విమర్శలోనూ రంగనాయకమ్మ మార్కు  హాస్యం, వ్యంగ్యం ఈ వ్యాసంలో తళుక్కున మెరుస్తుంటాయి. 

ముందుమాటా.. కేసులూ

చయిత నవల్లో  చేతబడిని సమర్థించడం గురించి  ముందుమాట రాసిన  డాక్టరు రచయిత  చిన్న విమర్శ అయినా చేయలేదనీ,

నవల్లో వైద్యం అనే కోణాన్ని సర్కస్ లో బఫూన్ని లాగా తయారుచేసినా తాను డాక్టరైవుండి కూడా కిమ్మనలేదనీ,

రచయిత శ్రద్ధా, పరిశోధనలు చేశారని  పొగడ్తలు కురిపించారనీ  ఆ ముందుమాటను కూడా రంగనాయకమ్మ ఘాటుగా  విమర్శించారు.

నవలపై వచ్చిన విమర్శపై  రచయిత  వీరేంద్రనాథ్ ఏమీ స్పందించలేదు. 

కానీ ముందుమాట రచయిత  డా.  కొమ్మూరి వేణుగోపాలరావు మాత్రం ఊరుకోలేదు. అలా అని ప్రతివిమర్శ చేయటం ద్వారా తన వైఖరిని సమర్థించుకోవటం కూడా చేయలేదు. 

ఆయన ఈ సాహిత్య వివాదాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవటానికి సిద్ధమయ్యారు.  ఆ విమర్శ వల్ల తన పరువుకు నష్టం జరిగిందనీ,  విమర్శకురాలు తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ లాయరు నోటీసు పంపారు.

ఆయనకు పరువు నష్టం కలిగివుంటే  ఆ పని జరిగింది తన వల్ల కాదనీ, ఆయన ప్రవర్తన వల్లే ఆయనకు పరువునష్టం కలిగిందనీ-

తాను ఆయనకు క్షమాపణ చెప్పుకోవటం కాదు- ఆయనే తెలుగు పాఠకలోకానికి క్షమాపణ చెప్పుకోవాలనీ-
లాయర్ నోటీసుకు రంగనాయకమ్మ బదులిచ్చారు. 

దీంతో...  తర్వాత సివిల్,  క్రిమినల్ కేసులూ ... విచారణలూ... చివరకు  జరిమానా!

ఈ విమర్శతో పాటు ఆ వివరాలన్నీ  పుస్తకంగా వచ్చాయి. (పరువునష్టంగా కోర్టులు భావించిన పదాలూ, వాక్యాలూ  తొలగించి).


ఈ విమర్శా వ్యాసానికి ఇంట్రో ను  ఎడిటర్  ఏబీకే ప్రసాద్ రాసివుంటారు.

‘సాంఘిక విమర్శ దావాలకు అతీతం’  అనే చక్కటి  వ్యాసాన్ని ఆయన ఈ వివాద సందర్భంలో రాశారు. విమర్శ చివరిభాగంతో పాటు దీన్నీ ప్రచురించారు.

అంతే కాదు-

‘న్యాయమూర్తి  సూచన శిరోధార్యం’  అంటూ 1985లో  ఓ సంపాదకీయాన్ని ఆయన ఉదయం దినపత్రికలో  రాశారు.

అందులో ‘తులసిదళం’ నవలను చీదరించుకున్న న్యాయమూర్తి అబిప్రాయాలను కోట్ చేయడంతో పాటు...  కొమ్మూరి వేణుగోపాలరావు ముందుమాట పాఠకులకు ఖండనార్హం ఎందుకయిందో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఏబీకే ప్రసాద్  రెండు వ్యాసాలనూ ఈ విమర్శ ఉన్న పుస్తకంలో చదవొచ్చు.

* * *

ఇందాక  ఈ విమర్శపై వీరేంద్రనాథ్ స్పందించలేదన్నాను కదా? అది కరెక్టు కాదనుకుంటాను.

