సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
మా.గోోఖలే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మా.గోోఖలే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జూన్ 2015, మంగళవారం

మాసాంత వేళ- నా బ్లాగూ... నేనూ!



సక్తితోనో .... అనాసక్తితోనో ... దాదాపు ప్రతిసారీ ఆలస్యంగానే 
బ్లాగులో  పోస్టులు రాసేస్తూ ఉండటమేనా?

ఎక్కడో ఓచోట కామా పెట్టి,
ఓసారి ఈ వ్యాసంగాన్ని పరామర్శించుకోవాలనీ...
ఇలాంటి  టపా ఒకటి రాయాలనీ కొద్ది కాలంగా అనుకుంటూనే ఉన్నాను.

వంద టపాలు పూర్తయినపుడా?
‘వంద’!
అయితే ..?
ఇలాంటి  అంకెల మ్యాజిక్కుల మీద నాకేమీ నమ్మకాల్లేవ్.

నూట ఆరో టపా రాసిన సమయంలో అనుకుంటా... నా బ్లాగు రాతల మీద ‘కన్ఫెషన్’ లాంటిది రాయాలనిపించింది.  కానీ కుదర్లేదు. మరో నాలుగు రాసేశాను.

*****

ప్రతి నెలా చివరి రోజుల్లోనే రాస్తూ వస్తున్నాను చాలా కాలంగా.

కారణం- ప్రతి నెలా తప్పనిసరిగా ఒక పోస్టునైనా రాయాలనే స్వీయ నిబంధన పెట్టుకోవటం !

దీన్ని పాటించటం కొన్నిసార్లు  కష్టంగా ఉన్నప్పటికీ .... రాయకుండా ఉండటం.. దాన్ని ఉల్లంఘించటం నాకే ఇష్టంగా ఉండదు.

ఇది  జూన్ నెల చివరి రోజు... పగలు గడిచింది... రాత్రి సమయం..
సరే,  ఆనవాయితీ తప్పినట్టూ ఉండదూ... అనుకుంటున్న ‘కన్ఫెషన్’ ఏదో  రాసేద్దామూ అనిపించింది...

*****

2009లో తెలుగు బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టటమే సోషల్ మీడియాలో నా ప్రవేశం..! అప్పట్లో... ఎంతోమంది ఎంతో బాగా రాసేవారు. 


గూగుల్ బజ్ వల్ల కొంతకాలం బ్లాగుల జోరు తగ్గిపోయింది. తర్వాత  ఫేస్ బుక్ విజృంభణా, మైక్రో బ్లాగ్ ట్విటర్ హోరూ, గూగుల్ ప్లస్  ప్రాచుర్యం....వీటితో బ్లాగుల ప్రభ గణనీయ స్థాయిలో క్షీణించిపోయింది.

అప్పట్లో క్రమం తప్పకుండా బ్లాగులను రాసేవాళ్ళు క్రమంగా బ్లాగులకు దూరమైపోయారు.

అయితే  -

‘బ్లాగు’ ఇప్పటికీ  నా మోస్ట్  ఫేవరిట్!

సవివరంగా చిత్రాలతో, వీడియో-  ఆడియోలతో  అలంకరించటానికి  దీనిలోనే  మంచి అవకాశం ఉంటుంది (అని నా నమ్మకం).

చదివినవారు  సావకాశంగా వ్యాఖ్యానించటానికైనా, 
వ్యాఖ్యలు అప్రూవ్ చేస్తే గానీ  ప్రచురితం కాని వెసులుబాటుకైనా బ్లాగులే బెటర్.

ట్విటర్ అయినా,  ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లైనా లింకులు ఇచ్చుకోవటానికే ఎక్కువ ఉపయోగం.

*****

సాహిత్యం,  సంగీతం,  చిత్రకళ... స్థూలంగా  ఈ బ్లాగు పరిధి అంశాలు. ఏం రాసినా వీటిలో ఏదో  ఒకటి- లేదా రెండు కలిసొచ్చేలా ఉంటాయి,  సాధారణంగా .  

సంగీత సాహిత్య  చిత్రకళలు-  ఈ  మూడూ కలిసొచ్చిన  విశిష్టమైన  పోస్టు మాత్రం  ఒకటుంది. అనుకోకుండా అలా కుదిరిన ఆ  టపా-  హిమగిరి సొగసులు.  బ్లాగింగ్ తొలినాళ్ళలోనే ... 2009లోనే రాశానిది.   
 
బాగా నచ్చిన పుస్తకాలూ, సినిమాలూ,  పాటల గురించే  ఎక్కువ టపాలున్నాయి. 

మరి నచ్చనివాటి గురించి?

అవి చాలా తక్కువే.  
‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక మునెమ్మ’ 
‘వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా? ’ ఇలాంటివి.  ఇవి వరసగా 2013 ఫిబ్రవరి,  మార్చి నెలల్లో.

‘ శ్రీరామరాజ్యం’  సినిమా పాటల విశేషాలు రెండు రోజులు- రెండు భాగాలుగా! .... ‘శ్రవణానంద కారకా.. ఇళయరాజా’ (2011 డిసెంబరు 23, 24).

వరసగా రెండు టపాల్లో  కళాదర్శకుడూ, రచయితా,  చిత్రకారుడూ అయిన  మా. గోఖలే  విశేషాలు.  (2012 జూన్, జులై).

అమితంగా అభిమానించే సంగీత దర్శకుడు ఇళయరాజా ,  చందమామ ల గురించీ,  ఇష్టమైన  కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గురించీ-  ఒకటికి మించిన  పోస్టులు. 

ముఖ్యంగా అత్యధిక టపాలు మాత్రం-  నా అభిమాన రచయిత్రి  రంగనాయకమ్మ గురించినవే! 

