సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
కామిక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కామిక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ ‘శంకర్’ కుంచె విన్యాసాలు!

సూక్ష్మాంశాలతో  సజీవ రూపు ‘రేఖ’లకు తుది మెరుగులు దిద్దుతూ..  శంకర్

  
‘చందమామ’ పత్రిక  అంటే ఆహ్లాదపరిచే  కథలే కాదు; అపురూపమైన బొమ్మలు కూడా! 

ఎలాంటి బొమ్మలవి? 

కథలను అలంకరించేవీ, కథ చదవాలనే ఉత్సుకతను కలిగించేవీ.  వాటిలోని సహజమైన రూపురేఖలూ, పరిసరాలూ కథను సంపూర్ణంగా ఆస్వాదించేలా చేసేవి.  అంతర్లీనంగా .. చదివేవారి పరిశీలనా శక్తిని అద్భుతంగా పెంచగలిగేవి!      

చందమామ చిత్ర సౌథానికి నాలుగు స్తంభాలైతే.. వారు  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య;  చిత్రా, శంకర్ లు.  మొదటి ఇద్దరూ ప్రధానంగా ముఖచిత్ర రూపకర్తలు. చివరి ఇద్దరూ కథలను చిరకాలం గుర్తుండేలా చేసిన అజరామర చిత్ర లేఖనా శిల్పులు. 

వారిలో చందమామ వైభవ శకానికి తానొక్కరే సజీవ సాక్ష్యంగా ఉన్న శంకర్..  మొన్న సెప్టెంబరు 29న  కన్నుమూశారు.  

సంవత్సరాల తరబడి ఆయన గీసిన బొమ్మలు ఎన్నో తరాల మనసుల్లో నిలిచిపోయాయి.  ఆయన్ను ప్రత్యక్షంగా  చూడకపోయినా...  చిత్రాల అనుసంధానంతో,  అ అనుబంధంతో  ఎందరికో ఆత్మీయుడిగా నిలిచారు.  

నా బాల్యాన్ని-  

తన సున్నితమైన రేఖలతో, 

కనువిందైన రంగులతో, 

ముచ్చటైన నగిషీలతో, 

 ప్రశాంత ముని కుటీరాల,  

కీకారణ్యాల, 

అశ్వపద ఘట్టనల యుద్ధ ఘట్టాల, 

పౌరాణిక  రామణీయక దృశ్యాలతో  

సంతోషభరితం చేసిన.. చిత్రకారుడు శంకర్ గారి గురించి...

 దాదాపు 11 సంవత్సరాల క్రితం (30, నవంబర్ 2009)  ఇదే బ్లాగులో ఓ పోస్టు రాశాను. అందులోంచి కొంత.. 

--------------------

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

 
శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.


1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, 

భీష్ముడి అవక్ర పరాక్రమం, 

పాండవుల మహాప్రస్థానం; 

రాముడి అరణ్యవాసం, 

వాలి సుగ్రీవుల గాధ, 

వాలి వధ, 

హనుమంతుడి లంకా నగర సాహసాలు, 

వారధి నిర్మాణం, 

రామ రావణ యుద్ధం .. 

ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.


ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  

ఈ ఇద్దరు చిత్రకారులదీ  సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. 

అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  

చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’;  

శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’!  (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)


చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!

--------------------

ప్రస్తుతానికి వస్తే....

బేతాళ కథల బొమ్మ
బేతాళ కథలకు శంకర్  వేసిన విక్రమార్కుడి బొమ్మ (లోగో) ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఇది  గొప్పగా ఉందనటంలో సందేహమేమీ లేదు.  

కానీ -
 

శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే ఆ విక్రమార్కుడి బొమ్మను మొదట వేసింది ‘చిత్రా ’(1955  సెప్టెంబర్ సంచిక).  ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే.  దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. 

చిత్రా సృష్టించిన చిత్రమిదే.. 


ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్.  ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.  

శంకర్ మెరుగుపరిచిన  బొమ్మ

బేతాళ కథలకు శంకర్  పేటెంట్ చిత్రకారుడిలా ఎక్కువ బొమ్మలు వేశారు. 

