సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, ఏప్రిల్ 2015, గురువారం

రెండో వైపు ... మరో రూపు!

‘గాయత్రి’ అనే ఒక పాత  (డబ్బింగ్? ) సినిమా ఉంది.  దానిలో  హీరోయిన్  అటు వైపు మొహం పెట్టి  నిలబడి వుంటుంది. ఆమె దగ్గరకు వెళ్తాడో  వ్యక్తి. పిలుస్తాడు.

 ఆమె హఠాత్తుగా   వెనక్కి తిరుగుతుంది. అప్పుడామె  మొహం  అనూహ్యంగా - వికృతంగా కనపడి  ప్రేక్షకులకు ఒక్కసారిగా జలదరింపు కలుగుతుంది.

హారర్  సినిమాల్లో  ఈ టెక్నిక్ ను చాలాసార్లు వాడుతుంటారు.   

*  *  *


హైదరాబాద్ లో   సాలార్ జంగ్ మ్యూజియం  చూసినవారికి  అక్కడి ‘డబుల్ స్టాచ్యూ ’ ప్రత్యేకత తెలిసేవుంటుంది.



 ఇదే ఆ శిల్పం!  దీన్ని ఫొటో రూపంలో నేను  మొదటిసారి చూసినపుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. 

ఏ కోశానా పోలిక లేని  వేర్వేరు  ముఖాలతో- భంగిమలతో  ఉన్నది ఒకే శిల్పం అంటే చప్పున  నమ్మ శక్యం కాలేదు.  

పరిశీలించి చూస్తే గానీ  ఆ భంగిమలోని మర్మం అర్థం కాలేదు.

19వ శతాబ్దంలోని ఈ దారు (చెక్క) శిల్పాన్ని గుర్తు తెలియని ఫ్రెంచి  కళాకారుడు చెక్కాడట. జర్మన్ నాటక కర్త  గెథె ( క్రీ.శ. 1808) రాసిన ‘డాక్టర్ ఫాస్టస్’ నాటకంలోని రెండు  పాత్రలు మెఫిస్టోఫిలిస్-  మార్గరెట్టా.  చెడుకూ, మంచికీ  ప్రతీకలు.

మెఫిస్టోఫిలిస్  తల పైకెత్తి  ఒక చేతిని మడిచి వీపు వెనక్కి వంచి  రొమ్ము విరుచుకోవడంలో మొహంలోని తీక్ష్ణతతో కలిపి  ఆ పాత్ర స్వభావం వ్యక్తమవుతుంది. 

మరి  అతడి  వీపు భాగాన  చెక్కిన  మార్గరెట్టా ?  

మెఫిస్టోఫిలిస్  భంగిమ...  వీపు వెనకవైపున్న  ఆమె రూపానికీ, స్వభావానికీ తగినట్టు  పూర్తిగా  భిన్న ప్రయోజనం కలిగించింది. 


తల కిందికి దించి, చేతిని ముందుకు పెట్టి నమ్రతగా ముందుకు వంగినట్టు  తయారైంది. ఆమె భంగిమా, మొహంలోని ప్రశాంతతా చూస్తే ..  పూర్తి వేరే శిల్పంలా భ్రమ కలిగిస్తుంది.

అతడి తలపాగా ఆమె మేలి ముసుగుగా మారిందని గమనించారా? 
మరో కోణంలో....

సందర్శకుల వైపు మెఫిస్టోఫెలిస్ ను ఉంచి, అద్దంలో వీపు వైపున్న మార్గరెట్టాను  కనపడేలా చేయటం కూడా బాగుంది.

ఒకవేళ  దీనికి వ్యతిరేకంగా చేసివుంటే  (మార్గరెట్టాను మనవైపు ఉంచి, అద్దంలో మెఫిస్టోఫిలిస్ ను చూపించివుంటే)   ప్రేక్షకులకు  ఈ స్థాయి అనుభూతి కలగకపోయేది!

అయినా  మార్గరెట్టాను ఇటువైపు నుంచే చూడాలనివుందా?

 

ఈ బొమ్మ చూడండి, ఇది మ్యూజియంలోది కాదు; మరెక్కడిదో  !

ఇలాంటి శిల్పం  మరెక్కడైనా ఉందా? 

హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట కు వెళ్ళే దారిలో  ‘సురేంద్రపురి’ అనేచోట  ‘కుందా సత్యనారాయణ కళాధామం’ ఉంది. దీనిలో చాలా దేవాలయాలున్నాయి. 

ప్రవేశం దగ్గర నిలువెత్తు  పంచముఖ ఆంజనేయ విగ్రహం... ఇలా  కనపడుతుంది. 

 
ఇదే విగ్రహం వెనక చూస్తే.. 
ఇదిగో...  ఐదు ముఖాలున్న శివుడి రూపం! 