తులసిదళం నవల వచ్చాక దానికి పేరడీగా ఆంధ్రప్రభ వారపత్రికలో  ‘వేపమండలు’ అనే సీరియల్ వచ్చింది.  శ్రీమతి  సంగీతారెడ్డి అనే పేరుతో..



ఈ నవల తులసిదళాన్నీ,  ఆ రచయితనూ  సమర్థించటానికి ప్రయత్నించింది.

 ‘ఎలక్ట్రానిక్స్ నుంచి హిప్నాటిజం వరకూ- రకరకాల పాత్రలూ, వాటి వ్యక్తిత్వమూ- ఘర్షణా- అన్నిటికీ మించి  మంచి క్లైమాక్సూ..’’  అంటూ ఆ నవలకు  కితాబులిచ్చింది.

‘సరదాగా చదివి పక్కనపెట్టెయ్యకుండా  ఒక భూత అద్దం తీసుకుని రామాయణంలా దీన్ని పఠించి, తప్పులెన్ని, దీనిమీద వ్యాసాలు వ్రాసి గ్లామరు పెంచుకునే అవసరం లేదని కూడా అనుకుంటున్నాను’’ అని ఓ పాత్ర తో చెప్పించింది.  అంటే   ఈ నవలపై విమర్శ   ‘గ్లామర్ పెంచుకోవటం కోసం’!

కథలో  పాత్రల మాటల మాటున  స్వీట్ హోమ్,  బలి (ఉరి) పీఠం అంటూ రంగనాయకమ్మ రచనల పేర్ల చెప్పి రచయిత్రిని ఎకసెక్కం చేయటానికి ముసుగులో  ప్రయత్నించింది ఈ  పేరడీ నవల.

విమర్శ ను రుజు మార్గంలో ఎదుర్కోలేని,  నేరుగా ప్రతి విమర్శ చేయలేని  అశక్తత తప్ప మరేమీ కాదిది.

ఇంతకీ  ఈ వేపమండలు రాసినవారు వీరేంద్రనాథ్ అభిమాన రచయిత  అయివుంటారని  అనుకున్నాను. కానీ దీన్ని స్వయంగా వీరేంద్రనాథే రాసినట్టు  2014లో  సాక్షి పత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్ వ్యూ సాక్ష్యమిస్తోంది..

లింకు  చూడండి- 


 ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన.’’  (పెట్టుడు పేరు మర్చిపోయినట్టన్నమాట...)

‘‘ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే.’’  

నిజమా?  నవల రాసిన ఇన్నేళ్ళ తర్వాత అయినా రచయిత  ఈ మాత్రం ఒప్పకున్నందుకు సంతోషించాలేమో.

 * * *
అంతటి వివాదానికి కారణమైన ముందుమాటను 1992లో తులసిదళం నుంచి తీసివేశారు. మళ్ళీ  ఎప్పట్నుంచి  జోడించటం మొదలుపెట్టారో కానీ 2015 ఎడిషన్లో  మాత్రం ఈ ముందుమాట కనపడుతోంది.

ఈ విమర్శా వ్యాసం ప్రభావం నా మీద చాలా ఉంది. .. ఇన్ని సంవత్సరాలుగా.

డా.  కేశవరెడ్డి నవల  ‘మునెమ్మ’ గురించి చాలా కాలం క్రితం  బ్లాగులో రాశాను. ఆ రాతలో  ఈ వ్యాస ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది.

 వ్యాస రచనా విధానం  ..  చెప్పదల్చుకున్న  అంశాలను పకడ్బందీగా, చక్కగా   అమర్చిన  క్రమం నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది.

వ్యాస  నిర్మాణానికి    బ్రీఫ్ నోట్సు/ ప్రణాళిక ఏమైనా ఉందేమో అనిపించి  రంగనాయకమ్మ గారిని  అడిగాను,  కొద్ది రోజుల క్రితం. (16.2.2017 తేదీన).  దానికి ఆమె ఇలా చెప్పారు.