బేతాళుణ్ణి  భుజాన  వేసుకుని, చెట్టు కొమ్మల్లోంచి దిగబోతున్న విక్రమార్కుడి బొమ్మ కూడా బాగుంటుంది. చిత్రా చిత్రించిన ఈ లోగోను మధ్యలో కొన్ని సంచికల్లో వరసగా  ప్రచురించారు. 
 
శంకర్ వేసినన్ని కాదు గానీ...  చిత్రా.. ఇంకా ఎంటీవీ ఆచార్య, బాపు.. తర్వాత కాలంలో రజీ, శక్తిదాస్ లు  బేతాళ కథలకు బొమ్మలు వేశారు.
 

చందమామలో శంకర్ తొలి బొమ్మలు...

1947 జులైలో ఆరంభమైన చందమామలోకి  శంకర్  1952 లో చేరారని తెలుసు.  కానీ  ఆ సంవత్సరం సంచికల్లో శంకర్ బొమ్మలేవీ లేవు.  బహుశా ఆయన  ఆ సంవత్సరాంతంలో చేరివుంటారు. 

ఆయన తొలి నాటి బొమ్మలు ఎలా ఉన్నాయి? వాటిని  చూడాలనే  ఆలోచన వచ్చింది.   

పాత సంచికలు తిరగేశాను, ఆసక్తిగా.

1953 జనవరి సంచికలో ఆయన మూడు కథలకు బొమ్మలూ, ఒక ఫీచర్ కు లోగో చిత్రించారు. 

సంచికలో మొదటగా కనిపించే ‘పాడుబుద్ధి’ కథకు వేసిన బొమ్మలను ఆయన మొదటి బొమ్మలనుకోవచ్చు. 


శంకర్ వేసిన  తొలి ఫీచర్ బొమ్మ

శంకర్ తొలినాటి ఓ  బొమ్మ... 

వీరబల్ (బీర్బల్) కథకు వేసిన బొమ్మ.. 1953 జనవరిలోదే

కథ మొత్తం కావాలంటే... ఈ నాలుగు పేజీలూ చదవండి..





అప్పట్లో ఆయన సంతకం ఇంగ్లిష్  కాపిటల్స్ లో  ఒద్దికగా ఉండేది. తర్వాత సంతకం.. మనందరికీ తెలిసినది- కుడివైపుకు ఏటవాలుగా వంగి,  స్వేచ్ఛగా స్మాల్ లెటర్స్ తో  ఉంటుంది. 

 
ఫిబ్రవరి 1953  చందమామ  సంచికలో దాదాపు అన్ని కథలకూ శంకరే వేశారు.  వీటిలో ఆలూరి బైరాగి, కొడవటిగంటి కుటుంబరావుల గేయమూ, కథా  ఉన్నాయి. 

కొడవటిగంటి  ‘అభేద్య’ కథ చివరి బొమ్మ ఇది. దీనిలో శంకర్  శైలి అనదగ్గ ‘నగిషీ’ మొదలైంది,  చూడండి.


ఆ నగిషీ తర్వాతి కాలంలో  చాలా చిత్రాల్లో ఉంటుంది. 

కింద ఈ రెండు బొమ్మలూ  చూడండి, ఆ నగిషీ ఎక్కడుందో గమనించండి.



సహజ ప్రతిభావంతుడైన శంకర్ గీతలో పరిణతీ, సాధికారతా ఆయన చిత్రించిన  రెండో సంచిక (1953 ఫిబ్రవరి) కల్లా  వచ్చేశాయి!

తర్వాతి  సంచిక... 1953 మార్చి నెలది.  ఈ సంచికకు శంకర్  ఏకంగా ముఖచిత్రమే వేసేశారంటే  ఆయన సామర్థ్యాన్ని  చందమామ ఎంతలా గుర్తించిందీ అర్థం చేసుకోవచ్చు!

శంకర్ వేసిన మొదటి ముఖచిత్రం

అలా ఆయన చందమామలో స్థిరపడిపోయారు.  క్రమంగా పౌరాణికాల చిత్రరచనలో స్పెషలైజ్  చేశారు.  

శంకర్ ప్రతిభ చందమామకే పరిమితం కాలేదు.  రామకృష్ణ ప్రభలో  కామిక్స్ లాంటి కొన్ని పౌరాణిక బొమ్మల కథలు వేశారు.  అవి పుస్తకాలుగానూ వచ్చాయి.