ఆంజనేయుడు గదనూ, శివుడు త్రిశూలాన్నీ ఒకే భంగిమలో పట్టుకునివుంటారు. 

తల చుట్టూ  శరీరంలో సగభాగం వరకూ చెక్కిన ఫ్రేమ్-  చెరో వైపునా  వేర్వేరు రూపాలను సులువుగా  చెక్కటానికి వీలు కల్పించింది.

ఈ భారీ శిల్పానికి  స్ఫూర్తి  ... మ్యూజియంలోని దారు  శిల్పమే అయివుంటుందా? ఏమో!



శిల్పంలోనైనా,  చిత్రంలోనైనా, మరే  కళలోనైనా  ఇలాంటి  వైచిత్రి, వైవిధ్యం  ఆహ్లాదాన్నీ,  గుర్తుంచుకోదగ్గ అనుభూతినీ  కలిగిస్తాయి   కదూ!

 తాజా చేర్పు (4.5.2015)
 తూర్పు గోదావరి జిల్లా ర్యా లిలో కూడా  దాదాపు ఇలాంటిదే..  విభిన్నమైన విగ్రహం ఉంది.




విగ్రహం ముందు వైపు విష్ణువు (కేశవస్వామి) రూపం ఉంటే ..  వెనుకవైపున  జగన్మోహిని - వెనుదిరిగి ఉన్న రూపం  చెక్కారు.

‘జగన్మోహిని’  రూపం అంటే అత్యంత సౌందర్యంతో ఉండాలి కదా? దాన్ని  ఆ స్థాయిలో చిత్రించడం,  ఒప్పించడం కష్టతరం  కాబట్టి-  అలా వెనక్కి తిరిగివున్నట్టు చెక్కాడా  శిల్పకారుడు!?

16 కామెంట్‌లు:

S చెప్పారు...

మీరు చెప్పిన సురేంద్రపురి విగ్రహం - ఆశ్చర్యంగా ఉందండి వింటూంటే. చూడాలి ఆవైపుకి వెళ్ళగలిగితే! టపా బాగుంది.

anu చెప్పారు...

మ్మ్... అవును....... అలాంటి అనుభూతినే కలిగిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

తూర్పుగోదావరి జిల్లా ర్యాలిలో విష్ణుమూర్తి - జగన్మోహిని విగ్రహం కూడా ఇలాంటిదే. ఇక వీల్డ్ రెబెకా - ర్యాలి మోహిని ఈ రెండింటిలో ఏది ప్రాచీనమైనదో నాకు కచ్చితంగా తెలీదు.

శ్యామలీయం చెప్పారు...

వేణువుగారూ,
వీల్డ్ రెబెకా విగ్రహం 19వ శతాబ్ధిలో మలచబడింది.
ర్యాలి జగన్మోహినీకేశవస్వామివారి గుడి స్థలపురాణం ప్రకారం 11వ శతాబ్ది నాటిది. ప్రస్తుత ప్రాకారాలను 1936లో నిర్మించారు.

వేణు చెప్పారు...

@ S: థాంక్యూ...

@ anu: కదా!

@ puranapndaphani: మీరు చెప్పాక ర్యాలి గుడిలో ఉన్న జగన్మోహినీ కేశవస్వామి విగ్రహం (ఫొటో, వీడియో) చూశాను. విష్ణుమూర్తి వెనకవైపు మోహినీ రూపం ఉన్నప్పటికీ వెనుదిరిగి ఉన్నట్టు చెక్కారు. ఇదో తేడా; వైవిధ్యం.

మ్యూజియంలో వీల్డ్ రెబెకా విగ్రహం ఉంది, నిజమే. అయితే దానికీ ఈ డబుల్ స్టాచ్యూ ప్రస్తావనకూ సంబంధం ఏమిటా అని ఆలోచించాను. ఏమీ లేదు కదా?

@ శ్యామలీయం: మీరందించిన సమాచారానికి కృతజ్ఞతలు.

వేణు చెప్పారు...

ప్రముఖ సేకరణకర్త, సంగీత సాహిత్యాభిమాని శ్యామ్ నారాయణ అభిప్రాయం: సాలార్ జంగ్ మ్యూజియాన్ని లెక్కలేనన్ని సార్లు చూశాను. ఈ డబుల్ స్టాచ్యూ చూసినపుడు నాకు ఏమనిపిస్తుందంటే- విగ్రహం వెనకభాగాన్ని అద్దంలోనే ఎందుకు చూపించాలి? హాలు మధ్యలో ఉంచితే సందర్శకులు రెండువైపులా దాన్ని సంపూర్ణంగా చూడటం సాధ్యమవుతుంది కదా? అద్దంలో ప్రతిరూపాన్ని చూపడం అంట దాన్ని అరకొరగా చూపించడమే!