‘‘ మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఒక తర్కంతో మాట్లాడతాం. ఇదీ అంతే. ఆ నవల చదువుతుంటే దానిలో వైరుధ్యాలూ, తప్పులూ తెలిసిపోయాయి. వాటిని తర్కంతో ఖండించే పనే చేసింది. ఏం చెప్పాలి, ఎలా మొదలుపెట్టాలి, ఏది ముందు , ఏది వెనక అనేది ఆలోచించటం తప్ప ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవటమో, ప్లాన్  వేసుకోవటమో ఏమీ లేదు. ’  

రంగనాయకమ్మ వ్యాసం వచ్చిన కొద్ది నెలలకే  1982 ఫిబ్రవరి లో  బాలగోపాల్ ‘కుహనా వైజ్ఞానిక నవలలు’ అనే వ్యాసం రాశారు, ‘అరుణతార’ పత్రికలో!

ఆయన మాటల్లో-

‘మంత్ర తంత్రాలను గురించి,  చేతబడి గురించి మనకున్న జ్ఞానం అసంపూర్ణం కాదు, సంపూర్ణమే. ’’

 ‘‘మంత్ర విద్యను సైన్సుతో సమంగా నిలబెట్టడం శాస్త్రీయం కాదు సరికదా,  సైన్సును క్షుద్రపరచడం అవుతుంది’’

ఆసక్తి ఉన్నవారు ఆ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.





ఈ రెండు నవలలు సరే...  మరి వీరేంద్రనాథ్ రాసిన మిగతా నవలల సంగతేమిటి?   

‘యుగాంతం’,  ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ప్రార్థన’  లాంటివి   నాకు ఇప్పటికీ  నచ్చుతాయి!

28, నవంబర్ 2016, సోమవారం

ఆ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి: రంగనాయకమ్మ

రంగనాయకమ్మ
కరు సహజ సుందరంగా, తీయగా  పాడే  గాయని.
మరొకరు  మౌలిక భావాలతో  పదునుగా  రాసే రచయిత్రి.

వాళ్ళు... 
బాల సరస్వతీ,  రంగనాయకమ్మా!

ఆపాత మధురమూ, ఆలోచనామృతమూ  అయిన  ఆ ఇద్దరికీ  పరస్పరం...  స్నేహం, గౌరవం, ఇష్టం.

వారిద్దరూ ఈ మధ్య  కలుసుకున్నారు.
 
ఆ గాయని తమ ఇంటికి వచ్చినప్పటి ఘట్టాన్నీ , తన జ్ఞాపకాలూ,  అనుభూతులను  రంగనాయకమ్మ  ఓ వ్యాసంగా రాశారు.  అది ఏ పత్రికలోనూ  రాలేదు.

కొత్తగా  విడుదలైన ఆమె వ్యాసాల పుస్తకం ... ‘మార్క్సే నా టీచరు!’ లో  ఉందీ వ్యాసం.

 ఈ పుస్తకంలో సామాజిక, రాజకీయ అంశాల పై, భాషా సాహిత్య  అంశాలపై వ్యాసాలు ఉన్నాయి. 

బాల సరస్వతి గురించి రాసిన వ్యాసం విభిన్నంగా... ఆత్మీయ స్పర్శతో  ఉండటం వల్ల... నాకు ప్రత్యేకంగా  నచ్చింది.  

దీనిలో  ప్రస్తావనకు వచ్చిన  బాల సరస్వతి పాటలు నాకింతవరకూ తెలియనివే. ( నేనంతగా ఇప్పటివరకూ  పట్టించుకోనివి అన్నమాట...)

ఆమె సినిమా పాటలు -  అవి కూడా కొన్ని  మాత్రమే వినివున్నాను.

అందుకే ఆ లలిత గీతాలను  వినాలనే ఉద్దేశం కలిగింది. 

కొన్నేళ్ళ క్రితం నుంచీ హార్డ్ డిస్కులో భద్రంగా ఉన్న బాల సరస్వతి  పాటల్లో  కొన్నిటిని  ఇప్పుడు  విన్నాను.