శంకర్ వేసిన పౌరాణికాల  బొమ్మలే  వేలల్లో ఉంటాయి.  ఆయన చిత్రలేఖన ప్రతిభను ప్రతిఫలించే  కొన్నిటిని  చూడండి.

    

వృత్రాసురుడి విజృంభణ


నరకుడి కొడుకు..భగదత్తుడు

భీష్ముడి యుద్ధ పరాక్రమంపై పాండవుల సమాలోచన

     దేవీ భాగవతం సీరియల్లో సింహ వాహినీ,  శ్రీ కృష్ణుడూ


కురుక్షేత్రంలో  క్రౌంచ (పక్షి) వ్యూహం

సీతాపహరణాన్ని అడ్డగిస్తూ రావణుడితో జటాయువు యుద్ధం

హనుమంతుడు చూస్తున్న లంకా నగర దృశ్యం

అనిరుద్ధుడి అదృశ్యం.. అతడి భార్యల కలవరం. దూరంగా ‘తాత’  శ్రీకృష్ణుడి సమాలోచనలు

శ్రీకృష్ణావతారం 

బేతాళ కథ చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా  (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)  చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


(చిత్రా కూడా ఈ బేతాళుడు చెట్టుమీదకు దూసుకుపోయే ఆఖరి పేజీ బొమ్మలు కొన్ని వేశారు.  విక్రమార్కుణ్ణి లాంగ్ షాట్లో  ఉంచి బేతాళుణ్ణి క్లోజప్ లో వేయటం చిత్రా స్పెషాలిటీ )
 
శంకర్ వేసిన ఆ బొమ్మలు కొన్ని ఇక్కడ చూడండి- 

 




















తన పౌరాణిక  బొమ్మల లోకంలో  శంకర్

 


31, డిసెంబర్ 2017, ఆదివారం

రాబిన్ సన్ క్రూసో ... ఆర్థికశాస్త్ర విశేషం

1719లో తొలి ప్రచురణ
క్కడో ఇంగ్లండ్ లో పుట్టి  దేశదేశాల పాఠకులకు చేరువయ్యాడు ..
రాబిన్ సన్ క్రూసో !


నా చిన్నప్పుడు మా అన్నయ్యల ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం ద్వారా  పరిచయమయ్యాడు.  
 
ఎటు చూసినా అంతు లేని సముద్రం... లోపల ప్రమాదాలకు ఆలవాలమైన చిన్న దీవి!
నర మానవుడు కనపడని ఆ నిర్జన ప్రాంతంలో ఒంటరిగా బతకాల్సిరావటం ఎంతటి భయానకం!
ఆశ లేశమైనా లేని పరిస్థితుల్లో గొప్ప నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో  అక్కడ 28 సంవత్సరాలు  జీవించి,
ఆ ద్వీపం నుంచి బయటపడ్డాడు రాబిన్ సన్ క్రూసో ! 

అప్పుడు కథ సారాంశం మాత్రమే తెలుసు.  వివరంగా తెలియదు. రాబిన్ సన్ నిర్భీతీ, తెలివితేటలూ, ప్రణాళిక ప్రకారం దీవిలో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తీరూ ..ఇవన్నీ ఇష్టపడ్డాను.

డిగ్రీ కోర్సులో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చిన క్రూసో.. ఆ తర్వాత  చదివిన  రంగనాయకమ్మ ‘ కాపిటల్ పరిచయం’లో మళ్ళీ తారసపడ్డాడు!

డేనియల్ డెఫో ఇంగ్లిష్ లో  రాసిన ఈ నవలను  సొదుం రామ్మోహన్ సంగ్రహంగా తెలుగులోకి అనువదించారు.  పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించారు.


ఈ మధ్య దీన్ని  మళ్ళీ  చదివాను.

దీని గురించి ఏదైనా  రాయాలనుకున్నపుడు  రాబిన్ సన్ క్రూసో ఒరిజినల్ తో పాటు రెండు వర్షన్ల  కామిక్స్, ఇంకా  వన్ సిలబల్ వర్డ్స్ తో రాసిన నవల... ఇవన్నీ పరామర్శించాను.




క్రూసో వివిధ చిత్రకారుల ఊహల్లో ఎలా ఉన్నాడో  చూశాను.