రచనలు చదవకుండా రచయితలను హేళన చేసే, వ్యతిరేకించే ధోరణి పాఠకలోకంలో  ఒకటుంది.  అరకొరగా చదివి దూషణలతో ముంచెత్తే వైఖరి కూడా.

ముఖ్యంగా రంగనాయకమ్మ గారి విషయంలో  ఇది జరుగుతూ వచ్చింది.  బ్లాగులోకంలోనూ ఇది మరింతగా  ప్రతిబింబించింది. 

వేణువు బ్లాగు టపాలు ఈ mis conception ఎంతో కొంత తొలగటానికి  పరోక్షంగా తోడ్పడ్డాయని అనుకుంటున్నాను. 

మనకిష్టమైన అంశాల విశేషాలన్నీ ఓ చోట ... అక్షరాలుగా- చిత్రాలుగా- దృశ్య శ్రవణ రూపంలో కనపడుతుంటే అదో సంతృప్తి.

ఈ క్రమంలో  నా  వ్యక్తీకరణ- writing ability -  బాగానే  మెరుగుపడింది.

వ్యక్తిగతంగా నేను పొందిన లాభమిది!  

*****

కామెంట్ల   సంఖ్యకీ,  టపాను ఎక్కువమంది చదవటానికీ   సంబంధం ఉండాలనేమీ లేదు.

టపాల  గణాంకాలను గమనిస్తే ఇది  అర్థమైంది.




*  ఇప్పటివరకూ నేను  రాసిన 110 టపాల్లో (నిజానికి మొత్తం టపాలు  111. కానీ వీటిలో ఒకటి-  ఓ మిత్రుడి రచన)  అత్యధిక పేజీ వ్యూస్ (2291)  వచ్చిన పోస్టు- ‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక  మునెమ్మ’.

2013  మార్చి 5న రాశాను. దీనికి వచ్చినవి ఏడే కామెంట్లు.(నా సమాధానాలతో కలిపి).

*  కానీ 2010 జులై 26 న రాసిన ‘నా హీరోలు వాలీ, కర్ణుడూ’కు  అత్యధికంగా  142 కామెంట్లు వచ్చాయి. (నా వ్యాఖ్యలతో కూడా కలిపి..)

కానీ పేజీ వ్యూస్  1421 మాత్రమే.




‘ఇదండీ మహాభారతం’ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి, వ్యక్తిగత కోణం అనుసంధానించి సమీక్షిస్తూ  రాసిన టపా కంటే ....

ఆ  పుస్తకం అప్పటికింకా పూర్తిగా చదవకుండా రాసిన కర్టెన్ రైజర్ (మహాభారతంపై రంగనాయకమ్మ పుస్తకం)  టపాకే  కామెంట్లూ ..పేజీ వ్యూస్  ఎక్కువ!

ఇలా ఉంటాయి... బ్లాగ్ లోక విచిత్రాలు!  

*****

చందమామ అభిమానిగాబ్లాగాగ్ని బ్లాగు ప్రేరణతో... 2009 మార్చి 11న తెలుగు బ్లాగ్లోకంలో  ‘తొలి అడుగు’ వేశాను. 



ఎమ్వీయల్-యువజ్యోతి బ్లాగర్  రామ్ ప్రసాద్,  ‘అనుపల్లవి’ బ్లాగర్   ‘తెలుగు అభిమాని’, చందమామ రాజశేఖరరాజు  .... ఇంకా మరికొందరి ప్రోత్సాహం లభించింది. 

ఇంతకీ-
పేరు కూడా  కలిసొచ్చేలా  ‘వేణువు’ బ్లాగు పేరు పెట్టాలని నాకెలా తోచింది?  

పత్రికా రంగంలో నా జూనియర్   పప్పు అరుణ  ‘అరుణమ్’  అనే బ్లాగును అప్పటికే  మొదలుపెట్టింది. (తర్వాత  మారిన పేరు ‘అరుణిమ’). 

ఆ పేరు  ప్రభావంతో  ఆలోచిస్తే ... వెంటనే  తట్టిన పేరిది!

30, అక్టోబర్ 2014, గురువారం

బ్రహ్మన్న బొమ్మా.... నా అన్వేషణా!

చూసీ చూడగానే ఆకట్టుకుంది. మనసులో ముద్రించుకుపోయింది.

కాలం గడుస్తున్నా వెంటాడింది!

అదో వర్ణ చిత్రం..
‘బ్రహ్మనాయుడి’ రూపం!

మా. గోఖలే గీసిన ఆ పెయింటింగ్... ఒరిజినల్ ని ఇంకా చూడలేదు.  ఫొటో మాత్రమే చూశాను.

ఆ చిత్రం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం  పెరుగుతూవచ్చింది.

మాధవపెద్ది గోఖలే
 1999లో  ‘ఆంధ్రప్రభ’ వాళ్ళు తెలుగు సినిమా విశేషాలతో ‘మోహిని’ పేరుతో రెండు పుస్తకాలు వేశారు. రెండో పుస్తకంలో మా. గోఖలే గురించి చిత్రకారుడు ఎస్.వి. రామారావు రాసిన వ్యాసం యథాలాపంగా చదివాను;  మర్చిపోయాను.

ఆ వ్యాసం టైటిల్ కింద బ్రహ్మనాయుడు పెయింటింగ్ ని  ఇచ్చారు... బహుశా మొదటిసారి ఈ బొమ్మను అక్కడే చూశాను.

తర్వాతి కాలంలో ముఖ్యంగా చిత్రకారుడిగా మా. గోఖలే వివరాల కోసం అన్వేషిస్తుంటే ఒక్కోటీ తెలుస్తూవచ్చాయి.

