ఈ మధ్యనే అనుకోకుండా ఓ వెబ్ సైట్లో చూశాను, ఆయన బొమ్మలను!
చూడగానే ఇట్టే ఆకట్టుకున్నాయి.
సంభ్రమపరిచే ఊహలూ, అనూహ్యమైన కోణాలూ....
మురిపించే రేఖలూ, మెరుపుల రంగులూ...
ఈమధ్యకాలంలో నన్ను బాగా ఆకట్టుకున్నఆ చిత్రకారుడు ముకేష్ సింగ్. భారతీయ చిత్రకారుడే!
కొద్దికాలంగా ‘నిశాచర్’ పేరుతో బొమ్మలు వేస్తున్నారు.
ఆయన కామిక్ బుక్ ఆర్టిస్టు, ఇలస్ట్రేటర్. మోషన్ గ్రాఫిక్స్, సీజీ మోడలింగ్ చేస్తారు.
నిశాచర్ చిత్రాలు కొన్ని చూడండి-
ముఖ్యంగా ఎపిక్ విజువల్ ఆర్ట్ లో ఆయన ప్రతిభ శిఖరస్థాయిలో కనపడుతుంది.
పురాణేతిహాసాల ఘట్టాలను ఎవరూ ఊహించని కోణంలో, గాఢతతో, కళ్ళముందుంచే నేర్పు ఆయనది. విశాలమైన కేన్వాస్ లో తన విశేషమైన ఊహలకు రెక్కలు కట్టి కాదు; రాకెట్లు కట్టి ఎగరేస్తారు.
రక్తబీజుడూ, అఘోరీల బొమ్మలను ఒళ్ళు జలదరించే రీతిలో చిత్రించారు. మరీ చిన్నపిల్లలు వాటిని చూడలేకపోవచ్చు.
అందుకే ఆ బొమ్మలను ఇక్కడ ఇవ్వటం లేదు.
మహాభారత ఘట్టాలకు ఆయన వేసిన బొమ్మలు పూర్తిగా భిన్నమైనవి. పాత్రలన్నీ మనకు తెలిసిన ఆహార్యంతో, రూపురేఖలతో కాకుండా సరికొత్తగా కనపడతాయి.
ఆ ‘కాన్సెప్ట్ డ్రాయింగులు’ చాలా బాగుంటాయి.
‘వెయ్యి ఏనుగుల బలం’ఉన్నట్టు కవి వర్ణించిన భీముడిని అంతే స్థాయిలో చిత్రించారు.
కృష్ణుడు కొత్త రూపంతో కనపడతాడు.
నిద్రపోతున్న కృష్ణుడి దగ్గరకు దుర్యోధనుడూ, అర్జునుడూ యుద్ధంలో సాయం కోరడానికి వస్తారు కదా? ఆ ముగ్గుర్నీఎంతో ఎత్తునుంచి చూపిస్తూ వేసిన బొమ్మ చూడండి-
భగవద్గీత చిత్రణ... (మాట్లాడుతున్న దేవుడు)
యుద్ధ దేవతను ఆవాహన చేస్తున్నఅర్జునుడు (లాంగ్ షాట్లో అర్జునుణ్ణి పెట్టి ఆకాశంలోని యుద్ధ దేవత భీకర స్వరూపాన్ని క్లోజప్ లో చిత్రించగలిగాడు)
కర్ణ, ఘటోత్కచుల సమరం
బ్రహ్మ
అగ్నిదేవుడు
భారతయుద్ధం ముగిశాక ఓ మృత కళేబరం వద్ద ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం..
విస్తృతమైన కేన్వాస్ లో .. కురుక్షేత్ర రణస్థలి
నిశాచర్ బొమ్మల్లో సూక్ష్మాంశాల సవివరణ చిత్రణ, చలనశీలత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఆకర్షణీయంగా అగ్నినీ, మెరుపులనూ, అనూహ్య పరిసరాలనూ సృష్టించటంలో ప్రత్యేక అభినివేశం ఉన్న చిత్రకారుడీయన!