సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, జులై 2010, సోమవారం

నా హీరోలు.. వాలీ, కర్ణుడూ!

విజేతలంటే  ఎవరికైనా ఇష్టమే! కానీ  పరాజితుల్లోనూ  కొందరు తమ  ప్రత్యేక లక్షణాలతో ఆకట్టుకుంటారు. పురాణేతిహాసాల విషయానికొస్తే... రామాయణంలో వాలీ, భారతంలో కర్ణుడూ  అలా నాకు ఇష్టంగా అనిపిస్తారు. ఇద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.

చెట్టు చాటు నుంచి దూసుకొచ్చిన  రామబాణానికి వాలీ; 
రథం కుంగి నిస్సహాయంగా ఉన్నపుడు  అర్జున బాణానికి కర్ణుడూ!

భీష్ముడు  అర్థరథుడిగా చేసి అవమానించినా తర్వాత కౌరవ సేనకు సర్వసైన్యాధిపత్యం వహించిన కర్ణుడి పేర ఏకంగా ఓ పర్వమే ఉంది; ‘కర్ణుడు లేని భారతం’ అని మాట పుట్టింది. ఈ స్థాయిలో వాలికి,  రామాయణంలో ప్రాధాన్యం లేకపోయినా ఆ పాత్రలో ఆకర్షణ ఉంది.

ఎదుటివ్యక్తిలోని శక్తిని లాగేసుకునే ప్రత్యేకత వాలిది. సహజ కవచ కుండలాలు కర్ణుడి విశిష్టత. వీటివల్ల నాకు ప్రాథమికంగా ఆ పాత్రలపై ఆసక్తి పెరిగి వుండొచ్చు.  

వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, చిన్నప్పట్నుంచీ. ‘చందమామ’లో ‘వీర హనుమాన్’ధారావాహిక వస్తున్నపుడు కూడా ఈ ఘట్టాన్ని ఆసక్తిగా చదివాను.
తారతో వాలి సంభాషణ (చందమామలో చిత్రకారుడు శంకర్ వేసిన చిత్రం)

కొడవటిగంటి కుటుంబరావు గారు రాశారో, మరెవరు రాశారో గానీ.. సుగ్రీవుడు అన్నను నిందిస్తూ  యుద్ధానికి రమ్మని సవాలు విసురుతుండగా కిష్కింధ అంత:పురంలో  వాలీ, తారల మధ్య నడిచే సంభాషణ ఎంతో భావగర్భితంగా ఉంటుంది.

రామాయణాన్నిఒక కవి రాసిన సాహిత్యంగా కాకుండా... వాస్తవంగా జరిగిన గాథగా, ఆ రచనను పవిత్ర గ్రంథంగా భావించే భక్తుల్లో కూడా వాలి వధ విషయంలో భిన్నాభిప్రాయాలుండటం  నాకు తెలుసు. దీనిపై అనుకూల ప్రతికూల వాదనలూ, చర్చోపచర్చలూ తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయనుకోండీ.

శ్రీరాముడి వల్ల వాలికి అన్యాయం జరిగిపోయిందనే నా ఆలోచనలకు తర్కబద్ధమైన సమర్థన రంగనాయకమ్మగారి ‘రామాయణ విషవృక్షం’లో దొరికింది. ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు  లేకపోవటం వల్ల  ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను. ఒకవేళ  అప్పటికి నాస్తికుణ్ణి కాకపోయినప్పటికీ ‘వాలి వధ’ఘట్టంలో రంగనాయకమ్మగారి వాదన నాకు  నచ్చివుండేదే!

కన్నతల్లితో కర్ణుడు  (చందమామలో శంకర్ వేసిన బొమ్మ)


కర్ణుడి విషయానికొస్తే.. తనను ఆదరించిన కౌరవుల పక్షాన చివరిదాకా ఉండటం, చెప్పిన మాటకు కట్టుబడటం కర్ణుడి పాత్రను ఉన్నతంగా నిలిపాయి. కుంతి వచ్చి తన జన్మ రహస్యం చెప్పి పాండవపక్షానికి రమ్మని  బతిమిలాడినప్పుడు నిరాకరించటం, తల్లిని నిరాశపరచకుండా  ఒక్క అర్జునుణ్ణి మినహా మిగతా పాండవులను చంపనని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటం కర్ణుడంటే ఏమిటో నిరూపిస్తాయి.

తార మాట వినకుండా సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళిన వాలీ, 
కుంతి మాటను తిరస్కరించి పాండవ పక్షానికి వెళ్ళని  కర్ణుడూ 
ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ; తారకూ, కుంతికీ వారు తమ కోణంలో చెప్పిన సమాధానాలు వారిమీద గౌరవం పెంచుతాయి.  

జాషువా అద్భుత పద్యాలు
నా స్కూలు రోజుల్లో గుర్రం జాషువా గారి ‘భారత వీరుడు’ (రచనా కాలం:1927)  పద్యాలు చదివాను. వాటిలో కర్ణుడి ఔన్నత్యాన్నీ, నిజాయతీనీ సమర్థిస్తూ జాషువా గారు అద్భుతంగా రాశారు. అర్జునుడి మీద ప్రయోగించిన నాగాస్త్రం కొద్దిలో గురి తప్పి, వెనుదిరిగి వచ్చి మళ్ళీ ప్రయోగించమని కోరినపుడు ‘ఛీ..ఎంగిలి బాణం వాడను’ అనటం.. ఇలాంటి ఘట్టాలను ప్రస్తావిస్తూ నేరుగా కర్ణుడినే ఉద్దేశిస్తూ  పద్యాలు సాగుతాయి. కర్ణుడే నిజమైన ‘భారత వీరుడ’ని అభివర్ణిస్తారు.

అంతర్జాలంలో ఆ పద్యాలు దొరుకుతాయేమోనని వెదికాను కానీ, ప్చ్... ఫలితం కనిపించలేదు!

కర్ణుడి మరణానికి కారకులెవరు?
‘కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్టు’ అనీ,  ‘కర్ణుడి చావుకు వెయ్యి కారణాలున్నట్టు’ అనీ  అంటుంటారు. కానీ శ్రీమదాంధ్ర మహాభారతంలో తిక్కన పద్యం ప్రకారం చూస్తే.. కర్ణుడి మరణానికి ఆరుగురు కారణమని అర్జునుడికి  స్వయంగా కృష్ణుడే చెప్పినట్టు ఉంది.

ఆ పద్యం చూడండి-
‘నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్’


1.అర్జునుడు   2.కృష్ణుడు   3.కుంతి   4.ఇంద్రుడు   5.భూదేవి   6.పరశురాముడు.

అయితే - యుద్ధ సమయంలో కర్ణుణ్ణి  అన్ని విధాలుగా నిరుత్సాహపరిచిన శల్య సారథ్యం సంగతేమిటి? ప్రత్యర్థిని హంసగా వర్ణించి, పొగడ్తలతో ముంచెత్తి, కర్ణుడిని కాకితో పోల్చి అతడి మనసును వికలం చేయటం... మానసికంగా బలహీనుణ్ణి చేయటం చిన్న విషయమేమీ కాదు  కదా!

అందుకని ఏడో కారకుడిగా శల్యుణ్ణి   పై జాబితాలో కలుపుకోవచ్చనిపిస్తుంది!

190 కామెంట్‌లు:

Prasanth చెప్పారు...

కర్ణుడి విషయంలో నేను ఏకీభవిస్తాను కాని...రామాయణ విషవృక్షం లో మీకు తర్క బద్ధమైన సమాధానం దొరికిందంటే నేను అంగీకరించలేను. ఆ పుస్తకం చదివితే మొదటినుంచి రాముడిని విలన్ లాగా చిత్రీకరించాలని ఆవిడ చేసిన ప్రయత్నం కన్పించిందే కాని....హేతుబద్ధత ఏమి కనపడలేదు.

మనోహర్ చెనికల చెప్పారు...

జై శ్రీ రాం,
శ్రీ రామదూతం శిరసా నమామి!
నిజానికి వాలి విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఐతే ఆ సందేహం వచ్చినప్పుడు స్వయంగా రామాయణాన్ని చదివి తెలుసుకుందామనుకునేవాళ్ళు తక్కువ. దానితో ఎవరో చెప్పిన దాన్ని ఎక్కడో చదివేసి వాళ్ళ అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా నిర్ణయించేసుకుంటారు.మీరు కూడా అలాగే అనుకున్నారు. అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎలా అలోచిస్తున్నారో అలా చెప్పే పుస్తకాన్నే మీరు చదివారు. మీరు చెప్తున్న సదరు విషవృక్షం అలాంటిదే.
ఎందుకంటారా?
రామాయణంలో ప్రతీ ఘట్టమూ రాముని ఔన్నత్యాన్ని చెప్తుంది, నాకు బాగా నచ్చిన రెండు ఉదాహరణలు చెప్తాను వినండి.
ఒకటి, రామాయణ ఆవిర్భావం సందర్భం లో వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన ప్రశ్న.(కోన్వస్మిన్ సాంప్రతే లోకే..)
ధర్మం తప్పనివాడూ, సత్యం తప్పనివాడూ, సచ్ఛీలం కలిగిన వాడూ ఇలా అటూఇటుగా పదహారు గుణాలను చెప్పి ఇలాంటి వాడిని గురించి చెప్పమంటే, నారదుడు చెప్పింది ఆ రాముడి గురించి. అడిగింది తన నడవడికతో ఎంతటి పామరుడైనా, కౄరుడైనా మహర్షి గా మారవచ్చని నిరూపించిన వాల్మీకి. చెప్పింది బ్రహ్మ మానసపుత్రుడూ, నిరంతరహరినామ సంకీర్తనా తత్పురుషుడైన బ్రహ్మర్షి. మరి అలాంటప్పుడు నారదమహర్షి ఒక హంతకుడి గురించి, అన్నదమ్ములమధ్య వచ్చిన తగవుని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశవాదిని గురించా చెప్తాడు? చెప్పడు గాక చెప్పడు . మరి ఎందుకు చెప్పాడు ? ఈ ప్రశ్న ఏ ఒక్కసారైనా మనలని మనం వేసుకుంటే సమాధానం ఇట్టే తెలుస్తుంది.
ఇక రెండవది.
యుద్ధకాండలో లక్ష్మణస్వామి మేఘనాధున్ని సంహరించడానికి వాడిన మంత్రం.
"ధర్మాత్మా సత్యసంధశ్చ రామో ధాశరధిర్యదీ!
పౌరుషేచాప్రతిద్వంద్వం శరైనం జహి రావణిం!!
రాముడు ధశరధనందనుడూ, ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, పరాక్రమంలో ఎదురులేని వాడూ అయితే ఈ బాణం మేఘనాధుణ్ణి సంహరించు గాక.
దీని తర్వాత ఇంద్రజిత్తు మరణించాడని వాల్మీకి మహర్షి రాసినదే కదా, మరి దీన్నెందుకు ఒప్పుకోరో నాకర్ధం కాదు.
ఈ రెండు విషయాలు వాలి వధ తర్వాతే జరిగాయి అన్నది గుర్తుంచుకోవాల్సిన , గమనించాల్సిన విషయం. (contd)

మనోహర్ చెనికల చెప్పారు...

ఇకపోతే మీరన్న ఆ సదరు రచయితలు అన్నట్టు రాముడు అన్యాయంగా వాలిని చంపేస్తే
రాముడి పని మీద తిరుగుతున్న వానరులకి మాటసాయం చేసినంత మాత్రాన సంపాతికి కాలిపోయిన రెక్కలు ఎందుకు వచ్చాయో చెప్పరు.
రాముడి పని మీద వెల్తున్న వాడి కోసం తన రెక్కలు పోతాయని తెలిసీ మైనాకుడు ఎందుకు బయటకు వచ్చాడో చెప్పరు. రామాయణం లో ఎంతో తెలివైనదిగా,పతివ్రతగా పేరు గాంచిన తార కూడా రాముడిని పల్లెత్తు మాట ఎందుకనలేదో చెప్పరు.
నా భర్త ధర్మం తప్పని వాడైతే హనుమ తోకకు ఏమీ కాకూడదు అని సీతమ్మ అడిగితే అగ్ని హనుమను ఎందుకు దహించలేదో చెప్పరు.
పైన చెప్పిన లక్ష్మణ మూర్తి శపధం ఎందుకు విఫలం కాలేదో చెప్పరు.


కాదూ వాల్మీకి రాసినవన్నీ నమ్ముతామా , మాకు నచ్చినవీ, రామాయణంలో మాకు ఇది నచ్చలేదు అని చెప్పుకోవడానికి అనువుగా ఉండేవి మాత్రమే నమ్ముతాము అంటే చెప్పేదేమీ లేదు. వాలిని,శంభూకుడిని చంపాడు, సీతని అగ్ని ప్రవేశం చేయించాడు, అడవులకి పంపాడు ఇలాంటివి మాత్రమే నిజాలు మిగతావి కాదు అంటే ఈ వ్యాఖ్యని మీరన్నా డిలీట్ చేసెయ్యండి, లేదా నేనన్నా డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే మనం ఒకరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అంటే దానికొక బేస్ కావాలి. ఇక్కడ ఆ బేస్ వాల్మీకి రామాయణం నిజం అనో లేదా అబద్దం అనో కావాలి. అంతే కానీ ...................

"ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు లేకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను."
కానీ రెండో వైపున తమ జీవితాలకి రామయణ రహస్యాలని సామాన్య్లులకి అందించడమే పరమావధి అని త్రికరణశుద్ధిగా భావించి యేళ్ళకేళ్ళు వేదంలో , ఉపనిషత్తులలో, గీతలో పరిశోధన చేసి ప్రవచనాలు చేసి తరించిన వాళ్ళున్నారు. వాళ్ళ పుస్తకాలు కూడా చదవండి. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి.

ఎందుకంటే రేపు పొద్దున ఆ రచయిత/రచయిత్రి మనసు మారి వాల్మీకి చెప్పిందే కరెక్ట్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఎటు వైపు నిలబడతారు. అలా జరగదు అని మీరనేటట్టయితే ఒక్కసారి చలం గారిని గుర్తు చేసుకోండి. జీవితమంతా స్త్రీ స్వేచ్ఛ, నాస్తికత్వం గురించి మాట్లాడిన మనిషి అవసాన దశలో రమణాశ్రమం లో స్ఢిరపడిపోయాడు. ఎంతగా అంటే అక్కడి నుండి బయటికి రావాలంటే ప్రాణాలు గిలగిలలాడిపోయేటంతగా.

అలాగే ఒక్కసారి రామాయణాన్ని కానీ, మనసా వాచా కర్మణా రాముణ్ణే నమ్మ్ముకున్న ( గుడ్డిగా కాదు, లోకాభిరాముడని అర్ధం చేసుకుని) వాళ్ళు (శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు ,చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు)రాసిన వ్యాఖ్యానాలను కానీ చదవండి.

అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. అది సహేతుకం. ఇప్పుడు కూడా నేను రాముణ్ణి సమర్ధించడానికి ఇది రాయలేదు. అలా చెప్పడం నా సిద్ధాంతానికి వ్యతిరేకం. స్వయంగా తెలుసుకోండి. అప్పుడు మీ నిర్ణయం లో ఒక రకమైన సాధికారత ఉంటుంది.

సహాయక గ్రంధాలు/ఇతరాలు
రామాయణం-- తత్వదీపిక(శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి)
రామాయణ ప్రవచనం( శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామి, చాగంటి కోటేశ్వరరావు గారు)
సుందర మారుతి
శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకాలు


-------
భారతం గురించి నాకు అంతగా అవగాహన లేదు. అందువల్ల రామాయణానికి మాత్రమే పరిమితమయ్యాను.

మనోహర్ చెనికల చెప్పారు...

http://newjings.blogspot.com/2007/10/blog-post_09.html

http://newjings.blogspot.com/2010/07/vs.html

Malakpet Rowdy చెప్పారు...

నాకు తెలిసిన భారతం ప్రకారం -

కర్ణుడు ఎంత అన్యాయంగా చంపబడ్డాడో, తను ఓడే పరిస్థితిలో ఉన్నప్పుడు అభిమన్యుడిని కూడా అంతే అన్యాయంగా చంపాడు. తనకి అన్యాయం జరిగింది కనుక అంతకు ముందు తను చేసిన పనులన్నీ మర్చిపోవాలంటే (మన గుజరాత్ షహబుద్దీన్ టైపులో) ఎలా?

అన్నట్టు కౌరవ మహామహుల్ని ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ చేతిలో అన్యాయంగా హతుడైన అభిమన్యుడు మీ ప్రశంశకు నోచుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

వేణు చెప్పారు...

Prasanth గారూ! రామాయణ విషవృక్షంలో ‘నాకు’ తర్కబద్ధమైన సమాధానం దొరికిందంటే ‘మీరు’ అంగీకరించలేరా? ఇదీ మరీ బావుందండీ.:)
‘విషవృక్షం’లో మీకు హేతుబద్ధత కనపడలేదేమో కానీ, ఆ పుస్తకం నుంచి పదునైన తర్కాన్నీ, ఇంకా చాలా విషయాలనూ నేర్చుకున్నాను.

వేణు చెప్పారు...

మనోహర్ చెనికల గారూ!
రంగనాయకమ్మ గారు రాసిన ‘రామాయణ విషవృక్షం’ పుస్తకం వాల్మీకి రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలించిన పుస్తకం.
దాని గురించి మీ అభిప్రాయం మీది.

వాలి వధ తర్వాత జరిగిన రెండు ఘట్టాలను బట్టి, వాలి విషయంలో శ్రీరాముడి చర్య సమర్థనీయమనటం ఎంతవరకూ సరైనది?

శ్రీరాముడు షోడశ గుణాభిరాముడని అంత గొప్ప బ్రహ్మర్షి నారదుడు, అంత గొప్ప మహర్షి వాల్మీకితో చెప్పాడు కాబట్టి.. విశ్వసించటం కాదు; అసలా గుణాలు వాలి వధ లాంటి ఘట్టాల్లో ప్రతిఫలిస్తున్నాయా అని పరిశీలించటం సమంజసం కదా!

‘ఎంతో తెలివైన తార’ వాలి చనిపోయాక రాముణ్ణి పల్లెత్తు మాట అనకపోవటం- అంగదుడి క్షేమం కోసమే!

మీరు ప్రస్తావించిన మిగిలిన విషయాలంటారా? అవి ఎవరికి వారు ఏర్పరచుకునే భావాలకూ, జీవన దృక్పథానికీ సంబంధించినవి!

వేణు చెప్పారు...

Malakpet Rowdy గారూ!
కర్ణుడి వైపు నుంచి తప్పులు జరగలేదని కాదు. మీరన్నట్టు- అభిమన్యుడిని అన్యాయంగా చంపిన విషయంలో కర్ణుడిని సమర్థించలేం. (ఎన్టీఆర్ తన‘దానవీరశూర కర్ణ’లో అభిమన్యుడి విషయంలో కర్ణుడు పశ్చాత్తాపపడినట్టు చూపించారు. భారతంలో ఇది ఉందో లేదో :)

భారతంలో అభిమన్యుడితో పాటు మరికొన్ని పాత్రలు కూడా నాకిష్టమే. కానీ పుట్టిన మరుక్షణం నుంచీ కర్ణుడికి జరిగిన అన్యాయం, అతడి జీవన ప్రస్థానంలో ఎదురైన శాపాలూ, అవమానాలూ ఆ పాత్రంటే నాకు సానుభూతిని పెంచాయి. అతడి ఉదాత్త లక్షణాలు బాగా ఇష్టపడేలా చేశాయి.

>‘తనకి అన్యాయం జరిగింది కనుక అంతకు ముందు తను చేసిన పనులన్నీ మర్చిపోవాలంటే..’- కర్ణుడేమీ అలా కోరుకోలేదుగా! నేను కూడా అలా మర్చిపోవాలనేమీ అనటం లేదు!

మనోహర్ చెనికల చెప్పారు...

"మీరు ప్రస్తావించిన మిగిలిన విషయాలంటారా? అవి ఎవరికి వారు ఏర్పరచుకునే భావాలకూ, జీవన దృక్పథానికీ సంబంధించినవి!"

దీని గురించే నేను రాసింది. మీరు కూడా రామాయణాన్ని ఆ కోణంలోనుండి చూసే వాళ్ళ పుస్తకాలు చూసి అభిప్రాయం ఏర్పరుచుకోవద్దు. ఇంకొంతమంది దృక్కోణం కూడా చూడండి ఐ మీన్ చదవండి. అప్పుడు ఆలోచించండి . అదే నేను చెప్పేది.

మరొక్క విషయం మీరు రామాయణం గురించి ఏం చదివారో తెలుసుకోవాలనుంది(other than విషవృక్షం). ఎందుకంటే వాల్మీకి రామాయణం చదవలేదని తెలుస్తోంది.

"వాలి వధ తర్వాత జరిగిన రెండు ఘట్టాలను బట్టి, వాలి విషయంలో శ్రీరాముడి చర్య సమర్థనీయమనటం ఎంతవరకూ సరైనది?"

ఒక్క వాలివధ అనే విషయాన్ని పట్టుకుని మీరు రాముడిని అధర్ముడిగా చిత్రీకరిస్తున్నారు. అలాంటిది నేను రెండు ఘట్టాలను చూపించాను. అది కూడా వాలివధ విషయంలో రాముడు ధర్మం తప్పలేదని చూపించేవి. నేను ఉదాహరించిన మిగతా ఘట్టాలన్నీ ఈ విషయాన్ని ఋజువు చేసేవే.
మీరు రామాయణం చూస్తే ఇలాంటి ఘట్టాలు బాగానే కనపడతాయి. కావలసింది వాల్మీకి రామాయణాన్ని మీ కళ్ళతో చూడటం(ఇంకా కుదిరితే వాల్మీకి దృక్కోణంలో).

Malakpet Rowdy చెప్పారు...

Point taken, but then didnt NTR add his own masala to Mahabharat?

వేణు చెప్పారు...

మనోహర్ చెనికల గారూ!
వాల్మీకి రామాయణం తెలుగు అనువాదం చదివానండీ. నా సంగతి వదిలేయండి- వాల్మీకి రామాయణాన్ని తమ కళ్ళతో, వాల్మీకి దృక్కోణంలో చూసిన ఎందరో భక్తులు కూడా వాలి వధ విషయంలో రాముణ్ణి సమర్థించలేదని మీరు గమనించాలి! అసలీ విషయంలో భిన్నాభిప్రాయాలు కొత్తవేమీ కాదు; ఇలాంటి ఘట్టాలు తరతరాలుగా చర్చనీయంగానే ఉన్నాయి.

మనోహర్ చెనికల చెప్పారు...

సరే మీకు సుగ్రీవుడి మీద జాలి కలగలేదా,
చెప్పినట్టు చేసిన దానికి, కనపడగానే కన్నీళ్ళతో కాళ్ళు కడిగి రాజ్యం ఇచ్చినా తీసుకోకుండా కత్తి గట్టి చంపాలని వెంటపడ్డాడే మీరు చెప్పిన వాలి. ఋష్యమూకం మీద శాపం ఉంది కాబట్టి సుగ్రీవుడు బతికిపోయాడు లేకుంటే సుగ్రీవుడికి ఏనాడో నూకలు చెల్లిపోయి ఉండేవి. అది అన్యాయం కాదా, తన రాజ్యం లో అన్యాయం జరిగితే అది మరణ దండనకర్హమైనదని రాజు భావించినప్పుడు చంపడంలో తప్పు లేదేమో కదా. ఒక పులో సింహమో జనపదాలను హింసిస్తున్నప్పుడు రాజులు(చక్రవర్తులు) వేటకి వెళ్ళి చంపాలి అక్కడ శాంతి నెలకొల్పాలి. రాముడు చేసిందీ అదే. ఎందుకంటే వాలి కూడా వనచరుడే కదా.
అరణ్య కాండ మొట్టమొదట్లోనే చెప్పాడు రాముడు భరతుడితో, ఈ పదునాలుగేళ్ళు నువ్వు అయోధ్యను పరిపాలించు, నేను అడవులని పాలిస్తాను అందులో ఉండే రాక్షసులను అధర్మ పరులను శిక్షిస్తాను అని.
నాకు సంబంధించినంత వరకు రావణ, కుంభకర్ణ,కబంధ విరాధాదులెంతో వాలి కూడా అంతే.

మీకు వాల్మీకి చెప్పిన దానిలో ఏమీ తర్కం కనపడలేదా. మీరు మళ్ళీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటున్నారు . నేనన్నది ఆ రెండు వాదనలను విని అప్పుడు మీకు మీరు నిర్ణయించుకోమని. ప్రపంచంలో ప్రతి విషయం మీద భిన్నాభిప్రాయాలుంటాయి. ఐతే మనం ఎలా దానిమీద అభిప్రాయం ఏర్పరుచుకుంటాం అనేది ముఖ్యం.

మనోహర్ చెనికల చెప్పారు...

వాల్మీకి రామాయణాన్ని తమ కళ్ళతో, వాల్మీకి దృక్కోణంలో చూసిన ఎందరో భక్తులు కూడా వాలి వధ విషయంలో రాముణ్ణి సమర్థించలేదని మీరు గమనించాలి!

మరి సమర్ధించిన వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు వాళ్ళ వాదన మీరు ఎప్పుడైనా consider చేసారా? అది కూడా చూసి కదా మీరు నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది సమర్ధించలేదని మీరూ సమర్ధించకుండా ఉంటాను అంటే అది విజ్ఞులు చేసే పని కాదు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A K Sastry చెప్పారు...

'.....అది రామాయణం లో వుందో లేదో.............?'

".....అది 'వల్మీకం' లో లేదు......."

ఇవి కాదు కావలసింది!

రంగనాయకమ్మకి యెవరైనా 'సాధికారికం' గా సమాధానం చెప్పారా?

ఇంకెందుకీ వాదనలు?

అజ్ఞాత చెప్పారు...

కృష్ణశ్రీ గారూ,
కల్పవృక్షాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ గారు రాసిన విషవృక్షంలో రాముడి గురించీ, ఇతర పాత్రల గురించీ రాసిన ప్రతి విమర్శ వెనుకా ఉన్న శ్లోకాలను అర్థం, వివరణ లతో పాటుగా ఏ కాండలో ఏ సర్గలో ఉన్నదీ వివరంగా ఇచ్చారు. అందువల్ల రుజువులు,వాటి అర్థాలూ చూపిస్తున్నారు కనుక రంగనాయకమ్మకి "సాధికారికంగా"జవాబిచ్చే పరిస్థితులు లేవు. "రాముడిని తిట్టింది.విలన్ని చేసింది"అనే దూషణలు తప్ప!

ఇంతకీ అసలు వాల్మీకి రాసిన రామాయణం ఏది?అనే దానిమీద కూడా స్పష్టమైన జవాబులు లేవు. మనకు నచ్చింది వాల్మీకి రాసిందీ, నచ్చనిది ప్రక్షిప్తమూ! ఇదే వరస!

durgeswara చెప్పారు...

కల్పవృక్షానికి ,విషవృక్షానికి ఉన్నతేడా అదే .

కలపవృక్షం లక హితకరమైన దానిని ప్రసాదిస్తుంది . విషవృక్షమో లోకపీడాకారకమైన వాటిని ఇస్తుంది. ఇక ఎవరి మనస్తత్వం ఎలాఉందో అలాంటి ఆశ్రయాలను ఆశ్రయించి వారికి నచ్చినవే పొందుతారు. ఇది ఆజీవులప్రకృతిసిధ్ధమైన స్వభావం .

రవి చెప్పారు...

కొంతకాలం క్రితం రామాయణంలో వాలివధ గురించిన భాగాన్ని చదివాను నేను. (అలవోకగానే శ్రద్ధగా కాదు)

అందులో రాముడు చెప్పే రీజన్ ఇది.

"నీవు నీ తమ్ముడి భార్యను కామించావు. తమ్ముడి భార్య కూతురితో సమానం కాబట్టి తనను కామించడం ద్వారా ధర్మాన్ని తప్పావు. అందుచేత నేను నిన్ను చంపాను" అంటాడు.

నిజానికి ఈ విషయాలు నిజాయితీగా చర్చిస్తే మంచి విషయాలు తెలుస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ అందుకు అనుకూలమైన వాతావరణం బ్లాగుల్లో లేదు. ఇక్కడ ఒపీనియన్స్ ముఖ్యం. ఆస్తికుడివా, నాస్తికుడివా? అన్న వితర్కం ఇంకా ముఖ్యం. వీటి మధ్య "తెలుసుకోగలిగింది" ఏరటం కష్టం. చివరకు మిగిలేవి అపోహలు మాత్రమే. :-)

వేణు చెప్పారు...