‘మాయాబజార్’ సినిమా కళాదర్శకుడిగా ఘటోత్కచ,  శ్రీకృష్ణ  పాత్రలకు ఆకట్టుకునేలా రూపురేఖలను సమకూర్చటం,  ముఖ్యంగా ‘మహాప్రస్థానం’ పుస్తకానికి  ఉత్తేజకరమైన ముఖచిత్రం గీయటం,  చందమామలో ‘బాలనాగమ్మ’ సీరియల్ కి బొమ్మలు వేయటం.... ఇవన్నీ. 

ఈ విశేషాలను అందరితో పంచుకోవటం కోసం ఈ బ్లాగులో రెండేళ్ళ క్రితం  వరసగా రెండు పోస్టులు కూడా రాశాను.

వాటిలో ఒకదానిలో  ‘బ్రహ్మనాయుడు’బ్లాక్ అండ్ వైట్ బొమ్మను కూడా ఇచ్చాను.

ఆ పోస్టుకు ‘కమనీయం’ ఓ వ్యాఖ్య రాస్తూ  ‘మా. గోఖలే చిత్రించిన బ్రహ్మనాయుడి వర్ణ చిత్రం ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది’  అంటూ సమాచారం తెలిపారు.

అక్కడితో ఆ బొమ్మ గురించిన ఆలోచనలు ఆగిపోలేదు!

ళ్ళీ ఈ మధ్య ‘మోహిని’ దొరికింది.

ఎస్.వి. రామారావు వ్యాసం మళ్ళీ  చదివాను. ఈసారి నాకు పరిచితుడైన ‘గోఖలే’గురించి మరిన్ని విశేషాలు తెలిశాయి. బ్రహ్మనాయుడి చిత్రం గురించి విశిష్ట చిత్రకారుడైన ఎస్. వి. రామారావు అభిప్రాయం కూడా దీనిలో ఉంది.

కానీ...
ఓ కొత్త సందేహం పుట్టుకొచ్చింది!

 ఆ వ్యాసంలో ఇలా ఉంది-

‘(గోఖలే) ఇంట్లో ఆయన వేసిన ‘బ్రహ్మన్న’ పెయింటింగ్ ఉండేది. అది ఎందరో చిత్రకారులకు స్ఫూర్తిదాయకంగా ఉండేది. ‘జీవం’ ఉట్టిపడేట్టు ఉండేది. రాయలసీమ ప్రాంతానికి చెందిన భూమిపుత్రుడు బ్రహ్మన్న బాసంపట్టు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిన ఆ భంగిమను చూస్తే ఎన్నెన్నో విషయాలు మనసులో మెదిలేవి’
 

ఇప్పటిదాకా ఈ బొమ్మ పల్నాటి బ్రహ్మనాయుడిది అనుకుంటున్నాను కదా? 

కాదా?

ఈ బ్రహ్మన్న ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  రాయలసీమ చరిత్ర, సాంస్కృతిక వివరాలూ స్థూలంగా పరిశీలించాను. ఎక్కడా బ్రహ్మన్న పేరే కనపడలేదు.

అయినప్పటికీ ... స్వయంగా చిత్రకారుడైన ఎస్.వి. రామారావు తను ఇంతగా వర్ణించిన గోఖలే చిత్రం విషయంలో  పొరబడివుంటారని అనుకోలేకపోయాను.

పల్నాటి బ్రహ్మనాయుడి ప్రధాన ఆయుధం పేరు ‘కుంతం’ అని చదివాను. 

శిల్పులు దీన్ని  రెండు రకాలుగా  చెక్కుతున్నారు...

ఒకటి-  చివర్లో  U ఆకారం ఉన్న ఈటె.  ఆ రెండు చివరలూ చెరోవేపూ మొనదేలివుండటం.

 హైదరాబాద్  ట్యాంక్ బండ్ మీద పెట్టిన బ్రహ్మనాయుడు విగ్రహంలో అలాగే ఉంది. 

ఎన్టీఆర్  నటించిన పల్నాటి యుద్ధం సినిమాలో  దాదాపు ఇలాంటి ఆయుధాన్నే  చూపించారు.


పల్నాటి యుద్ధం జరిగిన   ప్రదేశం ... కారంపూడి ఊరి మధ్యలో  బ్రహ్మనాయుడి విగ్రహం  ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం చేతిలోని ఆయుధం మాత్రం  మరో రకంగా ఉంది. 
 
చూడండి...  ఆ  విగ్రహం ! 



 కానీ..  గోఖలే వేసిన బొమ్మలో  పొడవాటి ఖడ్గం కదా  ఉన్నదీ? 

అందుకే  ఆ  బొమ్మ-  పల్నాటి బ్రహ్మన్నది  కాకపోవచ్చనే అనుకున్నా.

లోపు-  కిందటి సంవత్సరం జనవరిలో  కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట వెంకట అప్పారావు)  తన బ్లాగులో  బహ్మనాయుడి  బొమ్మను  ప్రచురించారు...  ‘భారతి’ పత్రిక  నుంచి సేకరించానంటూ!

ఇప్పటివరకూ  నేను  చూసిన బొమ్మల్లో  క్వాలిటీ పరంగా ఇదే  అత్యుత్తమం!  (దీన్ని చివర్లో చూద్దాం) .


అయితే ఇది  ఆంధ్రపత్రికలోది కాదా? భారతి పత్రికలోదా? భారతిలో ప్రచురించివుంటే  ఏ నెల? ఏ సంవత్సరం? అనే వివరాలు అప్పారావు గారి దగ్గర కూడా దొరకలేదు.

ఇలా కొత్త సందేహాలు...