రంగనాయకమ్మ వ్యాసాన్ని ఇక్కడ...ఈ  బ్లాగులో  ఇస్తున్నాను. 

బ్లాగులో  ఏ పోస్టు అయినా  నిడివి ఎక్కువ ఉంటే పాఠకులకు ఆసక్తిగా ఉండదు. అందుకే  దాన్ని మొత్తంగా కాకుండా... కొన్ని భాగాలను మాత్రమే  ఇక్కడ ఇస్తున్నాను.  

బ్లాగులో  పాటలు కూడా వినిపించే సౌలభ్యం ఉంది కదా?  అందుకని వ్యాసంలో ప్రస్తావించిన  బాల సరస్వతి పాటలు మూడిటినీ, ఒక  లతా మంగేష్కర్ పాటనూ  ఇస్తున్నాను.

సంగీతాభిమానులు వాటిని ఆస్వాదించవచ్చు.  

               * * *

రంగనాయకమ్మ గారి వ్యాసం ఇదిగో...

-----------------------------------------------------                 -----------------------------------------------------

నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామ ఫోను వుండేది. మా నాన్నకి పాటలు ఇష్టం. ఎప్పుడూ రికార్డులు కొనేవాడు. ఆ రోజుల్లో, ఒక గ్రామఫోను రికార్డు, 3 రూపాయల పావలా అని గుర్తు.

 ఒకసారి ఏదో వూళ్ళో ఒక జమీందారు ఇంటికి వెళ్ళాననీ, అక్కడ ఎవరో తనకి ఒక గ్రామ ఫోన్ రికార్డు ఇచ్చారనీ, తీసుకొచ్చాడు. అది, కొన్నది కాదు, ఆ రికార్డుని గ్రామ్ ఫోన్ లో వేస్తే, ‘‘ఆ తోటలో నొకటీ’’ పాట వచ్చింది. అది బాల సరస్వతి  పాట అని రికార్డు మీద వుంది. రెండో పక్క కూడా ఆవిడిదో, రాజేశ్వర్రావుదో వుంది. గుర్తులేదు.

అప్పటి నించీ  ‘‘ఆ  తోటలో నొకటీ’ పాటా,  ఆ కంఠమూ, అలవాటయ్యాయి ఇష్టంగా. తర్వాత కాలంలో బాల సరస్వతీ, రాజేశ్వర్రావూ కలిసి పాడిన ‘‘రావే రావే కోకిలా! రాగము పాడవే కోకిలా !’’ పాటా; ‘‘తుమ్మెదా ఒక సారీ, మోమెత్తి చూడమనీ’’ పాటా-  అలాంటివి రేడియోలో వినడం వుండేది.




వినేసి వదిలెయ్యడం కాదు; మరుపు వుండేది కాదు. ఇప్పుడైతే, ఆ పాటలన్నీ టేపుల్లో నా దగ్గిర పెట్టుకున్నాను. ఆ పాటలు, ఆ కాలపు రికార్డుల నించి టేపుల్లోకి ఎక్కించి అమ్మినవి. ఆ టేపులు కొని, ఆ పాటల్ని ఒక వరసలో నేను మళ్ళీ కొత్త టేపుల్లోకి ఎక్కించుకుంటే, సౌండ్ ఎంతో తగ్గిపోయాయి. 



బాల సరస్వతి  మైసూర్ లో వున్న రోజుల్లో ఆవిడితో ఉత్తరాల పరిచయం వుండేది. ఆవిడ ఒకసారి హైదరాబాదు వచ్చి ఏదో హోటల్లో దిగి వున్నారు. ఆ సంగతి తెలిసి, వెంటనే వెళ్ళి, ‘‘మా ఇల్లు వుండగా, మీరు హోటల్లో వుండడం ఏమిటి? ఎన్నాళ్ళయినా మా ఇంట్లో వుండండి!’’ అని పిలిచి తీసుకొచ్చాం.