మనోహర్ చెనికల గారూ!
వాలిని శ్రీరాముడు చంపిన విషయంలో నా వాదనలు నేను కొత్తగా చేస్తున్నవి కాదు; అలాగే మీ వాదనలు కూడా!
* వాలి వనచరుడు (పులి,సింహం లాంటి జంతువు) కాబట్టి శాంతి నెలకొల్పటం కోసం చంపటం తప్పు కాదా? మానవులకు వర్తించే ‘న్యాయం, ధర్మవర్తనా’ జంతువులకు వర్తిస్తాయా? న్యాయమూ, ధర్మమూ పాటించలేదనే కారణంతో ‘వాటిని’ చంపేయొచ్చునా?
* వాల్మీకి తన కథానాయకుడు రాముడి చర్యను సమర్థించకేం! దానిలో తర్కం సరిగా లేదు కాబట్టే.. ఈ విచికిత్స అంతా!
* మీకు సంబంధించినంతవరకూ రావణ, కుంభకర్ణ, కబంధ విరాధాదులెంతో వాలి కూడా అంతేనా? మంచిది.
* వాలి వధను ‘కొంతమంది సమర్థించలేదని మీరూ సమర్థించకుండా ఉంటారా?’అని నన్ను అడిగారు. ‘కొంతమంది సమర్థించారని మీరూ సమర్థిస్తారా?’ అని నేనూ మిమ్మల్ని అడగొచ్చు కానీ అడగను. ఎందుకంటే.. మీ అభిప్రాయం మీది! నా అభిప్రాయం నాది. రెండూ ఏకీభవించాలనేమీ లేదు కదా!

వేణు చెప్పారు...

సుజాత గారూ!
కర్ణుడి విషయంలో, వాలి విషయంలో మీరన్నట్టు ద్వైదీ భావాలు సహజమే. నూరుశాతం వారిని సమర్థించలేము; అలా అని ఇష్టపడకుండా ఉండలేం!

Kiran kumar గారూ!
బాగా చెప్పారు. ‘మనకు నచ్చింది వాల్మీకి రాసిందీ, నచ్చనిది ప్రక్షిప్తమూ!’ అన్న మీ వ్యాఖ్యలో ఎంతో వాస్తవముంది.

మీరు రాసిందాంట్లో చిన్న సవరణ- రంగనాయకమ్మ గారు విషవృక్షాన్ని రాసింది ‘కల్పవృక్షాన్ని విమర్శిస్తూ’కాదు; వాల్మీకి రామాయణాన్ని విమర్శిస్తూ!

Malakpet Rowdy చెప్పారు...

న్యాయమూ, ధర్మమూ పాటించలేదనే కారణంతో ‘వాటిని’ చంపేయొచ్చునా?
_____________________________________

ఈ కాలం లో కూడా ఒక పిచ్చి పట్టిన కుక్కని చంపడానికి సమాజం ఒప్పుకుంటుంది - గినియా పిగ్ లని ప్రయోగాల పేరుతో చంపడాన్ని సమర్ధిస్తుంది. మరి మనుషుల విషయంలో?

Malakpet Rowdy చెప్పారు...

"కలపవృక్షం"
___________

Durgeswara garu

"కల్ప" బదులు "కలప" అని వ్రాస్తే అర్ధం మొత్తం మారిపోదూ? :))

Malakpet Rowdy చెప్పారు...

Back to the discussion,

జంతువులని (of the wild type) చంపడాన్ని ఈ మధ్య కాలం దాకా సమాజమేనాడూ తప్పుగా పరిగణించలేదు.

వేణు చెప్పారు...

కృష్ణశ్రీ గారూ,
వారూ, వీరూ ఎందుకూ.. రంగనాయకమ్మ గారికి ‘సాధికారికం’గా మీరే సమాధానం చెప్పొచ్చు కదా! ఏమంటారు?

durgeswara గారూ!
కల్పవృక్షమని పేరు పెట్టినంతమాత్రానే ఏదైనా గొప్పదై పోదు; విషవృక్షం అనే పేరును బట్టే మరో రచన చెడ్డదై పోదు. వాటిలో చెప్పిన ‘విషయం’ చూడాలి!
రామాయణ రచనా స్వభావమే దాన్ని విషవృక్షంగా మార్చిందని రంగనాయకమ్మ గారంటారు. ఆ పుస్తకం చదివి, ఆమె వాదన ఎలా తప్పో ఖండించండి!

వేణు చెప్పారు...

రవి గారూ!
వాలిని చంపటానికి రాముడు చెప్పిన కారణంపై మళ్ళీ ప్రశ్న పుట్టుకొస్తుంది- వనచరులకు మానవుల వావివరసలు వర్తిస్తాయా అనేది!

వాలివధ మీదా, కర్ణుడి సంహారం మీదా వందల ఏళ్ళ నుంచీ వాదోపవాదాలున్నాయి. అసలు ఇలాంటి విషయాలను బ్లాగు టపాల ద్వారానో, వ్యాఖ్యల ద్వారానో తేల్చుకోలేము కూడా. ఇక్కడ కేవలం అభిప్రాయాలను పంచుకోవటం మాత్రమే చెయ్యగలం!

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

Malakpet Rowdy గారూ,
క్రూర జంతువులను చంపటం సరే. జంతువులు ‘ధర్మం,న్యాయం పాటించలేదనీ’, ‘వావి వరసలు లెక్కచేయలేదనీ’ కారణాలు చూపించి చంపెయ్యవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న!

శరత్ కాలమ్ చెప్పారు...

నేను కూడా కర్ణాభిమానినే.

Malakpet Rowdy చెప్పారు...

మీ లాజిక్కే. జంతువులకు మానవుల వావి వరసలు వర్తించవు. అలాగే మానవుల పీనల్ కోడ్ కూడా వర్తించదు.


వేటకి వెళ్ళిన వారు అప్పట్లో చంపింది సాధు జంతువులనే.

Malakpet Rowdy చెప్పారు...

Let me get back to the basic question -
ఇక్కడ మీ ఇబ్బంది - చంపడంతోనా? లేక కారణం తోనా?

వేణు చెప్పారు...

శరత్ గారూ,
:)

Malakpet Rowdy గారూ,
> ఇక్కడ మీ ఇబ్బంది-
భలేవారే.. నా ఇబ్బంది ఏముంటుంది?

వాలిని చంపడం, చంపిన విధానం (చెట్టు చాటు నుంచి), చంపినందుకు రాముడు చెప్పిన కారణం.. ఇవన్నీ అంగీకరించదగ్గవి కాదని నా అభిప్రాయం.

Malakpet Rowdy చెప్పారు...

చంపడం అనేదానిగురించి అనుకున్నాం కదా - మనిషి జంతువుని చంపడమనేది అప్పుడే కాదు ఇప్పుడు కూడా జరుగుతోంది.

చెట్టుచాటు నుండి చంపడం - మీ ఇంట్లో ఎలకలుంటే వాటిని బోను పెట్టి చంపుతారా లేక వాటి బొరియల్లో చెయ్యి పెట్టి చంపుతారా? నాకు తెలిసినంత వరకూ అక్కడ జరిగింది యుధ్ధం కాదు - కేవలం చంపడమనే ప్రక్రియ.


చమపడం వరకు ఫరవాలేదు, కానీ దానికి చెప్పిన కారణమే బాలేదు అంటరా - అది మరో చర్చ

A K Sastry చెప్పారు...

డియర్ బ్లాగర్!

రంగనాయకమ్మకి "సాధికారికం" గా సమాధానం చెప్పిన వాళ్లు యెవరూ లేరు.....అని వొప్పుకోండి!

ఇంక, ఆ సమాధానం నన్నే చెప్పమనేంత అమాయకులు మీరు అనుకోను!

యెందుకంటే, రంగనాయకమ్మతో నూటికి నూరు పాళ్లూ యేకీభవిస్తాను నేను!

యెందుకొచ్చిన రామాయణాలూ....వాటిమీద డిస్కషన్లూ?

వేణు చెప్పారు...

కృష్ణశ్రీ గారూ,
రంగనాయకమ్మ గారికి ‘సాధికారికం’గా సమాధానం చెప్పిన వాళ్లు ఎవరూ లేరనేదే నా ఉద్దేశం కూడా! ఆమె వాదనతో మీరు నూటికి నూరు పాళ్ళూ ఏకీభవించారంటే.. విషవృక్షం చదివి, అప్రిషియేట్ చేశారనే అర్థం. అలాంటపుడు ‘ఎందుకొచ్చిన రామాయణాలూ..వాటి మీద డిస్కషన్లూ’ అనటం ఆశ్చర్యంగా ఉంది!

రవి చెప్పారు...

విషవృక్షానికి సమాధానంగా తెన్నేటి హేమలత గారు "విషవృక్ష ఖండన" అనే పుస్తకం వ్రాశారు.

వేణు గారు: మీరడిన ప్రశ్న.వనచరులకు ఆ నిబంధనలు వర్తిస్తాయా? అని. రాజ్యంలో (పరిపాలింపబడే భూభాగంలో) ఎక్కడైనా అన్యాయాన్ని శిక్షించే బాధ్యత తమకు (రాజులకు) ఉన్నట్టు రాముడంటాడు.

Nrahamthulla చెప్పారు...

కర్ణుడు,ఇస్మాయిల్ జీవితాలు నాకు ఒకేరకంగా దయనీయంగా కనిపిస్తాయి.పసిబిడ్డ ఇస్మాయిల్ ను అతని తల్లి హాజారాను ఎడారిలో వదిలేస్తాడు ఇబ్రాహీమ్(అబ్రాహాము).అల్లా ఆజ్న అని ఇస్మాయిల్ ను బలి ఇవ్వటానికి కూడా సిద్ధమౌతాడు.

వేణు చెప్పారు...

రవి గారూ!
లత గారి ‘విషవృక్ష ఖండన’ కూడా చదివాను. నాకేమీ నచ్చలేదు. మరి మీకు?
మీ వ్యాఖ్య- రాజ్యంలో ఎక్కడైనా అన్యాయాన్ని శిక్షించే బాధ్యత తమకు(రాజులకు) ఉన్నట్టు రాముడంటాడని కదా! ఇక్కడ ‘అన్యాయం’అంటే వావివరసలు పాటించకపోవటమే కదా. వాలికైనా, సుగ్రీవుడికైనా మానవులు పాటించే నియమాలు వర్తిస్తాయా అనేది ఓ ప్రశ్న. వాల్మీకి రామాయణం ప్రకారం - వాలి తన మరదలు రుమతో ఉండటం కంటే ముందే (వాలి బిలంలో ఉన్నపుడు) సుగ్రీవుడు వాలి భార్య తారతో సంబంధం పెట్టుకున్నాడు. ఇది రాముడికి కూడా తెలుసు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

Nrahamthulla గారూ!
వివిధ మతాలకు సంబంధించిన మైథాలజీల్లో చాలా పోలికలు కనపడుతుంటాయి. గ్రీకు పురాణగాథలకూ, మహాభారతంలోని కొన్ని ఘట్టాలకూ ఎన్నో సారూప్యాలున్నాయి.
పుట్టుక నుంచీ మరణం దాకా కర్ణుడి లాగా అన్ని అవమానాలూ, శాపాలకు గురైనవాళ్ళు పురాణేతిహాసాల్లో మరెవరూ లేరేమో!

సుజాత వేల్పూరి చెప్పారు...

వేణుగారూ,మీకు విషవృక్షం నచ్చాక విషవృక్ష ఖండన నచ్చదని మీరు ప్రత్యేకంగా చెప్పాలా?!

రవి చెప్పారు...

విషవృక్షఖండన నేను చదవలేదండి. మీరు చెప్పిన వివరణ (సుగ్రీవుడు వాలిభార్యతో ఉండటం) నాకు తెలుసు. ఇక్కడ ఎందుకని చెప్పలేదు. :-) అయితే ఆ విషయం గురించి రామాయణంలో ఏముందో వెతికి కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాకాక, కేవలం విషవృక్షం మీద ఆధారపడడం పద్ధతి కాదని నేననుకుంటున్నాను.

మనోహర్ చెనికల చెప్పారు...

సుగ్రీవుడు తారతో ఉన్నప్పుడు , అంతా వాలి చనిపోయాడని భావించారు. అందువల్లనే సుగ్రీవుడు రాజ్యాన్ని , తారను స్వీకరించాడు. ఐతే వాలి రుమను చెరబట్టినప్పుడు సుగ్రీవుడు బతికే ఉన్నాడు. అందుకే దాన్ని దోషంగా పరిగణించారు.

ఈ కారాణం వల్లనే వాలి మరణం తర్వాత తార సుగ్రీవుడితో ఎవరూ తప్పు పట్టలేదు.
.....

చదువరి చెప్పారు...

సుగ్రీవుడు తారను చేపట్టడం గురించి నాకు తెలిసినంతలో -గుహలో యుద్ధానికి వెళ్ళాక, వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు. రాజ్యాన్నీ, తారనూ స్వీకరించాడు. సుగ్రీవుడు దురాలోచన చేసాడని వాలి భావించాడు. అసలు తగువు అలాగేగా మొదలైంది. అయితే వాలి తమ్ముణ్ణీ వెళ్ళగొట్టి తమ్ముడి భార్యను చెరపట్టాడు.

కర్ణుడికి సమర్ధనగా చాలా చెప్పుకుంటాం. ఆజీవితమూ కష్టాలకు, అవమానాలకూ ఓర్చాడని కర్ణుడిపై మనకు సానుభూతి. అది సమర్ధనీయమే. అయితే కర్ణుడిలోని స్నేహం పట్ల తాదాత్మ్యత అంకితభావమూ, దానగుణం మెచ్చుకోవాల్సినవి.

అయితే, అవతలి వైపు ఏంటంటే.. ఊహు, నేను చెప్పడం కాదు, రాణి సుబ్బయ్య దీక్షితులు గారు చెప్పినది వినాలి. మనిషికి రెండు వ్యక్తిత్వాలుంటాయి - గుణం, దోషం. దానమనేది అతడి గుణం. అతడి దోషాలివీ అంటూ ఆయన కర్ణుడి దోషాలు చెప్పారు. కర్ణుణ్ణి చూసుకుని దుర్యోధనుడు శత్రువులపై కాలుదువ్వితే, ఆ కర్ణుడు ఏనాడూ యుద్ధం చేసిన పాపాన పోలేదు అంటూ చెప్పుకొచ్చారు.

వేణు చెప్పారు...

రవి గారూ!
‘ఆ విషయం గురించి రామాయణంలో ఏముందో వెతికి కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాకాక, కేవలం విషవృక్షం మీద ఆధారపడడం పద్ధతి కాదు’ అన్నారు కదా!

వాల్మీకి రామాయణం తెలుగు అనువాదంలో ఈ సందర్భం గురించి ఇలా ఉంది (కిష్కింధ కాండ, సర్గ 46, శ్లోకాలు 8,9):
సుగ్రీవుడు రాముడితో ఇలా చెపుతున్నాడు- ‘‘ఆ బిల ద్వారమునకు ఒక బండను అడ్డము ఉంచి, వాలి బ్రతికి యుండునను ఆశ విడిచి, కిష్కింధకు వచ్చి , తార,రుమలతోడ గొప్ప కపిరాజ్యము బడసితిని.’’

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

"మానవులకు వర్తించే ‘న్యాయం, ధర్మవర్తనా’ జంతువులకు వర్తిస్తాయా? న్యాయమూ, ధర్మమూ పాటించలేదనే కారణంతో ‘వాటిని’ చంపేయొచ్చునా?"

వేణుగారు,
రామాయణంలో వానరుల్ని వాల్మీకి ఒట్టి జంతువులుగా చూపించడు. ఒట్టి జంతువులే అయితే వారికో రాజ్యం, రాజు, యువరాజు, ధర్మం అవీ ఉండవు. కానీ వానరులకు మానవులవి కాకపోయినా వారి సొంత న్యాయమూ, పద్దతి ఉన్నాయి. రాజుగా వాలి వాటిని పాటించాలి కదా. సోదరుడు చనిపోయాక వరసైన మరిదో, బావో స్త్రీని చేపట్టటం వారి ధర్మంలా చూపిస్తాడు. మానవులలో కూడా ఇదే ధర్మం ఉండేదనుకుంటా. వాలి చనిపోయాడని భావించే సుగ్రీవుడు తారని చేపట్టాడు. అందుకే ఆమె అంగీకరించింది. కానీ వాలి తమ్ముడ్ని తన్నితగలేసి అతను బ్రతికి ఉండగానే అతని భార్యని చెరపట్టాడు. సుగ్రీవుడు అంతకముందు తారని చేపట్టాడు, వాలి చెరపట్టాడు, అదే తేడా. నువ్వు చనిపోయావని భావించే రాజ్యాన్ని, తారని చేపట్టానని, వేరే దురుద్దేశం లేదని సుగ్రీవుడు మొత్తుకున్నాడు వాలి తిరిగొచ్చినప్పుడు. అంటే వానరులలో కూడా భర్త బ్రతికి ఉండగా ఇంకొకరు చేపట్టటం తప్పనే కదా అర్థం. వాలి రాజైయ్యుండి తమ ధర్మాన్ని తనే తప్పాడు. అదే రాముడు చెప్పాడు.

ఏ తప్పు చేసానని చంపావు అని అడిగితే, తమ్ముడు బ్రతికి ఉండగా అతని భార్యని చెరబట్టావు అందుకే చంపాను అన్నాడు. ఏ అధికారంతో చంపావన్నాడు. ఈ ప్రాంతమంతా ఇక్ష్వాకుల ఏలుబడిలో ఉంది, ఇక్కడ ధర్మరక్షణ మా భాధ్యత కాబట్టే శిక్షించానన్నాడు. వానరుడ్ని చాటుగా ఎందుకు కొట్టావని నిలదీసాడు. హాని కలిగించే జంతువుల్ని పొంచి ఉండి వేటాడటం తప్పు కాదు, నువ్వు వానరుడివైనా ఎదుటివారిలో బలాన్ని హరించే వరమున్న వాడివి కాబట్టే చాటుగా వేటాడానన్నాడు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Prasanth చెప్పారు...

రంగనాయకమ్మగారు పూర్తిగా అర్ధం లేకుండా రాసారు అని నేను అనడం లేదు...కాని ఆవిడ పుస్తకం మొదలు పెట్టడమే ఒక agenda తో మొదలెట్టారు. ఆవిడ కేవలం వాల్మికి రామాయణాన్ని ఉటంకించి తన వాదన చెప్తే నేను అభినందిన్చేవాడినేమో..కాని ఆవిడ రాముడు ఏదైనా మంచి పని చేసినప్పుడు కేవలం పిరికితనం వల్లనో లేకపోతే అవకాశవాదంతోనో చేసినట్టు చిత్రీకరించారు. ఇంకొక విషయం నాకు నచ్చనిది ఏమిటంటే లక్ష్మణుడి అంతరాత్మ పాత్ర (comic touch కొన్ని సార్లు బాగుంది కానీ)...ఆవిడకి తెలుసు పుస్తకం రాస్తున్నప్పుడే తెనేతుట్టిని కడుపుతున్నాను అని.. ఇలాంటి పాత్రల్ని పెట్టి ఆ బుక్ seriousness ని చంపేశారు.

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

సుజాతగారు,
నాకు తోచిన వివరణ ఇస్తాను. ఉపయోగపడుతుందేమో చూడండి. వదిన తల్లితో సమానమన్న భావన రామాయణం నెలకొల్పిన భావనే కానీ, రామాయణ కాలానికి లేదు. రామాయణంలో లక్ష్మణుడిని ఆదర్శంగా చూపించి మెల్లగా అమలులోకి తెచ్చిన భావన ఇది. ఇప్పటికీ ఆ భావనకి ఎక్జాంపుల్గా లక్ష్మణుడినే చూపిస్తారు. ఆ కాలంలో ఈ భావన లేదని రామాయణంలోనే కనిపిస్తుంది.

రాముడు లేడి వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు ప్రమాదం జరిగిందని భావించి లక్ష్మణుడిని వెళ్ళమన్నప్పుడు ఆయన మొదట వెళ్ళనంటే సీత అనుమానించి పరుషంగా మాట్లాడుతుంది. కాళ్ళు మొక్కేటప్పుడు వదిన పాదాలు తప్ప ఎప్పుడూ సరిగ్గా పరికించి ఎరుగని లక్ష్మణుడిని సీత అనుమానించాల్సిన ఏముంది. ఎందుకంటే అప్పటి లోకరీతి అది కాబట్టి. అప్పట్లో ఆ వరుస అమలులో ఉంది కాబట్టి. అలాగే అగ్ని ప్రవేశ ఘట్టంలో రాముడు అదే అంటాడు. మనిద్దరి వివాఃహ బంధం తెగిపోయింది. నువ్వు పది దిక్కులలో నీకిష్టం వచ్చిన వారిని చేపట్టవచ్చు. నువ్వు కోరుకుంటే స్వర్గాధిపతిని, లంకాధిపతి అయిన విభీషనుని, లక్ష్మణుని ఎవరినైనా వరించవచ్చంటాడు. అప్పట్లో అది అధర్మమైన వరుస కాదు కాబట్టి.

అన్న తండ్రి వంటివాడని, కాబట్టి అన్న భార్య తల్లివంటిదనే భావన రామాయణం అనే కథ ప్రవేశపెట్టిన విలువలు. ఆ కాలంలోనూ, అంతకు ముందూ అవి లేవు.

Prasanth చెప్పారు...

ఇంకొక మాట...ఏ సమాజనికైనా అందరూ అనుకరించాగలిగేట్లు ఒక "idol/leader" కావాలి. అలా కాదు నాకు నేనే రాజుని..నా మంచి చెడ్డలు నాకు తెలుసు...నేనెవరిని పట్టించుకోవక్కర్లేదు అనుకుంటే...సమాజం లో ప్రజలు "co-exist" అవ్వలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి వారి abilities/risk appetite/knowledge బట్టి ప్రవర్తిస్తే..పట్టణాల స్థానంలో అడవులు మిగులుతాయి. రాముడి క్యారెక్టర్ ఆ "idol/leader" కి ఒక మంచి ఉదాహరణ. రామాయణాన్ని వ్యంగ్యంగా ఆవిడ రాసిన దానివల్ల సమాజానికి మేలు కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది నా అభిప్రాయం.

రవి చెప్పారు...

వేణూ గారు, మీరు చూపించిన పద్యం సబబే. పంచమాతలలో వదిన కూడా ఒకతె. ఆమెను చేపట్టడం (అంగీకారంతో అయినా) ఎలా సబబో ఎవరైనా పెద్దలే చెప్పాలి.ఆ కాలపు ధర్మం అదేనంటే ఇక ఆర్గ్యుమెంటే లేదు.

Viswanath చెప్పారు...

Maridi vadinani chepattatam "Devara Nyayam" antaranukunta ... adi konni jatulalo unnatundi

Excerpts form http://singampalli.blogspot.com/2010/06/dharma-sandeham.html
==============================

In times of crisis, when the dynasty is on the verge of extinction, with the acceptance of the elders, children can be begotten by Devara Nyayam) Devara nyayam is having children by Brother-in-law. It is felt that the same blood is flowing through the veins of the husband and brother-in-law.

Unknown చెప్పారు...

ఇక్కడ రాముణ్ణి సమర్ధించే వాళ్ళందరూ వాలి నేరస్తుడూ సుగ్రీవుడు నిర్దోషీ అనే సత్యదూరమైన భ్రమతో వాదన మొదలుపెడుతున్నారు. ముందు ఈ భ్రమలో ఎంత నిజం ఉందో తేల్చుకుని అప్పుడు మాట్లాడితే మంచిది.
సుగ్రీవుడి ప్రకారం, వాలి నేరాలేమిటి?
- సుగ్రీవుడిని తరిమెయ్యడం
- రుమని ఉంచుకోవడం

వాలి ప్రకారం, సుగ్రీవుడి నేరాలేమిటి?
- గుహకి రాయి అడ్డం పెట్టి, తనని చంపడానికి ప్రయత్నించడం
- తను చనిపోయానని అబద్ధం చెప్పి తన భార్యని లోబరుచుకోవడం

రామాయణంలో ఉన్న సాక్ష్యాలని బట్టి మనం ఇప్పుడు ఎవరి నిజం చెపుతున్నారో చూద్దాం. ఎదుటి వ్యక్తి బలాన్ని లాగేసుకోగలిగిన శక్తి వున్న వాలి (ఆ శక్తి ఎంత గొప్పదంటే రాముడంతటి వాడే ఎదుట నిలబడ్డానికి జడిసి దొంగచాటుగా బాణం వేసేటంత) ఓడిపోతున్నాడని సుగ్రీవుడు ఎలా అనుకుంటాడు? నిజంగా ఓడిపోతున్నాడనే అనుకుంటే అన్నని రక్షించడానికి వెళ్తాడు కాని అన్నని ఆ పరిస్థితిలో వదిలేసి వస్తాడా? ఇక్కడ వాలి, రాముడు సుగ్రీవుడు లాంటి పేర్లని వరసగా ఎల్లయ్య, పుల్లయ్య, పెంటయ్య అని మార్చితే, నూటికి నూరు మందీ పెంటయ్య (సుగ్రీవుడు) అబద్ధం చెపుతున్నాడనీ, అన్నని చంపడానికి ప్రయత్నించాడనీ చెపుతారు. కాబట్టి నిస్సందేహంగా సుగ్రీవుడు అబద్ధమే చెపుతున్నాడు.

ఇక వాలి రుమని ఉంచుకోవడం విషయానికి వస్తే తనని చంపడానికి ప్రయత్నించినందుకుగాను వాలి సుగ్రీవుడికి మరణ దండన విధించాడు. అది అమలు కాకుండా సుగ్రీవుడు పారిపోయినా కూడా వాలికి సుగ్రీవుడు చనిపోయినవాడితో సమానమే. చనిపోయిన వాడి భార్యని ఉంచుకోవడం అప్పటి విలువల ప్రకారం న్యాయమే అయితే (సుగ్రీవుడు చేసినట్టు), మరణ దండన పడిన వాడి భార్యని ఉంచుకోవడం కూడా న్యాయమే.

ఇక్కడ రాముణ్ణి వెనకేసుకొచ్చే వళ్ళు ముందు సుగ్రీవుడి నేరాల చిట్టా విప్పితే బావుంటుంది. "పిచ్చికుక్క" లాంటి పదాలు వాడేముందు ఆ పదాలు వాలికి కాదు, సుగ్రీవుడికీ, రాముడికీ బాగా నప్పుతాయని గుర్తిస్తే మంచిది.

Malakpet Rowdy చెప్పారు...

మరి రాముడికి వాలి ఏమి హాని చేశాడని చంపాడు? కేవలం సుగ్రీవుడు శరణు కోరడం వల్లనేగా?
____________________________________
నేనెక్కడైనా వాలి నేరస్తుడని అన్నానా? నా వాదన ఒకటే, అక్కడ జరిగింది మనిషి జంతువుని చంపడం - అది సమాజంలో అంగీకారాత్మకమే. ( ఏ హానీ చెయ్యని జంతువులని కూడా వేట పేరుతో చంపేవారు, చంపుతున్నారు కూడా).


ఇక్కడ రాముణ్ణి వెనకేసుకొచ్చే వళ్ళు ముందు సుగ్రీవుడి నేరాల చిట్టా విప్పితే బావుంటుంది.
___________________________________

ఎందుకు బాగుండదూ? భేషుగ్గానే ఉంటుంది.


నా వరకూ నేను వాలి నేరస్తుడనీ, సుగ్రీవుడు మంచివాడనీ అనలేదు. ఇక పిచ్చికుక్క విషయం ఒక ఉదాహరణ మాత్రమే. వాలీ సుగ్రీవుడు ఇద్దరూ జంతువులే కాబట్టీ వాళ్ళలో వాళ్ళు ఏమి చేసుకున్నా చెల్లుతుంది. రాముడు చేసిందల్లా, తనకిష్టమైన జంతువు పైన దాడి చేసిన మరో జంతువుని చంపడం - మన పెంపుడు కుక్క మీద దాడిచేసిన వీధికుక్కని చంపినట్టు.

సుగ్రీవుని చిట్టా విప్పినా విప్పకపోయినా నాకప్రస్తుతం రంగనాయకమ్మను వెనకేసుకొచ్చేవాళ్ళు ఇది గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో? :))

Malakpet Rowdy చెప్పారు...

చైతన్య కృష్ణగారూ

జంతువులలో న్యాయాన్యాయాలు, ధర్మాలు జంతువులకే పరిమితం - వాటిట్లో రామునిలాంటి మానవుడు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మానవ ధర్మం కూడా వాటికి వర్తింపజెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు. నేను ముందే చెప్పినట్టు అక్కడ జరిగిందల్లా, మనిషి జంతువును చంపడం అనే ప్రక్రియ.

రవి చెప్పారు...

పిడకల వేటకు క్షమాపణలు. పైన Ravi అన్న పేరుతో వ్యాఖ్య చేసింది నేను (http://blaagadistaa.blogspot.com/) కాదు.

వేణు చెప్పారు...

Malakpet Rowdy గారూ,
‘రాముడు చేసిందల్లా, తనకిష్టమైన జంతువుపైన దాడి చేసిన మరో జంతువుని చంపడం’అని మీరంటున్నారు.

కానీ కథానాయకుడు రాముడు గానీ, కవి వాల్మీకి గానీ అలా అనుకోలేదు. రాముడు వాలిని జంతువన్నాడు కానీ, సుగ్రీవుణ్ని అలా అనలేదు. అతడితో శాస్త్రోక్తంగా స్నేహం చేశాడు; ప్రత్యర్థిని చంపి ‘రాజ్యం’ ఇప్పించాడు. సీతాన్వేషణలో, రావణునితో జరిగిన యుద్ధంలో సాయం తీసుకున్నాడు.

