సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, మార్చి 2011, శుక్రవారం

ఇద్దరు కవుల ‘విగ్రహ’వాక్యాలు!

విధ్వంసకుల  ఉన్మాద చర్యకు జాలి..
వారి సమర్థకుల దబాయింపులకు విస్మయం...

ఇలాంటి  భావాలన్నీ కలగాపులగమవుతున్న తరుణంలో  ముఖ్యంగా జాషువా... శ్రీశ్రీ లు  ‘విగ్రహ ప్రతిష్ఠాపన’లపై  రాసిందీ... మాట్లాడిందీ గుర్తుకొచ్చింది.

"రాజు మరణించెనొక తార రాలిపోయె
సుకవి మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములయందు
సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"


అనేది జాషువా తత్వం.  ‘రాతి విగ్రహం’ పగలగొట్టి  ఆయన్ను అవమానించగలరా ఎవరైనా?


ఇక శ్రీశ్రీ కి సంబంధించిన ఉపాఖ్యానం :
‘మీ  విగ్రహాన్ని భారీ ఖర్చుతో తయారుచేసి, ఘనంగా నాలుగు రోడ్ల కూడలిలో పెడదామనుకుంటున్నాం’ అని  అభిమానులెవరో ఆయనతో అన్నారట.

దారుణమైన ఆర్థిక సమస్యల్లో ఉన్న శ్రీశ్రీ  ఏమన్నాడో తెలుసా?- ‘‘ఆ విగ్రహానికి పెట్టే ఖర్చేదో నాకు ఇచ్చెయ్యండి.  ఆ కూడలికి నేనే వెళ్ళి నిలబడతాను’అని!  పైకి జోక్ గా కనిపించినా ఆ మహాకవి దారిద్ర్యానికి అద్దం పట్టే వ్యాఖ్య ఇది!

అంతే కాదు;
శిలా విగ్రహాలు పెట్టించుకోవాలనే మోజు  లేని శ్రీశ్రీ ని  విగ్రహ విధ్వంసంతో ఎవరు మాత్రం దెబ్బతీయగలరు?

విద్వేషం...  విధ్వంసాన్ని మించి  ప్రమాదకరం.
‘మూర్తి’కంటే ‘స్ఫూర్తి’ ప్రధానం!

తెలుగు నుడిలో,  పలుకుబడిలో... ఈ కవుల రచనలు ఎప్పుడో భాగమైపోయాయి.  అక్షరాల్లో ఆర్ద్రత వర్షించిన జాషువా, అగ్ని వెదజల్లిన శ్రీశ్రీ  ప్రాముఖ్యం, ప్రాసంగికతా ‘మాకు  వద్దం’టే మాత్రం మాయమైపోతాయా?

శ్మశాన ఘట్టాన్ని జాషువా మల్లే ఎవరు అభివర్ణించగలరు?


‘శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ’ వెలువడిన శ్రీశ్రీ కవితాఝరిని ఎవరు మాత్రం అడ్డగించగలరు? 

*  *   *

‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన
నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’


అని జాషువా ఘోషిస్తే...  ఆ విశ్వనరుణ్ణి  ఓ ప్రాంతానికి మాత్రమే  పరిమితం చేయటం హ్రస్వ దృష్టి మాత్రమే!

‘చీనాలో రిక్షావాలా,
 చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ’
అంటూ అంతర్జాతీయ దృక్పథంతో ...

‘నేను  సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’
అని ప్రకటించుకున్న  శ్రీశ్రీ   సంకుచితమైన సరిహద్దుల్లో ఒదుగుతాడా?



20 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

ఎంత బాగా చెప్పారండీ!....సరి అయిన సమయంలో మంచి కవితలను గుర్తుకుతెచ్చారు. మీ మాట ముమ్మటికీ నిజం.

సత్యాన్వేషి చెప్పారు...

బావుంది. అలాగే "దేశమంటే మట్టికాదొయ్, దేశమంటే మనుషులోయ్" అని గురజాడ అన్నాడు. ఇప్పుడు గురజాడ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకునే వారు ఆరు కోట్ల ప్రజల ఆకాంక్షకు, రాలిన ఆరువందల ప్రాణాలకు ఇచ్చే విలువ ఎంత అంటే: హేళనలు, అవమానాలు, అనుదినమూ అబద్దాలు.

సమైఖ్యంగా ఉందామని గొప్పలు పోయే వారికి కావలిసింది అక్కడి మనుషులు కాదు, భూములు, కబ్జా ఆస్థులు.

brahma చెప్పారు...

very nice one

Praveen Mandangi చెప్పారు...