1719లో మొదటిసారి ఇంగ్లండ్ లో ప్రచురితమైందీ నవల.  రెండు శతాబ్దాల తర్వాత ఈ నవలకు బొమ్మలు వేసే అవకాశం  1920లో  ఎన్.సి. వయత్ కు దక్కింది.

 
దాన్ని ఆయన అపూర్వంగా సద్వినియోగం చేసుకున్నాడు.

‘Do my pictures add a little to the vividness of this story? Do I aid a little in the clearer vizualization of Robinson Crusoe as he moves about on his sunny island? That is the most I can hope for. ' 


ఇంత వినమ్రంగా చెప్పుకున్న వయత్ వేసిన బొమ్మలు కొన్ని చూడండి-













 ***

సొదుం రామ్మోహన్ చేసిన అనువాదం  బాగుంది. ముందుమాటలో ఆయన అంటారు-

 ‘‘ప్రకృతి విసిరిన ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చునో ఈ పాత్ర పిల్లలకే కాదు పెద్దలకూ బోధిస్తుంది....అన్వేషణా స్ఫూర్తి, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై చెరగని ఆశ- ఇవీ క్రూసో లోని ప్రధాన లక్షణాలు’’

తన దుస్థితి గురించి ఆలోచిస్తూ  క్రూసో   ప్రతికూల అనుకూల అంశాలను రాసుకుని విశ్లేషించుకోవటం  గొప్పగా అనిపిస్తుంది.

‘‘నేను జనావాసం లేని దీవిలోకి వచ్చి పడ్డాను. ఇక్కడ నుంచి బయటపడతానన్న  ఆశలు లేవు ’’ 

దీన్నిప్రతికూల పరిస్థితిగా రాసుకున్న క్రూసో...
దాని ఎదురుగా సానుకూల పరిస్థితిని కూడా ఇలా  రాస్తాడు-

 ‘‘మొత్తానికి సముద్రంలో మునిగి చావకుండా ఇంకా సజీవంగానే ఉన్నా’’

మనిషి  సంఘజీవి (man is by nature a social animal) అని  చెప్పిన సోక్రటీస్ (క్రీస్తు పూర్వం 470 - 399) మాటలు ఎంత నిజమో క్రూసో కథ స్పష్టం చేస్తుంది.

దూరాన ఆగివున్న ఓడను చూసిన క్రూసో మానసిక స్థితిని రచయిత డేనియల్ డెఫో బాగా వర్ణిస్తాడు-

‘‘ఎక్కువమంది వద్దు...ఒక్కరంటే ఒక్కరు, ఒకే ఒక వ్యక్తి ఇటు వస్తే నేనెంత సంబరపడిపోతానో! 

ఎన్నేళ్ళయింది మనుషులతో మాట్లాడక......మనుషులతో మాట్లాడాలని నేను ఇంతకుముందెన్నడూ ఇంత గాఢంగా కోరుకోలేదు. 

కనీసం ఒక్క వ్యక్తి కూడా తోడు లేనందుకు నా హృదయం దు:ఖంతో లోలోతులకు కుంగిపోతోంది...’’.

మానవ ప్రపంచానికి సుదూరంగా ఉన్న ద్వీపంలో ఒంటరి మనిషి మనుగడ ఎలా ఉంటుందో  పరిశోధన చేసి రాసినట్టు  ఉంటుందీ నవల.

రచయిత డేనియల్ డెఫో
 300 వందల ఏళ్ళక్రితం రాసిన ఈ  నవల  ఇప్పటికీ ఉత్కంఠభరితంగానే ఉంటుంది.


రాబిన్ సన్ క్రూసో  వాస్తవిక వ్యక్తి కాదు. అది రచయిత కల్పనే.  మరి క్రూసోకు నమూనా ఎవరైనా ఉన్నారా? 

పసిఫిక్ ద్వీపం లో నాలుగేళ్ళు ఒంటరిగా గడిపిన నావికుడు అలెగ్జాండర్ సెల్ కిర్క్ (1676- 1721).  అతడే రియల్ రాబిన్ సన్.



ఆ సెల్ కిర్క్ గురించి   విలియం కౌపర్ (1731-1800) అనే కవి The solitude of Alexander Selkirk  అనే పొయెం రాశాడు.

దానిలో ఓ చిన్న భాగం-

O Solitude! where are the charms
That sages have seen in thy face?
Better dwell in the midst of alarms,
Than reign in this horrible place.