మిసిమి పత్రిక 1992 అక్టోబరు సంచికలో  ఇదే బొమ్మను ముఖచిత్రంగా వేసింది. 
ఆ సంచికలో ఈ బొమ్మ వివరాలుంటాయని ఆశపడ్డాను.  ఏమీ లేవు.  పైగా ‘ముఖచిత్రం మాదవపెద్ది ఘోఖలే’  అంటూ ఆయన పేరు రెండు తప్పులతో అక్కడ కనపడింది!

హతవిధీ... అనుకోవాల్సివచ్చింది!

ఈ లోపు  ఈ సబ్జెక్టు గురించి బ్లాగు పోస్టు రాయాలనిపించింది.
ఆ ఆలోచన రాగానే నా సందేహాలు తీర్చుకోవటానికి  ప్రయత్నించాను.

ఈ క్రమంలో...  తెలుగు విశ్వవిద్యాలయం 1995లో ప్రచురించిన పుస్తకం చూశాను. మొదలి నాగభూషణశర్మ, ముదిగొండ వీరభద్రశాస్త్రి సంపాదకులుగా తెచ్చిన ఈ పుస్తకం పేరు History and culture of the Andhras. 

183 వ పేజీ మొత్తం గోఖలే బ్రహ్మనాయుడు బొమ్మను  (బ్లాక్ అండ్ వైట్ )  ప్రచురించారు.

ఆ ముందుపేజీలో  పల్నాటి బ్రహ్మనాయుడి వివరాలు ఉన్నాయి.

అంటే ఆ బొమ్మ  పల్నాటి బ్రహ్మనాయుడిదేనని ఆ ప్రచురణకర్తలు కూడా భావించారన్నమాటే కదా?

ఆ పుస్తక ప్రచురణ నాటికి గోఖలే చనిపోయారు (1981). 

రాయలసీమ బ్రహ్మన్నా?  పల్నాటి బ్రహ్మన్నా?
ఏమీ నిర్థారణ కాలేదు.

కొ.కు. నా సాయానికొచ్చారు!
ఇంతలో... విరసం ప్రచురించిన కొడవటిగంటి రచనా ప్రపంచంలోని ‘సాహిత్య వ్యాసాలు’ రెండు పుస్తకాలుగా కొరియర్ లో వచ్చాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన  ‘నాయకురాలు’నాటకంపై ఆంధ్రప్రభలో కొ.కు.  చేసిన సమీక్ష  ఓ పుస్తకంలో  ఉంది. నాయకురాలు నాగమ్మ ఉంటే బ్రహ్మనాయుడు కూడా ఉండాల్సిందే కదా? 

నాక్కావలసిన సమాచారం సమీక్ష చివర్లో కనపడి చాలా సంతోషం వేసింది.

‘.. అట్ట మీద గోఖలే బ్రహ్మనాయుడి చిత్రానికి అనుకరణ ఉన్నది’(ఆంధ్రప్రభ వారపత్రిక 25.4.1970).

అనుకరణ బొమ్మ సంగతి అటుంచి... గోఖలే వేసింది పల్నాటి బ్రహ్మనాయుడనటంలో సందేహం లేదన్నమాట...

ఈ విషయం సాక్షాత్తూ  కొడవటిగంటి కుటుంబరావు సర్టిఫై చేసినట్టయింది.  (గోఖలేతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉంది మరి) .

చిక్కుముడి వీడింది...!

 ఈ బొమ్మ గురించి చిత్రకారుడు ఎస్.వి.రామారావు గారు ఇంకా ఏమని వర్ణించారో చూడండి-


‘... మట్టి రంగులతో చిత్రించిన ఆ పెయింటింగ్ లో వీరుని పౌరుషం స్పష్టంగా కనిపించేది. అతని ముందు డాలు, ఒరలో కత్తి, తలకు పాగా, పంచె తెలుగుదనం ఆ ఆకారంలో కొట్టొచ్చినట్టు కనిపించేది. ఆ బొమ్మకు చారిత్రక న్యాయం చేకూర్చాలన్న తపనతో గీసినట్టు ప్రస్ఫుటంగా కనిపించేది. ’

‘అలా ఆయన ఎన్నో ఎన్నెన్నో మరపురాని, మరువలేని చిత్రాలను గీశారు.  స్కెచ్ లు వేశారు. అవి చాలావరకు తెలుగువారికి  తెలియకపోవడం దురదృస్టకరం. వాటర్ కలర్స్ లో,  ఆయిల్ కలర్స్ లో ఆయన అపురూప చిత్రాలను గీశారు. వాటి ఎవాల్యుయేషన్ జరగనేలేదు.’


ఈ పెయింటింగ్ ను  అమ్మటానికి గోఖలే ఇష్టపడలేదట. 

‘నాన్న పెయింటింగ్స్ ‘బ్రహ్మనాయుడు’, ‘బొబ్బిలి మల్లన్న’, ‘పావురాలు’ ఆనాటి ప్రఖ్యాత నటులు కొందరు చాలా నచ్చి కొందామని ప్రయత్నించారు. వారు ఎంత మొత్తం చెప్పినా నాన్న అంగీకరించలేదు’ అని గోఖలే రెండో కుమార్తె  ఉపాధ్యాయుల జ్యోతి 2009 లో ‘మా నాన్నగారు’సంకలనంలోని వ్యాసంలో గుర్తు చేసుకున్నారు.

సరే.. ఇంతకీ కొడవటిగంటి  చెప్పిన  అనుకరణ  ముఖచిత్రం ఎలా ఉంటుందో చూడాలని ఉబలాటపడ్డాను. నెట్ లో... కొద్దిసేపట్లోనే దొరికింది!
                          
 

అదే ఇది...

ఈ నాయకురాలు నాటకం 1969 ప్రచురణ.

తొలిసారి 1926లో ప్రచురితమైనపుడు ఏ బొమ్మ ఉండేదో మరి!