అప్పుడు ఒక వారం రోజులు వున్నట్టున్నారు, మా దగ్గిర. ఆ రోజుల్లో మాకు వాషింగ్ మిషన్ లేదు. బట్టల పనిని ఇంటి కార్మికురాలి మీద ఎప్పుడూ పెట్టలేదు. మేమే ఉతుక్కునేవాళ్లం. బాలమ్మ గారి బట్టలు నేనే ఉతికేదాన్ని. ఆవిడ ‘‘అయ్యో, అయ్యో’’ అనేవారు.

‘‘అయ్యో, అయ్యోలు కావు. మీరు కోకిలలాగా పాడుతూ వుండండి, నేను పనులు చేస్తూ వుంటాను’’ అని నేను అనేదాన్ని.

‘‘నాది, ‘కోకిల కంఠం’ కాదు; నేను బేస్ లోనే పాడతాను’’ అన్నారు ఆవిడ ఒకసారి.

నాకు కోపం వచ్చింది. ‘‘మీరు, మీ పెళ్లి మీద చెప్పుకోండి, ‘మీ కంఠం’ మీద చెప్పకండి! మీ కంఠం అందం మీకు తెలిస్తే, మీ జీవితం ఇంకో రకంగా వుండేది’’ అన్నాను.
ఆవిడ నవ్వి వూరుకున్నారు.

‘‘ఉందువో మధురానగరిలో; కృష్ణా! బృందావనిలో ఎందును లేవే’ పాట బాలమ్మ కంఠంతో ఎంత మధురం!



ఆ మధురానగరీ, ఆ బృందావనం, ఆ కృష్ణుడూ, అవేవీ నాకు పట్టవు. ఆ రాగం, ఆ కంఠం, ఆ సంగీతం, కావాలి నాకు! బాలమ్మకి అది ‘‘భక్తే’’! నాకు అది సంగీతం! ఆ పాటని తయారు చేయించిన సినిమా వాళ్లకి అది, డబ్బు మార్గం బహుశా! ఎవళ్ళకి ఏది కావాలో అదీ!
                


‘‘రావే రావే కోకిలా!’’ పాడిన ఆ బాల గాయని, తన కంఠ మాధుర్యం ఏ మాత్రమూ తెలియని, పెద్ద వయసు మూర్ఖుణ్ణి, అప్పటికే ఇద్దరు భార్యలు బ్రతికి వున్నవాణ్ణి, ఆ భార్యలకు సంతానం లేదని మూడో భార్య కావాలనుకున్నవాణ్ణి,  మన చిట్టి గాయని తన 17 ఏళ్ళ బాల్యంలో, అతి సంతోషంగా పెళ్ళి చేసుకుంది! అతను ఒక  చిన్న జమీందారు. అంటే, భూమి కౌళ్ళు తింటూ, గుర్రాల మీద పోలో ఆటలు ఆడుతూ, వేశ్యల అందాలు భార్యలకు వినిపిస్తూ తిరిగే జులాయి ధనికుడు!  ఆ ధనికుడి దగ్గిరికి కూడా మా నాన్న, పత్రిక చందా కోసం వెళ్ళినప్పుడే, ‘‘ఆ తోటలో నొకటి’’ పాట రికార్డు మాకు దొరికింది!

17 ఏళ్ళప్పుడు పెళ్ళంటే, అది అతి చిన్న వయసు! సంగీతం తప్ప కొత్త భావాలు లేవు, ఆ బాల గాయనికి. సినిమా పాటల మనిషి. పాటలే కాదు; చిన్నప్పుడు సినిమాల్లో వేసింది కూడా. తల్లిదండ్రులు కూడా, జమీందారీ సంబంధానికి ముగ్ధులైపోయారు. ఈ పిల్ల, గుర్రప్పందాలకు పోయినప్పుడు, ఆ ధనికుడు ఈ పిల్లను చూసి, వీళ్ళ కుటుంబం వెంటపడ్డాడు. గుర్రప్పందాలకు తిరిగే సినిమాల పిల్లకి, ఎలాంటి భావాలు వుంటాయి? మూడో భార్యగా మారడానికే ముచ్చట పడిపోయింది!

