సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

17, ఫిబ్రవరి 2010, బుధవారం

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!


నకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత...
 జానపద కథల మాంత్రికుడు..
 దాసరి సుబ్రహ్మణ్యం గారు!

దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.

1954లో  ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన   ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం  1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ  విజయవంతంగా  కొనసాగింది.
చందమామ  అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి. 

ఆయన  అక్షరాలను మంత్రిస్తే..అవి  అవధుల్లేని   కథాకల్పనలయ్యాయి. వీర, బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో  అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై  పరుగులు పెడితే అసంఖ్యాక  పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో  ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.

ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని  తలపోసుకుంటూనే ఉన్నారు.

 ఊహల  విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ   వింత  వింత లోకాల్లో   విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.

కానీ...ఆయన  మాత్రం  పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో  ఆ   పాఠకులకు కూడా తనెవరో  తెలియని అజ్ఞాత రచయితగానే  ఉండిపోయారు!


ఉద్యోగ విరమణ చేసి, చెన్నై నుంచి విజయవాడ చేరుకుని, అన్నగారి కుమార్తె ఇంట్లో  విశ్రాంత జీవితం గడిపేటప్పుడు  మాత్రమే  ఆయన గురించి కొద్దిమంది పాఠకులకైనా తెలిసింది.

చివరిదాకా తాను నమ్మిన హేతువాదం నుంచి పక్కకు పోని, స్థిర సంకల్పం ఆయనది.



 న్మానాల ,సత్కారాల, బిరుదు ప్రదానోత్సవాల్లో, పొగడ్తల దండల శాలువాల హడావుడిలో బడా  సాహిత్య సంస్థలు  ఎప్పుడూ బిజీనే. నాలుగు కాలాల పాటు నిలిచే నిజమైన సాహితీ  కృషి చేసిన వారిని తల్చుకోవటానికి

వాటికి తీరికెక్కడిదీ? పైగా దాసరి సుబ్రహ్మణ్యంగారు  ఏ నాటి రచయిత? ఇలాంటివారిని   పట్టించుకునే తీరిక వారికేం  ఉంటుంది చెప్పండి!

ఇలాంటి పరిస్థితుల్లో -

జనవరి 27న కన్నుమూపిన  దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోవటానికి హైదరాబాద్ లో ఎవరైనా  చిన్న సభ పెట్టటం సంతోషకరమే కదా?



 దాసరి వెంకటరమణ, అట్లూరి అనిల్, వాసిరెడ్డి నారాయణరావు, రామవరపు గణేశ్వరరావు, చొక్కాపు వెంకటరమణ గార్లు.

ఆ పని ‘బాలసాహిత్య పరిషత్’ వారు చేశారు.
 
నిన్న  (ఫిబ్రవరి 16) సాయంత్రం  హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో  ఈ ప్రోగ్రాం జరిగింది.


 సమావేశ మందిరంలో అడుగు పెట్టగానే  సభ బ్యానర్ కనపడింది.గుమ్మం దగ్గరే టేబుల్ మీద దాసరి గారి రచనల పుస్తకాలు,చందమామ కథలు, ఆయన  దస్తూరితో ఉన్న కథల రాత ప్రతులు కనిపించాయి.

వీటన్నిటికంటే ముందు 1947 జులై చందమామ తొలిసంచిక దగ్గర్నుంచి కొన్ని నెలల సంచికల  బైండు  కనిపించింది. ఈ సంచికలన్నీ ఇంతకుముందు  పీడీఎఫ్ లుగా చూశాను గానీ, పుస్తకాలుగా ప్రత్యక్షంగా చూడటం ఇదే

మొదటిసారి. ఆ అనుభూతితో చందమామ   పేజీలను ఆత్మీయంగా స్పర్శించి, తిరగేస్తుంటే చాలా సంతోషమనిపించింది. సుబ్రహ్మణ్యం గారి గురించి పత్రికల్లో వచ్చిన రచనలు అక్కడున్న  గోడ మీద డిస్ ప్లే చేశారు.

వీటిని ఏర్పాటు చేయటం వెనక నిర్వాహకుల శ్రద్ధ అభినందనీయం.

పుస్తకాలను  ఫోటో తీస్తుంటే అక్కడే ఉన్న దాసరి వెంకటరమణ గారు పలకరించారు.(ఆయన సేకరణే ఈ పుస్తకాలన్నీ).