రెండు తెలుగు సినిమాల్లో...
పల్నాటియుద్ధం సినిమాను తెలుగులో రెండు సార్లు తీశారు.

1947లో  తీసిన సినిమాలో  బ్రహ్మనాయుడుగా గోవిందరాజు సుబ్బారావు నటించారు. (బాలచంద్రుడు అక్కినేని) .


1966లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడు ఎన్టీ రామారావు. (బాలచంద్రుడు హరనాథ్) .

వీరిద్దరి ఆహార్యం స్థూలంగా చూస్తే దాదాపు ఒకే విధంగా అనిపిస్తుంది.  తలపాగా, పెద్ద మీసాలు, పూసల దండలు మొదలైనవి.

ఇద్దరిలో  ఎన్టీఆర్ వేషం మాత్రం కొంత మెరుగుపరిచినట్టు ఉంటుంది.

గోఖలే వర్ణచిత్ర  ప్రభావం పల్నాటియుద్ధం (1966) సినిమాలోని  బ్రహ్మనాయుడి  ‘రూప’కల్పనలో ఏమైనా ఉందా అనే ఆలోచన వచ్చింది.

ఎవరు ఈ  సినిమాకు కళాదర్శకుడు?

టైటిల్స్ చూస్తే...  కనపడింది... ఆ కళాదర్శకుడు సాక్షాత్తూ... మా.గోఖలే! 

గోఖలే కళాదర్శకత్వం గురించి నెట్ లో అందుబాటులో ఉన్న వివరాల్లో ఈ సినిమా పేరు ఎక్కడా కనపడదు. అదో విచిత్రం!
 
 భారతి/ ఆంధ్రపత్రిక లో ప్రచురితమై నన్ను ఆకట్టుకున్న బ్రహ్మనాయుడి  బొమ్మ  ఇదిగో.. (కార్టూనిస్టు సురేఖ గారి సౌజన్యంతో...) 


 బ్రహ్మన్న ఘనత ఏమిటి?
అమానుషమైన కుల వ్యవస్థ మీద 12వ శతాబ్దంలోనే యుద్ధం ప్రకటించినవాడు పల్నాటి బ్రహ్మన్న!  ‘చాప కూడు’ పేరుతో అన్ని కులాలవారికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సంస్కర్త.

కుల వ్యవస్థ ఇప్పటికంటే  ఘోరంగా ఘనీభవించివున్న అన్ని వందల సంవత్సరాల క్రితం నిమ్నకులాల వారిని ఆదరించటం, ఇలాంటి ఒక ప్రయత్నం చేయటం సామాన్యమైన సంగతి కాదు.  మానవత, సమతా భావాలతో పాటు ఎంతో సాహసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

తెలుగు విశ్వవిద్యాలయం  ‘తెలుగు వైతాళికులు’ సిరీస్ లో  1988లో బ్రహ్మనాయుడు పుస్తకం ప్రచురించింది.

దాన్ని ఇక్కడ చదవొచ్చు...
   

27, జులై 2012, శుక్రవారం

సినీ మా.గోఖలే... అపర శ్రీకృష్ణ సృష్టి!


‘మనసుంటే మార్గ’మే కాదు, ఆ మార్గం ఫలితాన్ని కూడా ఇస్తుందని నా విషయంలో చక్కగా రుజువైంది. మనం ఏ విషయంలోనైనా  ఆసక్తి పెంచుకుంటే దాని విశేషాలు  మనకే తారసపడతాయి!

కిందటి నెల మా.గోఖలే గురించి ఓ టపా  రాశాను.  ఆయన ప్రతిభా విశేషాల  గురించి   వివరంగా, మరింకేమైనా తెలిస్తే బాగుణ్ణనుకున్నాను.  

అంతే.. అప్పటినుంచీ ఆయన విశేషాలు తెలుస్తూనే వచ్చాయి. (ఇదేదో మాయో, మహిమో  కాదు. అంతకుముందు కూడా కనపడే వుంటాయి కానీ, నేనే వాటిని  పట్టించుకోలేదు).

ముఖ్యంగా గోఖలే  సృజనకు అద్దం పట్టే సెటింగ్ ల స్కెచ్ ల ప్రతిరూపాలూ, ఓ జానపద సీరియల్ కి  ఆయన వేసిన  బొమ్మలూ  దొరికాయి! 

మరి  వీటిని మీ అందరితో  పంచుకోవద్డూ? దీంతో- మా. గోఖలేపై  మరో టపా అనివార్యమైపోయింది.

* * * 

ఖైదుకు మారు పేరు శ్రీకృష్ణ జన్మస్థానం. 

‘వెన్న దొంగ- మా తొలిగురువు- తొలి నుంచీ మా కులగురువు’ అంటూ  ఖైదీలు కూడా (శ్రీశ్రీ కలం సాయంతో) ఆరాధించే పాత్ర శ్రీ కృష్ణుడు.

మరి అపర సినీ  శ్రీకృష్ణ  జన్మస్థానం  ఎక్కడో తెలుసా? ‘విజయా’వారి ఆస్థానం!

శ్రీకృష్ణుడంటే మన తెలుగువారికి  ఎన్టీ రామారావే!   తమిళంలోనూ ఆయనకు అంత పేరుందట.  అంతకుముందు సీఎస్సార్ లాంటివారు ఈ వేషం వేసినా అప్పట్లో కృష్ణుడి పాత్రకు ఈలపాట రఘురామయ్య  ప్రసిద్ధి. ఆయన్ను చూడ్డానికీ, ఈలపాట వినడానికీ (కృష్ణుడి వేషమైనా  ఈలపాడక తప్పేది కాదు పాపం ఆయనకి) అలవాటుపడ్డ ప్రేక్షకులు  మరొకర్ని ఆ పాత్రలో  జీర్ణించుకోలేరు కదా?