బాలమ్మతో యుగళ గీతాలు పాడే రాజేశ్వర్రావు గారు అడిగాడట, బాలమ్మ తండ్రిని. ‘‘అమ్మాయిగార్ని నేను పెళ్ళి చేసుకుంటాను’’ అని! కానీ, అడిగిన వాడికి అప్పటికే భార్య వుంది! అయినా, రెండో పెళ్ళి చేసుకుంటానన్నాడు! బాలమ్మ తండ్రి ఒప్పుకోలేదు, ‘‘రెండో పెళ్ళి ఏమిట’’ని! కానీ, కూతుర్ని మూడో పెళ్ళికి నిర్ణయించాడు.

బాలమ్మకి, రాజేశ్వర్రావు మీద ఆసక్తి లేదు. నేను అడిగితే, ఆవిడ ఆ మాట గట్టిగా చెప్పింది. అతనితో, కలిసి పాడడం వరకే గానీ, అది ‘‘ప్రేమ’’వేపు పోలేదు. రాజేశ్వర్రావు మీద తనకి అలాంటి ఆసక్తి లేదని చాలా గట్టిగా చెప్పారు ఆవిడ. జమీందారు గారికి మూడో భార్య అవడానికే ఇష్టపడింది!

ఆ 45 ఏళ్ళ జమీందారు సరసన, ఈ 17 ఏళ్ళ బాల వధువు, నిలబడి వున్న ఫొటో వుంటుంది! ఈ వధువు, ఎంతో అణకువతో, ఎంతో వినయ విధేయతలతో, నిలబడి వున్న బొమ్మలాగ కనపడుతుంది ఆ ఫొటోలో!

ఆ పెళ్ళి తర్వాత ఆ భర్త, ఆమె కంఠాన్ని ఆపేశాడు! ఆమె పాడాలంటే, అతని పర్మిషన్ కావాలి! సినిమాల వాళ్ళు అలాగే చేసేవారు. అతన్ని బ్రతిమాలుకుని, ‘‘మా సినిమాలో అమ్మగారి పాట తప్పకండా వుండాలండీ’’ అని అతనికి చెప్పుకుని, అతని అనుమతి కోసం అడిగేవారు. ‘‘సరే, వెళ్ళి పాడి వచ్చెయ్యి!’’ అనేవాడు. అలాంటి మాటలన్నీ చెప్పేవారు ఆవిడ నాతో. ఇంకా చాలా చెప్పారు.

నేను బాధపడి పోయేదాన్ని. ‘‘మీరు చాలా తప్పు చేశారు!! చాలా తప్పు చేశారు! మూడో భార్యగా పెళ్ళేమిటి? అయ్యో! ఎంత తప్పు చేశారు!’’ అనేదాన్ని.

‘‘అవును, చిన్నదాన్ని. తెలీదు అప్పుడు నాకు’’ అంటారు ఆవిడ.

బాల సరస్వతి
    
బాలమ్మగారి కుటుంబం, మైసూర్ నించి హైదరాబాదు వచ్చేశారు. వచ్చి, వాళ్ళు దిగిన ఇల్లు, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీలో మేము (నేను) కన్నీళ్ళతో వదిలి వచ్చిన అద్దె ఇల్లు! ఆ ఇంటి ప్లాను, మా జీవితాల్లో ఒక భాగం అనుకుంటూ, అదే ప్లానుని  ఇంకా మెరుగు చేసుకుని, ఆ ప్లానుని వదలకుండా వుంచుకున్నాము.

కానీ, ఆ ప్లాను ఇల్లు, బాలమ్మ గారికి నచ్చలేదు. నేలకి సాదా సిమ్మెంటు వుండడం, ఆమెకి నచ్చలేదు. ఆమెని కలవడానికి వెళ్ళి, ఆ ఇంట్లో మళ్ళీ కాలుపెట్టి, ‘‘ఇదేం ఇల్లు? మార్చెయ్యాలి’’ అని ఆవిడ అనడం విన్నాను. షోకైన ఇళ్ళల్లో బతికిన మనిషి ఆవిడ.