 సభలో రామవరపు గణేశ్వరరావు గారు, వాసిరెడ్డి నారాయణరావు గారు, అట్లూరి అనిల్ గారు  దాసరి గారితో  వ్యక్తిగతంగా తమ చిరకాల  అనుబంధాన్నీ,జ్ఞాపకాలనూ గుర్తుచేసుకున్నారు. దాసరి వెంకట రమణ , చొక్కాపు వెంకట రమణ, మరికొందరు మాట్లాడారు.

 జనాలతో ఎవరితోనూ కలవని అంతర్ముఖుడైన దాసరి గారి ఆత్మగౌరవం గురించీ, సాహితీ సభలకు వెళ్ళటంపై ఆయన అనాసక్తి గురించీ ప్రస్తావించుకున్నారు. గట్టివాడూ, మొండివాడుగా కనిపించే ఆయన సున్నిత స్వభావం గుర్తు చేసుకున్నారు.


చిన్నపిల్లల రచనలే కాకుండా దాసరి గారు రాసినవి  ‘ఇంద్రాణి’ అనే కథాసంపుటి, పులిగోరు, భూతాల రాయుడు అనే పుస్తకాలున్నాయి. చందమామలోనే శంభుదాసు అనే పేరుతో కొన్ని కథలు రాశారు. ఇంకా  దాసు, సుజాత, భవానీ ప్రసాద్ అనే కలం పేర్లతో కూడా రచనలు చేశారు.

తెలుగులో రచయితలు తమ జీవితకాలంలో  స్వయంగా పట్టించుకోకపోతే వారి రచనల సేకరణ ఎప్పటికీ అసమగ్రంగానే ఉండిపోతుంది. కొ.కు. రచనల సంగతి అలాగే అయింది. ఎంతో క్రమశిక్షణతో రచయితలకు వారి రచనల గురించి  శ్రద్ధగా లేఖలు రాసే సుబ్రహ్మణ్యం గారి రచనల విషయమూ అలాగే అవటం విచిత్రం! సుబ్రహ్మణ్యంగారు సొంతపేరుతో, కలం పేర్లతో రాసినవీ,అజ్ఞాతంగా  ఇతర పత్రికల్లో చేసిన రచనలూ ఇంకా సేకరించాల్సేవుంది. 

ఈ సంస్మరణ సభ మూలంగా  కొన్ని  విశేషాలు తెలిశాయి.

 రచన శాయి గారు దాసరి గారి సాహిత్యాన్ని సేకరించటానికి చేసిన ప్రయత్నంలో శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. మరికొన్ని సేకరించాల్సినవి ఉన్నాయి.

ఇక శాయి గారు దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వేయాలనే సంకల్పాన్ని  వ్యక్తపరిచారు. చందమామ చిత్రకారులు వేసినట్టే  ఆ కథకు బొమ్మలు వేయించాలనుకుంటున్నానని చెప్పారు. ‘రచన’ ఏప్రిల్ సంచికను దాసరి గారి ప్రత్యేక సంచికగా తీసుకురాబోతున్నారు.  

ఇక వ్యక్తిగతంగా నాకు సంతోషం కలిగించిన మరో విషయం- ‘బొమ్మరిల్లు’లో నా అభిమాన ధారావాహిక ‘మృత్యులోయ’ రచయిత ఎవరో ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను; ఈ సభ కారణంగా!
 

కొసమెరుపు: ఆత్మల ఉనికినే నమ్మని నాస్తికుడైన  దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘ఆత్మశాంతి’కోసం సభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. కొందరు వక్తలైతే- అలవాటుగానేమో,ఆయన ‘స్వర్గస్థు’లయ్యారంటూ
మాట్లాడేశారు!

సభలో వక్తల ప్రసంగాలను ఇక్కడ చూడొచ్చు.



విజయవాడలో మరో్ సభ!

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ ను విజయవాడలో్ ఫిబ్రవరి 21న (ఆదివారం)
సాయంత్రం 6 గం.లకు నిర్వహిస్తున్నారు.

వేదిక- చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.


చందమామ అభిమానులు,  దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై తమ మనోభావాలను పంచుకోవచ్చు.

వివరాలకు -  కొత్తపల్లి రవిబాబు -+919490196890 e mail: ravibabu@yahoo.co.in


దివికుమార్ -+919440167891, 0866-2417890: divikumar1949@yahoo.com

14 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Ravi చెప్పారు...

కొసమెరుపు గురించి...
ఆయనకు ఆత్మల ఉనికి మీద నమ్మకం లేకపోయినా మాట్లాటే వాళ్ళకు నమ్మకం ఉంది కదా! అందుకనే అశువుగా అలా వచ్చేసుంటాయి ఆ మాటలు. :-)

కెక్యూబ్ వర్మ చెప్పారు...