ఘంటసాల సొంత  చిత్రం ‘సొంత ఊరు’ (1956)లో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి  శ్రీకృష్ణుడిగా కనపడ్డారు. కానీ  ఆ పాత్రలో జనం ఆయన్ను ఆమోదించలేకపోయారు. థియేటర్లలో హేళనగా  ఈలలతో  గోలగోల చేశారు.

 ఈ సంగతి తెలిసి కూడా జంకకుండా, ఎన్టీఆర్ తోనే మాయాబజార్ (1957)లో శ్రీకృష్ణుడి పాత్ర వేయించిన కేవీ రెడ్డి గారి ధైర్యం, దూరదృష్టిని  మెచ్చుకుని తీరాలి. ఆయనకు కళాదర్శకుడు మా.గోఖలే  రూపంలో  అండ దొరికింది.


(తాజా కలం in August 2013 :  ఈ విషయం వాస్తవం కాదని  సినీ విమర్శకుడు   డా. వి.ఎ.కె.రంగారావు  ‘నవ్య’లో ఈ లేఖ రాశాక తెలిసింది-    ఎన్.టి.రామారావు మొట్టమొదటి కృష్ణరూపం ధరించింది సొంత వూరు’ (1956) లో కాదు; ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954)లో. ఆయన వేషాన్ని  ఎవరూ విమర్శించలేదు. ఆ సినిమాలు రెండూ బాగా ఆడలేదు. అంతే. తెలియనివారూహించటం, అనడం, తక్కినవారు గొర్రెదాటు వాటాన్ని అనుసరించడం అలవాటైపోయింది’ ) 

ఎన్టీఆర్ ని కృష్ణుడిగా ఒప్పించాలన్నది   సవాలుగా తీసుకున్న  గోఖలే  ఊహలు రెక్క విప్పుకున్నాయి.  సహచరుడు కళాధర్ సాయంతో  కిరీటం, నగలూ రూపొందించారు. వివిధ రూపురేఖలతో రకరకాల స్కెచ్చులూ, గెటప్ లూ వేశారు. ఫొటోలు తీశారు. 

అప్పటిదాకా పరిచితమైన  కృష్ణుడి రూపుకు పూర్తి భిన్నమైన ఆహార్యం కోసం కృషి చేశారు. సగం కిరీటం కాస్తా  పూర్తి కిరీటంగా మారింది. వీటన్నిటికీ  ఎన్టీఆర్ రూపం, నడక, కొంటెదనపు  చిరునవ్వు తోడై  సినీ శ్రీకృష్ణుడు అవతరించాడు.

ప్రేక్షకులను నొప్పించిన  కృష్ణుడిని.. చివరకు వారిచేత  ఒప్పించటమే కాదు, మెప్పించి.. అంతటిలో ఆగకుండా  అశేష నీరాజనాలు పలికే స్థాయిలో  విజయవంతమైన  ఈ ప్రయత్నం  అమోఘం!  

భక్తుల కలల్లోకి  శ్రీకృష్ణుడు  వచ్చాడంటే...అది నిశ్చయంగా  ఎన్టీఆర్ రూపంలోనే అనే  స్థితి  ఏర్పడిపోయింది! :) 

అలా శ్రీకృష్ణ పాత్రే తానుగా మారారు ఎన్టీఆర్. కాసేపున్నా చాలనిపించేలా, ఆఖరికి సాంఘిక సినిమాల్లోకి కూడా ఆ పాత్ర  చొరబడింది.  1973లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కథాపరంగా  ‘మరల రేపల్లె వాడలో మురళి మోగి’ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ సమ్మోహనరూపం  కళ్ళబడినపుడు తెలుగు ప్రేక్షకుల సంతోషం తనలో ప్రతిఫలించిందా అన్నట్టు-   ఎస్వీ రంగారావు  మొహంలో సంతోషం వెల్లివిరుస్తుంది! 

తన దర్శకుడి  నిర్ణయం ఎంత కచ్చితమైనదో ఈ కళా దర్శకుడు తిరుగులేనివిధంగా  అలా నిరూపించారు! 

 * * * 

హైహై నాయకా  
మాయాబజార్ లో  ఘటోత్కచుడి ఆహార్యం మా.గోఖలే మరో అద్భుత సృష్టి.
ఆయన ఆ పాత్ర ఎలా ఉండాలో ఊహించి స్కెచ్ వేశారు. 

ఆ స్కెచ్ నీ , దాని ఆధారంగా రూపొందిన పాత్రధారినీ   చూడండి.

కొండల్లో కోనల్లో తిరిగేవాడు కాబట్టి కిరీటంపై ఈకలు డిజైన్ చేశారు.  కర్ణాభరణాలు పెద్దగా వెంకటేశ్వరస్వామి నగల మల్లే ఉన్నాయి. పూసలూ, కంఠాభరణాలూ కూడా అటవీ సంస్కృతిని గుర్తుచేసేవే.

ఈ గెటప్ కు ఎస్వీ రంగారావు గారి నటన  తోడై, ఘటోత్కచుడి పాత్ర గొప్పగా పండింది!
* * * 

తీయని ఊహల పూలతోట  
 పాతాళభైరవి సినిమాలో కథానాయిక  చెలికత్తెలతో  ‘తీయని ఊహల హాయిని గొలిపే వసంత గానమె హాయీ’ పాట పాడుకుంటుంది కదా? ఆ తోట  నిజమైన ఉద్యానవనంలాగే  ఉంటుంది. కానీ అది సెట్. మా.గోఖలే చేసిన మాయాజాలం!


* * * 

క్కడ కొన్ని సెటింగ్స్, వాటికి ముందుగా వేసుకున్న స్కెచెస్ చూడండి.