‘జంతువుల్లో న్యాయాన్యాయాలూ, ధర్మాలూ జంతువులకే పరిమితం- వాటిలో రామునిలాంటి మానవుడు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మానవ ధర్మం కూడా వాటికి (జంతువులకు) వర్తింపజెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు’ అని మీరంటున్నారు.

కానీ రాముడు అలా అనుకోలేదు. కలగజేసుకున్నాడుగా! ధర్మం తప్పినందుకే వాలిని శిక్షించానని సమర్థించుకున్నాడు.

Unknown చెప్పారు...

రామయణాన్ని చారిత్రక దృష్టితో చూస్తే, "వానరులు" ఆర్యులూ ద్రావిడులూ కాని ఆదివాసీ తెగలని తేలిగానే అర్ధమవుతుంది. ఆదివాసీలని జంతువులని అనే వాళ్ళతో ఇక వాదించడానికి ఏమీ వుండదు.

Malakpet Rowdy చెప్పారు...

కానీ రాముడు అలా అనుకోలేదు. కలగజేసుకున్నాడుగా! ధర్మం తప్పినందుకే వాలిని శిక్షించానని సమర్థించుకున్నాడు.
_____________________________________

నేనడుగుతోంది అదే - ఇక్కడ చర్చ చంపడం గురించా, లేక చెప్పిన కారణం గురించా అని.

ఇప్పటిదాకా రాముడేమనుకున్నాడు అనేదానికన్నా రంగనాయకమ్మ తదితరులు ఏమనుకున్నారు అనే దానిమీద కదా చర్చ జరుగుతోంది. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏమిటండీ?

Malakpet Rowdy చెప్పారు...

రామయణాన్ని చారిత్రక దృష్టితో చూస్తే, "వానరులు" ఆర్యులూ ద్రావిడులూ కాని ఆదివాసీ తెగలని తేలిగానే అర్ధమవుతుంది. ఆదివాసీలని జంతువులని అనే వాళ్ళతో ఇక వాదించడానికి ఏమీ వుండదు
____________________________________

LOOOOOL,మానెయ్యండి. నేనేమీ బ్రతిమాలలేదు కదా మిమ్మల్ని వాదించమని. జంతువుల లాజిక్ పనిచెయ్యకపోయేసారి కులాన్ని తీసుకొస్తున్నారన్నమాట :))


అన్నట్టు రామాయణం ఒక "కట్టుకధ" నుండి చరిత్రగా ఎప్పుడు మారింది?

Malakpet Rowdy చెప్పారు...

కానీ కథానాయకుడు రాముడు గానీ, కవి వాల్మీకి గానీ అలా అనుకోలేదు. రాముడు వాలిని జంతువన్నాడు కానీ, సుగ్రీవుణ్ని అలా అనలేదు.
_____________________________________

మీరన్నదానికి మరో అర్ధం - వాలి జంతువు కానీ సుగ్రీవుడు కాదు (వాల్మీకి అన్నదాన్ని బట్టీ) - అంటే రాముడు ఒక మనిషి కోసం ఒక జంతువుని చంపాడు!

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

@Malakpet Rowdy,
నేను నా వాఖ్యలో చెప్పినట్టు రామాయణ రచయితలెవ్వరు వానరుల్ని జంతువులులా చిత్రించలేదు. వాళ్ళకు పట్టణాలలో నివసించేవారికి వున్నన్ని సాంఘిక నియమాలు లేకపోయినా, వారిదైన సంఘం ఉన్నట్లే చూపించారు. కాబట్టే వారికొక రాజు, యువరాజు, మంత్రులు, సైన్యం అన్నీ ఉన్నాయి. వారి పద్దతులు వారికున్నాయి. వారి పద్దతిలోనైనా వాలి శిక్షార్హుడే కదా.

@Ravi,
మీ వాదన మరీ విచిత్రంగా ఉంది. కథ రాసిన రచయిత చెప్పిన సంఘటనలు బట్టి అనుకోవాలి కానీ మీకు నచ్చినట్టు తేల్చేస్తే ఏట్లా. "వాలి ఓడిపోతున్నాడని సుగ్రీవుడు ఎలా అనుకుంటాడు?" - వాలి ఓడిపోయాడని అనుకోలేదు. చచ్చిపోయాడని అనుకున్నాడు. వాలి ఏమీ చావులేని వాడు కాదుగా. చాటు నుంచి బాణం వేస్తే చావలేదా. అలాగే చీకటి గుహలో దారి తప్పి తిరుగుతున్న వాడిని చాటు నుంచి దాడి చేస్తే ఎందుకు చావడు.

వాల్మీకంలో సుగ్రీవుడి వాదన విందాం. గుహలోకి వెళ్ళేటప్పుడు తనూ వస్తానంటే వద్దని గుహకి కాపలా ఉండమని చెప్పి వెళ్ళిన వ్యక్తి సంవత్సరం అయ్యిన తర్వాత, ఆ జంతువు అరుపులు వినపడ్డాయి కానీ అన్న అలికిడి లేదు. కొన్నాళ్ళకు గుహలోంచి రక్తం రావటం చూసాడు. అన్న చనిపోయాడని భావించి ఆ జంతువు బయటకి రాకూడదని గుహ ద్వారం మూసివేసి తిరిగి వచ్చాడు. అన్న చనిపోయాడని లోపలికెళ్ళి తేల్చుకోవటానికి ధైర్యం చాలలేదని అనుకోవచ్చుగా. వాలిలాగ సుగ్రీవుడేం మహావీరుడు కాదుగా లోపలికెళ్ళి ఆ జంతువుతో తలపడటానికి. అది బయటికొస్తే తను హ్యాండిల్ చేయలేననే ద్వారం మూసి వచ్చాడు. కిష్కిందకు వచ్చి తను అనుకున్న విషయాన్ని మంత్రులకు చెప్పాడు. వాళ్ళు ఓదార్చి రాజ్యం కట్టబెట్టారు. తార కూడా జరిగింది విని వాలి చనిపోయాడనే నమ్మి సుగ్రీవుడ్ని వరించింది.

వాలి వాదనేంటి. చీకటి గుహలో దారి తప్పి తిరుగుతున్నాడు. చివరికి కనుక్కుని దాన్ని చంపేసరికి ఏడాది పట్టింది. దారి కనుక్కుని బయటికి వచ్చేసరికి అక్కడ సుగ్రీవుడు లేడు. ద్వారం మూసి ఉంటే దాన్ని పగలగొట్టి బయటకి వచ్చాడు. రాజ్యానికి వచ్చి సుగ్రీవుడ్ని చూసి కోపం తెచ్చుకున్నాడు. అతను పాదాలంటి జరిగింది ఇదని చెప్పినా వాలి వినలేదు. తార కూడా ఎన్నోసార్లు చెప్పింది సుగ్రీవునితో వైరం వద్దని.

ఇద్దరి వాదన విన్నాక ఒకరిది తప్పని, ఒకరిది ఒప్పని చెప్పలేకపోవచ్చు. కానీ సుగ్రీవుడి వాదన ఏమాత్రం వినకుండా శిక్షించబూనుకున్నాడు. పైగా అతని భార్యని బలవంతంగా చేజిక్కించుకున్నాడు. అదే తప్పన్నాడు రాముడు. ఇక సుగ్రీవుడు చేసిన తప్పేముంది, మీరు వేస్తున్న నిందలు తప్ప.

వేణు చెప్పారు...

Malakpet Rowdy గారూ!

రాముడు ‘నేను ఈ కారణం వల్ల, ఈ పద్ధతిలో నిన్ను చంపాను’ అని వాలితో చెప్పిన మాటలను మీరు తిరస్కరించి, మీ వాదం (‘రాముడు చేసిందల్లా, తనకిష్టమైన జంతువుపైన దాడి చేసిన మరో జంతువుని చంపడం’) చెపుతున్నారన్నమాట.

‘రాముడు వాలిని జంతువన్నాడు కానీ, సుగ్రీవుణ్ని అలా అనలేదు’ అంటే ఆ మాటల్లోని పొసగనితనాన్ని ఎత్తిచూపటమే!

Malakpet Rowdy చెప్పారు...

లేదండీ, అది నేను తిరస్కరించట్లేదు. ఆ విషయం వేరే చర్చ అంటున్నాను. చంపడం సరే అన్న విషయం రుఢీ అయితే, కారణం మీద వేరే చర్చ జరగచ్చన్నది నా అభిప్రాయం

మనోహర్ చెనికల చెప్పారు...

నాకు తెలిసి వాల్మీకి చాలా కచ్చితంగా కోతులనే చెప్పాడు. మండోదరిని చూసి సీత అనుకున్నప్పుడూ(ప్రదర్శయింత్వాం కపీనాం..). కోతులకు తేనెపట్లు ఇష్టం అని మైనాకుడిని హనుమకి ఆతిధ్యమివ్వమన్నప్పుడూ, అమ్మని చూసి వచ్చాక మధువనం లో వానరుల ప్రవర్తనని చూపించినప్పుడూ( ప్రలపంతి కేచిత్,ప్రహసంతి కేచిత్)....
ఇలా చాలా చోట్ల కోతులనే రాసాడు.


రాముడిని ఆర్యుడనీ, రాక్షసులని ద్రావిడులనీ కొంతమంది చేసిన ప్రయత్నానికి ఇప్పుడు వానరులని ఆదివాసి లను చేసే ప్రయత్నమ్ కూడా తోడవుతుందనమాట.
రవి:

నిజానికి ఈ విషయాలు నిజాయితీగా చర్చిస్తే మంచి విషయాలు తెలుస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ అందుకు అనుకూలమైన వాతావరణం బ్లాగుల్లో లేదు. ఇక్కడ ఒపీనియన్స్ ముఖ్యం. ఆస్తికుడివా, నాస్తికుడివా? అన్న వితర్కం ఇంకా ముఖ్యం. వీటి మధ్య "తెలుసుకోగలిగింది" ఏరటం కష్టం. చివరకు మిగిలేవి అపోహలు మాత్రమే. :-)

నాకు తెలిసి ఈ చర్చ చాలా అర్ధవంతంగానే సాగింది. ఎవరి వాదనలని వారు చెప్పారు తప్పితే ఇంతవరకూ ఎక్కడా వ్యక్తిగత దూషణలు గానీ , వెక్కిరింపు మాటలు గానీ లేవు. ఇది మంచి పరిణామమే కదా....

Kathi Mahesh Kumar చెప్పారు...

hmmm good fun

Unknown చెప్పారు...

@chaitanyaa...,
మీ వాదన మరీ విచిత్రంగా ఉంది. కథ రాసిన రచయిత చెప్పిన సంఘటనలు బట్టి అనుకోవాలి కానీ మీకు నచ్చినట్టు తేల్చేస్తే ఏట్లా. "వాలి ఓడిపోతున్నాడని సుగ్రీవుడు ఎలా అనుకుంటాడు?" - వాలి ఓడిపోయాడని అనుకోలేదు. చచ్చిపోయాడని అనుకున్నాడు.
---------------------------------
కధ రాసిన రచయిత రాసినదేమిటో సరి చూసుకుని మాట్లాడితే బావుంటుంది:
కిష్కింధా కాండ, సర్గ 9, శ్లోకం 18: "బిలములోపల సింహనాదము చేయుచుండు రాక్షసుడి ధ్వని నా చెవిలో బడెను. యుద్ధములో అపజయము పొంది అరచుచుండు నా అన్న ధ్వని నాకు వినవచ్చెను" - ఇవీ సుగ్రీవుడి ద్వారా కవి అనిపించిన మాటలు.

దీన్ని ప్రక్షిప్తమనో ఇంకేదనో మభ్యపరుచుకున్నా, మీరు "నిజం" అని దేన్ని గురించి నిర్ధారణ కి వస్తున్నారో అదంతా సుగ్రీవుడి వర్షన్. రామాయణంలోనే వున్న వాలి వర్షన్ని వదిలేసి లాజిక్కి పూర్తిగా విరుద్ధమైన సుగ్రీవుడి వర్షన్నే నిజమెందుకనుకోవాలో మీ పోస్టులో ఎక్కడా వివరణ లేదు.


--------------------------------
@chaitanyaa...,
ఇద్దరి వాదన విన్నాక ఒకరిది తప్పని, ఒకరిది ఒప్పని చెప్పలేకపోవచ్చు. కానీ సుగ్రీవుడి వాదన ఏమాత్రం వినకుండా శిక్షించబూనుకున్నాడు. పైగా అతని భార్యని బలవంతంగా చేజిక్కించుకున్నాడు.
---------------------------------
ఆహా! ఎంత చక్కగా శెలవిచ్చారు? ఈ నీతులు కొంచెం రాముడి చెవిలో కూడా ఊదితే బావుండునేమో? వాలిని చంపే ముందు వాలి వాదన విన్నాడా రాముడు? వాలి వాదన కూడా వినకుండానే వాలిని చంపిన రాముడిని చీదరించుకోక నెత్తిన పెట్టి పూజిస్తున్నారెందుకో రామ భక్తులందరూ? అవును లెండి, రాముడికైతే ఒక నీతి, వాలికైతే ఇంకొక నీతి. మనకి కావలసి వచ్చినట్టు ఎప్పటికప్పుడు నీతుల్నీ నిజాలనీ మార్చుకుంటూ ఉంటే రాముడేమిటి హిట్లరయినా నరేంద్ర మోడీ అయినా నీతి మంతుల్లా కనపడతారు.

ఏ విషయం మీద అయినా చర్చ జరగడానికి ఒక కనీసపు స్థాయి నిజాయితీ, చర్చించే విషయం గురించి కనీస అవగాహనా అవసరం. ఇక్కడ పోస్టు చేస్తున్న చాలా మందిలో ఆ రెండూ కనపడటం లేదు. రామాయణంలో ఏం ఉందో తెలీకుండా దాని సమర్ధనకీ విషవృక్షంలో ఏం ఉందో కనీస అవగాహన లేకుండా దాని విమర్శకీ దిగుతున్నారు. రామయణం రెండు జాతుల మధ్య జరిగిన యుద్ధం గురించి, ఒక జాతికి చెందిన రచయిత, చిలవలూ పలవలూ చేర్చి రాసిన మిథలాజికల్ గ్రంధమనే అవగాహన (మీరెంత భక్తులైనా ఇవన్నీ నిజాలే)కూడా లేకపోతే చర్చ అనేది సాధ్యం కాదు.

Malakpet Rowdy చెప్పారు...

ఒహో! రాముడిని పొగిడితే మిథాలజీ, వాలి విషయంలో మాత్రం చరిత్ర - ఇదే కదా "కనీస అవగాన అంటే?"

LOOOOOOOOOOOL again!

పక్కవాళ్ళ అవగాహనని ప్రశ్నించేవాళ్ళు ముందు తమకెంత అవగాహన ఉందో చూసుకుంటే బాగుంటుందేమో?

Malakpet Rowdy చెప్పారు...

ఇంతవరకూ ఎక్కడా వ్యక్తిగత దూషణలు గానీ , వెక్కిరింపు మాటలు గానీ లేవు. ఇది మంచి పరిణామమే కదా....
___________________________________


అక్కడే పొరబడుతున్నారు. ఇంకా మొదలవ్వందే? ఆయన లాజిక్ ఫెయిలయ్యేసరికి అవతల వాళ్ళ అవగాహన మీద కామెంటడం పెట్టాడు కదా. ఇప్పుడు ఉంటుంది అసలు మజా.

చదువరి చెప్పారు...

"..దురదృష్టవశాత్తూ అందుకు అనుకూలమైన వాతావరణం బ్లాగుల్లో లేదు..." - నిజానికి ఇప్పటి దాకా ఈ వాతావరణం ఇక్కడ ఉంది. చర్చ చక్కగా సాగింది. అయితే ఇందులోకి జాతులను చొప్పించడం, ’ఈ నీతులు కొంచెం రాముడి చెవిలో కూడా ఊదితే బావుండునేమో?’ లాంటి వ్యాఖ్యలు మొదలవడం చూస్తూంటే, ఆ వాతావరణానికి మూడిందనిపిస్తోంది. ఇక ఇది మా..మూలు, తెలంగాణపై బ్లాగుల్లో జరిగే చర్చలాంటిది అయ్యే అవకాశం కనిపిస్తోంది. :)

Malakpet Rowdy చెప్పారు...

రామయణం రెండు జాతుల మధ్య జరిగిన యుద్ధం గురించి, ఒక జాతికి చెందిన రచయిత, చిలవలూ పలవలూ చేర్చి రాసిన మిథలాజికల్ గ్రంధమనే అవగాహన (మీరెంత భక్తులైనా ఇవన్నీ నిజాలే)కూడా లేకపోతే చర్చ అనేది సాధ్యం కాదు.
___________________________________

వాలి ఆ రెండు జాతులకీ చెందని జంతువు. రచయిత ఆ మూడు జాతులకీ చెందనివాడు. ఇంతకీ ఆ రచయితే చెప్పకపోతే అసలు రామాయణం గురించి మీకెలా తెలిసేది?

Malakpet Rowdy చెప్పారు...

Sarga 9, Verse 18 says:


nardataam asuraaNaam ca dhvaniH me shrotram aagataH |
na rastasya ca sa.mgraame kroshato api svano guroH || 4-9-18

18. nardataam= screams; asuraaNaam ca= of the demon, also; dhvaniH= sounds; me shrotram aagataH= to my, ear, came; sangraame ratasya= in fight, involved in; kroshataH api= on who is screeching, even; guroH= of my brother; svanaH= sounds; na ca= not, even [heard.]

Sounds of screaming demon came to my ear, but the screeches of my brother who is involved in fight are unheard, in the least. [4-9-18]

Link: http://www.valmikiramayan.net/kishkindha/sarga9/kishkindha_9_frame.htm


వాలి అరుపులేమీ వినబడలేదనే ఆ శ్లోకం అర్ధం.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రవి చెప్పారు...

@Ravi గారు: అవగాహన, నిజాయితీ కన్నా, విచక్షణ, వ్యక్తులపట్ల గౌరవం ఇంకా ముఖ్యం.

వేణు గారు, ఈ చర్చ మూసెయ్యడం ఉత్తమం. దారిని వెతకడం కంటే, దారిని మూసెయ్యడం, తమకు తెలిసిన దారిలో ఇతరులు నడవాలనుకోవడం అన్నది మొదలవుతున్నదిక్కడ.

ఆ.సౌమ్య చెప్పారు...

@వేణు గారు మంచి చర్చ మొదలెట్టారు
కర్ణుడంటే నాకూ ఇష్టమే. పుట్టిన దగ్గరనుండీ ఎన్నో కష్టాలను ఓర్చి తనదైన విలువలని కాపాడుకుంటూ బ్రతికాడు. తను నమ్మిన విలువలని ఏ సమయంలోనూ విసర్జించకపోవడం ఒక గొప్ప వ్యక్తిత్వం.

ఇక వాలి సుగ్రీవుల విషయానికొస్తే
నిన్నటి వరకు జరిగిన చర్చ చదివి ఒక కంక్లూజన్ వచ్చింది. ఇవాళ మళ్ళీ చర్చ కొనసాగాకా మరో కంక్లూజన్ వస్తోంది. ఇక్కడ వాల్మీకి రాసిన రామాయణంలో వాలిని దొంగచాటుగా చంపడం ధర్మం కాదు అన్నది ఒక వాదన, ధర్మమే అన్నది ఇంకో వాదన. మొదట్లో ఎవరో ఎవరో అన్నాట్టుగా ఒక వైపు కథలే కాకుండా రెండోవైపు కూడా చదివితే బాగుంటుంది అని. మరి ఇక్కడ వాదిస్తున్నవాళ్ళలో ఎంతమది విషవృక్షం చదివి, ఆవిడ చెప్పిన లాజిక్కుని వ్యతిరేకిస్తున్నారో నా కర్థం కావట్లేదు. రామాయణం చదివి రాముడి గొప్పతనం తెలుసుకోవలన్నవాళ్ళే విషవృక్షం చదివి రాముడు ఎందుకు ధర్మం తప్పాడంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా. పైన రవి గారి పాయింట్లతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

నాకు రామాయణంలో చెప్పిన శ్లోకం అర్థం కాలేదు. వాలి అరుపులు సుగ్రీవుడికి వినిపినంచాయా లేదా? అన్న గుహ లోపల ఉండడాన్ని ఒక విధమైనా అవకాశంగా తీసుకుని సుగ్రీవుడి రాజ్యాన్ని, తారని చేపట్టాడా? ధర్మ ప్రభువులు ఎవరైనా ఇంకాస్త వివరంగా చెప్పి నాలాంటి పామరుల జ్ఞానచక్షువులు తెరిపించవలసినదిగా ప్రార్థన.

ఆ.సౌమ్య చెప్పారు...

ఈ చర్చంతా చదివిన తరువాత నాకింకో భీభత్సమైన విషయం తట్టింది. వాలిసుగ్రీవుల సంగతి పక్కనబెట్టండి. తార సంగతి ఆలోచించండి. పాపం అన్న కాకపోతే తమ్ముడు, తమ్ముడు కాకపోతే అన్న...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆమెని సొంతం చేసుకోవచ్చు. ఆవిడ ఒక ఆటబొమ్మ. ఆహా ఆడదానికి ఎంత విలువిచ్చారు కాలంలో, హేట్స ఆఫ్. ఆ కాల ధర్మాలు అంతే అని ఈ విషయానికి మంగళహారతి పాడితే ఇక చర్చకి ఆస్కారం లేదు.

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

మొదటగా శ్లోకాన్ని తప్పుగా చదువుకున్నారు (రౌడీగారు కోట్ చేసారు). తద్వారా సుగ్రీవుడి వాదన లాజిక్కి విరుద్దమని తేల్చారు. కాబట్టి ఇది రాముడు సుగ్రీవుడు కలిసి పన్నిన కుట్ర అని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా మీ రెండు జాతుల సిద్దాంతపు అవగాహనే సరైందని, అదే నిజమని నొక్కి వక్కాణించారు. అలాంటి అవగాహన లేకపోవటం కనీసపు స్థాయి నిజాయితీ లేకపోవటమేనని ప్రకటించారు. ఇక ఆ తర్వాత అవతలి వారి అననివి మీరే ఊహించుకుని, మీ సిద్దాంతం కంటె భిన్నమైన అవగాహన కలవారందరు రామభక్తులేనని, వారు హిట్లరుకి, నరేంద్రమోడీకి ఫ్యాన్స్ అని తేల్చారు. ఇన్ని విషయాలు మీరే ఫిక్స్ అయిపోయాక ఇక మనం చర్చించేదేముంది పిడివాదనలు చేసుకోవటం తప్ప.

నేను రామభక్తుడినని, అసలు ఆస్తికుడినని మీకు చెప్పినవారెవ్వరు మహానుభావా. నా వాఖ్యలలో కానీ మరెక్కడైనా కానీ రాముడు దేవుడని, కాబట్టి ఆయన చేసిందేదైనా లోకకల్యాణమని చెప్పానా. పై నా వాఖ్యలలో కూడా రామాయణం కథని, రచయితలు అనే పదాలే వాడుతూన్నానే కానీ అది చరిత్రని, విష్ణువు చేసిన లోకకల్యాణమని అన్నానా. నా దృష్టిలో రాముడు రామాయణమనే కావ్యానికి కథానాయకుడు అంతే. ఆ కథలోనూ, అందులో పాత్రలలోనూ అనౌచిత్యాలుంటే వాటి గురించి చర్చించటమే నా ఉద్దేశం.

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

ఎలాంటి కారణమేనా కానీ బలవంతంగా ఒకరి భార్యని అపహరించటం రాముడు నేరంగా భావించాడు. పైగా తను అదే బాధను అనుభవిస్తున్నాడు అప్పుడు. కాకపోతే ఘనత వహించిన ఇక్ష్వాకు వంశ రాజైయ్యుండి, అన్ని రాజధర్మాలు తెలుసుండి, సుగ్రీవుడి చెప్పింది విని నిజంగా వాలి రుమని బలవంతంగానే చేజిక్కించుకున్నాడో, ఆమే వరించిందో కనుక్కోకుండా శిక్ష విధించేయటం నాకూ నచ్చలేదు. జరిగింది సొంతంగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవటం రాముడి తొందరపాటని మనం వాదించచ్చు నేనూ ఏకీభవిస్తాను. కానీ మీరు చేస్తున్నట్టు అందుకు సుగ్రీవుడ్ని విలన్ని చేయనక్కర్లేదు, వాలి చేసింది సరైందేనని వాదించక్కరలేదు. రాముడ్ని తప్పుపట్టాలంటే రామాయణంలో చాలా కనిపిస్తాయి. అలాగని ప్రతి సీన్లో తప్పుపడతాము, అసలు రాముడు చేసినవన్నీ తప్పే, రాముడితో ఉన్నవారందరూ విలన్లే, రాముడు చంపిన వారందరూ అమాయకులే అంటే ఎట్లా.

వెంకట్ చెప్పారు...

"తను నమ్మిన విలువలని ఏ సమయంలోనూ విసర్జించకపోవడం ఒక గొప్ప వ్యక్తిత్వం"
How come?
కర్ణుడికి పాండవులతో ఎలాంటి శతృత్వమూ లేదు, ధుర్యోధనుడితో స్నేహం చేసే వరకు, నిజంగా విలువలకు విలువ ఇచ్చేవాడైతే పాండవులను మాయా జూదంలో ఓడించినప్పుడు ఎందుకు మిన్నకుండి పోయాడు, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు? పాండవులను లక్క ఇంట్లో చంపడానికి ప్రయత్నించి నప్పుడు అది అధర్మమని ఎందుకు అడ్డు పడలేదు?

ఇక రామాయణం గురించి అంటారా, ఇక్కడ జరుగుతున్న పిడివాదాల్లో పాల్గొనక పోవడమే మంచిది.
కాని ఒక్క మాట మాత్రం నిజం, రామాయణ భారతాలలో ఉన్న పాత్రలను విమర్శించే అర్హత మనలో ఎవ్వరికీ లేదు, పైన నేను చెప్పిన కర్ణుడే కవచ కుండలాలు ఇస్తే తనకు మరణం తప్పదని తెలిసీ వాటిని దానం చేశాడు.విభీషణుడు,కుంభకర్ణుడు రావణుడు సీత ను అపహరించాలనుకున్నప్పుడు అది మంచి ఆలోచన కాదని అడ్డు చెప్పారు.ఇలా ప్రతి పాత్రలోను నేర్చుకోదగిన నీతి ఉంటుంది ఆ మూల సూత్రాన్ని పక్కన పెట్టి మన మన ప్రిజుడీస్ ప్రకారంగా రాముడు అధర్మ పరుడు, ఆ కాలం స్త్రీలకు గౌరవం లేదు అంటు విమర్శిస్తామంటే చెప్ప గలిగేది ఏమీ లేదు.
Enjoy in your way, but dont hurt others by abusing the characters of our epics.

చెకోర చెప్పారు...

అసలు ఏ కావ్యమైనా మనుష్యులను మంచి మార్గంలో నడపడానికి, వారి మనసుని చెడు వైపు మళ్లకుండా చూడడానికి అని నా అభిప్రాయం. ఇది సబబో కాదో నాకు తెలియదు కాని, ఒకసారి హారి పొటర్ చదవండి. రాముడి పాత్ర ఒక ఉద్దేశ్యంతో, ప్రత్యేకించి కలియుగంలో అథర్మం పెరగకుండ మంచి నడవడిక చూపడం. ఒక మంచి నీతి కథ అని అనుకుంటే ప్రొబ్లెం ఎమి ఉండదు కద.

Malakpet Rowdy చెప్పారు...

సుజాత,

నేను కూడా చాలాకాలం (మొన్నీమధ్యదాకా) వాలి గిరిజనుడనే అనుకున్నా. అనుకోకుండా కొంతకాలం క్రితం చదివిన వాల్మీకి వర్ణనల బట్టీ వాలి జంతువే అని నిర్ధారించుకోక తప్పలేదు.


మనిషి జంతువుని చంపడం ఈమధ్య కాలందాకా అంగీకారాత్మకమే కదా?

సుజాత & సౌమ్య,

శ్లోకం ప్రకారమయితే వాలి గర్జనలు సుగ్రీవుడికి వినబడలేదు.

ఇక తార విషయం - మగ జంతువులలో బలమున్నదే కదా ఆడ జంతువుని చేబట్టేది?

Malakpet Rowdy చెప్పారు...

వాలితో రాముడు యుధ్ధం చేసి ఉంటే చాటునుండి చంపడం తప్పే. కానీ నాకు అర్ధమైనంతవరకూ అక్కడ యుధ్ధం జరగలేదు - ఒక జంతువుని ఒక మనిషి వేటాడాడు అంతే.

అజ్ఞాత చెప్పారు...

తెలుగులో అంగీకారయోగ్యం/ ఆమోదయోగ్యం అనే మాట ఉంది. ఆంగీకారాత్మకం అనే మాట లేదు. దానికి అర్థం కూడా లేదు. ఇంగ్లీషులో -able తో అంతమయ్యే పదాలకి తెలుగులో -అనీయం అని వాడతారు. ఉదా:- పూజనీయం, గౌరవనీయం, గణనీయం.