శ్రీశ్రీ గారు మార్క్సిస్ట్ రచయిత. వ్యక్తిపూజ (personality cult) మార్క్సిజానికి వ్యతిరేకం. విగ్రహాలు కట్టడం అంటే వ్యక్తిపూజ చెయ్యడమే కదా. అటువంటప్పుడు శ్రీశ్రీ గారికి విగ్రహం ఎందుకు కట్టినట్టు? వ్యక్తి పూజ చేస్తే విప్లవ లక్ష్యం దెబ్బ తింటుంది. లెనిన్, స్టాలిన్‌లు బతికి ఉన్నప్పుడు వాళ్లకి వ్యక్తిపూజ చేసి, వాళ్లు చనిపోయిన తరువాత వాళ్లని ఉత్సవ విగ్రహాలని చేసి చివరికి వాళ్ల విగ్రహాలనే కూల్చే రోజులు తెచ్చారు. కాకపోతే శ్రీశ్రీ విగ్రహం కూలిపోయింది వేరే కాంటెక్స్ట్‌లో. అది ప్రాంతీయ ఉద్యమంలో. శ్రీశ్రీ గారికి విగ్రహ పతిష్ఠ చేసి వ్యక్తిపూజ చెయ్యడం ఎందుకు? విగ్రహం కూలిపోయిన తరువాత కూల్చినవాళ్లని తిట్టడం ఎందుకు?

ఎలక్ట్రాన్ చెప్పారు...

ఎంత బాధపడివుంటారో మీరు.. ఇంత హృద్యంగా చెప్పారు..

Praveen Mandangi చెప్పారు...

శ్రీశ్రీ గారే కాదు, గురజాడ గారు కూడా తనకి విగ్రహాలు పెట్టాలని చెప్పలేదే. వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠల కోసం ప్రాకులాడిన వాడికి ఊరూరా విగ్రహం పెట్టినా అతనికి కీర్తి పెరగదు. ముఠా నాయకుడు రాజశేఖరరెడ్డి విగ్రహం మా ఊర్లో కూడా ఉంది, అతని కొడుకు సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి జనం ఇంకా మర్చిపోకపోయినా. శ్రీశ్రీ, గురజాడ లాంటి మహనీయులకి విగ్రహాలు అవసరం లేదు. వాళ్ల అడుగుజాడల్లో నడిస్తే చాలు. గురజాడ గారు జాతకాలని నమ్మరాదు అన్నారు. కానీ ప్రయాణాలకి కూడా ముహూర్తాలు చూసేవాళ్లు ఉన్నారు. భర్త చనిపోయిన స్త్రీలకి రెండవ పెళ్లి చేసుకునే హక్కు ఉండాలన్నారు. మన చుట్టుపక్కలే ఒకడు "మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు" అని భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సామెత వాడితే అలా అనడం తప్పు అని వాడికి చెప్పము. ఎందుకంటే మనవాళ్లకి మహనీయుల అడుగుజాడలు కంటే వాళ్ల విగ్రహాలే ముఖ్యం. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చి వెయ్యడం జరిగిన తరువాత కొత్తగా పోయినది ఏమిటి? ఆ విగ్రహాలు తయారు చెయ్యడానికి ఖర్చైన సిమెంట్, రంగులు తప్ప? మహనీయులని మన:స్ఫూర్తితో గౌరవించండి కానీ విగ్రహాలు పేరుతో కాదు.

వేణు చెప్పారు...

ఆ.సౌమ్య గారూ!
థాంక్యూ!
ch.brahmanandam గారూ!
ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

సత్యాన్వేషి గారూ!
సమైక్యవాదుల్లోనూ, ప్రత్యేక వాదుల్లోనూ రకరకాల లక్ష్యాల వాళ్ళుండటం చూస్తూనే ఉన్నాం. అయితే విద్వేషం, అసహనం పెంచుకోవటం ఏ ఉద్యమానికీ మంచి చేయదు. మనుషుల ప్రాణాలు విలువైనవే. అంతమాత్రం చేత సంస్కృతికి ప్రతీకలైన మహనీయులను సంకుచితంగా అపార్థం చేసుకుని, వారి శిలా విగ్రహాలను ధ్వంసించటం సహేతుకం అయిపోదు.

ఉద్యమనేతలు విగ్రహాల విధ్వంసాన్ని నిర్ద్వంద్వంగా ఖండించకపోవటాన్నీ, పైగా సమర్థించటాన్నీ మీరేమంటారు?

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ!
‘శ్రీశ్రీ గారికి విగ్రహం ఎందుకు కట్టినట్టు?’ అనడగుతున్నారు మీరు. కట్టింది ఎవరు? విప్లవ కార్యాచరణ లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం కాదు కదా! ఆయన అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను సంతృప్తి పరచటానికి విగ్రహం పెట్టి వుంటారు.