ఆవిడ ఈ వూరు వచ్చేశాక, అప్పుడప్పుడూ మేము వెళ్ళడం, ఆవిడ రావడం, జరుగుతూనే వుంది.

మొన్న ఒకసారి ఆవిడ, ‘‘మీ దగ్గిరికి ఒకసారి రావాలనిపిస్తోంది’’ అన్నారు.

అప్పుడు నేను ‘‘వేదాల’’ పుస్తకం పనిలో బిజీగా వున్నాను. అయినా, ఆవిడికి 87 ఏళ్ళు. నాకు 77. ఇద్దరికీ పెద్ద వయసులే. అప్పుడప్పుడూ కలవడం మంచిదే కదా? రేపేం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఆ మర్నాడే ఆవిడ వచ్చేలాగ, టాక్సీ రెడీ చేశాం.

ఆవిణ్ణి చూడాలని ఒక స్నేహితురాలు ఉష కూడా వొచ్చి వుంది. టాక్సీ దిగిన బాలమ్మగార్ని తీసుకురమ్మని ఉషని పంపించాను గానీ, కాళ్ళ నొప్పుల వల్ల నేను వెళ్ళలేదు. టాక్సీ రాగానే ఉషే వెళ్ళి ఆవిణ్ణి పట్టి తీసుకురాబోయింది.

‘‘అక్కరలేదు’’ అంటూ ఆవిడ చిన్న పిల్ల లాగ చక చకా వరండా మెట్లెక్కి గబగబా నడుచుకుంటూ వచ్చేశారు! ఆవిడ నడక మీద, అందరికన్నా నేనే ఎక్కువ ఆశ్చర్యపోయాను, నెప్పుల కాళ్ళదాన్ని!

బాలమ్మగారికి స్వీట్లు అంటే పిచ్చి ఇష్టం! షుగర్ జబ్బు లేదు.

టేప్ రికార్డర్ లో, ఆమె పాడిన ‘‘తన పంతమె’ పాట వినపడుతూ వుండగా ఆవిడ గది లోపలికి వచ్చారు.

ఆవిడ రాక ముందే, ‘‘రావే రావే కోకిలా’’ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి నాకు. ఎప్పుడూ అలా జరగలేదు. ఆమె ఎంతో చిన్నప్పుడు పాడిన పాట అది.



పెద్ద వారై పోతున్నారు. మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని నాకూ అనిపించింది. పాటలు వినపడుతూనే వున్నాయి. ఆవిణ్ణి కావిలించుకోవాలనిపించింది.

వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషిని ఎలా కావిలించుకుంటాను? ఆవిడ దగ్గిరికి పోయి, పక్కనే కూర్చోవాలని నేల మీద కూర్చోబోతోంటే, ఆవిడ నా చేతులు గట్టిగా పట్టుకుని ‘‘వొద్దు, వొద్దు’’ అని చాలా వారించారు.

‘‘కాదు, కొంచెం సేపు కూర్చుంటాను. నా కలా అనిపిస్తోంది’’ అంటూ, ఆవిడికి దగ్గిరిగా నేల మీద కూర్చుని ఆవిడి ఒడిలో మొహం పెట్టి, ఆవిడి పాటలు వస్తోంటే వింటూ కూర్చున్నాను. కొంతసేపు కూర్చుని లేచాను.

ఆవిడి పెళ్ళి గురించి ఆవిడికి బాధ వుండదు గానీ, నాకు చాలా బాధగా వుంటుంది. ఆ పెళ్లి జరగకపోతే, అసలు లతకి లాగ ఏ పెళ్ళీ జరగకపోతే, ఆవిడి పాటలు ఇంకా చాలా వినగలిగే వాళ్ళం.

అప్పటికి సినిమాలు ఇంకా భ్రష్టు పట్టలేదు. సంగీతాలు చచ్చిపోలేదు. తప్పకుండా కొన్ని మంచి పాటలే వచ్చేవి బాలమ్మ కంఠంతో.