తన డిజైన్  సంతృప్తికరంగా వచ్చి, గోఖలేకి నచ్చిన ఈ సెట్ ‘జగదేకవీరుని కథ’లోది.



ఇది మాయాబజార్ లో శశిరేఖ భవంతి .



చంద్రహారంలోనిది ఈ  కన్నులపండువైన ఈ సెట్.

సహజత్వం,  భారీతనం,  కథాస్థలంలోకీ, కథా కాలంలోకీ తీసుకువెళ్ళగలిగే  నేపథ్య కల్పన, పాత్రలకు సముచితమైన  ఆకట్టుకునే ఆహార్యం.... ఇవీ-  మా.గోఖలే కళాదర్శకత్వంలో కనపడే విశేషాలు.
 * * * 

వైముఖ్యం నుంచి  ప్రాముఖ్యం
గూడవల్లి రామబ్రహ్మం గారి ‘రైతుబిడ్డ’ (1939)  సినిమా ఆర్ట్ విభాగంలో పనిచేసిన గోఖలేకు ఆ పని అంత ఉత్సాహం కలిగించలేదు.  ఇక సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకూడదని నిశ్చయించుకుని పదేళ్ళ పాటు సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు.

అలాంటిది చక్రపాణి ప్రమేయంతో  షావుకారు (1950) కు కళా దర్శకుడి బాధ్యత స్వీకరించారు. తన పని విలువా,  ప్రాముఖ్యం తెలిసిన నిర్మాతలవటం వల్ల విజయా ఆస్థాన కళా దర్శకుడిగా కొనసాగారు.  అజరామర చిత్రాలకు పనిచేశారు.

* * * 
చిత్రకారునిగా...

మా.గోఖలే డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో రాజకీయ కార్టూన్లు వేశారు. చక్రపాణి  ఆయన్ని 1948లో మద్రాస్ పిలిపించుకుని తన సంపాదకత్వంలోని యువ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బొమ్మలు వేయించారు.

గోఖలే  ‘చందమామ’ తొలి సంచికల్లో కూడా  బొమ్మలు వేశారని కొత్తగా తెలిసింది. ఆయన బొమ్మలు వేసిన సీరియల్  ‘బాలనాగమ్మ’!

సమాచారం తెలిస్తే అలా ఊరుకోలేను కదా? ఆ సంచికలు సంపాదించి, ఆ  బొమ్మలను చూసి  ఆనందించాను.  కొన్ని చిత్రాలు   మీరూ చూడండి...





 8 సంచికలుగా విస్తరించిన ఆ సీరియల్ భాగాలను ఒకే pdf ఫైలుగా కంపైల్ చేశాను. ఈ సీరియల్ 66 పేజీలుంది.  50 mb.

మరి మన మిత్రులకు దీన్ని  ఎలా అందుబాటులోకి తేవడం? రాపిడ్ షేర్ లో అప్ లోడ్ చేశాను.

ఆసక్తి ఉన్నవారు కింది బొమ్మ మీద క్లిక్ చేసి,  ‘బాలనాగమ్మ’ సీరియల్ ని  డౌన్ లోడ్ చేసుకోవచ్చు
 
http://rapidshare.com/share/13AF3DFBD6F284057C27CC4A5504D90F


(‘సినిమా రంగం’ సంపాదకుడు కీ.శే. జి.వి.జి. గారు, ‘బ్లాక్ అండ్ వైట్’ రచయిత రావి కొండలరావు గారు,  ‘చందమామ’ సంస్థాపకుల సౌజన్యంతో ఈ టపాలో కొన్ని అంశాలూ, చిత్రాలూ ఉపయోగించుకున్నాను. వారికి  నా  కృతజ్ఞతలు).
 
3.12. 2020 
తాజా చేర్పు:  చందమామ 1948 జనవరి సంచికలో మా. గోఖలే వేసిన  దమయంతి రంగుల  చిత్రం
 

 
 
 

13, జూన్ 2012, బుధవారం

మాయాబజార్ చిత్రం ... మహాప్రస్థానం ముఖచిత్రం!

1950 లో ప్రచురితమైన  మహాప్రస్థానం, 1957 లో విడుదలైన మాయాబజార్ ... ఈ రెంటితో  సంబంధమున్న  కళాకారుడు మా.గోఖలే !

మొదటిది  తెలుగు కవిత్వ పటుత్వానికి  చిరునామా, సాహిత్య  శిఖరం!  రెండోది  తెలుగు సినిమా  స్థాయికి  పరాకాష్ఠ,  వెండితెర కావ్యం!

ఈ రెండిటి గురించి  ఇక  చెప్పాల్సిందేమీ లేనంతగా  విస్తారంగా  చర్చలు  జరిగాయి. అయినా... తరచూ ఉటంకింపులతో ప్రశంసలూ,   సమాలోచనలూ,  తలపోతలూ సాగుతూనే ఉన్నాయి. 


ఇక  మా.గోఖలే! (1917-1981). మాధవపెద్ది  గోపాల కృష్ణ గోఖలే. ఇంటి పేరు చూడకపోతే పేరును బట్టి  తెలుగువాడు కాదనిపిస్తుంది. ( స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి గుర్తుగా మనలో ఝాన్సీలక్ష్మీబాయిలూ ,  బాలగంగాధర తిలక్ లూ, గాంధీలూ చాలామందే ఉన్నారనుకోండీ.) 

ఆయన  రాసిన  కథలతో  ఓ సంకలనం  వచ్చింది. అయితే   చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా ఆయన  కృషిని   తెలిపే  సమాచారం అంతగా  అందుబాటులో  లేదు.