శ్రీశ్రీ లాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టమని చెప్పరు. చెప్పలేదు. నా టపా లో ఉన్న పాయింటే అది కదండీ!

విగ్రహాలు పెట్టకుండా వాళ్ళ అడుగుజాడల్లో నడవటం ఉత్తమోత్తమమైన విషయమే. అయితే- పెట్టిన విగ్రహాన్ని సంకుచితమైన కారణం ఆపాదించి, ద్వేషంతో కూల్చటం గురించే ప్రశ్నించాలి! ఆ కూల్చటం ‘విగ్రహాలు వద్దులే, వాళ్ళ అడుగుజాడల్లో నడుద్దాం’ అనే (విప్లవ) చైతన్యంతోనో, పరిణతితోనో చేయలేదు కదా! అలా చేసిననాడు ‘ఆ విగ్రహాలు తయారు చెయ్యడానికి ఖర్చైన సిమెంట్, రంగులు తప్ప కొత్తగా పోయిందేమిటి?’ అని మీరు సంతోషిద్దురు గాని!

సత్యాన్వేషి చెప్పారు...

వేణు,

1) ఖండించడమంటూ చేస్తే ఖండనలు ఎక్కడ మొదలు పెట్తాలన్నదే ఇక్కడ సమస్య, అంతే కానీ ఆ మహనీయులపైన ఇక్కడ ఎవరికీ ద్వేషం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఒక నిరశన కార్యక్రమాన్ని చేసుకుంటే దానికి అనుమతి నిరాకరించి ర్యాలీని ఫెయిల్ చెయ్యాలనే ఒకే ఉద్దేషంతో లక్షల మందినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు కూడా చాలక కనిపించిన ప్రతి ప్రభుత్వ భవనాన్ని జైలుగా మార్చి బంధించి బస్సులూ రైల్లనూ ఆపేసి 300ల చెక్ పోస్టులు పెట్టి ర్యాలీని అణచివెయ్యడానికి ప్రయత్నం చెయ్యడాన్ని ఒక్క సీమాంధ్ర నేతకూడా ఖండించకపోవటం, మన తెలుగు మీడియా అసలు ఆ వార్తే రాయకపోవడం మీరెలాగ చూస్తారు? ఎక్కడో ఈజిప్ట్‌లో ప్రజలు ఉద్యమిస్తే మన పేపర్లు రాస్తాయి, ఇక్కడ మనప్రజా ఉద్యమాన్ని ఇంత ఘోరంగా అణచివెయ్యడాన్ని మాత్రం అసలు పట్టించుకోం.

2) లక్షమందిని అరెస్టుచేసి అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నా తెగించి యాభై వేలమంది ర్యాలీ చేపడితే, మరుసటి ప్రజల ఆకాక్షకు విలువనివ్వకుండా మరుసటిరోజున "ఫెయిల్ అయిన మిలియన్ మార్చి, పదివేలు కూడా రాలేదు" లాంటి హెడ్డింగులతో మన పేపర్లు నిండిపోతే మీరు హర్షిస్తారా? అది సహించని ఉద్యమకారులు తమ ఆవేశాన్ని అక్కడ కనపడ్డవాటిపై వెల్లగక్కడం అంతపెద్ద నేరమా? పోనీ ప్రజాస్వామ్య బద్దంగా చేపట్టిన నిరశనలకు ప్రభుత్వం, మీడియా ఎప్పుడైనా విలువ ఇచ్చిందా?

మనం మన మహనీయుల విలువలను ఇలా పాటిస్తున్నాం:

దేశమంటే మనుషులు కాదోయ్,
దేశమంటే కబ్జా భూములూ, విగ్రహాలోయ్!!

వేణు చెప్పారు...

సత్యాన్వేషి గారూ!
ఉద్యమం వేరు; విధ్వంసం వేరని నేను నమ్ముతున్నాను. ఉద్యమకారులు విధ్వంసాన్ని ఉద్యమంలో భాగంగా చూడకూడదనీ, దాన్ని గుడ్డిగా సమర్థించకూడదనీ ఆశిస్తాను.

‘ఆ మహనీయులపైన ఇక్కడ ఎవరికీ ద్వేషం లేదు’ అన్నారు. నిజమా?!