Malakpet Rowdy చెప్పారు...

తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు తాడేపల్లిగారూ. ఇంకపై సరైన పదమే వాడతాను.

Malakpet Rowdy చెప్పారు...

oops .. మళ్ళీ తప్పు -

తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు తాడేపల్లిగారూ. ఇకపై సరైన పదమే వాడతాను.

Unknown చెప్పారు...

@సుజాత:
ఇంతకీ ఆ శ్లోకం ఏం చెపుతోంది? అరుపులు వినపడ్డాయనా వినపడలేదనా?
రవి గారూ, మలక్పేట్ రౌడీ ప్రతిపదార్థం కూడా ఇచ్చి తాత్పర్యం చెప్పారు. దీనికి మీరేమంటారు?
----------------------------------------------------------------------------------------------------
సుజాత గారూ - మీరు అసలు పాయింటుని మరిచి పోయారు. ఇక్కడ వాదన, వాలి అరుపులు వినపడ్డాయా, వినపడలేదా అని కాదు (నేను కోట్ చేసింది సంస్కృత పండితులు అనువదించిన తాత్పర్యమే, అది నా సొంత కవిత్వం కాదు). రామాయణంలో వాలికీ, ఆ రాక్షసుడికీ యుద్ధం జరిగిందని ఉందా లేద అని. పైన ఇచ్చిన ప్రతి పదార్ధంలో "సంగ్రామే" - అంటే సంగ్రామంలో - యుద్ధంలో. అసలే యుద్ధం జరగిందనే రమాయణంలో లేదు అని బుకాయించే వాళ్ళే ఈ తాత్పర్యానికి సంజాయిషీ ఇచ్చుకోవాలి. నా వాదనని తిరిగి పోస్టు చేస్తున్నాను:

"ఎదుటి వ్యక్తి బలాన్ని లాగేసుకోగలిగిన శక్తి వున్న వాలి (ఆ శక్తి ఎంత గొప్పదంటే రాముడంతటి వాడే ఎదుట నిలబడ్డానికి జడిసి దొంగచాటుగా బాణం వేసేటంత) ఓడిపోతున్నాడని సుగ్రీవుడు ఎలా అనుకుంటాడు? నిజంగా ఓడిపోతున్నాడనే అనుకుంటే అన్నని రక్షించడానికి వెళ్తాడు కాని అన్నని ఆ పరిస్థితిలో వదిలేసి వస్తాడా? ఇక్కడ వాలి, రాముడు సుగ్రీవుడు లాంటి పేర్లని వరసగా ఎల్లయ్య, పుల్లయ్య, పెంటయ్య అని మార్చితే, నూటికి నూరు మందీ పెంటయ్య (సుగ్రీవుడు) అబద్ధం చెపుతున్నాడనీ, అన్నని చంపడానికి ప్రయత్నించాడనీ చెపుతారు. కాబట్టి నిస్సందేహంగా సుగ్రీవుడు అబద్ధమే చెపుతున్నాడు."

----------------------------------------
@ చైతన్య:
కాకపోతే ఘనత వహించిన ఇక్ష్వాకు వంశ రాజైయ్యుండి, అన్ని రాజధర్మాలు తెలుసుండి, సుగ్రీవుడి చెప్పింది విని నిజంగా వాలి రుమని బలవంతంగానే చేజిక్కించుకున్నాడో, ఆమే వరించిందో కనుక్కోకుండా శిక్ష విధించేయటం నాకూ నచ్చలేదు. కానీ మీరు చేస్తున్నట్టు అందుకు సుగ్రీవుడ్ని విలన్ని చేయనక్కర్లేదు, వాలి చేసింది సరైందేనని వాదించక్కరలేదు.
------------------------------------------
ఆ మాత్రం ఓపెన్ మైండెడ్ నెస్ కి అభినందనలు. ఇంకొచెం ముందుకి వెళ్ళి అదే స్టాండర్డ్ ని వాలికి కూడా వర్తింపచేసి "నచ్చకపోవడంతో" సరిపెడితే సుగ్రీవుడి వాదనలోని వైరుధ్యాలు తేటతెల్లమవుతాయి.
సుగ్రీవుడిని నేను విలన్ని చేయటంలేదు. ఆ ఘనత వాల్మీకి సొంతం. కేవలం రంగు కళ్ళద్దలు తీసి చూడమని మాత్రమే అంటున్నాను.
___________________________________
@ చైతన్య:
అసలు రాముడు చేసినవన్నీ తప్పే, రాముడితో ఉన్నవారందరూ విలన్లే, రాముడు చంపిన వారందరూ అమాయకులే అంటే ఎట్లా.
--------------------------------------------
రాముడు చంపిన వాళ్ళందరూ అమాయకులే అని నేనెక్కడ అన్నానో చెప్పగలరా? రాముడుని సమర్ధించడానికి మీరు అవతలి వారి నోట్లో వాళ్ళు అనని మాటలు పెట్టవలసి వస్తోందంటే మీ వాదన ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోగలరు.

Malakpet Rowdy చెప్పారు...

Chaitanya garu

I am reposting your response here:


కథ రాసిన రచయిత చెప్పిన సంఘటనలు బట్టి అనుకోవాలి కానీ మీకు నచ్చినట్టు తేల్చేస్తే ఏట్లా. "వాలి ఓడిపోతున్నాడని సుగ్రీవుడు ఎలా అనుకుంటాడు?" - వాలి ఓడిపోయాడని అనుకోలేదు. చచ్చిపోయాడని అనుకున్నాడు. వాలి ఏమీ చావులేని వాడు కాదుగా. చాటు నుంచి బాణం వేస్తే చావలేదా. అలాగే చీకటి గుహలో దారి తప్పి తిరుగుతున్న వాడిని చాటు నుంచి దాడి చేస్తే ఎందుకు చావడు.

Malakpet Rowdy చెప్పారు...

అసలే యుద్ధం జరగిందనే రమాయణంలో లేదు అని బుకాయించే వాళ్ళే ఈ తాత్పర్యానికి సంజాయిషీ ఇచ్చుకోవాలి.
_____________________________________

LOOOOOOOOOOOOOOL నేను యుధ్ధం జరగలేదన్నది వాలికి, రాముడికీ :)) వాలికీ ఆ జంతువుకీ కాదు :))

సుజాత వేల్పూరి చెప్పారు...

రవి గారూ,ఈ శ్లోకం విషయంలో కొద్దిగా confusion ఉన్నా మీ పాయింట్ ఒప్పుకున్నాను.అరుపులు వినపడ్డాయా లేదా అన్న విషయమై ఆలోచనలు ఎక్కడో చిక్కుముళ్లు పడి పోతున్నాయి. ఇంకా స్పష్టత లేదు. అవి విడగానే దాని గురించి మళ్ళీ అడుగుతాను మీ ఇద్దరిని!

ఇంకోటి...

మలక్పేట్ రౌడీ యుద్ధం జరగలేదన్నది వాలికీ రాముడికీనూ! దుందుభికీ,వాలికీ కాదు గా!

@ మలక్పేట్ రౌడీ,

వాలి జంతువని అర్థమైందన్నారు. అలా అయితే సుగ్రీవుడూ జంతువే అవుతాడు. మరి ఆ perspectiveలో జంతువులతో అగ్నిసాక్షి స్నేహాలూ ఇవీ ఎలా సాధ్యం? జంతువులకి వావి వరసల సంగతి పక్కన పెట్టినా, రాజ్యాలూ రాజ భోగాలూ వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి?

Unknown చెప్పారు...

సుజాత గారూ,

నేను ఇక్కడ రౌడీలకి సమాధానం ఇవ్వటం లేదు. నేను ప్రస్తావించింది చైతన్య.. గారి
"చీకటి గుహలో దారి తప్పి తిరుగుతున్న వాడిని చాటు నుంచి దాడి చేస్తే ఎందుకు చావడు." అని అసలు వాలికీ ఆ రాక్షసుడికీ యుద్ధమే జరగలేదు. దొంగచాటుగా చంపాడని అనుకోవచ్చుగా అని అర్ధం వచ్చే వాదన గురించి.

వేణు చెప్పారు...

వాల్మీకి రామాయణంలో అనేక వర్షన్లు ఉన్నాయి. దక్షిణాది, ఉత్తరాది రామాయణాలు..

రంగనాయకమ్మ గారు ‘విషవృక్షం’లో తన విశ్లేషణ/ విమర్శకు చదలవాడ సుందరశాస్త్రులు వాల్మీకి రామాయణానికి చేసిన అనువాదాన్ని ఆధారం చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని 19వ శతాబ్దం చివర్లోనూ 20వ శతాబ్దం మొదట్లోనూ వావిళ్ళ రామశాస్త్రులు అండ్ కంపెనీ (చెన్నపురి) ప్రచురించారు.

మలక్ పేట్ రౌడీ తన వ్యాఖ్యలో ఇచ్చిన శ్లోకం, ప్రతిపదార్థం, తాత్పర్యం ఓ వెబ్ సైట్ నుంచి తీసుకున్నది.

గీతా ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణలు సంప్రదాయకమైనవీ, ప్రామాణికమైనవీ అని పేరు. వారు ప్రచురించిన ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్లో ఇదే శ్లోకం తాత్పర్యం ఎలా ఉందో చూద్దాం.

“The yell of thundering demons too reached my ears, while the noise of my elder brother, even though he was roaring while engaged in the encounter, did not fall on my ears.”
(అతను అరుస్తున్నప్పటికీ .. అంటున్నాడు సుగ్రీవుడు. అరుస్తున్నప్పటికీ వినబడలేదనటం ఏమిటి?)

మలక్ పేట్ రౌడీ కోట్ చేసిన తాత్పర్యంలో ‘screeches of my brother…unheard’ అని ఉందే గానీ, ‘even’= అయినప్పటికీ- అనేది లేదు. ప్రతి పదార్థంలో ఉంది గానీ , తాత్పర్యంలో వదిలేశారు.

అసలు ప్రధానమైన పాయింట్- వాలి సజీవంగా తిరిగి వచ్చాడు.
* ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఇద్దరి అరుపులూ వినపడతాయి. బలహీనుడి ఆర్తనాదమూ, బలవంతుడి విజయధ్వానమూ!
* "యుద్ధములో అపజయము పొంది అరచుచుండు నా అన్న ధ్వని నాకు వినవచ్చెను" అనే వర్షన్ ప్రకారమైతే గెలుస్తున్న వాలి ఆర్తనాదాలు చెయ్యడు కదా!
* "వాలి అరుపులేమీ వినపడలేదు" అన్నది కదా మరో వర్షన్. అసలే అరుపులూ వినపడలేదంటే వేరు. రాక్షసుడి అరుపులు మాత్రమే వినపడి, వాలి అరుపులు వినపడలేదన్న సుగ్రీవుడి వాదనను- శత్రువును చంపి వాలి తిరిగి రావటమనే వాస్తవం ఖండిస్తోంది!

Malakpet Rowdy చెప్పారు...

సుగ్రీవుడూ జంతువే, కాదనలేదు. హనుమంతుడితో, జాంబవంతుడితో రాముడికి స్నేహం లేదా? జంతువులతో మనిషికి స్నేహం కూడదన్న విషయం రామాయణంలో ఉందా?


వేణూ గారూ,

వేణూ గారూ,

తెలుగులో ప్రతిపదార్ధాలనుండి భావాలు వ్రాసినట్టు, ఆంగ్లం లో వ్రాయలేము కదా. వాక్యనిర్మాణం అక్కడ వేరేగా ఉంటుంది.

Unknown చెప్పారు...

1. లత గారు రాసిన "విష వృక్ష ఖండన", రంగనాయకమ్మ గారు రాసిన "విష వృక్షం" మొదటి భాగం వచ్చిన తరువాత. లత గారు అందులో, "విష వృక్షం హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతోందని" వాపోయారని గుర్తు. "విష వృక్షం" రెండూ, మూడూ భాగాలు వచ్చాక లత గారు ఏమీ రాయలేదు. అంటే, లత గారు మొత్తం పుస్తకం వచ్చే వరకూ ఆగలేదు ఖండించడానికి. మొత్తం పుస్తకం వచ్చాక ఖండించనూ లేదు. దీనర్థం ఆవిడ విషవృక్షంతో అంగీకరించారని అర్థం కాదు. ఎప్పుడో చదివాను. అందులో విశ్వనాథ గారికీ, లత గారికీ సంభాషణ జరిగినట్టుగా రాసినట్టు గుర్తు. లత గారు మళ్ళీ రామాయణం తిరగ రాసినట్టు గుర్తు ఆ పుస్తకంలో. అదీ సంగతి గుర్తున్నంత వరకూ.
2. శ్లోకం ప్రకారం సుగ్రీవుడు వాలి అరుపులు వినలేదు అని అన్నారు.
రాక్షసుడి అరుపులు వినబడ్డప్పుడు, వాలి అరుపులు ఎందుకు వినబడ్డం లేదూ అనే ప్రశ్న రాదూ? అందులోనూ, వాలి గెలిచి వచ్చిన వాడాయే. వాలి చచ్చిపోయి, అరవకుండా వుంటే, సుగ్రీవుడికి వాలి అరుపులు వినబడలేదంటే, అర్థం వుంది. అలా జరగలేదు కదా? రాక్షసుడే చచ్చిపోయి, వాలి నెగ్గాడు. మరి వాలి అరుపులు సుగ్రీవుడికి ఎందుకు వినబడలేదూ? "ఏమో, నాకు వినబడ లేదమ్మా" అని సుగ్రీవుడు సంస్కృతంలో బుకాయించితే, అది అబద్ధం చెప్పినట్టు కాదూ? చచ్చి పోయిన రాక్షసుడి అరుపులు వినబడ్డాయనడం, బతికున్నవాడి అరుపులు వినబడలేదనడం తర్క బద్ధంగా లేదు. శ్లోకం అలా వుందంటే, దాని అర్థం ఏమిటంటే, సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు అని.

3. ఇక శ్లోకం సంగతి చూద్దాం.
ప్రతి పదార్థంలో వున్న పదాలన్నీ తాత్పర్యంలో లేవు. even అనే మాట ఎగిరిపోయింది.
ప్రతి పదార్థంలోంచి తాత్పర్యం రాస్తే, ఇలా వస్తుంది:
“The yell of thundering demons too reached my ears, while the noise of my elder brother, even though he was roaring while engaged in the encounter, did not fall on my ears.”
అతను అరుస్తున్నప్పటికీ... అంటున్నాడు సుగ్రీవుడు. అరుస్తున్నప్పటికీ వినబడ లేదనడం ఏమిటీ? ఒకాయన కోట్‌ చేసిన తాత్పర్యంలో screeches of my brother...unheard అని వుంది గానీ, 'even' = అయినప్పటికీ అనేది లేదు. ప్రతి పదార్థంలో వుంది గానీ, తాత్పర్యంలో ఒదిలేశారు.

4. రంగనాయకమ్మ గారు ఫాలో అయిన రామాయణం: Chadaluvada sundararamasastrulu, which was published by vavilla ramasastrullu and company, chennapuri in late 1800s and early 1900s

5. వేరే పాయింటు. వాలి అయితే ఏమిటీ, కర్ణుడు అయితే ఏమిటీ? వీళ్ళ రాజ్యాలలో పేదరికం, ముష్టి తనం, వ్యభిచారం, దొంగతనం లాంటి వన్నీ వున్నాయా, లేవా? ఉన్నాయి. అందరి రాజుల్లాగానే వీళ్ళు కూడా పన్నులు వసూలు చేశారా, లేదా? చేశారు. అందరూ ఆ మూస లోంచి వచ్చిన వాళ్ళే.

6. సౌమ్య గారి పాయింటు ఎవరూ మళ్ళీ ఎత్తనే లేదు - తార సంగతి. ఆవిడ చెప్పింది నిజమే. తార సంగతి ఘోరం కదా? తార ఆ ఇద్దరు డబ్బా గాళ్ళనీ వదిలేసి, మీ చావు చావండి అని చెప్పి, చక్కా వేరే ఊరు వెళ్లి పోయి వుండాల్సింది. ఆ కధలన్నీ ఆ రోజుల్లో స్త్రీ ధర్మాలన్నీ ఎలా వున్నాయీ అని చెబుతూనే వుంటాయి కదా?

ఇంతే ఇప్పటికి.
ప్రసాద్

Malakpet Rowdy చెప్పారు...

అయితే ఇక్కడ అసలు ఇబ్బంది, రచయిత వ్రాసిన రెండు పొంతన లేని విషయాలతో.

అయితే ఒకటి - జంతువు హాహాకారాలు విని వాటిని గర్జనగా సుగ్రీవుడు ఊహించుకుని ఉంటే?

అలగే జరిగిన యుధ్ధంలో భాగంగా చీకటి చాటుకు వెళ్ళిన జంతువు వాలిని దెబ్బతీసిందని ఊహించుకుని ఉంటే?

ఇదేదో మరణమృదంగం నవలలో నెత్తిమీద బొట్ల పజిల్ లా ఉంది :))

సుగ్రీవుడూ ఇలా అనుకున్నాడా, అలా అనుకున్నాడా అంటూ - సుగ్రీవుడి మాన్సిక విశ్లేషణ బాగానే చేసేస్తున్నాంగా?

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

@Ravi,
నేనూ రంగు కళ్ళద్దాలు తీసి చూడమనే చెబుతున్నాను. రాముడు చంపాడన్న కారణంతో తప్ప వాలిని సమర్థించటానికి వేరే కారణం కనిపించట్లేదు. రాముడితో స్నేహం తప్ప సుగ్రీవుడి నేరమూ కనిపించట్లేదు. రకరకాల రామాయణాలు కలిపి వాదించే సరదా నాకు లేదు. నేను వాల్మీకం ప్రకారమే మాట్లాడుతున్నాను. దాని ప్రకారం వాలి గొంతు సుగ్రీవుడికి వినపడలేదనే అర్థం చేసుకున్నాను. అది తప్పంటే ఇక ఏ
సంస్కృత పండితుడినో పట్టుకోవాలి. అక్కడ చెప్పిన సంఘటనల ప్రకారం సుగ్రీవుడు వాలి చనిపోయాడనుకోవటంలో నాకు ఏ తప్పు కనిపించటం లేదు. కుట్ర అంతకన్నా కనిపించటం లేదు. వెళ్ళిన మనిషి తిరిగి రాక సంవత్సరమైంది. జరిగింది విన్న మంత్రులు, తార కూడా అదే జరిగి ఉంటుందని నమ్మారు. సుగ్రీవుడి గొడవ ఎలా ఉన్నా, వాలి చేసిన తప్పు స్పష్టంగానే కనిపిస్తోంది నాకు. వాలి సుగ్రీవుడ్ని తన్నితరిమేసింది రాముడిలా తొందరపాటే అనుకోవచ్చు కానీ, రుమను బలవంతంగా చెరబట్టటం స్పష్టమైన తప్పుగానే కనిపిస్తోంది. నేను నా మొదటి వాఖ్య నుంచీ వాదిస్తోంది రుమను బలవంతంగా చేపట్టడం గురించే కదా. కాబట్టి వాలి విషయాన్ని నచ్చకపోవటంతో సరిపెట్టలేను.

శరత్ కాలమ్ చెప్పారు...

@ సుజాత
అప్పటెప్పటో పరిస్థితి పక్కనపేడితే ఇప్పటికి మాత్రం ఎంతమంది తల్లితండ్రులు సరిగ్గా తమ పిల్లల ఇష్టాయిష్టాలను బట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు? అలాంటి ఓ అన్యాయానికి బలయిపోయిన వాడిగా చెబుతున్నాను.

Malakpet Rowdy చెప్పారు...

ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో వేరే వూరు పోయినా వాళ్ళ పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉండదనుకుంటా!
_____________________________________

ఆనాడే కాదు, కోతుల్లో అదే పరిస్థితి ఈనాడు కూడా ఉంది, రేఫు కూడా ఉంటుంది. బలమున్న మగ కోతే తన దరిదాపుల్లోనున్న ఆడ కోతులని లోబరుచుకునేది.

కోతుల్లో స్త్రీవాద విప్లవన్ని తీసుకురావడం మనుషులకి అంత సులభం కాదేమో? :))

Malakpet Rowdy చెప్పారు...

I already said it at 29 జూలై 2010 3:56 pm

చైతన్య కృష్ణ పాటూరు చెప్పారు...

మొత్తానికి అందరూ ఆ శ్లోకం అంతు తేల్చటానికి పూనుకున్నారన్న మాట. రచయిత చెప్పాలని ప్రయత్నించిందాంతో ఒప్పుకోం, అతను కవర్ చేసేసిన కుట్రని మేము కనిపెట్టేసాం అని వాదించటం ఇప్పటి ట్రెండ్ అవుతుందని తెలీక వాల్మీకి స్కీన్ ప్లే మీద సరిగ్గా దృష్టి పెట్టుండడు. మామూలుగా నాకు ఇలా వాదించటం నచ్చదు కానీ అందరిని చూసి ఇప్పుడు సరదా పుట్టింది. నేను సైతం ఒక ఆర్గ్యుమెంట్ ట్రై చేస్తాను. చచ్చిన రాక్షసుడి అరుపులు వినపడటమేమిటి, గెలిచిన వాలి అరుపులు వినపడకపోవటమేమిటి అనే కదా మన డౌటు. వాలి గుహలో పెడబొబ్బలు పెట్టాలని రూలేం లేదుగా. రాక్షసులు ఉండే చీకటి గుహలో దారి తప్పిపోయిన వాడు రంకెలెయ్యాలనేం లేదుగా. వాల్మీకంలో వాలి చెప్పిన ప్రకారం గుహలోపల రాక్షసుడొక్కడే కాదు వాడి ఫ్యామెలీనే ఉందంట. కాబట్టి వాళ్ళ అరుపులు వినపడే అవకాశం ఎక్కువ, అందులో వాలి కేకలు వినపడకపోయే అవకాశమూ ఉందిగా.

Malakpet Rowdy చెప్పారు...

ఒకాయన కోట్‌ చేసిన తాత్పర్యంలో screeches of my brother...unheard అని వుంది గానీ, 'even' = అయినప్పటికీ అనేది లేదు. ప్రతి పదార్థంలో వుంది గానీ, తాత్పర్యంలో ఒదిలేశారు.
_____________________________________

సరే, ఆ పదం పెట్టి దాని తాత్పర్యం మీరే చెప్పండి. ఆ పదం పెట్టడం వల్ల దాని అర్ధం ఎంతా మారిపోతుందో చూడాలని నాకు కూడా కుతూహలంగానే ఉంది

Malakpet Rowdy చెప్పారు...

అతను కవర్ చేసేసిన కుట్రని మేము కనిపెట్టేసాం అని వాదించటం ఇప్పటి ట్రెండ్ అవుతుందని తెలీక వాల్మీకి స్కీన్ ప్లే మీద సరిగ్గా దృష్టి పెట్టుండడు.
_____________________________________

నాకు కూడా కొత్త కొత్త ఐడీయాలు వస్తున్నాయ్. ఒక ప్రఖ్యాత రచనని అనువదించి, దానిలో నాకు తోచిన మసాలా చొప్పించి, ఆ అనువాదానికి వ్యతిరేకంగా "మసాలా విషవృక్షం" అనే పుస్తకం నేనే రాసేసి, మొత్తం తప్పంతా ఒరిజినల్ రచనదే అని decide చేసేస్తే? :))

karthik చెప్పారు...

అతను అరుస్తున్నప్పటికీ... అంటున్నాడు సుగ్రీవుడు. అరుస్తున్నప్పటికీ వినబడ లేదనడం ఏమిటీ?
even though he was roaring while engaged in the encounter, did not fall on my ears.”
--------------------------------
ఈ వాక్యం యొక్క అర్థం పోరాటం మొదలైనప్పుడు అరుస్తున్నాడని.. అరుస్తున్నా వినబడలేదని కాదు. పోరాటం మొదలైనప్పుడు అరుస్తున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత అరవకపోతే ఏమనుకోవాలి?? అది కూడా శత్రువు యొక్క అరుపులు వినిపిస్తున్నప్పుడు..

ఇక్కడ వాలి, రాముడు సుగ్రీవుడు లాంటి పేర్లని వరసగా ఎల్లయ్య, పుల్లయ్య, పెంటయ్య అని మార్చితే, నూటికి నూరు మందీ పెంటయ్య (సుగ్రీవుడు) అబద్ధం చెపుతున్నాడనీ, అన్నని చంపడానికి ప్రయత్నించాడనీ చెపుతారు
------------------------------
ఈ పేర్లను చాన్,చున్, చిన్ అని మారిస్తే రంగనాయకమ్మ గారు ఎవరిది తప్పంటారో తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది బాసూ.. :P

వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ!

సుగ్రీవుడి పాత్ర నిజాయతీని నిరూపించే కీలకమైన శ్లోకం ఇది. దీనిలో ప్రతి పదమూ జాగ్రత్తగా పరిశీలించాల్సిందే!
ఇంగ్లిష్ వాక్యనిర్మాణం వేరుగా ఉంటుందన్నారు.
మీరు కోట్ చేసిన శ్లోకం ఇంగ్లిష్ అనువాదంలో even అనే మాట మొత్తం అర్థాన్నే మార్చేస్తున్నపుడు ఆ మాటను ప్రతిపదార్థంలో ఇచ్చి, తాత్పర్యంలో వదిలెయ్యటం సబబేనా?

వాలి సుగ్రీవుల్ని మీరు జంతువులన్నారు. ఇప్పుడు ‘రాక్షసుడు’ మాయావి (దుందుభి ఇతడి అన్న) కూడా జంతువే అంటున్నారు. రాక్షసులు కూడా జంతువులే అయితే ఆ వాదన ప్రకారం విభీషుడు కూడా జంతువే. అంతే కాదు; రావణుడు కూడా జంతువే. ‘అప్పుడు మీరు మనిషి (సీత)కోసం రాముడు జంతువును చంపాడన్నమాట’అని మీరు వెంటనే కంక్లూజన్ కు వచ్చేస్తారేమో!

సుగ్రీవుడు- మాయావి (మీ భాషలో జంతువు) హాహాకారాలు విని వాటిని గర్జనగా ఊహించుకునివుంటే..? అన్నారు కదా!
ఇంత అపసవ్యంగా ఊహించుకునే సుగ్రీవుడు అసలు జరిగిందంతా తనకు అనుకూలంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది కదా!ఎందుకంటే- బిలంలో ఏం జరిగిందీ, తర్వాత తిరగొచ్చిన వాలి తననెలా దూషించి, వెళ్ళగొట్టిందీ అంతా రామాయణంలో సుగ్రీవుడి వర్షన్లోనే ఉంటుంది. బిలంలో ఏం జరిగిందనేదానిపై వాలి ఏం చెప్పాడనేది కూడా సుగ్రీవుడి మాటల్లోనే పాఠకులు తెలుసుకునేలా కథ సాగుతుంది.

karthik చెప్పారు...

i found an interesting argument here:
గుహకి రాయి అడ్డం పెట్టి, తనని చంపడానికి ప్రయత్నించడం
let me do some math here
so గుహకి రాయి అడ్డం=చంపడానికి ప్రయత్నించడం
fine then.

నిజంగా ఓడిపోతున్నాడనే అనుకుంటే అన్నని రక్షించడానికి వెళ్తాడు కాని అన్నని ఆ పరిస్థితిలో వదిలేసి వస్తాడా?
----------------------------------
సగం శక్తిని లాగేసుకునే అన్ననే చంపాడంటే ఇక వాడి ముందు తనెంత అని అనుకుని ఉండచ్చు కదా??
ఐనా గుహకు రాయి అడ్డం పెట్టి రాక్షసుడిని చంపాడు కదా..(మీ లాజిక్ ప్రకారం)

అజ్ఞాత చెప్పారు...

ఇది చదవండి :

http://dharmasthalam.blogspot.com/2009/12/blog-post.html

karthik చెప్పారు...

ఇప్పుడు ‘రాక్షసుడు’ మాయావి (దుందుభి ఇతడి అన్న) కూడా జంతువే అంటున్నారు.

-------------------------------------
మాయావి దుందుభి జంతు రూపంలో ఉండే రాక్షసులు..

వేణు గారూ.. ఇవన్నీ చందమామ లో ఉన్నాయి కదా? మీకు గుర్తులేదా?

వేణు చెప్పారు...

కార్తీక్ గారూ!
రావణుడి భార్య మండోదరి తండ్రి పేరు మయుడు. మండోదరి అన్నలు మాయావి, దుందుభి. ఇప్పుడు చెప్పండి- మాయావీ, దుందుభీ జంతు రూపంలో్ ఉండే రాక్షసులేనా?

‘చందమామ’ బొమ్మలను ముచ్చటగా చూసుకుంటాం గానీ, ఆ బొమ్మలను బట్టి ఇలాంటి చర్చల్లో ఒక నిర్థారణకు రాలేం కదా!

Unknown చెప్పారు...