కథల మాంత్రికునికి నివాళి...ఆయన రచనలన్నీ ఒక ప్రత్యెక స౦కలన౦గా తీసుకు వస్తారా?

Saahitya Abhimaani చెప్పారు...

వేణూగారూ! దాసరివారి సంస్మరణ విశేషాలను అందించినందుకు కృతజ్ఞతలు. నేను ఆఫీసులో పని వత్తిడి వల్ల రాలేని పరిస్థితులు, దూరాభారం. ఎమైనా మీ ద్వారా అక్కడకు వచ్చి చూసినంత ఆనందం కలిగింది.

రచన శాయిగారి చెప్పిన విషేషం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. చందమామలో లాగ బొమ్మలు వేయించి కథలు ప్రచురిస్తే రచన తప్పకుండా కొని చదువుతాంకదా.

దాసరిగారు వ్రాసిన అనేక ఇతర కథల గురించి, వారి కలం పేర్లగురించి ఇప్పుడే మీద్వారా తెలుసుకున్నాను.

తరువాత బొమ్మరిల్లు మొదటి ధారావాహిక మృత్యులోయ వ్రాసినది ఎవరండి చెప్పరూ. ఈ ధారావాహిక గురించి మరొక వ్యాసం వ్రాస్తారు నాకు తెలుసు. మౄత్యులోయ ధారావాహిక పూర్తిగా (నిజంగా పూర్తిగా) నా దగ్గ హార్డు కాపీ ఉన్నది. ఈ సారి విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చి, స్కాన్ చేస్తాను.

వేణు చెప్పారు...

సుజాతా!
మీరన్నట్టే- అటువంటి సాహితీసంస్థలు సుబ్రహ్మణ్యం గారి గురించి పట్టించుకోకపోవటం నిజంగా ఆయనకు గౌరవమే! మీ స్పందనకు ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

రవిచంద్రా,

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభలో వక్తలు యథాలాపంగా ఆయన ‘స్వర్గస్థులయ్యా’రని మాట్లాడివుంటారు. అది ఓకే!

కానీ, ఆ రచయితను స్మరించుకుని,గౌరవించుకునే సందర్భంలో ఆయన నమ్మకాలకు విలువ ఇవ్వాలా? వద్దా? అదీ నా ప్రశ్న.

ఆయన ‘ఆత్మ’శాంతికి మౌనం పాటించకుండా ఉంటే సరిపోయేది కదా? మిగతా అన్నీ బావున్నా ఇది మాత్రం ఆ సభలో నిశ్చయంగా అపశ్రుతే!

వేణు చెప్పారు...

కెక్యూబ్ వర్మ గారూ!
థాంక్యూ.
దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనలన్నీ పాఠకులకు అందుబాటులో తేవాలని వక్తలు సభలో ఆకాంక్షించారు. ఈ దిశలో రచన శాయి, దాసరి వెంకటరమణ గార్లు చేసే ప్రయత్నం ఫలిస్తుందని ఆశిద్దాం. ‘రచన’ ఏప్రిల్ సంచికలో దాపరి గారి కొన్ని రచనలు మనం చదవొచ్చు.

వేణు చెప్పారు...

శివ గారూ!

మీ అభిప్రాయానికి థాంక్యూ.

‘మృత్యులోయ’ రచయిత పేరు కొంచెం దేవరహస్యమనే చెప్పాలి. అయినా మీరు తేలిగ్గానే ఊహించగలరు. యశపాలుడూ,జయకేతుడూ అనే జంట కథానాయకులూ, ఆ రచనా శైలీ గమనించి చూడండి!

ఈ ధారావాహిక గురించి మరో వ్యాసం రాస్తానని కమిట్ చేయిస్తున్నారే..:)

‘మృత్యులోయ’ బొమ్మరిల్లు ప్రచురణగా రెండు భాగాలుగా ప్రచురితమైంది.అది నా దగ్గరుంది. మీ దగ్గర బొమ్మరిల్లు సంచికల భాగాలుంటే, స్కాన్ చేయించి, అప్ లోడ్ చేస్తే, నాతోపాటు చాలామంది సంతోషిస్తారండీ. మీ ‘విజయవాడ ప్రయాణం’ కోసం ఎదురుచూస్తుంటాను!

kanthisena చెప్పారు...

"తనకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా ,అనాయాసంగా అంతర్థానమైన రచయిత... జానపద కథల మాంత్రికుడు.."

దాసరి గారి బౌద్ధిక, ఆంతరంగిక ప్రపంచాన్ని ఈ ఒక్క వాక్యంతో విప్పి చెప్పారు. సంస్మరణ సభ విశేషాలపై కూడా హృద్యమైన కథనం పోస్ట్ చేశారు. అభినందనలు, అడగగానే, శ్రమకోర్చి చందమామకు కూడా సభ వివరాల నివేదిక పంపినందుకు కృతజ్ఞతలు. శాయిగారి వద్ద ఇప్పటికే నేను ఏప్రిల్ రచన కాపీలు 10 లేదా 20 నాకోసం తీసి పంపమని, వాటి వెల పంపుతానని చెప్పాను. దాసరి గారి గురించి అడిగే వారికి ఆయన పుస్తకం కూడా బహూకరిస్తే ఆ అనందాన్ని కొలవలేము గదా!

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెలుగులో బాల సాహిత్యం చందమామను దాటి పోలేదు అనే అంశంతో చర్చ నడుస్తున్నట్లుంది. తెలుగులో హారీ పోటర్లు ఎందుకు రాలేదు అనే చర్చలో భాగంగా శివరాం ప్రసాద్ గారు చేసిన ఈ వ్యాఖ్యను ఇక్కడ గుర్తుకు తేవడం సందర్భ సహితం అనుకుంటాను. "చందమామలో దాసరి సుబ్రహ్మణ్యంగారి ధారావాహికలముందు, హారీ పోటర్లు తీసికట్టు. ఆయన వ్రాసిన పన్నెండు ధారావాహికలు ఒక్కొక్కటి వంద హారీ పోటర్లకు సమానం." ఈ మహానుభూతి చందమామ ధారావాహికలు చదివిన వారికే కలుగుతుందనుకుంటాను.

వేణు చెప్పారు...

రాజు గారూ,

ధన్యవాదాలండీ. హారీ పోటర్ ప్రస్తావన సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభలో కూడా వచ్చింది. అలాగే, అవతార్ సినిమాలో సన్నివేశాలు ‘జ్వాలాద్వీపం’ ధారావాహికకు అనుసరణ అని వక్తలు ప్రస్తావించుకున్నారు కూడా!

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి కార్యక్రమాల గురించి మరి కొంచెం ప్రచారం చేస్తే సిటీలో ఉన్న మాలాంటి అభిమానులు కూడా హాజరవుతారు కదా! ఆయన గురించి మీ బ్లాగులో చదవడమే! ఆయన ఇతర పుస్తకాలు కూడా రాశారని ఇవాళే తెలిసింది. ఇటువంటి మహానుభావులు సాహితీ సంస్థలకు అక్కర్లేకపోవచ్చు కాక! కానీ మాలాంటి సాహిత్యాభిమానులకు తప్పకుండా కావాలి. ఆయన గురించి మాకు తెలిసే సరికే మాకు అందని తీరాలకు వెళ్ళిపోయారు.

కనీసం సంస్మరణ సభ గురించి అయినా అభిమానులకు తెలిసే విధంగా ఏదైనా చేసి ఉంటే బావుండేది.

వేణు చెప్పారు...

neelaanchala గారూ, దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ గురించి ‘మన తెలుగు చందమామ’ బ్లాగులో, రాజశేఖర రాజు గారి ‘చందమామ చరిత్ర’బ్లాగులో టపాలు వచ్చాయి. ఆ రోజు దినపత్రికల ఎంగేజ్ మెంట్ కాలమ్స్ లో కూడా సమాచారం వచ్చింది. కాకపోతే, మీరన్నట్టు ఎక్కువ మందికి తెలియజేసే పని ఇంకా బాగా జరగాల్సింది.
>> ఇటువంటి మహానుభావులు సాహితీ సంస్థలకు అక్కర్లేకపోవచ్చు కాక! కానీ మాలాంటి సాహిత్యాభిమానులకు తప్పకుండా కావాలి.

చాలా బాగా చెప్పారండీ. ధన్యవాదాలు!

Kalpana Rentala చెప్పారు...

వేణు గారు,

చాలా బాగా రాశారు. మాలాంటి వాళ్ళం దూరం గా వుంటాము కాబట్టి మీరు, చందమామ రాజు గారు ఇలాంటి విషయాల గురించి చెప్తుంటే తెలుస్తోంది. అందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

కల్పన గారూ, థాంక్యూ!