1949 ఆగస్టు 1న కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో ప్రజలను దిగంబరులుగా మార్చి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించారు పోలీసులు. దీనిపై గోఖలే గీసిన రేఖా చిత్రం అప్పట్లో చర్చనీయాంశమయిందట.  (చలసాని ప్రసాదరావు ‘ఇలా మిగిలేం’లో కూడా ఈ సంఘటన ప్రస్తావన ఉంటుంది).


గోఖలే చిత్రించిన  పలనాటి ‘బ్రహ్మన్న’కు  బాగా ప్రసిద్ధి వచ్చింది. ‘చాపకూడు’తో సమత కోసం ప్రయత్నించిన బ్రహ్మనాయడు చాప మీద  ఆలోచనా ముద్రలో  కూర్చుండగా ఎదురుగా ఖడ్గం.  సాంప్రదాయిక శైలిలో గీసిన  ఈ బొమ్మను చూస్తుంటే పల్లెటూళ్ళలోని  వ్యవసాయకుటుంబాల్లో ఆజానుబాహులైన రైతులు గుర్తొస్తారు. నీటి రంగుల్లో చిత్రించిన ఈ బొమ్మను ఏ పుస్తకంలో చూశానో గుర్తు లేదు కానీ ఆ వర్ణచిత్రం లభ్యం కాలేదు.

ప్రస్తుతానికి నలుపు తెలుపు చిత్రాన్నే చూద్దాం.



గోఖలే  మరో ప్రసిద్ధ చిత్రం  ‘పావురాళ్ళు’. నేనింతవరకూ  చూసినట్టు గుర్తులేదు. ఇది కూడా ఎక్కడా  దొరకలేదు.  

కళా దర్శకుడు
మాయాబజార్  సినిమాకు  కళా దర్శకుడిగా మా. గోఖలే  పనిచేశారు. ఘటోత్కచుడూ, శ్రీకృష్ణుడూ  .. ఈ   పాత్రల ఆహార్యం , పౌరాణిక వాతావరణం కళ్ళముందుకు తెచ్చిన  సెట్ల వెనక కృషి మా. గోఖలేదే.


ఈ సారి  ఆ సినిమా చూసేటపుడు... సెట్ల అందాలనూ,  పాత్రధారుల అలంకరణలనూ గమనించి  మా.గోఖలేను  కూడా  తల్చుకోండి ఓసారి! 

గోఖలే కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాలు పదకొండో, పన్నెండో ఉన్నాయి. షావుకారు  (1950)తో కెరియర్  ప్రారంభించి,  పాతాళభైరవి  (1951), మిస్సమ్మ (1955) ... అలా ఎదుగుతూ జగదేకవీరుని కథ (1961), ఆపై శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)  వరకూ విజయవంతంగా కొనసాగారు.

టైటిల్ డిజైనర్
 గత అరవయ్యేళ్ళలో  30కు పైగా  ముద్రణలు పొందిన విశేష  ప్రాచుర్యం  మహాప్రస్థానానిది.  దీనికి  ముఖచిత్రం  వేసింది మా.గోఖలేనే !

‘మహాప్రస్థానం’అనే అక్షరాలు  ఏటవాలుగా వంగి ఒక కదలికను స్ఫురింపజేస్తుంటాయి.  గుండ్రంగా, ఒద్దికగా ఒదిగివుండే సాంప్రదాయిక  తెలుగు అక్షరాలు కావివి.  కొత్త బాటలో  తిరుగుబాటును తలపించేలా , పుస్తక స్వభావం  వ్యక్తమయేలా  ఉంటాయవి. ‘భారతీయుడి’ గొలుసుకొట్టు రాతను పోలి అక్షరాలు విభిన్నంగా  కనపడతాయి. తలకట్టు గీయటంలో,  నిలువుగా నిలిచిన  అక్షర నిర్మాణంలో  అదో  ప్రత్యేకత.  ‘శ్రీశ్రీ’ చేతిరాత ఇలాగే ఉంటుంది!

తర్వాతి కాలంలో  మాదాల రంగారావు ‘మహాప్రస్థానం’ పేరుతో  సినిమా తీసినపుడు  ఇదే  టైటిల్ ని లోగో గా వాడుకున్నారు.



ముఖచిత్రంలో వివరాలు  అంత స్పష్టంగా ఉండవు. కానీ ఒక రకమైన impact కలగజేసేలా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన దృశ్యాలు ఇందులో చిత్రించారు.

 ఓ పక్క.  ఉరికొయ్యలకు వేలాడే  శిరస్సులు, కుంగిపోయి, వంగిపోయి కూలబడిపోయిన  వృద్ధులూ, పిల్లలూ. ‘అనేకులింకా అభాగ్యులంతా అనాధులంతా అశాంతులంతా ’!  మరోపక్క- విముక్తి కోసం ప్రతిఘటనకు సిద్ధమైన జనం!

ఇదంతా  నేపథ్యం.  

‘మీ కోసం కలం పట్టా’నని  భరోసా ఇస్తూ -

‘నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి’..


సమర్పణం చేస్తున్నానన్నట్టు  ఒక పక్కకు  తలపైకెత్తి స్థిరంగా,  ధీమాగా చూసే  శ్రీశ్రీ (అలనాటి) రూపం !

‘మహాప్రస్థానం’  టైటిల్ డిజైన్ రూపకల్పన అనుభవం  గురించి  మా. గోఖలే  ఎక్కడైనా చెప్పారో, రాశారో లేదో తెలీదు.

చలం రాసిన  ‘యోగ్యతా పత్రం’ శక్తిమంతమైన అక్షర నివాళి! 
గోఖలే గీసిన ముఖపత్రం- ఆ పుస్తక సారాన్ని చాటి చెప్పే చిత్రకళా కాహళి!!