వేణు గారూ,
-------------------------------
ఇంత అపసవ్యంగా ఊహించుకునే సుగ్రీవుడు అసలు జరిగిందంతా తనకు అనుకూలంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది కదా!
-------------------------------
చాలా బాగా చెప్పారు. తేటతెల్లంగా కనపడుతున్నదానిని వదిలిపెట్టేసి, ఇంత అడ్డదిడ్డంగా జరిగింది జరగనట్టుగా జరగనిది జరిగినట్టుగా ఊహించుకునే సుగ్రీవుడిని ఎవరయినా ఏ కారణం చేత నమ్మగలరో నాకర్ధంకావటంలేదు.

ఇక్కడ ఒకరు "... మంచి నీతి కధగా అనుకుంటే సరిపోతుంది కదా ..." అని అన్నారు. దాదాపు అలాంటి అభిప్రాయాలే ఇంకొంత మంది ప్రకటించారు. ఈ "వాలి వధ" సంఘటన నుంచీ నేర్చుకోవలిసినదేమిటో చూద్దాం:

నేను నా శత్రువు మీద యుద్ధానికి వెళ్ళాలి. అయితే నా దగ్గర సైన్యం లేదు. పక్క రాజ్యం సహాయం కావాలి. కానీ పక్క రాజ్యంలో బలవంతుడైన రాజు ఉన్నాడు. ఆ రాజుకి నాకు సహాయం చెయ్యవలసిన అవసరంలేదు. అయితే ఏం చెయ్యాలి? పక్క రాజు సింహాసనానికి ఆశ పడుతున్న బంధువుడినొకడిని చేరదీసి, కుట్ర పన్ని, పక్క రాజుని దొంగచాటుగా చంపి, ఈ బంధువుని రాజుగా నిలబెట్టాలి. ఈ బంధువు బలహీనుడు కనక, ఎప్పుడూ నాకు లోబడి ఉంటాడు. నాకు కావలిసిన సైన్యాన్ని పంపిస్తాడు. నా పని నెరవేరుతుంది. దీనిలో పక్క రాజు మంచివాడా అతని బంధువు మంచివాడా , లేదా ఇద్దరూ చెడ్డవాళ్ళా, దీనివల్ల పక్క రాజ్యం ప్రజలు ఎంత నష్టపోతారు (తమకు ఏమీ సంబధం లేని యుద్ధం లోకి దిగడం వల్ల), ఇటువంటి న్యాయాన్యాయ విచక్షణ ఏమీ అవసరంలేదు.

ఇదండీ ఈ వాలి వధ నుంచీ నేర్చుకోవలసిన నీతి! సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి ఈ నీతి చాలా బాగా ఉపయోగపడుతుంది!

Srinivas చెప్పారు...

వాలి జంతువూ, సుగ్రీవుడు కాదూ అనడం తార్కికం గాదు. తప్పు చేసినవాణ్ణి "నువ్వు మనిషివి గాదు జంతువువి" అని చావగొట్టినట్లుంటుంది. అవసరమయితే మిత్రుడూ లేదంటే జంతువూ అంటే కుదరదు గదా?
వాలి ఇంద్ర పుత్రుడని చెప్పే ఈ శ్లోకాలు గమనించండి -
vaalii naama mahaa praaj~naH shakra putra prataapavaan |
adhyaaste vaanaraH shriimaan kiSkindhaam atula prabhaam || 4-11-21
tam evam uk{}tvaa sa.mkruddho maalaam utkSipya kaa.ncaniim |
pitraa dattaam mahendreNa yuddhaaya vyavatiSThata || 4-11-39

రాజ్యాలూ,నగరాలూ, మంత్రులూ, భార్యలూ, రాజులకు ఛత్రాలూ, వొంటి మీద బట్టతో వెళ్ళగొట్టాడని సుగ్రీవుడు వాపోవడమూ, అగ్ని సాక్షిగా సుగ్రీవుడితో మైత్రీబంధనమూ చూస్తుంటే వాళ్ళను జంతువులని కొట్టిపారేయలేం రాముణ్ణి కాపాడ్డానికి కాకపోతే.

ఇక అది రాముడి రాజ్యమే అయితే/నా నిందితుడిని శిక్షించే ముందు అతని వాదనా వినకపోవడం అధర్మమే అవుతుంది.
ఇదంతా ఎందుకు పేచీ - మనకు నచ్చినట్టుగా ఈ దోషాలన్నీ తొలగించుకుంటూ రామాయణాన్ని తిరగరాసుకుంటే మంచిదేమో!

Unknown చెప్పారు...

@karthik:
ఐనా గుహకు రాయి అడ్డం పెట్టి రాక్షసుడిని చంపాడు కదా..(మీ లాజిక్ ప్రకారం)
------------
రాక్షసుడిని వాలి అప్పటికే చంపేశాడు (గుహ నించీ రక్తం...) వాలి అప్పటికే చంపిన వాణ్ణి సుగ్రీవుడు మళ్ళీ ఎలా చంపాడో మీరే వివరించవలసి ఉంటుంది.

Malakpet Rowdy చెప్పారు...

మీరు కోట్ చేసిన శ్లోకం ఇంగ్లిష్ అనువాదంలో even అనే మాట మొత్తం అర్థాన్నే మార్చేస్తున్నపుడు ఆ మాటను ప్రతిపదార్థంలో ఇచ్చి, తాత్పర్యంలో వదిలెయ్యటం సబబేనా?
_____________________________________

Even అనే మాట మొత్తం అర్ధాన్ని ఎక్కడ మారుస్తోందో తెలుసుకోవాలనుంది నాకుకూడా. ఆ పదం పెట్టి మళ్ళీ ఆ తాత్పర్యం రాయగలరా?

Since you are very specific about one single word, I hope you use it as a single word - meaning using it only once with no additions


ఇప్పుడు ‘రాక్షసుడు’ మాయావి (దుందుభి ఇతడి అన్న) కూడా జంతువే అంటున్నారు
__________________________________

సరే, దుందుభి జంతువైతే జంతువు కాకపోతే రాక్షసుడు. దానితో నాకేమీ పేచీ లేదు.

Malakpet Rowdy చెప్పారు...

చందమామ’ బొమ్మలను ముచ్చటగా చూసుకుంటాం గానీ, ఆ బొమ్మలను బట్టి ఇలాంటి చర్చల్లో ఒక నిర్థారణకు రాలేం కదా!
____________________________________

విషవృక్షం బట్టీ నిర్ధారణకి వచ్చానని మీరే చెప్తున్నారు కదా. అనువాదల మీద ఆధారపడేడప్పుడు చందమామ అయితేనేం, విషవృక్షం అయితేనేం?

Malakpet Rowdy చెప్పారు...

వాళ్ళను జంతువులని కొట్టిపారేయలేం రాముణ్ణి కాపాడ్డానికి కాకపోతే.
_____________________________________


వాల్మీకి చెప్పింది వాళ్ళు జంతువులనే. రాముడుని తిట్టడానికి వాళ్ళని కమ్యూనిష్టులు మనుషుల్లా చిత్రీకరిస్తున్నారేమో?

Malakpet Rowdy చెప్పారు...

ఇంత అపసవ్యంగా ఊహించుకునే సుగ్రీవుడు అసలు జరిగిందంతా తనకు అనుకూలంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంది కదా!
_____________________________________

అవకాశం ఉంది. కానీ అలా జరిగిందా లేదా అనేది విషయం.

Srinivas చెప్పారు...

వాల్మీకి చెప్పింది వాళ్ళు జంతువులనే. రాముడుని తిట్టడానికి వాళ్ళని కమ్యూనిష్టులు మనుషుల్లా చిత్రీకరిస్తున్నారేమో?
-------------------------
ఆ చిత్రీకరణ అంతా వాల్మీకిదే! ఆ శ్లోకాలన్నీ ఇక్కడ అతికించలేను కానీ మరొక్క సారి చదవండి కిషికింధ కాండ. ఇంద్రుడి కొడుకుని జంతువు అనడమేమిటో పక్కన పెట్టినా, వాళ్ళ ఊహలూ, సంభాషణలూ కవి కల్పితమని కొట్టేసినా ఆ నగరాలూ, భవనాలూ, తప్త కాంచన తోరణాలూ, సమరానికి గోచీ బిగించడాలూ, ఆభరణాలూ.. వాళ్ళు మనుషులకంటే ఎట్లా భిన్నమో చెప్పలేదెక్కడా చనిపోయేప్పుడు వాలితో మేం మృగాలం అనిపించడం తప్ప. అది చదువుతుంటే వానరులు అంటే వననరులేమో అనిపించింది నాకయితే.

వాలి జంతువంటూనే పరదారను చెరపట్టరాదనే మానవ ధ్రమం పాటించని నేరానికి శిక్ష ఇది అని చెప్పడం నాకూ మింగుడు పడలేదు.
ఏంటో ఆ వేసే బాణమేదో ఎదురుగా పోయి వేసిఉంటే వాల్మీకి చావకపోయేవాడా!

హరి చెప్పారు...

ते तथा उक्ताः भगवता तत् प्रति श्रुत्य शासनम् |
जनयामासुः एवम् ते पुत्रान् वानर रूपिणः || १-१७-८

8. bhagavataa = by Brahma; tathaa uktaH = thus, addressed; te = those gods; tat shaashanam pratishrutya = that, order [of Brahma,] agreeing; evam vaanara ruupiNaH putraan = accordingly, monkey, in appearance, sons; janayaamaasuH = started to parent.

When Brahma addressed them thus, those gods have agreed to his order and accordingly started to parent sons in the semblance of monkeys. [1-17-8]

This pedigree is not yet given the label of monkeys. They are lookalike of monkeys but not monkeys, vaana ruupiNam resembling monkeys, as said in the verse. The word vanara is vane carati iti vanara-s because they range far and wide over forests they are called vanara-s, but not exactly a monkey race.

దీన్ని బట్టి బ్రహ్మ ఆజ్ఞాబద్ధులై దేవతలు వానర రూపంలో ఉన్న కుమారులను కన్నారని తెలుస్తోంది. వానరుడు అంటే వనచరుడైన మానవుడు, లేదా సగం మనిషి, సగం జంతువు కావచ్చు. ఎలా అయినప్పటికీ పూర్తి స్థాయి జంతువుగా భావించ లేం.

ఒక వేళ జంతువే అనుకున్నా,

pa.nca pa.nca nakhaa bhakSyaa brahma kSatreNa raaghava |
shalyakaH shvaavidho godhaa shashaH kuurmaH ca pa.ncamaH || 1-17-39

39. raaghava= oh, Raghava; brahma kSatreNa= by Brahmans, Kshatriya-s; shalyakaH= a wild-rodent with defensive quills; shvaavidhaH= a kind of boar that kills dogs, wolves etc; godhaa= a lizard with unimaginable grip; shashaH= hare; pancamaH kuurmaH ca= fifthly, tortoise, also; panca= five [kinds of]; panca nakhaa= five nailed animals; bhakSyaa= are edible.

"Raghava, five kinds of five-nailed animals, viz., a kind of wild rodent, a kind of wild-boar, a kind of lizard, a hare and fifthly the turtle are edible for Brahmans and Kshatriya-s. [4-17-39]

carma ca asthi ca me raajan na spR^ishanti maniiSiNaH |
abhakSyaaNi ca maa.msaani so aham pa.nca nakho hataH || 1-17-40

40. raajan= oh, king; maniiSiNaH= sensible people; me carma ca asthi ca= my, skin, also, bones, also; na spR^ishanti= will not, touch; maamsaani ca= meats, also a + bhakSyaaNi= not, to be eaten; panca nakhaH= five, nailed one; saH aham hataH= such as I am, I am killed.

"Sensible people will not touch my skin and bones, oh, king, nor meats from my body are to be eaten, such as I am, a five-nailed animal, I am killed. [4-17-40]

ఇలాంటి ప్రశ్నలు వేయగల, రాముడు అంతటి వాడితో వాదించగల వాలిని జంతువు అని ఎలా అనుకోగలం?

ఇంకో కోణంలో చూస్తే, పక్షి అయిన జటాయువు సీత రక్షణ కోసం ప్రాణం నిస్వార్థంగా విడుస్తాడు. అలాగే ఎంతోమంది వానరులు రాముడికోసం అంతే నిస్వార్థంగా ప్రాణం విడుస్తారు, యుద్ధంలో!

karthik చెప్పారు...

@Ravi,
రాక్షసుడిని వాలి అప్పటికే చంపేశాడు (గుహ నించీ రక్తం...) వాలి అప్పటికే చంపిన వాణ్ణి సుగ్రీవుడు మళ్ళీ ఎలా చంపాడో మీరే వివరించవలసి ఉంటుంది.
-----
గుహ నుంచీ రక్తం వస్తుంటే అది రాక్షసుడిదని ఎలా ఫిక్స్ అయిపోతారు?? వాలిది కాకూడదా??
మీరు చెప్పిన రెండు పాయింట్లూ ఒకదానితో ఒకటి చేరుద్దాం..
1. గుహ లోపల నుంచీ రక్తం వస్తోంది.
2. వాలి అరుపులు కాకుండా కేవలం రాక్షసుడి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి.. (స్లోకం గురించి నేను పైన రాసిన కామెంట్ చదివారనుకుంటా)

వాలి శత్రువులోని సగం శక్తిని లాగేసుకుంటాడు అనే పాయింట్ తప్ప రాక్షసుడు ఓడిపోవడానికి మరొక బలమైన కారణం కనిపించదు.. యుద్దం లో ఎవరైనా గెలవచ్చు..సగటు మనిషిగా నేనైతే సుగ్రీవుడు చేసిన పనే చేసేవాడిని.. ఇందులో మరో కోణం ఏమైనా ఉంటే చెప్పగలరు..

సుజాత వేల్పూరి చెప్పారు...

@శరత్,

అవును, ఈ నాటికీ పెళ్ళిళ్ళు దాదాపుగా తల్లిదండ్రుల వల్లే నిర్ణయమవడం, చేసుకునే వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం లేకపోవడం జరుగుతోంది. అటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఇష్టమైన పెళ్ళి చేసుకున్న వ్యక్తిగా మీ బాధను అర్థం చేసుకోగలను.ప్చ్! వేణుగారూ, ఈ పిడకల వేట కామెంట్ కి క్షమించాలి.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ !

नर्दताम् असुराणाम् च ध्वनिः मे श्रोत्रम् आगतः |
न रस्तस्य च संग्रामे क्रोशतो अपि स्वनो गुरोः || ४-९-१८

ఈ శ్లోకాన్ని తెలుగు లిపిలో కూడా ఇస్తున్నాను- చదవటానికి హాయిగా ఉంటుంది.

నర్దతామ్ అసురాణామ్ చ ధ్వని: మే శ్రోత్రమ్ ఆగత:
న రస్తస్య చ సంగ్రామే క్రోశతో అపి స్వనో గురో:

http://www.valmikiramayan.net/kishkindha/sarga9/kishkindha_9_frame.htm
వెబ్ సైట్ లో ఇచ్చిన తాత్పర్యం:

Sounds of screaming demon came to my ear, but the screeches of my brother who is involved in fight are unheard, in the least. [4-9-18]

వెబ్ సైట్ లోని శ్లోకంలో మొదటి లైను చూద్దాం.

* ఒక్కో పదానికీ అర్థం (ప్రతిపదార్థాలు)
Screams-of the demon, also-sounds-to my, ear, came.

* లిటరల్ (మక్కీకి మక్కీ అనువాదం ):
The screams of the demon also came to my ear.

ఫ్రీ ట్రాన్స్ లేషన్ [gist/తాత్పర్యం]:
I heard the screams of the demon.

______________________________
వెబ్ సైట్ లోని శ్లోకంలో రెండో లైను చూద్దాం.

* ఒక్కో పదానికీ అర్థం (ప్రతిపదార్థాలు)
In fight, involved in-on who is screeching, even-of my brother-sounds-not, even [heard].

* లిటరల్ (మక్కీకి మక్కీ అనువాదం ): Even the sounds of my brother, who is screeching, were not even heard.

* ఫ్రీ ట్రాన్స్ లేషన్ [gist/తాత్పర్యం]:
I did not hear even the sounds of my brother who was screeching. [screech=to utter a harsh, shrill cry or sound].

మలక్ పేట్ రౌడీ గారూ!

వెబ్ సైట్ ప్రకారం మీరు కోట్ చేసిన శ్లోకంలోని ఇంగ్లిష్ అనువాదంలో 'even'అనేది రెండు చోట్ల వచ్చింది. కాబట్టి మీరు గానీ, వెబ్ సైట్ అనువాదకుడు గానీ గానీ ఆ పదాన్ని తాత్పర్యంలో ‘మిస్’చేయటానికి వీల్లేదు.

Random House Dictionary of English language ప్రకారం- even అనే పదానికి 20కి పైగా అర్థాలున్నాయి. దీని అర్థం - ‘yet’, ‘still’ (అయినప్పటికీ).

‘తాత్పర్యం’ ఏమిటంటే- even though vali made sounds [of screaming with anger or fear for death], sugriva says he did not hear them.

వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ !
‘అనువాదాల మీద ఆధారపడేటప్పుడు చందమామ అయితేనేం, విషవృక్షం అయితేనేం?’ అన్నారు కదా!

రెంటికీ తేడా ఉంది కదా! చందమామలో వచ్చిన రామాయణం (పోనీ- వీర హనుమాన్) సీరియల్ కథను సంగ్రహంగా చెప్పటానికి ఉద్దేశించింది. అది వాల్మీకంపై ఆధారపడివుందని చెప్పలేం.

‘విషవృక్షం’ వాల్మీకి రామాయణంపై సీరియస్ విమర్శ.
వాల్మీకి రామాయణం సంస్కృత కావ్యం కాబట్టి ఆ భాషపై పట్టు లేనపుడు- ఆ పట్టు ఉన్న పండితులు చేసిన అనువాదాల మీద ఆధారపడటంలో కించపడాల్సిందేమీ లేదు. అది లోపమూ కాదు.

మీరు రంగనాయకమ్మ గారి ‘విషవృక్షం’ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెపుతున్నాను- ఆ పుస్తకం మూడు రకాల అనువాదాలను పరిశీలించి రాసింది. కాండ, సర్గ, శ్లోకాల సంఖ్య ను పేర్కొంటూ ఎక్కడికక్కడ ఫుట్ నోట్లు ఇచ్చారు.
ఏ రచనను అయినా అర్థం చేసుకోవడానికీ, గుణదోష పరిశీలన చేయటానికీ అనువాదాలు బాగానే ఉపయోగపడతాయి.

కిష్కింధ కాండలోని 9వ సర్గ 18వ శ్లోకాన్ని కోట్ చేసినపుడు కూడా వెబ్ సైట్ లో ఉన్న ఇంగ్లిష్ అనువాదాన్నే మీరు కోట్ చేశారు కదా!

ఆ.సౌమ్య చెప్పారు...

హమ్మో నేను పడుకుని లేచే లోపల ఎంత జరిగిందీ?

అన్ని కామెట్లూ మళ్ళీ తీరికగా చదివితేగానీ లాభం లేదు.

కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏ రకమైన రాగద్వేషాలకి పోకుండా ఆరోగ్యవంతమైన చర్చ జరిగిందిక్కడ. బహుసా ఇలాంటి చర్చ బ్లాగ్లోకంలో జరగడం ఇదే మోదటిసారేమో!

Unknown చెప్పారు...

@వేణు గారూ,

రెండు లైన్ల మక్కీకి మక్కీ అనువాదాలూ పక్క పక్కన పెట్టి చూస్తే:
Screams-of the demon, also-sounds-to my, ear, came.

Even the sounds of my brother, who is screeching, were not even heard.

దీన్ని చూస్తే నేను కోట్ చేసిన తెలుగు తాత్పర్యం పూర్తిగా కరెక్టు అనిపిస్తోంది - రెండో లైన్లో screeching అన్న మాటకు అర్ధం, ఈ సందర్భంలో, "దెబ్బలు తింటున్నప్పుడు బాధతో చేసే శబ్దాలు" - అవి మూలగడం కానీండి, యేడుపులు కానీండి. ఇవి సుగ్రీవుడికి వినపడ్డాయనే చెపుతున్నాడు. వినపడనివి ఏమిటంటే, మొదటి లైనులో ప్రస్తావించిన అరుపులు. ఈ సందర్భంలో మక్కీకి మక్కీ అనువాదాన్ని ఇలా అర్ధం చేసుకోవలసి వుంటుంది - ఇక్కడ even కన్నా but అన్న అర్ధం కరెక్టుగా సరిపోతుంది:

but the shouts of my brother, who was screeching [in pain], could not at all be heard

కాబట్టి తెలుగు పండితులు చేసిన ఈ అనువాదం స్లోకం అర్ధాన్ని కరెక్టుగా చెపుతోందని నాకనిపిస్తోంది:
"బిలములోపల సింహనాదము చేయుచుండు రాక్షసుడి ధ్వని నా చెవిలో బడెను. యుద్ధములో అపజయము పొంది అరచుచుండు నా అన్న ధ్వని నాకు వినవచ్చెను"

screeches వినపడ్డాయి, కాని shouts వినపడలేదు.

Malakpet Rowdy చెప్పారు...

వాలి జంతువంటూనే పరదారను చెరపట్టరాదనే మానవ ధ్రమం పాటించని నేరానికి శిక్ష ఇది అని చెప్పడం నాకూ మింగుడు పడలేదు
___________________________________


దీని గురించి ముందే అన్నాను కదా - నేనిక్కడ చంపడం గురించే మాట్లాడుతున్నా - జంతువులకి మానవ ధర్మాలు వర్తింపజేయ్యడం ఇబ్బంది అయితే అది వేరే చర్చ. నేనక్కడ అన్నది శిక్ష అని కాదు - వేట అని. రెండిటికీ తేడా ఉంది కదా


ఇంద్రుడి కొడుకు మానవుడు కాగలిగినప్పుడు వానరుడు కాలేడా? ఒక వేళ కుదరదు అనుకుంటే దేవతే అవాలి. దెవతలకి మానవ న్యాయం వర్తించదుగా?


___________________________________
ఇలాంటి ప్రశ్నలు వేయగల, రాముడు అంతటి వాడితో వాదించగల వాలిని జంతువు అని ఎలా అనుకోగలం?
__________________________________

కవి చెప్పాడు కాబట్టీ.


even though vali made sounds [of screaming with anger or fear for death], sugriva says he did not hear them
___________________________________

The sloka is in direct speech. could you please check it again?


ఏ రచనను అయినా అర్థం చేసుకోవడానికీ, గుణదోష పరిశీలన చేయటానికీ అనువాదాలు బాగానే ఉపయోగపడతాయి.
__________________________________

I dont disagree. My question is - విషవృక్షం ఎక్కువేమిటి చందమామ తక్కువేమిటి?

అజ్ఞాత చెప్పారు...

Anybody interested in a thought experiment?

http://nagamurali.wordpress.com/2010/07/30/%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8F%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81/

I am not interested in any discussions, so no more comments from me.

వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ !
శ్లోకం డైరెక్ట్ స్పీచ్ లో(ఉత్తమ పురుష) ఉన్నప్పటికీ సారాంశంలో స్పష్టత కోసం రిపోర్టింగ్ స్పీచ్ లో చెప్పాను.

సరే, శ్లోకార్థాన్ని డైరెక్ట్ స్పీచ్ లోనే చూడాలంటే... శ్లోకంలోని రెండు లైన్లనూ కలుపుకుంటే సరి.

మక్కీకి మక్కీ అనువాదంలో ఇలా-

The screams of the demon also came to my ear. Even the sounds of my brother, who is screeching, were not even heard.

స్వేచ్ఛానువాదంలో ( free translation/ gist/తాత్పర్యం) ఇలా-

I heard the screams of the demon. I did not hear even the sounds of my brother who was screeching. [screech=to utter a harsh, shrill cry or sound].


ఇక మీ రెండో ప్రశ్న-
‘విషవృక్షం ఎక్కువేమిటి చందమామ తక్కువేమిటి?’
ఒకటి ఎక్కువనీ, మరొకటి తక్కువనీ నేను అనలేదు.

(మీరన్నారని నేనెక్కడ అన్నాను? అంటారా? సరే.. అది ‘మీ తాజా ప్రశ్న’గానే భావించి చెపుతాను.)
నేను నా వ్యాఖ్యలో రెంటికీ తేడా ఏమిటో చెప్పాను. అసలు విషవృక్షం లక్ష్యం వేరు, చందమామ ధారావాహిక లక్ష్యం వేరు. రెండిటికీ పోలిక తీసుకురావటంలో ఔచిత్యం నాకేమీ కనపడటం లేదు!

Malakpet Rowdy చెప్పారు...

The screams of the demon also came to my ear. Even the sounds of my brother, who is screeching, were not even heard.
_____________________________________

How about trying this interpretation?

I HEARD THE SCREAMS OF THE DEMON. I KNOW MY BROTHER WOULD BE SCREECHING BUT I COULD NOT EVEN HEAR THE SOUNDS.

లక్ష్యాలు వేరవ్వచ్చు. కానీ రెండిటి కధాంశం ఒకటే కదా? నేనన్నది "చందమామను సీరియస్ గా తీసుకోలేము" అన్న దానిగురించి. వాల్మీకి రామాయణం కానప్పుడు చందమామ రామయణం అయితేనేం లేక రంగనాయకమ్మ రామాయణం అయితేనేం అని. ( కావాలంటే చదవలవాడ, నేను చూపించిన వెబ్ పేజ్, తులసీదాస్, మొల్ల, విశ్వనాధ ని కూడా కలుపుకోవచ్చు)

శ్రీనివాస్ చెప్పారు...

వాలిని సంహరించాక రాముడు వాలికే వివరణ ఇచ్చాడు

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||


" నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.

నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు.

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.

Unknown చెప్పారు...

@శ్రీనివాస్:
జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం.
---------------------------------------
అయితే ఇక్ష్వాకు ధర్మం ప్రకారం తార సుగ్రీవుడికి తల్లి అవుతుంది. తల్లిని కామించడం ఇక్ష్వాకు ధర్మం ప్రకారం నేరమే.

--------------------------------------
@శ్రీనివాస్:
సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు.
---------------------------------------
ఓహో. అయితే ఇక్ష్వాకు ధర్మాలు వానర జాతికి వర్తించవనమాట, వానర జాతి నియమాల ప్రకారం వదిన (ఇక్ష్వాకు తల్లి) నైనా కామించవచ్చు, మరదలు (ఇక్ష్వాకు కూతురు) నైనా కామించవచ్చు.

------------------------------------------
@శ్రీనివాస్:
అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు.
-------------------------------------------
మళ్ళీ ఇదేమిటి? ఇక్ష్వాకు ధర్మాలు వానురులకెలా వర్తిస్తాయి? ఇక్ష్వాకు ధర్మాలు వానరులకి వర్తించేటట్టయితే ముందు సుగ్రీవుడికి మరణ దండన విధించాలి కదా!
--------------------------------------------
@శ్రీనివాస్:
.....సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి....
..... నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు ....
----------------------------------------------
సంధ్యావందనం చేసే, .... చేసే, ... చేసే, వానరజాతి, ఇప్పుడు జంతువు ఎలా అయింది? కవి తను చంపాలనుకున్న పాత్రని జంతువు అనగానే అది జంతువు ఎలా అవుతుంది? అది జంతువా కాదా అన్నది ఆ కవి చేసిన పాత్ర చిత్రణ బట్టి ఉంటుంది. జాత్యాహంకారంతో ఉన్న తెల్ల వాళ్ళు భారతీయుల్ని గానీ, నల్ల వాళ్ళని గానీ కోతులనగానే వాళ్ళు కోతులయిపోరు. అలాగే జాత్యాహంకారంతో ఉన్న వాల్మీకి, వానరులని తనకి అవసరమైన చోట మనుషుల గానూ అవసరం లేని చోట జంతువులగానూ సంభోదించినంతమాత్రాన వాళ్ళు అలా "ట్రాన్స్ ఫార్మ్" అయిపోరు. ఇక్కడ రామభక్తుల హిపొక్రసీ చాల హాస్యాస్పదంగా ఉంది. ఇక్ష్వాకు ధర్మాల ప్రకారం మరణ దండన ప్రకటించడానికి వాలి మానవుడుగా ఉండాలి. కాని మరణ దండన విధించే సమయానికి దొంగ చాటుగా చంపడానికి వీలుగా వాలి జంతువుగా ఉండాలి. సుగ్రీవుడిని దండించవలసిన అవసరం తప్పించుకోవడానికి వాలి తమ్ముడు సుగ్రీవుడు వానర ధర్మాలు మాత్రమే వర్తించే వానరుడై ఉండాలి.

ఇన్ని వాదనలన్నీ ఇందుకు? మీరు చెప్పదలుకున్నది ఇదీ: రాముడు ఏది చేస్తే అదే న్యాయం. ఇతరులు చేసేవి రాముడికి అనుకూలమైతే అవి నీతిమంతమైన చర్యలు, అనుకూలం కాక పోతే అవి నేరాలు.

Srinivas చెప్పారు...