@ Puranapandaphani: మీరు ప్రస్తావించిన ర్యాలి విగ్రహం ఛాయాచిత్రాన్ని టపాలో చేరుస్తున్నాను. థాంక్యూ!

రామ్ చెప్పారు...

వేణు గారూ

మీ పరిశోధన 'ఉపరితల' శోధన కాదని మీ పోస్ట్ మరో మారు ప్రూవించింది.

" ... రెండో వైపు చూడలనుకోకు... " అని బాలయ్య బాబు అనటం వెనక ఇంత కథ ఉందని ఇప్పుడే అర్ధం అయింది.

శ్యామలీయం చెప్పారు...

ప్రశ్న. ‘జగన్మోహిని’ రూపం అంటే అత్యంత సౌందర్యంతో ఉండాలి కదా? దాన్ని ఆ స్థాయిలో చిత్రించడం, ఒప్పించడం కష్టతరం కాబట్టి- అలా వెనక్కి తిరిగివున్నట్టు చెక్కాడా శిల్పకారుడు!?

సమాధానం. మొదటి విషయం ఈ విగ్రహం స్వయంభువు. అనగా భగవంతుడు ఇలా సాలగ్రామశిలా విగ్రహరూపంలో స్వయంగా వ్యక్తం ఐన రూపం అన్న మాట. రెండవది ఆ క్షేత్రంలో శివకేశవులు వెలసిన విదానానికి సంబంధించిన కధతో ముడిపడిన విషయం. క్లుప్తంగా మనవి చేస్తాను. తన మోహినీ అవతారం వెంటబడిన శివుడిని కొంత దూరం పరిగెత్తించి శ్రీమహావిష్ణువు నిజస్వరూపం చూపుతాడు. ముందుభాగంలో విష్ణుస్వరూపం ప్రకటనం అవుతుండగా చూసి శివుడు లింగస్వరూపియై వెలుస్తాడు ఎదురుగా. విష్ణువు వెనుకభాగం మాత్రం కథాసూచనగా మోహినీస్వరూపంగానే ఉండనిచ్చి తానూ సాలగ్రామశిలారూపిగా వెలుస్తాడు. అన్నట్లు ఆ శివయ్య పేరు ఉమాకమండలేశ్వరస్వామి. ఈయనేమో ఎదురుగా జగన్మోహినీకేశవస్వామి అన్నమాట. మీ సందేహం తీరిందని తలుస్తాను.

వేణు చెప్పారు...

@ రామ్: మీ అభినందనలకు అభివందనాలు. బాలయ్య బాబు డైలాగుకూ, ఈ విషయానికీ భలే సంబంధం పెట్టారే...!

@ శ్యామలీయం : మీరు ప్రస్తావించిన కథా వివరణ ఆసక్తికరంగా ఉంది. థాంక్యూ. విగ్రహంలో వెనకవైపు జగన్మోహిని రూపం వెనుదిరిగి వుండటానికి కారణం అదన్నమాట! ముందుభాగం రూపం మారిపోయి, వెనకభాగం ఇంకా మారే దశలో ఉన్నప్పటి ఘట్టాన్ని సూచించే శిల్పం..
ఇలాంటి transformation ని శిల్పకళలో సాధించటం అరుదైన విషయమే అనుకుంటాను.

‘స్వయంభువు’, ‘స్వయం వ్యక్త’ భావనలను విశ్వసించేవారు ఇలాంటి శిల్పాల రూపకల్పన వెనక మనిషి కృషి ఉందని అంగీకరించే అవకాశం లేదు. కానీ ఆ భావనలను నమ్మని నాలాంటివారు? ఈ విగ్రహాన్ని ‘చెక్కిన’ అజ్ఞాత శిల్పిని తల్చుకుని, అతడి/ ఆమె నైపుణ్యానికీ, కళా చాతుర్యానికీ ముగ్ధులమవుతాం.

Edge చెప్పారు...

***ఈ విగ్రహం స్వయంభువు. అనగా భగవంతుడు ఇలా సాలగ్రామశిలా విగ్రహరూపంలో స్వయంగా వ్యక్తం ఐన రూపం అన్న మాట.***

శ్యామలీయంగారు, ఇది మీ విశ్వాసమా లేక అందరు నమ్మితీరవలసిన సత్యమా?

శ్యామలీయం చెప్పారు...

@వేణు:
‘స్వయంభువు' వంటి భావనలను నమ్మనివాళ్ళము విగ్రహాన్ని ‘చెక్కిన’ అజ్ఞాత శిల్పిని తల్చుకుని, అతడి/ ఆమె నైపుణ్యానికీ, కళా చాతుర్యానికీ ముగ్ధులమవుతాం అన్నారు. ఈ‌మాట ముదావహం.