చందమామకి భర్త వుంటే, ఆ భర్త, చందమామతో, ‘‘నువ్వు వెన్నెల కాయొద్దు! అందరూ చూస్తున్నారు. అంతా దాచు!’’ అంటాడు.

అప్పుడు, చందమామ ఏం చేస్తుంది? భర్త ఆగ్న్య కదా? భూమికి వెన్నెల రాదు!


బాల సరస్వతికి, భర్త వుండడం వల్ల, ఆమె కంఠానికి సంకెళ్ళుపడ్డాయి! అతని  దయతోనే అవి తెరుచుకునేవి. బాలమ్మ కంఠస్వరం ఇచ్చే వెన్నెల, మసక బారిపోయింది. భర్తలూ భార్యలూ కూడా సంగీతకారులైనప్పుడు, వాళ్ళ వివాహాల తర్వాత, ఆ భర్తలు, భార్యల సంగీతాల్ని ఆపి వేస్తారని, పేరున్న సంగీతకారులైన భర్తల గురించే విన్నాం. ఇటువంటి వార్త, రవి శంకర్ గురించి ఒకప్పుడు ఏదో పత్రికలో చదివాను.

కళానిధులైన భార్యలకు భర్తలు, అడ్డుకట్టలు! ప్రమాదకారులు!

గాయనీమణుల గానాలలో, అతి మాధుర్యాలు- బాలమ్మా, లతమ్మా! ఈ ఇద్దరూ  ఇతరుల కన్నా వేరు అనిపిస్తారు నాకు. ఎందరో  పాడతారు. అందరూ సంగీతాల నిధులే. అందరూ రమ్యంగానే పాడతారు. అందర్నీ వింటాం. ఎవరికి వారు, వేరు వేరు! కానీ, బాలమ్మా, లతా, మరీ వేరు!

లతని కూడా కావిలించుకోవాలనే వుంటుంది నాకు. కానీ, ఆమె కంఠానికే దాసోహం అవుతాను గానీ, ఆమె భావాలూ, ఆమె ప్రకటనలూ, చాలా అధమ స్థాయిలో వుంటాయి.

‘‘ఏమిటి లతా? అప్పుడప్పుడూ మతి లేకుండా మాట్లాడతావు? ఎవరికో ‘భారత రత్న’  రావడానికి ఉపవాసం చేస్తానంటావు! ఎవరో ‘ప్రధాన మంత్రి’ అవడానికి ఏదో చేస్తానంటావు! మతి పోతుందా? అంత ఆలోచించవేం?’’ అని అడిగేసి, తర్వాత ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటాను. కానీ, బాలమ్మ లాగ లత, మా ఇంటికి రాదు కదా? ‘‘నిన్ను చూడాలని వుంది’’ అనదు కదా? ఒక సారి మా ఇంటికి వచ్చి, బాలమ్మ లాగ నాకు కబుర్లు చెప్పదు కదా?

లత చాలా తెలివైనది! ‘‘లతా! నువ్వు పెళ్ళి చేసుకోలేదు. నీకు భర్త వుంటే, మాకు నీ కంఠంతో దొరకకుండా ఎన్ని పాటలు పోయేవో! నీకు చిన్నప్పుడే భర్త వుంటే, ‘‘ఆయెగా, ఆనే వాలా’’ దొరికేది కాదు కదా? ఇక, ఏ పాటలు దొరికేవి?



 ఎంత తెలివైన దానివి! నువ్వు తెలివితో చేశావో, ఎలా చేశావో గానీ, నీ గానానికి ‘‘భర్త’’ అనే అసూయాపరుడు లేకుండా, నిన్ను అడ్డుకునే పెత్తందారుడు లేకుండా, చేసుకున్నావు.

నువ్వు మా కోసం పాడావు! ఎంత మంచిదానివి లతా! బాలమ్మ అమాయకురాలు గానీ, మధుర గాయని, నీ లాగే! మీ ఇద్దరి గానాలకీ, నా ముద్దులు!

-----------------------------------------------------                 -----------------------------------------------------