ద్వేషం లేనపుడు ఎందుకు ధ్వంసం చేశారనే దానికి సమాధానంగా - ‘ ఉద్యమకారులు తమ ఆవేశాన్ని అక్కడ కనపడ్డవాటిపై వెల్లగక్కడం అంతపెద్ద నేరమా?’ అంటున్నారు మీరు. ‘ కొన్నిటిపైనే’,‘సెలక్టివ్ గా’ ఎందుకు ధ్వంసం చేశారో చెప్పగలరా? ఇదంతా అనుకోకుండానే క్షణికావేశంలో జరిగిందని మీరు నిజంగానే నమ్ముతుంటే చెప్పేదేమీ లేదు.

ప్రభుత్వం, మీడియా పక్షపాతం సంగతంటారా? అది వేరే కాంటెక్ట్స్.

సత్యాన్వేషి చెప్పారు...

ఒక ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివెయ్యడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఆవేశానికి గురయిన ఉద్యమకారులందరూ ఒకేలా రియాక్ట్ కావలని మీరెలా అనుకుంటున్నారో నాకర్ధం కావడం లేదు. కొందరు సరే పోనీ అని ఊరుకుంటారు, కొందరు కడుపు రగిలి ఆత్మాహుతి చేసుకుంటారు (చేసుకున్నారు కూడా), ఇంకొందరు విధ్వంసానికి ఒడిగడతారు. దాన్ని ఎవరూ గుడ్డిగా సమర్ధించలేదు, గుడ్డిగా విమర్శించకుండా అందుకు దారి తీసిన పరిస్థుతులు గమనించాలనేదే ఇక్కడ వాదన.

ఇక విధ్వంసం లేని ఉద్యమమంటూ లేదు, పదిహేనురోజులు జరిగిన సమైఖ్య ఉద్యమంలో 15 నెలల తెలంగాణా ఉద్యమంకంటే ఎక్కువ విధ్వంసమే జరిగింది, అక్కడ విగ్రహాలు కూలకపోవడానికి కారణం అక్కడ విగ్రహాలు లేకపోవడమే. మన దురదృష్టం ఏమిటంటే మన అప్రజాస్వామ్య ప్రభుత్వాలు విధ్వంసం జరిగితేగానీ ఉద్యమాలను పట్టించుకోవు.

సత్యాన్వేషి చెప్పారు...

విగ్రహాల ధ్వంసం క్షణికావేశమని నేననుకోవడలేదు, అంతకు మూడు రోజులముందునుంచి జరుగుతున్న అణచివేత ఫలితమని నేననుకుంటున్నాను. ఉద్యమానికి అనుమతిని నిరాకరించి నాయకులను అరెస్టు చెయ్యడం ద్వారా ప్రభుత్వం జరిగిన పరిణామాలపై ప్రశ్నించే హక్కును కోల్పోయిందని అనుకుంటున్నాను. అలాగే ద్వేషం విగ్రహాలపైన కాదు, వివక్షపైన అనుకుంటున్నాను. విగ్రహాలలో జరిగిన వివక్ష చాలా చిన్నదే కావొచ్చు.. కానీ సాగునీటిలోనో, నిధులూ, నియామకాలలోనో జరిగిన వివక్షను ధ్వంసం చెయ్యడం సాధ్యం కాదు, ఆవేశంలో సాఫ్ట్ టార్గెట్‌లే దెబ్బతింటాయి.

అజ్ఞాత చెప్పారు...

@సత్యాన్వేషి

"హేళనలు, అవమానాలు, అనుదినమూ అబద్దాలు"

వాళ్ళు హేళనలు, మీరు బండబూతులు. అంతేగా?


" మరుసటిరోజున "ఫెయిల్ అయిన మిలియన్ మార్చి, పదివేలు కూడా రాలేదు" లాంటి హెడ్డింగులతో మన పేపర్లు నిండిపోతే మీరు హర్షిస్తారా? అది సహించని ఉద్యమకారులు తమ ఆవేశాన్ని అక్కడ కనపడ్డవాటిపై వెల్లగక్కడం అంతపెద్ద నేరమా?"

ఒహో! అంటే విగ్రహాల విధ్వంసం మిలియం మార్చ్ మరుసటిరోజున జరిగిందన్నమాట. అమ్మా! మొత్తం పేపర్లు న్యూస్ చానెళ్ళు అన్నీ అబద్ధ్హలు చెప్పాయి కదా. మీరొకరే కదా నిజం మాట్లాడేది?


"ఇక విధ్వంసం లేని ఉద్యమమంటూ లేదు, పదిహేనురోజులు జరిగిన సమైఖ్య ఉద్యమంలో 15 నెలల తెలంగాణా ఉద్యమంకంటే ఎక్కువ విధ్వంసమే జరిగింది"

అంటే సమైక్యాంధ్రది ఉద్యమమని ఒప్పుకున్నట్టేగా? ఇదే చేత్తో మొన్నెప్పుడో అసలది ఉద్యమం కాదు అని రాశారు. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నిజం ఏది అబధ్ధం?