@Edgeగారు,
స్వయంభువు అని అనటాన్ని మీరు ప్రశ్నించారు. శ్యామలీయంగారు, ఇది మీ విశ్వాసమా లేక అందరు నమ్మితీరవలసిన సత్యమా? అని. స్థలపురాణం ఈ విధంగా చెబుతున్నది. అదే ప్రస్తావించాను. విశ్వసించేవారూ ఉంటారు, నమ్మనివారూ ఉంటారు. ఎవరూ ఎవరినీ‌ బలవంతం చేయలేరు కదా. భగవద్విలాసం అనుకోవటమా కళానైపుణ్యం అనుకోవటమా అన్నది మీ యిష్టం. నా విశ్వాసం గురించి కాని మీ విశ్వాసం గురించి కాని చర్చ జరుగవలసిన పనిలేదు.

Edge చెప్పారు...

శ్యామలీయంగారు,
అది స్థలపురాణం అనే ముక్క ముందే చెప్పుంటే నాకు ప్రశ్నించాల్సిన అవసరమే ఉండేదికాదు. స్పృష్టీకరించినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

వేణు గారూ...

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి.

ర్యాలి విషయంలో నాది మిడిమిడి వినికిడి జ్ఞానం మాత్రమే. నేను ర్యాలి చూడలేదు. అయితే... ముందు అయ్యవారి మూర్తి, వెనుక అమ్మవారి మూర్తి ఉంటాయని చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. మూర్తి భంగిమలో భేదం సంగతి గుర్తే లేదు. అందుకే.. డబుల్ స్టాట్యూ గురించి చదవగానే (ఆ మాటకి వస్తే, మ్యూజియంలో చూసినపుడు కూడా) ర్యాలి విగ్రహమే స్ఫురించింది. ఏదైతేనేం... నా వరకూ నేను ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. మీకూ, శ్యామలీయం మాస్టారికీ కృతజ్ఞతలు.

వీల్డ్ రెబెకా ప్రస్తావన పొరపాటు మాత్రమే... మార్గరెట్టా అనబోయి,తప్పులో కాలేసా :)

వేణు చెప్పారు...

@ Edge & శ్యామలీయం: ‘స్వయంభువు’ భావన విషయంలో అడగవలసిన ప్రశ్నను నిక్కచ్చిగా అడిగినందుకూ; దానికి సముచితమైన వివరణ ఇచ్చినందుకూ మీ ఇద్దరికీ అభినందనలు.

మర్యాద ఏమీ కోల్పోకుండానే భిన్న ధ్రువాల వారు ఒక విషయంలో పద్ధతిగా సంభాషించుకోవచ్చనటానికి ఇదో ఉదాహరణ!

@ Puranapandaphani: ఈ మాత్రం దానికి క్షమాపణలనే మాటలెందుకండీ. మీ వల్ల ఈ పోస్టులో నాకు తెలియని కొత్త అంశం జోడించగలిగాను. అందుకు కృతజ్ఞతలు.

M b d syamala చెప్పారు...

వేణు!రెండోవైపు మరోరూపు అనే ఈ అంశం చాలా ఆసక్తిని కలిగించింది!సాలార్జంగ్ మ్యూజియంలో యీశిల్పం చూసినా నీ బ్లాగు కొత్త దృక్కోణంలో చూపించింది! ఈశిల్ప ప్రదర్శన విషయంలో శ్యాం నారాయణగారి అభిప్రాయంతో నేనేకీభవించలేను హాలుమధ్యలో వుంచినా ఒకేసారి రెండువైపులా చూడలేము!అద్దం వల్ల ఒకేసారి రెండు విభిన్న ప్రకృతులను చూడగలగడం ఆశిల్పంలోని గొప్పదనమనిపిస్తుంది!అంతే కాదు !మంచిచెడు అలాపక్కపక్కనే ఉంటాయని తెలిపినట్లులేదూ!
ర్యాలీలోని శిల్పంనేను చూడలేదు కానీ విన్నాను !జగన్మోహిని మహాద్భుత సౌందర్యం వెనక వైపయితే మాత్రం శిల్పీకరించడం సాధ్యమా? గంగకు ఇద్దరి అద్దరి గలదే ఉద్యద్రాజ బింబాననా!అన్న తెనాలి రామలింగ కవి మాట గుర్లొచ్చింది! ఆ శిల్పులెంత గొప్ప వారు! నీ పరిశీలనకు అభినందనలు!

వేణు చెప్పారు...

Thank u Syamala! మ్యూజియంలో శిల్పాన్ని అద్దంలో చూపడమే మెరుగని నీ వ్యాఖ్య చూశాక అనిపించింది. జగన్మోహినిని వెనకవైపు శిల్పించటం మాత్రం సాధ్యమా అనే నీ
వ్యాఖ్య చాలా బాగుంది.Thank u!