శ్రీనివాస్ గారు శ్లోకానికి అర్థం చెప్పేబదులు వ్యఖ్యానం రాసేశారు.
వానరులు జంతువులా? కాదా? (వాళ్ళు జంతువుల్లా జీవించారా? ప్రవర్తించారా? ఆలోచించారా? ఆపటిదాకానూ, ఆత్రవాతా రామలక్ష్మణులు వాళ్ళను జంతువుల్లా treat చేశారా? వాళ్ళకూ నియమాలూ, పాపపుణ్యాలూ ఉన్నాయా?)
జంతువులే అనుకుంటే - రాముడు "ఇది వానరన్యాయం కదా!" అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన చెప్పినవన్నీ మానవధ్రమాలే! ( కూతురు లాంటి కోడలిని చేసుకోవడం తప్పయితే తల్లిలాంటి వదినను పెళ్ళి చేసుకోవడం ఒప్పెలా అవుతుందో నన్నది వేరే ప్రశన)
చిక్కుముడి ఇదీ -
రాముడు నువ్వు జంతువువు కనుక చాటునుండి కొట్టడం ధర్మమే అంటున్నాడు. మరొక పక్క నీ మరదల్ని చెరపట్టినందుకే చంపానంటునాడు. ఈ రెండూ ఎందుకు పొసగవో స్పష్టం. ఏదో ఒక్కటే సరి అయి ఉండాలి. నువ్వు జంతువువు అందువల్ల చాటు నుంచి చంపాను అంటే పేచీ లేదు. ధర్మాన్ని కాపాడవలసిన రాజుగా చంపానంటునాడు కనుక ఆరోపణా, విచారణా, నిరూపణా తప్పనిసరి. శత్రువు బలశాలి అని వీరుడెవ్వడూ చాటు నుంచి కొట్టడు. ఏ న్యాయమూర్తీ ఏకపక్ష వాదన నమ్మి నిందితుణ్ణి యమపురికి పంపడు.

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) చెప్పారు...

శ్రీనివాసు గారి స్పందనతొ నేను పూర్తిగా ఏకీభవించుచున్నాను. కొంత మంది ప్రజలు అందరూ నడిచే దారిలో కాకుండా, వేరే దారిలో వెడుతూ, గొప్ప విషయాన్ని కనుగొన్నట్లు భావిస్తున్నారు. రాముడు నాకు హీరో, రామాయణమే నాకు ఆధర్శం అని అంటే ఇంతటి చర్చా జరిగి వుండదు గాక వుండదు. మన హిందూ మతములో చాల సంవత్సరాలుగా చాలమంది ఇట్లా ప్రవర్తిస్తూ ఆకస్మిక గుర్తింపు పొందటానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నొ పౌరాణిక చిత్రాలలొ, రామాయణ మహాభారతాలు మార్పులు చేసి తీసారు. అవి చూసి ఈ తరం ప్రజలు రావణుడిని, కర్ణుడిని, ధుర్యోధనుడిని, హీరోలుగా చేసుకుని, రాముడిని భార్యని కాపాడుకోలేని అసమర్ధుడిగా, కృష్ణుడిని మోసగాడిగా, ధర్మరాజుని జూదరిగా, ద్రౌపదిని పతితగ వర్ణిస్తూ వుంటారు. ఇటువంటి కుక్కమూతి పిందెలు పుడతాయనే, ఆనాడే రాముడు సీతను తన పవిత్రతను నిరూపించుకోమని మన తరపున ఆయనే కోరాడు.

Malakpet Rowdy చెప్పారు...

నువ్వు జంతువువు అందువల్ల చాటు నుంచి చంపాను అంటే పేచీ లేదు. ధర్మాన్ని కాపాడవలసిన రాజుగా చంపానంటునాడు కనుక ఆరోపణా, విచారణా, నిరూపణా తప్పనిసరి.
_____________________________________
చంపడం వరకూ పేచీ లేదు, కానీ చెప్పిన కారణం తప్పు అంటున్నారుగా. దీనిమీద రెండో చర్చ మొదలవ్వాలి అయితే.

Malakpet Rowdy చెప్పారు...

కవి తను చంపాలనుకున్న పాత్రని జంతువు అనగానే అది జంతువు ఎలా అవుతుంది?
_____________________________________

అబ్బే, వాల్మీకి తన రచనలో కోతి అంటే కోతి కాదు, కానీ వేరేవరో లాజిక్ ఫెయిలయ్యి మైథాలజీనో చరిత్రో తెలియక తికమక పడి ఆదివాసీ అనగానే ఆదివాసీలు అయిపోతారు, అది కూడ సంధ్యావందనం చేసే ఆదివాసీలు :))

krishna చెప్పారు...

@ వేణు గారు,
మంచి ఆరొగ్యకరమైన చర్చ ని లేపారు, అభినందనలు! రామాయణం ఒక కావ్యంగా నాకు చాలా నచ్చుతుంది. ప్రతి పాత్ర చిత్రణ గొప్పగా వుంటుంది. వాలి, రావణ, కుంభకర్ణ ఇత్యాది పాత్రలు కేవలం ప్రతినాయక పాత్రలుగా వుండవు.. వాటి పాత్ర చిత్రణ అత్యధికులు అనుకున్నట్టు వుండవు! ఆదర్శ మానవుడు గా రాముడు ప్రతి చర్యా సునిశిత పరిశీలనకి గురి కావడం సహజం! అలాంటప్పుడు సీత శీల పరీక్ష, వాలి సంహారం, శంభూక వధ ఇత్యాది విమర్శకి గురి కావడం సహజమే! వాలి వధ విషయానికి వస్తే...

1) వాలి సుగ్రీవుల మధ్య ఒక అపోహ శతృత్వానికి కారణం..స్వభావరీత్యా వాలి దుర్మార్గుడూ కాదు! సుగ్రీవుడు చేసిన పని అనుమానం రేకిత్తంచగా అతను అలా ప్రవర్తించాడు! సుగ్రీవుడు చెప్పినది నిజమే అనుకుందాం కాసేపటి వరకు... తన అన్న రాజ్యానికి కొన్ని రోజులు రాజరికం నెరిపినింత మాత్రాన.. తనని కిష్కింద రాజుగా , హనుమంతుడు రాముడికి పరిచయం చెయ్యడం.. ఒక రాజ్యభ్రష్టుడైన రాజుగా తనని చెప్పుకోవడం అతని రాజ్య కాంక్షకి చిహ్నం!
2) తనని అపార్ధం చేసుకున్న అన్నకి కనువిప్పు కలిగించమని కోరక..తమ సయోధ్యకి ప్రయత్నించమనక.. వాలికిశిక్షకి కారణం అవడం అతని తప్పు. బాహాబాహీకి వెళ్లి తన అన్న ప్రాణాలు పోవడానికి కారణం అవడం అతని రాజ్య కాంక్షని తెలుపుతుంది.
3) రాముడు ధర్మ సంస్థాపన కోసం వాలిని చంపితే.. ప్రతిగా వానర సేన సహాయం ఎందుకు తీసుకోవాలి ? ధర్మం నిలబెట్టడానికి ప్రతిఫలం ఎందుకు ?
4) ఒక మృగాన్ని హతమార్చడం క్షత్రియులకి వేట కావచ్చు, కానీ వేటాడదగ్గ జంతువులు.. కౄర మృగాలు, అదుపు తప్పిన జంతువులు, ఆహార యొగ్యమైన జంతువులు.. అంతేగాని శాఖాహర, పూర్తి సచేతనమైన , ఆహార యోగ్యం కాని జీవులు కావు.
5) ఇక్ష్వాకుల పాలనలో ధర్మ సంరక్షణ రాజుల కర్తవ్యమయితే.. రాజ్యభ్రష్టుడు అయినా రాముడు కి ఆ పని చేయవలసిన అవసరం ఏమిటి ? ధర్మాధర్మ పరిశీలన చేయడానికి దశరధ మహారాజు వున్నాడు కదా! ధర్మ పరి రక్షణ రాజుల ధర్మం కదా!వనవాసం రాజరికానికి దూరంగా వుండమనే కదా!

వాలి వధ సానుభూతి కలిగించడం ఆశ్చర్యం కలిగించదు.

Malakpet Rowdy చెప్పారు...

ఇక్కడ రామభక్తుల హిపొక్రసీ చాల హాస్యాస్పదంగా ఉంది
_____________________________________

అవసరమైన చోట చరిత్ర లేని చోట మైథాలజీ అనే రంగనాయకమ్మ భక్తుల హిపోక్రసీ కన్నానా?

Malakpet Rowdy చెప్పారు...

ఈ మధ్య కాలం వరకూ కూడా వేటాడిన జంతువులని ఎన్నిటిని మానవుడు తిన్నాడు?

తన పెంపుడు జంతువుపై దాడిచేసిన వేరే జంతువుని మానవుడు చంపడం ఎప్పటినుండో చేస్తున్నదే

Malakpet Rowdy చెప్పారు...

కోతులని వేటాడడం అనేది ఈనాటికీ జరుగుతునే ఉంది. అన్నట్టు వేట అనేది తిండికే కాదు, వినోదం కోసం కూడా.

Malakpet Rowdy చెప్పారు...

రాముడు చేసింది జంతువుని చంపడమే. ధర్మ పరిరక్షణ ఏమీ చెయ్యలేదు.

Srinivas చెప్పారు...

@రౌడీ
నా ఉద్దేశం ఈ రెంటినీ విడిగా చూడలేమని. consisTency లోపించిందని.
1. వానరులూ మానవుల్లాగే జీవిస్తారు (వేటాడరు గానీ), వాళ్ళను రామలక్ష్మణులు తోటి మానవులుగానే Treat చేస్తారు, వాళ్ళూ మానవధర్మాలు అతిక్రమించినపుడు శిక్షార్హులే
2. వానరులు జంతువులు గనక చాటునుండి చంపడం న్యాయం
ఈ రెండింట్లో ఒకటే నిజం. అది ఏదన్నదీ స్పష్టమే కానీ భక్తులిప్పటికే ఆగ్రహావస్థలో ఉన్నారు కనక ఇక స్వస్తి!

krishna చెప్పారు...

@ మలక్

>> అన్నట్టు వేట అనేది తిండికే కాదు, వినోదం కోసం కూడా. >>


ఇది ధర్మం కాదు కదా!
రాముడు వినోదం కోసం వాలిని చంపితే.. జీవ హింసని ప్రోత్సహించినట్టు కాదా! మరీ వినోదం కోసం రాముడు వాలిని చంపాడనడం ... మింగుడు పడడం లేదు!

Malakpet Rowdy చెప్పారు...

రాముడు వినోదం కోసం వాలిని చంపితే.. జీవ హింసని ప్రోత్సహించినట్టు కాదా! మరీ వినోదం కోసం రాముడు వాలిని చంపాడనడం ... మింగుడు పడడం లేదు!
_____________________________________

వేట వినోదం కోసం కూడ అన్నాను గాని రాముడు వినోదం కోసం చంపాడనలేదు. Pardon the miscommunication. తనకిష్టమైన జంతువంటే పడని వేరే జంతువుని చంపాడు. మనిషి జంతువుని చంపడం మొన్నీమధ్యదాకా అంగీకారయోగ్యమే.

వేణు చెప్పారు...

మలక్ పేట రౌడీ గారూ!

* రాముడు చేసిందల్లా, తనకిష్టమైన జంతువు పైన దాడి చేసిన మరో జంతువుని చంపడం - మన పెంపుడు కుక్క మీద దాడిచేసిన వీధికుక్కని చంపినట్టు.

* తన పెంపుడు జంతువుపై దాడిచేసిన వేరే జంతువుని మానవుడు చంపడం ఎప్పటినుండో చేస్తున్నదే.

* రాముడు చేసింది జంతువుని చంపడమే. ధర్మ పరిరక్షణ ఏమీ చెయ్యలేదు.

----------------------
మీ ఈ వాదనలకు ఆధారాలేమిటి? ధర్మరక్షణ కోసమే వాలిని చంపానని రాముడు చెప్పినా దాన్ని మీరు అంగీకరించకుండా.. ఈ కొత్త ప్రతిపాదన చేయటానికి ప్రాతిపదిక ఏమిటి? అసలీ ప్రతిపాదన మీకంటే ముందే ఎవరైనా చేశారా?

Malakpet Rowdy చెప్పారు...

consisTency లోపించిందని.
____________________


I agree with you . There is some inconsistency for sure. May be in the original text, may be in the interpretation or may be in our understanding.

As far as I am concerned, I am with #2. I dont agree with the first point

Malakpet Rowdy చెప్పారు...

ధర్మరక్షణ కోసమే వాలిని చంపానని రాముడు చెప్పినా దాన్ని మీరు అంగీకరించకుండా..
_____________________________________

నేను దాన్ని తిరస్కరించలేదే. దాని గురించి వేరే చర్చ జరగాలనేకదా నేనంటొంది.రాముడు చెప్పిన కారణం తప్పు/ఒప్పు కావచ్చు. చంపడం సరి ఐనదే అని ఒప్పుకుంటే కారణం గురించి మాట్లాడచ్చు.

Malakpet Rowdy చెప్పారు...

అసలీ ప్రతిపాదన మీకంటే ముందే ఎవరైనా చేశారా?
__________________________________

విషవృక్షం రంగనాయకమ్మ కన్నా ముందు ఎవరైనా వ్రాశారా?

షాడో చెప్పారు...

>>>తన పెంపుడు జంతువుపై దాడిచేసిన వేరే జంతువుని మానవుడు చంపడం ఎప్పటినుండో చేస్తున్నదే

LOL

అంటే సుగ్రీవుడు రాముడి పెంపుడు జంతువా?

షాడో చెప్పారు...

>>>కోతులని వేటాడడం అనేది ఈనాటికీ జరుగుతునే ఉంది. అన్నట్టు వేట అనేది తిండికే కాదు, వినోదం కోసం కూడా.

ఈ రోజుల్లో వినోదానికి వేటాడితే బొక్కలో తోస్తారు.

Remember Salman Khan

షాడో చెప్పారు...

>>>రాముడు చేసింది జంతువుని చంపడమే. ధర్మ పరిరక్షణ ఏమీ చెయ్యలేదు.

tad vyatiitasya te dharmaat kaama vR^ittasya vaanara |
bhraatR^i bhaaryaa abhimarshe asmin daNDo ayam pratipaaditaH || 4-18-20

Thereby, oh, vanara, this punishment is imposed on you, for your dissolute sinning in abusing your brother's wife, thereby for your transgression of tradition and virtue.

వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ!
‘విషవృక్షం రంగనాయకమ్మ కన్నా ముందు ఎవరైనా వ్రాశారా?’ -
ఇది మీరు సమాచారం కోసం అడగటంలేదని తెలుస్తూనే ఉంది. ‘నా ప్రతిపాదన సరికొత్తది.. గతంలో ఎవరూ ప్రతిపాదించినది కాదు’ అని చెప్పకుండా ఇలా ప్రశ్నరూపంలో సమాధానం చెప్పారన్నమాట. సరే!

ఏ వాదనకైనా, రచనకైనా ఒక ప్రాతిపదిక, నేపథ్యం ఉంటాయి; విషవృక్షం రచన నేపథ్యం మీకు తెలిసివుండొచ్చు కానీ, తెలియని వాళ్ళకోసం రాస్తున్నా.

రేడియోలో శూర్పణఖ ఘట్టం హరికథగా వచ్చినపుడు విన్న కుటుంబరావు, గాంధీ అనే రచయితలు విమర్శనాత్మకంగా ‘శూర్పణఖ’ పేరుతో ఓ కథ రాశారు. ఆ కథ రంగనాయకమ్మ గారి అభిప్రాయం కోసం వచ్చినపుడు అసలు కథ కోసం, పాత్రలను అర్థం చేసుకోవటం కోసం ఆమె వాల్మీకి రామాయణాన్ని బాలకాండ నుంచి చివరిదాకా చదివారు. 1974-76ల మధ్య వచ్చిన ‘రామాయణ విషవృక్షం’ రాయటానికి ఇదీ నేపథ్యం!

Malakpet Rowdy చెప్పారు...

అంటే సుగ్రీవుడు రాముడి పెంపుడు జంతువా?
_______________________________

అనే కదా నేను అన్నది.


_______________________________


ఈ రోజుల్లో వినోదానికి వేటాడితే బొక్కలో తోస్తారు.

Remember Salman Khan


___________________________________

Thats because he hunted endangered species (Blackbucks) and again this is limited to a few countries


About the reason given by Rama, I said it could be right or wrong. I said my understanding is that he just killed Vali. No Dharmaparirakshana here.

Malakpet Rowdy చెప్పారు...

1974-76ల మధ్య వచ్చిన ‘రామాయణ విషవృక్షం’ రాయటానికి ఇదీ నేపథ్యం!
_____________________________________

"మీకన్నా ముందు ఎవరూ ప్రతిపాదించలేదు కాబట్టీ మీరు చెప్పింది తప్పు" అంటూ మీరు అంతర్లీనంగా అన్నదానికి సమాధానం నా ప్రశ్న.


(BTW విషవృక్షం ఆవిడకన్నా ముందు ఎవరూ రాయలేదని ఒప్పుకున్నట్టేగా?)

ఇక నా ప్రతిపదనకి నేపధ్యం, ఒక యాహూ గుంపులో జరిగిన చర్చ ఫలితంగా అక్కడక్కడ నేను చదివిన వాల్మీకి రామాయణం.

వేణు చెప్పారు...

మలక్ పేట్ రౌడీ గారూ!

"మీకన్నా ముందు ఎవరూ ప్రతిపాదించలేదు కాబట్టీ మీరు చెప్పింది తప్పు" అంటూ మీరు అంతర్లీనంగా అన్నదానికి సమాధానం నా ప్రశ్న.
-----------------------------------
‘గతంలోనే ఉన్న ప్రతిపాదనను మీరు సమర్థిస్తున్నారా? లేక కొత్తగా ప్రతిపాదిస్తున్నారా?’ అని తెలుసుకోవడమే నా ఆంతర్యం. మీరు ఊహిస్తున్నట్టు అంతర్లీనంగా నేనన్నది గానీ, అనుకున్నది గానీ ఏమీ లేదు.
‘మీకన్నా ముందు ఎవరూ ప్రతిపాదించలేదు కాబట్టి మీరు చెప్పింది తప్పు’ అనే అభిప్రాయం ... అది ఎవరికి ఉన్నా- సహేతుకం కాదని నా అభిప్రాయం.

Malakpet Rowdy చెప్పారు...

oops, I got it wrong then, sorry bout that

వేణు చెప్పారు...

‘విషవృక్షం’నేపథ్యం గురించి నా వ్యాఖ్యలో రాసింది అసంపూర్తి సమాచారమే. ‘మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే, ఈ ‘విషవృక్షం’ ఉండేది కాదు’ అంటారు రంగనాయకమ్మ.
ఈ నేపథ్యం పూర్తి వివరాలను ‘రామాయణ విషవృక్షం’ తాజా ఎడిషన్ (మూడు భాగాలూ కలిపిన సంపుటి) 86-88 పేజీల్లో చూడొచ్చు.

వేణు చెప్పారు...

సో... అదండీ సంగతి!

‘నా హీరోలు.. వాలీ, కర్ణుడూ’ అంటూ రాసిన టపాకు ఇంతగా స్పందించిన వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. బ్లాగుల్లోని మిగిలిన చర్చలతో పోలిస్తే ఇది ‘దాదాపు’ఆరోగ్యకరంగానే సాగింది. కొద్ది వ్యాఖ్యల్లో మాత్రం కొందరు సంయమనం కోల్పోయారని అనిపించింది. అయినా ఏ ఒక్క వ్యాఖ్యనూ రిజెక్ట్ చేయకుండా ‘ప్రజాస్వామ్య’ పద్ధతినే పాటించాను!

టపాలో రాసింది అధిక భాగం కర్ణుడి గురించే. కానీ 90 శాతం చర్చంతా వాలి చుట్టూనే తిరిగింది.:)

ఈ టపా తర్వాత .. కొన్ని ఇతర బ్లాగుల్లో వేరే రూపాల్లో ఈ సబ్జెక్టుపై చర్చలు మొదలవటం కూడా ప్రస్తావనార్హం. Once again thank u one and all!

krishna చెప్పారు...

బాగుందండి వేణు గారు! మంచి చర్చ మీ వలన చూడగలిగాము. అభినందనలు. వాల్మీకం గాని, విషవృక్షం గాని నేను చదవలేదు కనుక నాకు ఇక్కడ జరిగిన చర్చ చాలా విషయాలని తెలిపింది.
రామాయణానికి authentic అనువాదం ఏది చెబుతారా కొంచెం ?
ఇక మార్క్సిజం విషయానికి వస్తే.. గత కొన్ని నెలలుగా రంగనాయకమ్మ గారి బలి పీఠం , స్వీట్ హోం , జానకి విముక్తి , కొ.కు. గారి కధల సంపుటి చదివాను.విష వృక్షం సైజు చూసి భయమేసింది. కానీ ఈ చర్చ చూసాక తప్పక చదువుతాను. మార్క్సిజం గురించి తెలుసుకోవాలన్న అభిలాష చాలా వుంది.కాపిటల్ చదవదగ్గంత సులభంగా వుంటుందా? ఇంకా ఏవన్నా మంచి పుస్తకాలు వుంటే చెబుతారా దయ చేసి!

Unknown చెప్పారు...

@krishna
వాల్మీకం గాని, విషవృక్షం గాని నేను చదవలేదు కనుక...
-------------------------------------------------

క్రిష్ణ గారూ - మీరు కేవలం రామయణం చదవలేదనే అర్ధంతో ఇది రాసి ఉండచ్చు గానీ, విషవృక్షం చదవని చాలా మందికి అదేదో వాల్మీకి రామాయణానికి భిన్నమైన కధని చెపుతుందనే పొరపాటు అభిప్రాయం ఉంది. విషవృక్షం పూర్తిగా వాల్మీకి రామాయణం కధనే తిరిగి చెపుతుంది. అయితే తేడా అల్లా వాల్మీకి రామాయణంలో "నీతిపరుడూ, పెద్దలంటే గౌరవం ఉన్న వాడూ, సత్య సంధుడూ" అని రామ భక్తితో రాసినదయితే, విషవృక్షం ఇటువంటి pre-conceived opinions తో కాక, ప్రతీ సందర్భంలోనూ రాముడిని గానీ ఇతర పాత్రలని గానీ కేవలం వాళ్ళ ప్రవర్తన మీద మాత్రమే అధారపడి జడ్జ్ చేస్తుంది. రాక్షసులనే species కానీ, గంధర్వులనే species గానీ ఈ భూమి మీద ఎప్పుడూ ఎగ్జిస్ట్ కాలేదు గనుక, రాక్షసులు by definition దుష్టులనే అభిప్రాయాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళు కేవలం వేరే జాతికి చెందిన మనుషులనే అవగాహనతో, కేవలం వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి మాత్రమే వాళ్ళని జడ్జ్ చేస్తుంది.

lalithag చెప్పారు...

రామాయణ మహాభారతాలు ధర్మశాస్త్రాలుగా, అందులో కొన్ని పాత్రలు దేవుళ్ళుగా అనుకుని ఆలోచించడం వల్ల మనం పాత్రలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాము అనిపిస్తుంది. అదే విధంగా, అలా ధర్మశాస్త్రాలూ, దేవుళ్ళు అనే ఆచారాన్ని పూర్తిగా వ్యతిరేకించడమూ పాత్రలకు న్యాయం చెయ్యదు.

వాలి విషయంలో ఒక established ధర్మం ప్రకారం అన్యాయమేమో కానీ, నాకెప్పుడూ అన్యాయం అనిపించలేదు.
సుగ్రీవుడు అన్న చెప్పిన ప్రకారమే ఫలానా సమయానికి అతను తిరిగి రాక పోవడం వల్లో, లేక గుహ ద్వారం మూసి ఉన్న రాయి కింద నుంచి రక్త ప్రవాహం కనిపించడంతో అన్న యుద్ధంలో ఓడిపోయి మరణించాడనో (లేక రెండూ కారణాలేనో) భయపడి పారిపోయి అన్న లేడు కనక తను రాజౌతాడు. ఇది నేను చిన్నప్పుడు రామాయణ పారాయణం గుళ్ళో పండితులు వాల్మీకి రామాయణం చదివి చెప్తుంటే విన్న కథ. అపార్థం వల్ల వాలి తమ్ముడిని రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు. ముందే బలవంతుడు, ఎదుటి వారి శక్తిలో సగం గ్రహించే వరమున్న వాడూ ఐన వాలి గురించి భయపడుతూ బిక్కు బిక్కుమంటుంటాడు సుగ్రీవుడు. అపార్థం చేసుకుని తమ్ముడిని వెళ్ళగొట్టాడడు కనుక, ఎదుటి వారి శక్తిని గ్రహిస్తాడు కనుక, చాటుగా బాణం వెయ్యడం reasonable గా అనిపించింది.
అసలు కష్టం అనిపించే పనులు సీతను అగ్ని ప్రవేశం చెయ్యమనడం, ఆమెని అడవులకి పంపడం, శంభుకుణ్ణి వధించడం. వీటికి చెప్పే కారణాలు చిన్నప్పుడు బాధ కలిగించినా సమాధానపడిపోయాను కానీ, ఇప్పుడూ ఆ కారణాలు సరిగా ఎవరూ అర్థం చేసుకోలేదనే అనిపిస్తుంది. ఇంకా అవి తప్పు అనీ అనలేకపోతున్నాను పూర్తి నమ్మకంతో. ఎందుకంటే శ్రీరాముడి పాత్ర అందరి పట్లా ఎంతో అనురాగం కలిగిన పాత్ర.
రామాయణ మహాభారతాలలో నాయకుల పాత్రలే కాక ప్రతినాయకుల పాత్రలూ చాలా శ్రద్ధతో తీర్చబడినవి. అవి అంత శ్రద్ధగానూ అందజేయబడకపోవడం వల్ల, కేవలం black and white గా వాడుకోవడం వల్లా మనం చాలా miss అయిపోతున్నాము. అయినా, రామాయణంలో కాని, మహాభారతంలో కానీ, గెలిచిన వారు మాత్రం ఏం సుఖపడ్డారు కనుక?
ప్రతినాయకుడు నాయకుడితో సాటి, లేదా అంతకన్నా మేటి యుద్ధ విద్యలలో. అయినా నాయకుడి బలం అతను నమ్ముకున్న విలువలు. ప్రతినాయకుల పాత్రలు తేలిపోయినట్లైతే నాయకుడి విజయమూ గొప్పది అవ్వదు కదా?
కర్ణుడి విషయంలో జాలి వెయ్యక మానదు. ఎంత చెడ్డా, అతనూ కుంతీ పుత్రుడే, సూర్యుడికి పుట్టినవాడు కూడాను. అందువల్ల పాండవులకి ఆపాదించబడిన మంచితనం ఇతనికీ కాస్త అంటుకుంటుంది.
కర్ణుడి చావుకి కారణాలు స్వయంగా శ్రీకృష్ణుడే అనుకుంటాను, వివరిస్తాడు. అప్పుడు ఎలాంటి వారికీ బాధ వెయ్యక మానదు. ఐనా జాలి వేసినంత మాత్రాన ఆ పాత్ర చేఇన పనులు సమర్థనీయం కాదు అని తెలుసుకో గలగాలి. అలాగే, అన్నీ ఉన్న దుర్యోధనుడికే అసూయ ఉండగా లేనిది, కర్ణుడికి ఇంకెంతగా అభద్రతా భావం ఉండాలి? అదీ గ్రహించుకోవాలి. అయినప్పటికీ అతను చేసిన చెడు పనులు సమర్థనీయం కావు అని తెలుసుకోవాలి. పాత్రలు ఎన్నుకున్న మార్గాల మీద వాళ్ళ జీవితాలు నడిచాయి, మళ్ళీ ఒక్క కర్ణుడి పాత్ర తప్ప. అతని ఎంపికని నిర్దేశించే కారణాలే అతని చేతులలో కాక ఇంకెవరి చేతులలోనో ఉన్నాయి. కాక పోతే అతని పాత్ర ద్వారా తర్వాతి తరాల వారికి ఏమి చెయ్యకూడదో తెలియజేయడానికి అవకాశం ఏర్పడింది అనుకోవచ్చు. ఒక్కో సారి ఎలా మనచేతులలో లేని కారణాలు మన జీవితాలని నిర్దేసించవచ్చో తెలియజేయడం జరిగింది, మనకు హెచ్చరికగా ఉపయోగపడుతుంది కర్ణుడి పాత్ర.
నా ఆలోచనలు నేను సవరించుకునేందుకు ఈ విషయం మీద వ్యాఖ్య రాయాలనిపించింది. అది టపా పరిమాణంలో తయారయ్యింది. ఈ వ్యాఖ్య నా అభిప్రాయం, ఇప్పటి వరకూ నాకు అర్థమయ్యిన, ఆలోచింపచేసిన వాటిని బట్టి. వాదన నా ఉద్దేశం కాదు.

వేణు చెప్పారు...

కృష్ణ గారూ! థాంక్యూ. మీరడిగిన ప్రశ్నలు..