హరి చెప్పారు...

నిజంగా తెలంగాణా వారు ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేయాలంటే ఆ విగ్రహాలు శ్రీశ్రీవో, జాషువావో కానక్కర లేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో 350 ఉద్యమ కారుల చావులకు, ఉద్యమ అణచివేతకు కారకుడైన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం, నిన్న మొన్నటివరకు అడ్డమూ, నిలువూ కాదని చెప్పుతూనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మోకాలడ్డిన రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు బ్రహ్మాండంగా తల ఎత్తుకునే ఉన్నాయి, హైదరాబాదులో, తెలంగాణా అంతటా.

Praveen Mandangi చెప్పారు...

కవులూ, కళాకారులూ, సంఘ సంస్కర్తలూ ఎవరైనా చనిపోయిన తరువాత ఉత్సవ విగ్రహాలు అయిపోతారు. భర్త చనిపోయిన స్త్రీలని అవమానించే ముండమోపి లాంటి పదాలు వాడేవాడు గురజాడ గారి విగ్రహానికి కొబ్బరికాయ కొడితే ఎలా ఉంటుందో, భూకబ్జాలు చేసేవాడు శ్రీశ్రీ గారి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తే అలాగే ఉంటుంది. ముఠా నాయకుడైన రాజశేఖరరెడ్డికి ఊరూరా విగ్రహాలు కట్టినవాళ్లు శ్రీశ్రీ గారికి విగ్రహం కడితే ఎంత, కట్టకపోతే ఎంత?

వేణు చెప్పారు...

ఎలక్ట్రాన్ గారూ! మీ వ్యాఖ్య ‘స్పామ్’ ఫోల్డర్ లోకి వెళ్ళింది ఎందుకనో. అందుకే నిన్న చూడలేక పోయాను. ఇవాళ చూసి, పబ్లిష్ చేస్తున్నా. ధన్యవాదాలు!

Praveen Mandangi చెప్పారు...

గూగుల్ బజ్‌లో కూడా విగ్రహాల ద్వంసం గురించి చర్చలు జరిగాయి.

తెలుగు తల్లి అనేది ఊహాజనితం కనుక తెలుగు తల్లి విగ్రహం ద్వంసం చెయ్యడం తప్పు కాదని ఒక తెలంగాణావాది అంటే తెలంగాణా తల్లి కూడా ఊహాజనితమే కదా అని ఒక సమైక్యవాది అన్నాడు.

ట్యాంక్ బండ్ మీద ఉన్న శ్రీకృష్ణ దేవరాయుల విగ్రహం సినిమాలలోని NTR వేషాన్ని పోలి ఉండేది, వాస్తవానికి శ్రీకృష్ణ దేవరాయులు హిందువులాగ కాషాయ వస్త్రాలు వేసుకుని ముస్లింలాగ టోపీ పెట్టుకునేవాడు అని ఒక తెలంగాణావాది అన్నాడు. హిందూ దేవతల బొమ్మలు కూడా ఊహాచిత్రాలే కదా అని హిందూ దేవతలకి చిత్రాలు వెయ్యడం మానేస్తామా అని ఒక సమైక్యవాది అడిగాడు.

తెలంగాణావాదులు & సమైక్యవాదుల వాదనలు ఎలాగున్నా విగ్రహాలు పెట్టడం అనేది సిమెంట్ & రంగులు వృధా చేసే పనే అని నేను నమ్ముతాను. అవి కూల్చినా కూడా సిమెంట్ & రంగులు పోవడం తప్ప పెద్ద నష్టమేమీ రాదు.

శ్యామలీయం చెప్పారు...

చాలా ఆలస్యంగా చుసానీ‌టపాని
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని ఉండాలి.

వేణు చెప్పారు...

@ Kondala Rao Palla : Thank you.

@ శ్యామలీయం: పద్యం సవరించినందుకు కృతజ్క్షతలు. వికీలో, మరికొన్నిచోట్లా ఇలాగే కనపడుతోంది. మీరు పేర్కొన్న పదంతో పాటు మరికొన్ని పదాల్లోనూ తేడాలున్నాయి.

ఈ సందర్భంగా ‘జాషువ’ సర్వ లభ్య రచనల సంకలనం నుంచి ఈ పద్యం సరైన రూపం ఇస్తున్నాను.
----------------
ఇది తేటగీతి పద్యం.

రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగనమెక్కె
రాజు జీవించె ఱాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకలయందు