సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

13, జూన్ 2012, బుధవారం

మాయాబజార్ చిత్రం ... మహాప్రస్థానం ముఖచిత్రం!

1950 లో ప్రచురితమైన  మహాప్రస్థానం, 1957 లో విడుదలైన మాయాబజార్ ... ఈ రెంటితో  సంబంధమున్న  కళాకారుడు మా.గోఖలే !

మొదటిది  తెలుగు కవిత్వ పటుత్వానికి  చిరునామా, సాహిత్య  శిఖరం!  రెండోది  తెలుగు సినిమా  స్థాయికి  పరాకాష్ఠ,  వెండితెర కావ్యం!

ఈ రెండిటి గురించి  ఇక  చెప్పాల్సిందేమీ లేనంతగా  విస్తారంగా  చర్చలు  జరిగాయి. అయినా... తరచూ ఉటంకింపులతో ప్రశంసలూ,   సమాలోచనలూ,  తలపోతలూ సాగుతూనే ఉన్నాయి. 


ఇక  మా.గోఖలే! (1917-1981). మాధవపెద్ది  గోపాల కృష్ణ గోఖలే. ఇంటి పేరు చూడకపోతే పేరును బట్టి  తెలుగువాడు కాదనిపిస్తుంది. ( స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి గుర్తుగా మనలో ఝాన్సీలక్ష్మీబాయిలూ ,  బాలగంగాధర తిలక్ లూ, గాంధీలూ చాలామందే ఉన్నారనుకోండీ.) 

ఆయన  రాసిన  కథలతో  ఓ సంకలనం  వచ్చింది. అయితే   చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా ఆయన  కృషిని   తెలిపే  సమాచారం అంతగా  అందుబాటులో  లేదు.

1949 ఆగస్టు 1న కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో ప్రజలను దిగంబరులుగా మార్చి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించారు పోలీసులు. దీనిపై గోఖలే గీసిన రేఖా చిత్రం అప్పట్లో చర్చనీయాంశమయిందట.  (చలసాని ప్రసాదరావు ‘ఇలా మిగిలేం’లో కూడా ఈ సంఘటన ప్రస్తావన ఉంటుంది).


గోఖలే చిత్రించిన  పలనాటి ‘బ్రహ్మన్న’కు  బాగా ప్రసిద్ధి వచ్చింది. ‘చాపకూడు’తో సమత కోసం ప్రయత్నించిన బ్రహ్మనాయడు చాప మీద  ఆలోచనా ముద్రలో  కూర్చుండగా ఎదురుగా ఖడ్గం.  సాంప్రదాయిక శైలిలో గీసిన  ఈ బొమ్మను చూస్తుంటే పల్లెటూళ్ళలోని  వ్యవసాయకుటుంబాల్లో ఆజానుబాహులైన రైతులు గుర్తొస్తారు. నీటి రంగుల్లో చిత్రించిన ఈ బొమ్మను ఏ పుస్తకంలో చూశానో గుర్తు లేదు కానీ ఆ వర్ణచిత్రం లభ్యం కాలేదు.

ప్రస్తుతానికి నలుపు తెలుపు చిత్రాన్నే చూద్దాం.



గోఖలే  మరో ప్రసిద్ధ చిత్రం  ‘పావురాళ్ళు’. నేనింతవరకూ  చూసినట్టు గుర్తులేదు. ఇది కూడా ఎక్కడా  దొరకలేదు.  

కళా దర్శకుడు
మాయాబజార్  సినిమాకు  కళా దర్శకుడిగా మా. గోఖలే  పనిచేశారు. ఘటోత్కచుడూ, శ్రీకృష్ణుడూ  .. ఈ   పాత్రల ఆహార్యం , పౌరాణిక వాతావరణం కళ్ళముందుకు తెచ్చిన  సెట్ల వెనక కృషి మా. గోఖలేదే.


ఈ సారి  ఆ సినిమా చూసేటపుడు... సెట్ల అందాలనూ,  పాత్రధారుల అలంకరణలనూ గమనించి  మా.గోఖలేను  కూడా  తల్చుకోండి ఓసారి! 

గోఖలే కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాలు పదకొండో, పన్నెండో ఉన్నాయి. షావుకారు  (1950)తో కెరియర్  ప్రారంభించి,  పాతాళభైరవి  (1951), మిస్సమ్మ (1955) ... అలా ఎదుగుతూ జగదేకవీరుని కథ (1961), ఆపై శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)  వరకూ విజయవంతంగా కొనసాగారు.

టైటిల్ డిజైనర్
 గత అరవయ్యేళ్ళలో  30కు పైగా  ముద్రణలు పొందిన విశేష  ప్రాచుర్యం  మహాప్రస్థానానిది.  దీనికి  ముఖచిత్రం  వేసింది మా.గోఖలేనే !

‘మహాప్రస్థానం’అనే అక్షరాలు  ఏటవాలుగా వంగి ఒక కదలికను స్ఫురింపజేస్తుంటాయి.  గుండ్రంగా, ఒద్దికగా ఒదిగివుండే సాంప్రదాయిక  తెలుగు అక్షరాలు కావివి.  కొత్త బాటలో  తిరుగుబాటును తలపించేలా , పుస్తక స్వభావం  వ్యక్తమయేలా  ఉంటాయవి. ‘భారతీయుడి’ గొలుసుకొట్టు రాతను పోలి అక్షరాలు విభిన్నంగా  కనపడతాయి. తలకట్టు గీయటంలో,  నిలువుగా నిలిచిన  అక్షర నిర్మాణంలో  అదో  ప్రత్యేకత.  ‘శ్రీశ్రీ’ చేతిరాత ఇలాగే ఉంటుంది!

తర్వాతి కాలంలో  మాదాల రంగారావు ‘మహాప్రస్థానం’ పేరుతో  సినిమా తీసినపుడు  ఇదే  టైటిల్ ని లోగో గా వాడుకున్నారు.



ముఖచిత్రంలో వివరాలు  అంత స్పష్టంగా ఉండవు. కానీ ఒక రకమైన impact కలగజేసేలా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన దృశ్యాలు ఇందులో చిత్రించారు.

 ఓ పక్క.  ఉరికొయ్యలకు వేలాడే  శిరస్సులు, కుంగిపోయి, వంగిపోయి కూలబడిపోయిన  వృద్ధులూ, పిల్లలూ. ‘అనేకులింకా అభాగ్యులంతా అనాధులంతా అశాంతులంతా ’!  మరోపక్క- విముక్తి కోసం ప్రతిఘటనకు సిద్ధమైన జనం!

ఇదంతా  నేపథ్యం.  

‘మీ కోసం కలం పట్టా’నని  భరోసా ఇస్తూ -

‘నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి’..


సమర్పణం చేస్తున్నానన్నట్టు  ఒక పక్కకు  తలపైకెత్తి స్థిరంగా,  ధీమాగా చూసే  శ్రీశ్రీ (అలనాటి) రూపం !

‘మహాప్రస్థానం’  టైటిల్ డిజైన్ రూపకల్పన అనుభవం  గురించి  మా. గోఖలే  ఎక్కడైనా చెప్పారో, రాశారో లేదో తెలీదు.

చలం రాసిన  ‘యోగ్యతా పత్రం’ శక్తిమంతమైన అక్షర నివాళి! 
గోఖలే గీసిన ముఖపత్రం- ఆ పుస్తక సారాన్ని చాటి చెప్పే చిత్రకళా కాహళి!!