* వాల్మీకి రామాయణానికి అథెంటిక్ అనువాదం ఏదని కదా! తెలుగులో వావిళ్ళ రామశాస్త్రులు అండ్ కంపెనీ (చెన్నపురి) సంస్థ ప్రచురణ రంగంలో ప్రామాణికతకు పేరు. ఒక్క అక్షరదోషం కూడా దొర్లనంత కచ్చితత్వం ఉంటుందని ప్రతీతి. ఆ సంస్థ చదలవాడ సుందరరామశాస్త్రులు గారితో అనువదింపజేసిన రామాయణాన్ని ప్రామాణికంగా భావించవచ్చు. రంగనాయకమ్మ గారు తన పరిశీలనకు ఎంచుకున్న రామాయణాల్లో ఇదీ ఒకటి.
దాదాపు వందేళ్ళ క్రితం ప్రచురించిన ఈ పుస్తకం మీకు గ్రంథాలయాల్లో తప్ప అందుబాటులో ఉండదు.

*‘విషవృక్షం’సైజు చూసి భయమేసిందా? భలేవారే. ఆలోచనాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చదివేటప్పుడు సైజు గురించి ఆలోచన రాదులెండి.

* ‘మార్క్సిజం గురించి తెలుసుకోవాలన్న అభిలాష చాలా ఉంది’అంటున్నారు మీరే. అలాంటపుడు ‘కాపిటల్’ సులభంగా ఉంటుందా లేదా ప్రశ్న రాకూడదు కదా? నా అనుభవం ప్రకారం తెలుగులో రంగనాయకమ్మ గారు చేసిన ‘కాపిటల్ పరిచయం’ చాలా సరళంగా ఉంది. చాలావరకూ ఆసక్తికరంగానూ ఉంది. అది చదివితే తర్వాత మీకు ఇంగ్లిష్ మూలం తేలిగ్గా అర్థమవుతుంది.

* ‘ఇంకా ఏవన్నా మంచి పుస్తకాలు ఉంటే చెబుతారా’ అని అడిగారు. ‘మంచి పుస్తకాలు ఇవీ’ అంటూ ఇతరులు ఓ జాబితాను సిఫార్సు చేయటంలో నాకు అర్థం కనిపించదు. మన అభిరుచులూ, దృక్పథమే మనకిష్టమైన పుస్తకాలేమిటో తెలిసేలా, తెలుసుకునేలా చేస్తాయి. అయితే- భావసారూప్యత ఉన్నవారు మాత్రం ఒకరికొకరు ‘ఫలానా పుస్తకం చదవండి’ అంటూ సూచించుకోవటంలో ఔచిత్యం ఉంటుంది. మరి మనిద్దరికీ భావ సారూప్యత ఉందా? :-)

వేణు చెప్పారు...

lalithag గారూ!
అపార్థం చేసుకుని తమ్ముడిని వెళ్ళగొట్టాడు కనుక, ఎదుటి వారి శక్తిని గ్రహిస్తాడు కనుక, చాటుగా బాణం వెయ్యడం reasonable గా అనిపించింది.
--------------------
అపార్థం చేసుకుని తమ్ముడిని వెళ్ళగొడితే.. ఆ అపార్థాన్ని తొలగించే ప్రయత్నం జరిగిందా?
‘ఎదుటికి వస్తే ఇబ్బంది కాబట్టి’ అనే కారణం వల్ల చాటుగా బాణం వెయ్యడం సమర్థనీయం అవుతుందా?

సీతను అడవులకు పంపటం, శంబుకుణ్ణి వధించటం బాధ కలిగించాయంటూనే ‘శ్రీరాముడి పాత్ర అందరి పట్లా ఎంతో అనురాగం కలిగిన పాత్ర’ కాబట్టి సమాధానపడిపోయానని అంటున్నారు. పాత్రల ‘చర్యల’ వల్ల ఆ పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ‘పాత్రల స్వభావం ఫలానా’అని నిర్థారించుకుని దానికనుగుణంగా ఆ పాత్రల ‘చర్యల’ను అర్థం చేసుకుంటామా?

కర్ణుడి విషయంలో మీ భావాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. అన్నట్టు- వాలికి జరిగింది మీకు అన్యాయం అనిపించలేదు; కర్ణుడి మీద మాత్రం జాలి ఏర్పడింది! కారణం-‘ఎంత చెడ్డా, అతనూ కుంతీ పుత్రుడే, సూర్యుడికి పుట్టినవాడు కూడాను’ కాబట్టేనా? ఇతర కారణాలతోనా?

krishna చెప్పారు...

@ వేణు గారు,
>> ‘మార్క్సిజం గురించి తెలుసుకోవాలన్న అభిలాష చాలా ఉంది’అంటున్నారు మీరే. అలాంటపుడు ‘కాపిటల్’ సులభంగా ఉంటుందా లేదా ప్రశ్న రాకూడదు కదా? >>
నేను రిచర్డ్ డాకిన్స్ గారి ' ఇన్ గాడ్ డైల్యూసన్ ' అన్న పుస్తకం ముందు తెలుగు లో చదివి తరువాత ఇంగ్లీషులో చదివాను లెండీ. ఆ అనుభవం వలన అలా అడిగాను. అది కాకుండా అసలు సిద్ధాంతానికి వివరణ ఇచ్చే ప్రయత్నంలో సిద్ధాంత విరుద్ధమైన సంగతులు ఏమన్నా వుండోచ్చేమో అని అనుమానం :)

>> మరి మనిద్దరికీ భావ సారూప్యత ఉందా? :-) >>
ఆ విషయంలో మీకు ఒక అంచనా రావలనే నేను గత ఆరు నెలలు గా చదువుతున్న పుస్తకాల వివరాలు ఇచ్చాను అండి :)
నా వరకు నేను ఒకరు చెప్పారని కొన్ని అభిప్రాయాలకి బానిస అవ్వను. అసలు నా అభిప్రాయాలు కూడా కరెక్టా కాదా అని తరచి చూసుకుంటాను. తర్క బద్ధంగా ఆలోచించే వారి రచనలు చదవడం నాకు ఇష్టం! మీరు కూడా రంగ నాయకమ్మ గారి రచనలు చాలా చదివారు అని అనిపించి......

అయినా ఇప్పుడు పుస్తకాలు చదివే మిత్రులు ఎక్కడ దొరుకుతారు! మీకు నచ్చిన పుస్తకాలుని బట్టి మీ అభిరుచిని ఒక అంచనా చేస్తాను లెండీ :)

krishna చెప్పారు...

@ Ravi గారు,
ముందుగా మీ వాదనా పటిమ బాగుందండి! నేను విషవృక్షం చదువుదామన్న ఉద్దేశ్యం తోనె వున్నా , ఆల్రెడీ ఇటువంటి విమర్శలు విని వున్నాము కదా ! ఇంకా కొత్తగా ఏమి వుంటుందిలే అని ఇన్నాళ్లు చదవలేదు! ఇప్పుడు తప్పక చదవుతాను !

కానీ ఒక విషయం .. రంగ నాయకమ్మ గారి రచనలు నాకు నచ్చినా ఆవిడ అన్ని అభిప్రాయాలతో నేను ఏకీభవించను. ఆవిడ రచనలు చదివాక కూడా ఇంకా ఎవరివో ( అది రంగ నాయకమ్మ గారు కూడా కావచ్చు ) అభిప్రాయాలని మనవి చేసుకోవడం కాకుండా తర్క బద్ధంగా ఆలోచించాలి అని నా ఉద్దేశ్యం!

ఆవిడ రాసిన బలిపీఠం పై ఒక సమీక్ష రాసాను. ఇంకా స్వీట్ హోం పైన , జానకి విముక్తి పైన నా ఆలోచనలు అక్షరబద్ధం చేయాలి. చాలా విషయాలలో ఆవిడ అభిప్రాయాలతో నేను అంగీకరించినా .. పెళ్లి , స్త్రీ పురుష సమానత్వం, శ్రమ విభజన, మార్క్సిజం వలన సమ సమాజం వగైరా విషయాలలో కొంత విభేదిస్తాను.

lalithag చెప్పారు...

ఈ ఒక్క వ్యాఖ్య తర్వాత నేను విరమించుకుంటాను.
నేను ఏ నిర్ధారణకీ వచ్చెయ్యలేదు.
ఇప్పటి వరకూ అర్థమైనది రాశాను.
ఈ పాత్రల గురించి బహుశా జీవితాంతమూ ఆలోచిస్తూనే ఉంటాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
ఎప్పటికైనా మూలం నేను చదవగలనేమో చూద్దాము.
చదివినంత మాత్రానా సరిపోదు.
ఆంగ్ల పుస్తకాలే అందుకు సాక్షి.
నాకు ఒక టీచరు చెప్పేంతవరకూ ఒక ఆంగ్ల నవలనే సరిగా అర్థం చేసుకోలేకపోయాను.
ఆ తర్వాతనుంచీ ఎంత చిన్న కథనైనా "అర్థం చేసేసుకోవడానికి" జంకుతుంటాను.
కనీసం జంకే ప్రయత్నమైనా చేస్తాను.
ఇక "చిన్నప్పుడు సమాధానపడిపోయాను" అని చెప్పాను.
ఇప్పుడు సమాధానపడక పోయినా, కారణం సరిగా అర్థం చేసుకోవట్లేదు, అందరూ సమర్థంచడమో, లేదా వ్యతిరేకించడమో మాత్రమే చేస్తున్నాము అని అనిపిస్తుంది. రాముడి వంటి అనురాగ మూర్తి ఈ పనులకు ఏ కారణాలు చెప్పుకుని ఉంటాడు అని ఆలోచించాలి అనిపిస్తుంది.
కారణాలేవైనా, చర్య మాత్రం బాధాకరం. అదీ నా మాటల్లోని సారాంశం.
"ఎంత చెడ్డా, అతనూ కుంతీ పుత్రుడే, సూర్యుడికి పుట్టినవాడు కూడాను. అందువల్ల పాండవులకి ఆపాదించబడిన మంచితనం ఇతనికీ కాస్త అంటుకుంటుంది."
వ్యాఖ్య పెద్దదై నేను ఇది పూర్తిగా చెప్పలేదనుకుంటాను. black and white గా పాండవులు మంచి, కౌరవులు చెడు అని నిర్ణయించే వారిక్కూడా కర్ణుడు grey area లో మిగిలిపోతాడు అని అనుకుంటాను నేను చెప్పదల్చుకున్నది.
నేను చిన్నప్పుడు విన్నదంతా ఇప్పుడు ఇక్కడ రాయలేను, ఇప్పటికి వివరాలు చాలా మర్చిపోయి ఉంటాను.
కాకుంటే నా మీద అప్పుడు పడిన ముద్ర ఎలాంటిదంటే వాలి అన్యాయం చేశాడు. న్యాయంగా యుద్ధంలో అతనిని గెలవడం సాధ్యం కాదు. అందువల్ల అన్యాయాన్ని అలా చెట్టు చాటునుంచి ఎదుర్కున్నాడు అని మాత్రమే. దాని గురించి ప్రశ్నే ఇప్పటివరకూ నా mindలో ఉదయించలేదు అని. ఇప్పుడేమైనా ఆలోచిస్తానేమో అని నేను చెప్పదల్చుకున్నాను.

Praveen Mandangi చెప్పారు...

మీకు మార్క్సిజం గురించి తెలిసినది చాలా తక్కువ అని మీ మాటలలోనే చెపుతున్నారు. కాపిటల్ గ్రంథంతో పాటు ఎంగెల్స్ వ్రాసిన చారిత్రక భౌతికవాద రచనలు కూడా చదివితే వ్యవస్థ యొక్క పరిణామం గురించి బాగా అర్థమవుతుంది.

Vinay Datta చెప్పారు...

Venu garu,

Krishnasree garu need not explain anything to Ranganayakamma garu now. Several years back scholars of her own generation had debates with her on several platforms and proved that she 'is' wrong. I heard that she agreed that she 'was' wrong. Actually her book should have been banned but it is not our Indian cultureto ban a book. But a gap of so many years and the diversion of people towards english studies have made her (dare) print her book once again.

వేణు చెప్పారు...

మాధురి గారూ !

మీ వ్యాఖ్యలో అస్పష్టతా, అపోహలూ, అవాస్తవాలూ కనిపిస్తున్నాయి.

‘కృష్ణశ్రీ గారు ఇప్పుడు రంగనాయకమ్మ గారికి ఏమీ వివరించనక్కర్లేదు’ అంటున్నారు మీరు. నేనన్నమాట ‘వివరించటం’ కాదు; ‘సాధికారికంగా సమాధానం చెప్పటం’. అయినా కృష్ణశ్రీ గారేమో తన వ్యాఖ్యలో ‘రంగనాయకమ్మ గారితో నూటికి నూరు పాళ్లూ ఏకీభవిస్తాను నేను!’ అనేశారు. మీరు చూళ్ళేదా?

ఇక మీ వ్యాఖ్యలో మరో విషయం... కొన్నేళ్ళ క్రితం పండితులు ఎన్నో వేదికల మీద చర్చించి విషవృక్షం విషయంలో ఆమె తప్పని తేల్చారంటున్నారు.
కొన్నేళ్ళ క్రితం అంటే.. ఏయే సంవత్సరాల్లో? ఎవరా పండితులు? ఏ వేదికల మీద?

అన్నిటికంటే ఘోరమైన సంగతి.. ఒక పక్క.. విషవృక్షం విషయంలో సాధికారికంగా ఆమెకు సమాధానం చెప్పినవారే లేరంటుంటే (అది సాధ్యం కాదు లెండి) ‘తాను పొరపాటని ఆమె ఒప్పుకున్నారని విన్నానని’ మీరు రాయటం. ఆమే పొరపాటని ఒప్పుకున్నారంటే ఇక పేచీ ఉండదు కదా అని అక్కసుతో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు సాగిస్తుంటారు కొందరు. విన్న ప్రతి ముక్కా నిజమై పోదని గుర్తించండి!

ఈ పుస్తక పున :ప్రచురణకు ఆమె ఎలా ‘ధైర్యం’చేశారో మీరు సూత్రీకరించిన విషయం మీ ‘సాహసాన్ని’ తెలుపుతోంది. వాస్తవాలు తెలియకుండా రాసే సాహసాన్ని! విషవృక్షం తొలి భాగం 1974లో వచ్చి, 7 ముద్రణలు పొందింది. 75 వచ్చిన రెండో భాగం 6 ముద్రణలూ, 76లో వచ్చిన మూడో భాగం 4 ముద్రణలూ పొందాయి. 12 ఏళ్ళ క్రితం మొదటి భాగం 7వ ముద్రణ వచ్చింది. అన్ని భాగాలూ కలిపిన సంపుటం ఐదేళ్ళ క్రితం 2005లో వచ్చింది. అంటే 36 సంవత్సరాలుగా ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులోనే ఉంటూ వస్తోంది.

అసలీ పుస్తకం ఇంగ్లిష్ లోకి అనువాదం అయిందని మీకు తెలిసివుండదు!

A K Sastry చెప్పారు...

డియర్ madhuri!

చాలా కాలం తరవాత నాపేరు మీ వ్యాఖ్యలో చోటు చేసుకొంది. నేను రంగనాయకమ్మగారికి ఎక్స్ ప్లెయిన్ చెయ్యడమేమిటో నాకర్థం కాలేదు.

మిగిలనవాటికి వేణు సమాధానం ఇచ్చాడు కదా.

ఇక బుక్స్ బేన్ చెయ్యడం ఇండియన్ కల్చర్ కాదంటున్నారు.......మన ప్రభుత్వం యెన్ని బుక్స్ బేన్ చేసిందో మీకు తెలుసా?

ఈ వాలి సుగ్రీవుల గోల గురించి నా క్రింది టపా చదవండి.

http://krishnasree.blogspot.com/2010/07/blog-post_30.html

ధన్యవాదాలు.

Narsimha Kammadanam చెప్పారు...

అలా పుట్టి చావు లేకుండా ఎన్నాళ్ళని బతుకీడుస్తవ్ (ఛస్తావని) రాముడు వాలి ని చంపాడు,లేకుంటే శత్రువు బలాన్ని మొత్తం లాగేసుకునే వాలిని చంపటం ఎవరి వల్ల కాదు అలా ఇప్పటికే బ్రతికుండే వారు (ఉంటే తప్పకుండ "రామయణ విషవృక్షం" అనె పుస్తకం విడుదల అయ్యేది కాదు,మొదలెట్టగానే వచ్చి లెఫ్ట్ & రైట్ ఇచ్చే వాడు ఎందుకంటే స్వహతాగా వాలి కి రాముడంటే అభిమానమే చచ్చే ముందు ఈ అభిప్రయం వ్యక్త పరుస్తాడు కూడా)(హనుమతుడు చిరంజీవే కదా మరెందుకు లెఫ్ట్ & రైట్ ఇవ్వలేదు అని అడిగితే "హనుమ సాఫ్ట్ తనకి భక్తి మత్రమే మంచి మాత్రమే తెలుసు కాని వాలికి అన్నీ తెలుసు అంటే మంచీ,చెడు అని అర్థం కనుక లెఫ్ట్ & రైట్ ఇచ్చేవాడు).పుట్టిన వాడు చా..వాలి,చచ్చిన వాడు మళ్ళీ కర్మానుసరం పుట్టాఅలి ఇది సృష్టి ధర్మం ఋఆమవతారం ధర్మాన్ని నిలుపుటకు,పుణ్యం చేసినా చావాలి,పాపం చేసినా చావాలి,పాత బట్టలు వదిలి కొత్తబట్టలు వేసుకో ..వాలి.అందుకే ఈ ఘట్టాం.

ఇహ భారతం లో పుట్టినప్పటి నుండి ...అంటే ఆ జన్మ వౄత్తామంతమే అంత,దాన్ని విశదీకరించి,విపులీకరించినా ఆ సఫ్ట్ కార్నెర్ పోదు అంత గా దాణ వీర శూర కర్న మూవీ ప్రభవం మన ఆంధృల ఉంది.కర్నుడు పూర్వ జన్మలో తపస్సు చేసి నర నరాయణుల చేత 1000 సార్లు చావలి అని శశ్వతంగా జీవించటానికి తింగరి కోరిక కోరడాం అలా 99 వ చావు భరతం లో అయింది.కాని ఈ పాత్ర తో చాల నీతులు వివరించటం జరిగింది కనుక కర్ణుడికి ఎం అన్Yఆయం జరగలేదు.

వేణు చెప్పారు...

@ Narsimha : వాలి బతికుంటే ‘రామాయణ విషవృక్షం’ పుస్తకం విడుదలయ్యేది కాదన్నమాట! ఈ వాలికి మీ ప్రకారం ‘అన్నీ తెలుసు’. కానీ పాపం, తనను పదునైన తర్కంతో సమర్థిస్తూ రాసిన రచయిత్రికే ‘ లెఫ్ట్ & రైట్ ఇచ్చే’ వాడయితే పాపం, ఇంకేం తెలివిపరుడు?

నిజమే! పుట్టిన జీవులు చనిపోవలసిందే. దీనికి అతడి పుణ్య పాపాలతో నిమిత్తం లేదు. ఇది నిఖార్సయిన ప్రకృతి ధర్మం. ఇక ‘చిరంజీవులు’ అంటూ ఎవరైనా ఉండటానికి ఆస్కారమెక్కడ? ఇతిహాసాల్లో, పురాణాల్లో అలాంటి కల్పనలను వాస్తవికంగా అర్థం చేసుకుంటే చాలా చిక్కులొస్తాయి.

కర్ణుడికి అన్యాయం జరగలేదంటూ మీరు చేసిన వాదన స్పష్టంగా అర్థం కావటం లేదు!

dhupam abhi చెప్పారు...

ఈ చర్చనంతా గమనించిన తరువాత నాకు కూడా స్పందించాలనిపించింది.
వానరులు గిరిజనులు. ఆటవికులు ఇప్పటికీ గిరిజన జాతులలో అన్న భార్యను అర్ధ భార్యగా భావించే జాతులు వున్నాయి. గిరిజన కట్టుబాట్ల ప్రకారం అన్న మృతి చెందితే అతడి బాధ్యతలను తమ్ముడు స్వీకరించాల్సి వుంటుంది. దీనిలో భాగంగానే గుహలో వాలి మరణించాడని భావించిన సుగ్రీవుడు ధర్మం(తమ ఆచారం) ప్రకారం అన్న రాజ్యాన్ని, ఆయన భార్య తారను చేపట్టాడు, అది అందరూ ఆమోదించాల్సిన అంశం. ఇక్కడ సుగ్రీవుడు అప్పటి పరిస్థితుల్లో అన్న చనిపోయాడని భావించాడే తప్ప అన్నకు ద్రోహం చేయాలని అనుకోలేదు. ఇక్కడ సుగ్రీవుడి వుద్దేశాలు విస్పష్టం. గుహను మూసివేయడం లో కూడా రాక్షసుడిని నిరోధించడానికే తప్ప అన్నను ఇబ్బంది పెట్టడానికి కాదు.
గుహలోనుండి బయటపడిన వాలి పెద్దవాడిగా తన హుందాతనాన్ని కాపాడుకో లేదు. తాను పొరపడ్డానని తమ్ముడు ఎంతమొరపెట్టుకున్నా తన అహంకారం తో బలగర్వం తో వ్యవహరించాడే తప్ప వయసులో పెద్దవాడుగా, రాజు స్థానం లో వుండికూడా విచక్షణారహితంగా వ్యవహరించాడు. ఈర్ష్యాద్వేషాలతో రాజు లాగా వ్యవహరించకుండా అతి సామాన్యుడిలా వ్యవహరించాడు. గిరిజన తెగల ఆచారం ప్రకారం సోదరుడు జీవించివుండగా అతడి భార్యను పొందడం ఆమెను చెరబట్టడమే అవుతుంది. ఇలా సామాన్యుడు చేస్తే రాజు దండించాలి. మరి రాజే అన్యాయం చేస్తే ఆ రాజు రాజ్యాధికారానికి అర్హుడవుతాడా? ఇక్కడ వాలి పెద్దతరహాగా ఆలోచించి వుండాల్సింది. కానీ ఈర్ష్యా, ద్వేషాలతో విచక్షణ కోల్పోయాడు. ఏ పరిస్థితి లో తమ్ముడు తన భార్యను చేపట్టాడనే ఆలోచనకూడా చేయలేదు. తనలోని అహంకారం తో బలహీనుడైన తమ్ముని భార్యను చెరబట్టాడు. ఇది నూటికి నూరుశాతం అన్యాయం. వాలి బలవంతుడు కావడం వల్ల ఇతడిని ఎవరూ ఎదిరించలేకపోయారు.
ఇక రాముని విషయానికి వస్తే రాముడు ఒక మహావీరుడు ధర్మం, న్యాయం పట్ల విచక్షణ వున్న వ్యక్తి. ధర్మాత్ముడెప్పుడూ కూడా అధర్మపరుడిని ఆశ్రయించడు. సుగ్రీవుడు తనగురించి తాను అబద్దాలు చెప్పి సానుభూతి పొందడానికి ప్రయత్నించివుండవచ్చు, కానీ వాలి సుగ్రీవుని భార్య రుమను చెరబట్టిన వాస్తవం కళ్ళెదుట కనిపిస్తోంది.

ఇక బలవంతుడిని అశ్రయిస్తే రాముడు శరణార్థి అవుతాడే కానీ తాను వీరుడని అనిపించుకోడు. సామాన్యుడు, దుర్భలుడు బలవంతుడిని ఆశ్రయిస్తాడు. వీరుడెప్పుడూ బలవంతుడిని ఆశ్రయించడు. నిజమైన క్షత్రియుడు ఎవరినీ సహాయం అర్థించడు. వాలిని చంపిన అనంతరం సుగ్రీవుని నుండి ఆశించింది ప్రత్యుపకారమే తప్ప సహాయం కాదు. రాముడు సుగ్రీవుడిని కాకుండా నేరుగా వాలి వద్దకే వెళ్ళి నా భార్యను వెతికిపెట్టు అంటే వెతికిపెట్టేవాడా??? నేనెందుకు చేయాలి అనివుండేవాడు. కాదంటారా??? ఎంతటివాడినైనా ఓడించగలిగిన వాలి రాముడిని లెక్క చేసివుండేవాడేకాదు. అందుకే రాముడు తన సహాయం అవసరం వున్న సుగ్రీవునితో జట్టుకట్టాడు. వాలి కుమారుడు అంగదుడిని యువరాజుని చేశాడు. ఆనాటి చట్టాల ప్రకారం రాముడు వాలిని చంపడం తప్పయితే వాలి కుమారుడు అంగదుడు, వాలి వర్గం వానరులు రాముడికి శతృవులయివుండేవారు కాదా? ఇంతమంది ఆమోదం పొందాడు కాబట్టే రాముడు సకలగుణాభిరాముడనిపించుకున్నాడు. ఎంతటివారిలోనైనా తప్పులు వెతికే సామాన్య మానవులం మనం. రాముడిలో కానీ వాల్మీకిలో కానీ తప్పులు వెతకడానికి మనం ప్రయత్నిస్తే మహాపర్వతం చుట్టూ కంతలు వెతికే కందిరీగల్లా మిగిలిపోతాము.


Free version has input file size limit. Please buy premium version to remove this restriction.

వేణు చెప్పారు...

@ Dupam Abhi: మీ వ్యాఖ్య స్పామ్ లోకి వెళ్ళినందువల్ల రెండ్రోజులు లేటుగా పబ్లిష్ చేశాను.

మీకు తోచిన వాదన మీరు చేశారు. సరే! కానీ చివర్లో ‘రాముడిలో కానీ వాల్మీకిలో కానీ తప్పులు వెతకడానికి మనం ప్రయత్నిస్తే మహాపర్వతం చుట్టూ కంతలు వెతికే కందిరీగల్లా మిగిలిపోతాము’ అనే శాపనార్థం/ ఉక్రోషం మాత్రం, అంతవరకూ మీరు అవలంబించిన చర్చాధోరణిని పూర్వపక్షం చేస్తోంది!

SaiRam చెప్పారు...

I do not know why this much discussion is needed. If you read Ramayanam you will find that Vali asks Rama more questions that you asked. And when Rama replies, Vali agrees with explanation given by Rama, apologizes Rama for accusing him.
Karna had some good qualities. But not as many good qualities as mentioned in DVS karna movie - that is a false movie. Karna encourage others to insult Draupadi, kill Abhimanyu. He gave all the plans to destroy Pandavas. In aadi parvam of Bharatam he encouraged the idea of killing Pandavas (for no reason)
Read the original scripture with "open mind".

వేణు చెప్పారు...

@ Sai paada Dhooli :

ఈ రెండు కావ్యాల్లోనూ వందల ఏళ్ళ నుంచీ చర్చనీయాంశమవుతున్న అంశాలివి. ఇంత చర్చ ఎందుకో అవగాహన రావటానికి open mind ఉండాలనుకుంటాను.

రాముణ్ణి ప్రశ్నలు అడిగి, వాటికి తార్కికమైన సమాధానాలు రాకుండానే వాలి సమాధానపడ్డాడు. (అలా కవి రాశాడు). కానీ ఆ ప్రశ్నలు అలాగే ఉన్నాయి, తరతరాలుగా చర్చనీయాంశమవుతూ. ‘సాక్షాత్తూ వాలే ఒప్పకున్నాక మీకేంటి అభ్యంతరం?’ అంటే చెప్పేదేమీ లేదు. వీలైతే ఆ ప్రశ్నలకు మీరు తార్కికంగా సమాధానం చెప్పమని సూచించటం తప్ప!

కర్ణుడు తను నమ్మిన కౌరవుల క్షేమం కోసం తపించాడు. వారి శత్రువులను తనూ ద్వేషించాడు. అతడి కోణంలో అతడి చర్య సరైనదే. అయితే కర్ణుడిలో లోపాలు లేవని కాదు!

మీరు చెపుతున్నఆదిపర్వం ( కవిత్రయ భారతం) సంస్కృత భారతానికి యథాతథానువాదం కాదు. అయినప్పటికీ ‘పాండవుల వధకు కర్ణుడు అకారణంగా ప్రోత్సహించినది’ ఆదిపర్వంలో ఏ ఘట్టంలో ఉందో కాస్త చెప్పగలరా? Academic interest తోనే అడుగుతున్నాను!




SaiRam చెప్పారు...

sare meeru oka pani cheyyandi interest undi antunnaru kabatti
valmiki ramayana moolam pustakam chadavandi - dantlo vaali tanu adigina prashnalaku poortigaa samaadhanapaddadu ane undi. Vali convince kaledu ani manam assume cheskovadaniki nakaithe reason kanapadaledu. okavela adi Adharmam aithe: Lakshmanudi baanam indrajittuni champedi kadu - because that is Astram. Astram is different from Sastram. Astram is powered with Mantra with which it is used.
Following were his words.
"Indeed an ignoble cannot disprove a nobleman, Raghava, and with regards to the undesirable and improper words I have unwittingly spoken earlier, in that mater too it will be truly unapt of you to make me blameworthy, as I spoke them in anguish and ignorance."

And Rama knows that Vali defeated Ravana earlier. Vali and Ravana made an agreement then. With the help of Vali Rama could have got Sita back. But Rama adhered to Dharma.
It is rather surprising to see God taking a human form to teach human kind the values and the way of life , earned a Title that "He slained vali unlawfully"

May be there are some other aspects you can also look at
1. Rama did not even thought to conquering Lanka after winning.
2. Rama asked Hanuman to check on Bharata to see if He liked being a king, in which case Rama would decide to remain in forest forever
3. When Ravana died and Vibhishana told that he hated Ravana for what he did and will not consider him his brother, Rama told that if Vibhishana do not perform his final rights, Rama would do it. Rama also told, "you are my friend. Hence Ravana is equal to my brother. I killed him because of his wrong path even after so many chances. But I have no bitter feelings for him."
4. After war, when Brahma, Bharadwaja Maharshi appeared and asked Rama to ask boons, He asked only for the monkeys who helped him but nothing for himself.
5. For having to be in forest for so long, Rama never, not even for a second, blamed Kaika.
6. When Rama and Ravana fought so fiercely and Ravana was almost lost and about to die, Rama asked him to go back and come next day as he was tired. He did not try to kill when he had a clear shot.
7. Rama mentioned Guha as a "Atma Samaana Sakha". That shows how much he loved his friends. Guha is uneducated.

I am not telling these to cover up something. I am telling qualities of Rama. Rama gave abundant reasons for killing Vali.

Regarding Karna I will give the quotes from Adi parva Sanskrit. But please refrain from taking our beloved NTR movies as reference. Movies directed by him, most of them, are utter wrong and disgrace.

Karna has both sides of him - like he gave his Kavach to Indra knowing that he is Indra. He suffered so much for no mistake of his. This can be a lesson to those celebrating valentines day (Their kids will meet same fate as Karna)
Kanya garbham eppudu anthe.
But Karna deserved what he got in final battle.
I am referring to aadi parvam in Sanskrit only.
I will give you the link. It contains verses without translation

rajakishor చెప్పారు...

వాలీ, కర్ణుడూ ఇద్దరూ దుష్టులే, అధర్మపరులే. దుష్టులను ఏ విధంగా వధించినా తప్పులేదు. వాళ్ళని తొలగించాలి అంతే. కర్ణుడు శౌర్యవంతుడే. కాని తనకి ఆశ్రయం ఇచ్చినవాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండా జీవితాంతం ఊడిగం చేసేడు. అంటే అధర్మానికి దాస్యం చేసేడు. అంటే కర్ణుడు అధర్మ వర్తనుడే. అంతేకాదు, కర్ణుడు పచ్చి మోసగాడు. తనని ప్రాణమిత్రునిగా భావించి, అంగరాజ్యం ఇచ్చి, తనని మాత్రమే నమ్ముకుని భారతయుద్ధానికి సిద్ధపడిన దుర్యోధనుని నిలువునా మోసం చేసేడు. సమయం వచ్చినప్పుడు అస్త్ర ప్రయోగం మరిచిపోతాడని కర్ణునికి పరశురాముని శాపం ఉంది. అలాగే సమయం వచ్చినప్పుడు తన రథం భూమిలో క్రుంగిపోతుందని భూదేవి శాపం ఉంది. అంటే పైకి మహావీరుడిలా కనపడటమే కాని సమయం వస్తే కర్ణుడు ఎందుకూ పనికి రాడన్నమాట. ఈ నిజాలన్నీ దాచి తననే నమ్ముకున్న దుర్యోధనుని నిలువునా నాశనం చేసేడు కర్ణుడు. వాలిని రాముడూ, కర్ణుడిని అర్జునుని చేత కృష్ణుడు వారు నిస్సహాయ స్థితిలో ఉండగా చంపలేదు, చంపించలేదు. వాళ్ళని చంపే అదనుకోసం ఎదురుచూసి వాళ్ళని అంతం చేసేరు. ఆ సమయాలలో వాలికి రాముడు ఇచ్చిన, కర్ణుడికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం పూర్తిగా చదవండి. అసలు వాలీ, కర్ణుడూ ఎలాంటి వారంటే చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేస్తూ పైకి గొప్పగా అన్నదానాలూ, దేవుడి హుండీలో నిలువు దోపిడీలూ ఇచ్చుకునే నేటి రాజకీయ నాయకుల్లాంటి వాళ్ళు. అయినా మీ ఇంట్లో రాత్రిపూట ఒక దొంగాడు చొరబడితే అదను చూసి వెనక నుంచి వెళ్లి కొడతారా లేక గొప్పగా జబ్బలు చరుచుకుంటూ వాడికి ఎదురుగా వెళ్తారా? ఈ రెండూ కాకపొతే పదిమందినీ పిలిచి వాడిని పట్టించి బాగా దేహశుద్ధి చేయిస్తారు. అంతేకాదు, ఒక దొంగాడినో, తీవ్రవాదినో పట్టుకోడానికి పదిమంది పోలీసులూ వెళ్ళటం లేదూ? అదను చూసి వెనుక నుంచి దెబ్బకొట్టటంలేదూ? ఒక దొంగాడినే మీరు వెనక నుంచి వెళ్ళి తంతే, లేదా ఒక్కడిని చేసి పదిమంది చేతా తన్నిస్తే తప్పులేదు కాని, అదే పని రాముడు, కృష్ణుడు చేస్తే మీకు తప్పయిపోయిందా? భలే చెప్తున్నారండీ!!!! ఇవేవీ ఆలోచించకుండా ఇలా వ్రాయడం చాలా విచారకరం.

వేణు చెప్పారు...

@ Raja kishor D: ఈ పోస్టు రాసిన మళ్ళీ ఇన్నేళ్ళకు ఒక అభిప్రాయం రావటం సంతోషంగానే ఉంది.

* కర్ణుడు తన శాపాల గురించిన నిజాలను దుర్యోధనుడికి తెలియకుండా దాచాడా? వ్యాస భారతంలో గానీ, కనీసం కవిత్రయ భారతంలో గానీ ఇదెక్కడుందో.. నిర్దిష్టమైన రెఫరెన్స్ (పర్వం- శ్లోకం/ పద్యం, ఘట్టం etc.) ఇవ్వండి. ఈ పాయింట్ ఆలోచిద్దాం.

* >> ఆ సమయాలలో వాలికి రాముడు ఇచ్చిన, కర్ణుడికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం పూర్తిగా చదవండి.>>

చదివానండీ. వాటిపై మీకేమీ సందేహాలే రాలేదా? సరే.. ఆ సమాధానం.. మీ సమర్థనా వివరంగానే రాసి పంపండి. దానిగురించి చర్చిద్దాం.

వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!

yallapragada hyma kumar చెప్పారు...

రామాయణం కల్పిత కథేగనక ఐతే ఇంత చర్చ అనవసరం.కేవలం కల్పిత కథ అని నాకు అనిపినచటం లేదు.చారిత్రక సాక్షానికి పోకుండానే ఆలోచిస్తే, ఒకవేళ కల్పిత కథఐతే ప్రపంచం అంతా ఒకే కథ ఉండేది.ఇన్ని రకాల రామాయణాలు ఉండేవి కాదేమో,అలానే కథేఐతే(ఆర్య ఆధిపత్యాన్ని,కులవ్యవస్థని బలోపేతం చేయాలనే ఈకథని సృష్టించి ఉంటే) రాముడి పాత్రని విమర్శకి అందకుండా చిత్రించి ఉండేవారు కదా!ఐనా ఇప్పుడు ఆర్య సిద్ధాంతం తప్పని అంటున్నారు కదా.ఇది నిజమైతే ఆర్య సిద్ధాంతంతాన్ని పట్టుకొని వేళ్ళాడు తున్న కొన్ని జీవుల కూసాలు కదిలి పోయినట్లే.పాపం ఎలా బ్రతుకుతారో.

yallapragada hyma kumar చెప్పారు...

బాగా చెప్పారు.

hari.S.babu చెప్పారు...

@venu
వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!

haribabu:
అంత జవాబూ చదివాక మల్ళీ అదే చాలెంజి చహెస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!

1.నేను ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిని అనై ప్రకటించేసుకుని ఆవిద మీద వ్హక్తిరసంబు వెదజల్లుతూ ఇన్ని పోష్టులు వేశాక మీ ఎజెండా స్థిరపడిపోయినట్టే కదా!రామయణ మహాభారతాల ఎజెండా మీకు నచ్చలేదు గనక అవి తప్పని చెప్పడానికి వ్యాఖ్యానాలూ వాదనలూ సాక్ష్యాలూ కోకొల్లలుగా పుట్టించవచ్చు - అదే కదా సేంటూసేం ఎజెండా ఉన్నవారిలో మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేటందుకు పనికొచ్చే పాండిత్యం!

2.మీరు ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిగా ఉన్నంతవరకూ మీకు రాముడు పరమ నీచాతి నీచుడు గానూ,రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడూ,జాంబవంతుడూ,హనుమంతుడూ విభీషణుడూ జాతిద్రోహులుగా కనబడటమూ సహజమే.రాముడికి ఎగస్పార్టీ అయిన రావణుడూ,శూర్పనఖా,వాలీ లాంటివాళ్ళు ధర్మావతారులుగా కనబడటమూ అంతే సహజం.

ముందుగానె ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటివాడి వాదన ఎంత యుక్తియుక్తంగా ఉన్నా సరే ఒప్పుకోకూదదని భీష్మించుకున్న గట్టి ఎజెండాతో ఉన్న మీకు వాలినీ కర్ణుణ్ణీ దుర్మార్హులని రుజువు చెయ్యడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు:-)

వేణు చెప్పారు...

@ Haribabu Suraneni: >> అంత జవాబూ చదివాక మల్ళీ అదే చాలెంజి చహెస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!>>

ఎంత జవాబూ? ఆయన (Raja kishore D) రాసినదానిలో వాలీ, కర్ణుడూ దొంగల్లాంటివాళ్ళని రుజువు చేసిందెక్కడా? అలా తెలిపే రెఫరెన్సులూ, వాదనా చేయలేదు కాబట్టే రుజువు చేయమని అడగాల్సివచ్చింది.

నేను చర్చలు చేస్తాను; ఛాలెంజ్ లు కాదు. ఇక్కడ ఆయన్ను ‘వాదనతో రుజువు చేయండి’ అన్నది చర్చలో భాగంగానే!

వాలినీ, కర్ణుణ్ణీ దుర్మార్గులని రుజువు చేయగలిగినవారు తమ యుక్తియుక్తమైన వాదనను ఇక్కడే ప్రవేశపెట్టవచ్చు. దానికి ఆహ్వానమే. వారి వాదన నా కోసం మాత్రమేనా? ఇక్కడ ఈ సంవాదాన్ని చదివే పాఠకుల కోసం కాదూ?

వారి వాదనలో సత్యం ఉంటే నా సమ్మతి లేకుండానే దానికదే నా వాదనను ఖండించేస్తుంది.

ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటి ప్రకారమే వారు వాదిస్తారు. స్థిరమైన అభిప్రాయాలు ఉండడటం దోషం కాదు.

అయినా చర్చను స్వాగతించటం ఎందుకంటే- ఎదుటివారి దృక్పథాన్ని సహిష్ణుతతో గమనించటానికీ, వాటిలో వైరుధ్యాలుంటే వాటిని ఎత్తిచూపటానికీ. ఇదంతా స్వీయాభిప్రాయాలను బలమైన పునాదిపై పటిష్ఠపరచుకోవటానికీ; అవసరమైతే మార్పులు చేసుకోవటానికీ.

ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!

ఆరోగ్యకరమైన చర్చలమీదే నాకు ఆసక్తి.

hari.S.babu చెప్పారు...

Pont1:
Raja Kishor D
సమయం వచ్చినప్పుడు అస్త్ర ప్రయోగం మరిచిపోతాడని కర్ణునికి పరశురాముని శాపం ఉంది. అలాగే సమయం వచ్చినప్పుడు తన రథం భూమిలో క్రుంగిపోతుందని భూదేవి శాపం ఉంది.
Haribabu: వేణు గారూ!తనకు శాపాలు ఉన్నాయని కర్ణుడికి తెలియదా?కధ చదివానంటున్నారుగా - చిన్నప్పుడు చదివినప్పుదూ గౌరవంగా అనిపించింది మీ అభిమాన రచయిత్రి చెప్పినప్పుడు గౌరవం పోయిందని చెప్పడం ద్వారా రెండు సార్లు చదివారు.ఆ శాపాలన్నీ కర్ణుడు వింటూ ఉండగానే చెప్పడం జరిగింది కదా!
Point2:
Raja Kishor D
ఆ సమయాలలో వాలికి రాముడు ఇచ్చిన, కర్ణుడికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం పూర్తిగా చదవండి.

Haribabu: రామాయణం చదవకుండానే తమకిష్టం లేని రాముడు చంపాడు గాబట్టి వాడు ఖచ్చితంగా మంచివాదేనని తీర్మానించుకుని వాలికి ఫ్యాన్సయిపోయిన వాళ్లకి రాని అనుమానాలు కూడా వాలి రాముణ్ణి అడిగాడు.రాముడు చెప్పాడు.అసలు సమస్య మీకు వాల్మీకి కన్నా రామాయణం గురించి మీ అభిమాన రచయిత్రికే ఎక్కువ తెలుసు అన్న నమ్మకం ఉండటం కదా?

వాల్మీకి రాసిన రామాయణానికి సంబంధించి వాల్మీకి చెప్పిన దాన్ని ఒప్పుకోనంటుంటే ఇంక జవాబు చెప్పడం సాధ్యమయ్యే పనెనా??అలా వాల్మీకి చెప్పీన దాన్నే ఒప్పుకోనంటుంటే మరో విధంగా రుజువులూ సాక్ష్యాలూ సమర్ధనలూ ఎక్కడ దొరుకుతాయి?

hari.S.babu చెప్పారు...

@Venu
ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!

@haribabu:ఒక మనిషి పేరుని అస్తవ్యస్తంగా రాయడం ఎందుకు చేశానో తెలుసా?ఆ మనిషికీ ఆ పేరుకీ ఏమి సంబంధం ఉందని ఆ అర్చయిత ఇంటిపేరుని వాడుకోవటం మానివేశారు?ఎందుకు ఆ పేరుని అస్తవ్యస్తం చెయ్యడం పట్ల మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు?అంటే,వివేకానందుడు రాజుగారి పటాన్ని కాళ్ళతో తొక్కమంటే భటుడు ఎట్లా భయపడ్డాడో మీరూ అట్లాగే ఆ పేరులో ఆ మనిషిని చూస్తున్నారు,అవునా కాదా?మరి అస్తవ్యస్తం చహెయ్యడం నావైపు నుంచి మీ అభిమాన రచయిత్రికి జరిగీతే మీకు కలుగుతున్న బాధయే మీ అభిమాన రచయిత్రీ చేసిన వక్రీకరణల వల్ల రాముడితో అనుబంధం పెంచుకున్నవాళ్ళకె కలుగుతుంది కదా!

డిస్టార్షన్ అనేది మీరు ఇతరులకి అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యవచ్చును గానీ ఇతర్లు మీకు అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యగూదదా?

వేణు చెప్పారు...

@ Haribabu: భారతం కథ ప్రకారం.. కర్ణుడు తనకున్న శాపాల సంగతిని దాచిందేమీ అలేదు. యుద్ధరంగంలో సాక్షాత్తూ తన సారధి శల్యుడితోనే ఆ శాపాల సంగతి చెప్తాడు.

ఆ శల్యుడు ఎంత దారుణంగా అవమానిస్తూ , హీనంగా నిందించినా తన స్నేహితుడైన దుర్యోధనుడి కోసం అర్జునుడిపై యుద్ధం చేస్తాడు. దీనిలో దుర్యోధనుణ్ణి మోసం చేసిందెక్కడ?

మీరు సమర్థించుకొచ్చిన Raja Kishore గారు రాసింది మరోసారి చూడండి- ‘‘కర్ణుడు పచ్చి మోసగాడు. తనని ప్రాణమిత్రునిగా భావించి, అంగరాజ్యం ఇచ్చి, తనని మాత్రమే నమ్ముకుని భారతయుద్ధానికి సిద్ధపడిన దుర్యోధనుని నిలువునా మోసం చేసేడు...’’.

కర్ణుడిని ఈ రీతిలో అర్థం చేసుకోవటం అంటే అది అతణ్ణి అపార్థం చేసుకోవడమే. ఒకవేళ శాపాలున్నాయని భయపడి యుద్ధానికి సిద్ధపడకపోతే, వెనుకంజ వేస్తే అప్పుడు పిరికివాడని ముద్ర వేస్తారు కానీ, స్నేహధర్మం పాటించిన నిజాయతీపరుడని ఎవరూ మెచ్చుకోరు.

* * *

రామాయణంలో, మహాభారతంలో వాలీ, కర్ణుల వధ సందర్భంగా వాళ్ళు తమ ప్రత్యర్థులకు దీటుగా సమాధానాలు ఇచ్చినట్టు వాల్మీకి గానీ, వ్యాసుడు గానీ రాయలేదు. ఎందుకంటే ఆ కవులు ఆ ప్రత్యర్థుల పక్షం కాబట్టీ; వాళ్ళనే సమర్థించదలిచారు కాబట్టీ. రామాయణంలో వాలి ఏదో నామమాత్రంగా రాముడితో వాదించినట్టు కవి రాశాడు. భారతంలో కర్ణుడు అధర్మ యుద్ధం వద్దు అన్నతర్వాత కృష్ణుడి మాటలకు నోరే ఎత్తడు. కవి కర్ణుడి వాదనను రాసే ప్రయత్నమే చేయలేదు.

రథం కుంగినపుడు కర్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు- ‘‘నేను కింద ఉన్నాను. నువ్వు రధం మీదున్నావు. ఆగడం ధర్మం. తల విరబోసుకున్నవాణ్నీ, రధం లేనివాణ్నీ, ఆయుధం కిందపెట్టిన వాణ్నీ శూరులు కొట్టరు. శూరుడివీ, రణధర్మం తెలిసినవాడివీ అయిన నువ్వు ధర్మయుద్ధం చేయాలి’.

అప్పుడు అర్జునుడు ఏమీ అనడు. కృష్ణుడు మాత్రం కౌరవుల తప్పులన్నీ ఏకరవు పెట్టి ‘ఇప్పుడు చెపుతున్న నీ ధర్మపన్నాలు అప్పుడు ఏమైపోయాయి?’ అని కర్ణుణ్ణి నిలదీస్తాడు.

అప్పుడు కర్ణుడికి తన వాదం ఏదో ఉంటుంది కదా? కర్ణుడి స్పందనను రాయదలచలేదు కవి.

వాలిని చంపినపుడు రాముడూ; కర్ణుణ్ణి చంపించినపుడు కృష్ణుడూ ఏవో యుక్తియుక్తమైన గొప్ప సమాధానాలు ఇచ్చారని వారిద్దరి సమర్థకులూ భావిస్తుంటారు.

ఇక్కడ కర్ణుడి వధ సందర్భంలో కృష్ణుడి వాదనపై కర్ణుడికి గానీ, ఇతరులకు గానీ ప్రశ్నలేమీ రావా?
కౌరవులు అధర్మంగా ప్రవర్తించారు. నిజమే. మరి ధర్మవర్తనులని కృష్ణుడు కీర్తించే పాండవులూ అలాగే చేయొచ్చా? అప్పుడు ఇద్దరికీ తేడా ఏముంటుంది? చివరకు కౌరవ పాండవులు ఇద్దరూ అధర్మ వర్తనులేనని తేలుతుంది తప్ప!

వేణు చెప్పారు...

@ Haribabu: ఒక రచయిత్రి భావాలంటే మీకిష్టం లేదు కాబట్టి ఆమె దశాబ్దాల క్రితం వదిలేసి, వాడదల్చని ఇంటి పేరును మీరు ఆమెకు ఆపాదిస్తూ ఆమెను సంబోధిస్తారు. ఆమె పేరును కావాలని అస్తవ్యస్తంగా, చెత్త విశేషణాలతో రాస్తారు. వీటన్నిటికీ మళ్ళీ సమర్థనలు!

ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి. అది సరైన మార్గం.

కానీ మీరు ఏం చేస్తున్నారు చాలాకాలంగా?

ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.

నచ్చని భావాలతో సంఘర్షించటంలో ఆరోగ్యకరమైన చర్చల, వాదనల దారిని వదిలేసి, ఆ భావాలను వ్యక్తంచేసే వ్యక్తులను అవమానించటానికి ప్రయత్నించే దూషణల మార్గం తొక్కారు మీరు.

అది మీ అభిరుచి కావొచ్చు. కానీ ఇలా ఒక రచయిత్రి పేరునూ, ఆమె భావాలను ఇష్టపడే బ్లాగర్ల పేర్లనూ అస్తవ్యస్తంగా మార్చి రాయటం, దాన్ని అస్తవ్యస్తంగా సమర్థించుకోజూడటం మీ నిస్సహాయమైన ఓటమిని మాత్రమే విస్పష్టంగా రుజువు చేస్తుంది!

SaiRam చెప్పారు...

కురుక్షేత్రం జరిగినపుడు మీరు పక్కన లేకపోవడం వలన ఎంత చారిత్రాత్మకమైన తప్పు జరిగిపోయింది. మీ సందేహం భూమి ఉన్నంతవరకూ ఉంటుంది. ఈ సారి నుంచి పురాణాలు రాసేప్పుడు మిమ్మల్ని ఒక సారి సంప్రదించమని వ్యాస వాల్మీకులకు చెప్పండి. మీరు ప్రూఫ్ రీడింగ్ చేసాక వాళ్ళు పబ్లిష్ చేస్తారులే. ఈ విధంగా వాళ్ళకి మీ దగ్గరనుంచి మంచి రేటింగ్స్ వస్తాయి
ఋషులు పొలిటీషీన్స్ కాదు. పొలిటికల్ మైండ్సెట్ తో లిటిగేషన్ మైండ్ సెట్ తో పురాణాలు చది బాగుపడిన వాడు ఎవడూ లేడు
ఇప్పటి ఓట్లు అడుక్కునే వాళ్ళలాగ ౠషులు ఎవరి మెప్పు కోసం రాయలేదు. వారు ఆశించింది కూడా ఏమీ లేదు - మనం బాగు పడడం తప్ప.
ఇలాగే చెయ్యండి అని వారెపుడూ ఆదేశించలేదు. భారత రామాయణాలు మనకు ఇచ్చి 'ఇలా ప్రవర్తించిన వాడు చరిత్రలో నిలిచిపోయాడు - ఇలా ప్రవర్తించిన వాడు మట్టి గొట్టుకుపోయాడు - నీవెలా ఉండాలో తేల్చుకో అన్నారు.
ఇక్కడ చర్చకు తావులేదు. నీవే మార్గం ఎంచుకుంటావో అన్న నిర్ణయం నీది. 'బాబ్బాబు మా పురాణాలు చదివి పెట్టు అని ' వారెన్నడూ అడగలేదు.
బాగు పడే మార్గం, మట్టిగొట్టుకు పోయే మార్గం రెండు ఉన్నాయి - అని వారు చెప్ప్పరు. ఎవరికి ఏది ప్రాప్తమో అది వారు ఎంచుకుంటారు. మిత్రున్ని ఎలా ఎంచుకోవాలి అన్న విషయం దగ్గరనుంచీ అన్ని ధర్మాలూ ఉన్నాయి భారతములో రామాయణములో. పురుగులా ఒకే విషయాన్ని పట్టుకు వేళ్ళాడతారా లేక అందులో మంచిని అర్థం చేసుకుని, అభ్యాసం చేసి బాగుపడతారా అనేది వ్యక్తిగతమైన విషయం. ఇలాంటి ప్రశ్నలకు నాకు గల ఒకే సమాధానం, పురాణం జరిగినపుడు మీరు ఉంటే బాగుణ్ణు ప్రశ్నించి ఉండేవారు. ఈ సారినుంచి పురాణాలు రాసేప్పుడు, భగవంతుడు సృష్టించేప్పుడు, మిమ్మల్ని పక్కనపెట్టుకు చేయడమే ఈ చర్చను ముగించడానికి గల ఒకే ఒక మార్గం

వేణు చెప్పారు...

@ SaiRam: ఇలాంటి మీ జనరల్ స్టేట్మెంట్లకు ఏం స్పందించను? చర్చలో నిర్దిష్టమైన పాయింటు గురించి ఏమైనా రాస్తే అది వేరు.

వాలి వధ విషయంలో రాముడి చర్య సరికాదని వాదిస్తున్నవారిలో ఆస్తికులైన పండితులు ఎందరో తరతరాలుగా ఉంటూనే ఉన్నారు. అసలీ చర్చ ఈ నాటిది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అలా ఎంతోకాలంగా ఈ విషయంపై చర్చలు చేసినవారిని కూడా ‘పురాణాలు రాసేటపుడు పక్కన పెట్టుకోమని’ మీరు ఎకసెక్కం చేసినట్టే!

వాలి వధపై కొన్నిదశాబ్దాల క్రితం ఆకాశవాణిలో (బహుశా విజయవాడ కేంద్రం )చర్చ కూడా నడిచింది.

hari.S.babu చెప్పారు...

@venu
ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.

haribabu
ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని మీరు అంటున్నారా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించహ్తం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల అమంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల అసంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్ల పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పౌగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు:-)

ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు - నాతో సహా!అలా చెయ్యాలంటే రాముది ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు "తమ్ముడూ బాగున్నావా" అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడ్గినట్టు వాల్మీకి తన అభిప్రాయాలు చెప్తున్న సన్నివేశాలు ఎన్ని ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు - రావణుడు, సీత - శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాలో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!
TO BE CONTINUED

వేణు చెప్పారు...

@ Haribabu :

మీ కొనసాగింపు వ్యాఖ్యను (రెండోదాన్ని) ప్రచురించటం లేదు.

వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!

ఒక రచయిత్రి భావాలు మీకు నచ్చకపోతే ఆమెను సంస్కారహీనమైన మాటలతో దూషించేయటమేనా? ఆమె భావాలు ఇష్టపడేవారిని అవమానకరంగా సంబోధిస్తూ చెత్తగా రాసెయ్యటమేనా?

సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను.

hari.S.babu చెప్పారు...

మీ వ్యాఖ్యాతల పూర్తి అభిప్రాయాన్ని ప్రచురించకుండా మీకు నచ్చని భాగాన్ని వదిలేసి ఇతర్లకి కనబదకుండా చేసి జవాబును మాత్రం జనాంతికంగా చెప్పే మీ అతి తెలివి ధోరణి నాకు తెలుసు!ఆ భాగాన్ని మీరు ప్రచురించరనీ అనుకున్నాను.ఎందుకంటే అక్కడ అర్ధవంతమయిన చర్చలకి సుముఖం అని పైకి చెప్తున్నా మీ ఎజెండాయే ముఖ్యపాత్ర వహిస్తుంది గాబట్టి:-)

అందుకే నమ్మినా నమ్మకపోయినా అన్న భాగాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి మీ వైపు నుంచి మీరు చూపించాలసీన నిజాయితీ మీదకి మీకు ఒక చాలెంజి విసిరాను.ఆ చాలేంజిని మీరు సరైన పద్ధతిలో టేకప్ చెయ్యలేదు.అలా చేసే నిజాయితీ మీలో లేదని రుజువయింది.ఉండదని నాకు తెలుసు.మీ ఎజెండా మీది,ఇంక నాకు మీరు ప్రచురించ లేదని దిగులు కానీ బెంగ కానీ నిరాశ కానీ ఎందుకు ఉంటుంది?

నేను అనుకున్నట్టుగానే ప్రవర్తించారు మీరు - శభాష్!నా జవాబులో ముఖ్యమైన పార్టునే వొదిలేశాక మీ తొక్కలో జవాబుకి విలువేముంటుంది, I DONT CARE!

వేణు చెప్పారు...

పాఠకులూ... గమనించండి, ఈ Haribabu వ్యాఖ్యల ధోరణి.
సాటి బ్లాగర్లకు కనీస మర్యాద ఇచ్చే సంస్కారం లేదు. నిలువెల్లా అసహనం... పరుష పదజాలం!

ఆ భాగాన్ని ప్రచురించరని కూడా అనుకున్నారట. ( అది నా బ్లాగులో ప్రచురణార్హం కాదని రాసినప్పుడే ఆయనకు తెలిసిపోయిందన్నమాట...)

నా కోణంలోంచి చెప్పాలంటే- విషయాన్ని సభ్యతగా ఆరోగ్యకరంగా చర్చించే ధోరణితో లేని అభ్యంతరకర వ్యాఖ్య కాబట్టే ప్రచురించలేదు.)

నా అతి తెలివి ధోరణి తెలుసట. నాది తొక్కలో జవాబట...

చూశారు కదా, ఈయన ఎదుటివారికిచ్చే మర్యాదా, సంస్కారం ఉట్టిపడే భాషా సౌందర్యం!

ఇలాంటి వ్యాఖ్యల వల్ల వాటిని రాసినవారి డొల్లతనమే బయటపడుతుంది. నేను అంగీకరించని భావాలనైనా చర్చలో భాగంగా నా బ్లాగులో ప్రచురిస్తాను గానీ సంస్కారంలేని వ్యక్తిగత దూషణలతో కూడిన వ్యాఖ్యలను మాత్రం ప్రచురించే ప్రసక్తి లేదు!