మనుషులెవరూ కనపడని  ఒంటరితనం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పే ఈ పద్యాన్ని డిగ్రీ  పాఠ్యపుస్తకంలో  చదువుకున్నాను.

అప్పుడు కూడా క్రూసో గుర్తొచ్చాడు.

***

ధునిక కాలపు క్రూసో ఎవరంటే.. అడ్మిరల్ బర్డ్.

1934లో ఈ అన్వేషకుడు అంటార్కిటికాలో దక్షిణ ధ్రువాన్ని కప్పే విశాలమైన మంచుదిబ్బలో దాదాపు కూరుకుపోయిన గుడిసెలో ఐదు నెలల పాటు ఒంటరిగా గడిపాడు.  చుట్టు పక్కల వందమైళ్ళ దూరంలో ఎలాంటి ప్రాణీ లేని నిర్జన ప్రదేశమది. మైనస్ 80 డిగ్రీల విపరీతమైన చలి... కటిక చీకటి...లాంతరు మాత్రం ఉంది. 


Alone అనే తన రచనలో బర్డ్ తన అనుభవాలను రికార్డు చేశాడు. 


డేల్ కార్నెగీ 1948లో రాసిన - How to stop worrying and start living (తెలుగులో- ఆందోళన చెందకు ఆనందంగా జీవించు) లో  బర్డ్ ప్రస్తావన వస్తుంది.


***

స్తువులూ -విలువలూ -మారకాలకు సంబంధించి ఆర్థిక శాస్త్ర అంశాన్ని చెప్పటానికి  కార్ల్ మార్క్స్ ‘కాపిటల్’ లో  రాబిన్ సన్ క్రూసోను కోట్ చేస్తాడు.



రాబిన్ సన్ దీవిలో ఒక్కడే వేర్వేరు రకాల శ్రమలు చేశాడు. జంతువుల్ని వేటాడటం, చేపలు పట్టడం, ఇల్లు కట్టుకోవడం, వంట చేసుకోవడం, మేకల్ని పెంచడం...ఇలా.  వాటిని ఉపయోగించుకోవటంలో అతడికెలాంటి సమస్యా రాలేదు.  

ఆ దీవిలోకి రాబిన్ సన్ ఒక్కడే కాకుండా పగిలిపోయిన ఓడ నుంచి మరికొంత మంది మనుషులు కూడా వచ్చివుంటే? అందరూ తలో శ్రమా చేసి తయారుచేసుకున్న వస్తువుల్నీ, పదార్థాల్నీ అందరూ సమష్టిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది.

అలా కాకుండా ఎవరికి వాళ్ళే తాము తయారుచేసుకున్న వస్తువులకు సొంతదారులుగా ఉండి, వాటిని ఇతరుల వస్తువులతో ‘మారకాలు’ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది?

వాళ్ళంతా ‘విలువల గందరగోళం’లో  పడిపోతారని మార్క్స్ చెపుతాడు.

ఆ వస్తువుల్లో శ్రమకాలాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి  వాటికి రకరకాలుగా మారకపు విలువలు ఏర్పడి వాటిని మార్చుకోవడంలో చిక్కులు మొదలయ్యేవి. పోట్లాటలూ, కొట్లాటలూ, నరుక్కోవడాలతో ఆ దీవి లో ప్రశాంతత భగ్నమయ్యేది.

ఆ వస్తువులన్నిటి సొంతదారు రాబిన్ సన్ ఒక్కడే కాబట్టి .. తన  వస్తువులను తన ఇతర వస్తువులతో  మారకం చేసుకోనక్కర్లేదు కాబట్టి... ఆ దీవిలో మారకపు విలువల తల నొప్పుల నుంచి తప్పించుకోగలిగాడు రాబిన్ సన్.

అంటే... మనుషులంతా శ్రమలు చేస్తూ ప్రణాళికతో వస్తువులు ఉత్పత్తి చేసుకుని, వాటిని సమష్టిగా (ఎవరి అవసరం మేరకు వారు) వాడుకోవటం మాత్రమే శాస్త్రీయమైన, ఉన్నతమైన మార్గం... అని చెపుతాడు మార్క్స్.

సమ సమాజపు ఈ ఊహ నిజమైతే.. ఎంతో బాగుంటుంది కదూ..!