సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

బాల రాహుల్... గాన లాహిరి!



లేత గొంతు నుంచి  జాలువారే  ఆ  తీయని గానం  జనం  మనసులను ఇట్టే కట్టిపడేస్తుంది.  

ఆ  బెంగళూరు బాలుడి గళ  వశీకరణం అలాంటిది.

పేరు-  రాహుల్ వెల్లాల్ !  

‘వెల లేని పువ్వు కదా మనిషికి చిరునవ్వు!’ 
అంటుంది కవయిత్రి   యం.బి.డి. శ్యామల,  ఓ  గజల్ లో.     

రాహుల్ వెల్లాల్ ను వీడియోల్లో చూస్తుంటే... ఆ వాక్యమే గుర్తొస్తుంది!

పాడుతున్నంతసేపూ చెదరని  మందస్మితం.  స్వచ్ఛంగా,  అమాయకత్వం ఉట్టిపడే  చిలిపి  చిరునవ్వు.

మంద్ర-మధ్య- తార స్థాయి  శ్రుతులకు తగ్గట్టుగా -
తలను  చిన్నగా అటూ ఇటూ కదలిస్తూ...
ఒక్కోసారి కళ్ళు మూస్తూ.. 
చేతులను  భావ స్ఫోరకంగా  పైకెత్తుతూ ..  
తాదాత్మ్యంతో
ఆరోహణ... అవరోహణలతో
రాహుల్   పాడుతూవుంటే...  

త్యాగయ్య   చెప్పినట్టు- ‘నాభీ హృత్కంఠ రసన నాసాదుల యందు’ పాడుతున్నాడా అనిపిస్తుంది !
   
బాణీలోని  తీయదనం పంచుతూ  పాట  శ్రోతలకు  రసానుభవాన్ని అందిస్తుంది.  

*     *     * 


ఎస్ వీ భక్తి చానల్ లో ప్రసారమైన.. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  పాటల కార్యక్రమాలు హైదరాబాద్ లోనే జరిగాయి. వాటిలో రాహుల్ తన గాన వైదుష్యంతో  మెరిశాడు.

‘అయ్యో  నేనేకా అన్నిటికంటె దీలు..’  అనే   పాటను  రాహుల్  పాడుతుంటే   వేదిక మీద  ఉన్న గాయని సునీత   కదిలిపోయి,  కన్నీరు  కార్చి  ‘మనసూ, దేహం, ఆత్మా స్వచ్ఛమయ్యాయి’ అంటూ’   సభాముఖంగా చెప్పారు.  

సంగీత దర్శకుడు   కీరవాణి ‘ రాగమయి అయిన   సరస్వతి రాహుల్ వెల్లాల్ లో  కనిపించింది’   అంటూ మెచ్చుకున్నారు.

బాణీని  సరిగా  నేర్చుకుని  సంగీతపరంగా లోపాల్లేకుండా , భాషాపరంగా  ఉచ్చారణ దోషాల్లేకుండా పాడినంతమాత్రానే  ఏ పాటా మీటదు హృదయాల్ని.  సాహిత్యంలోని  భావం గ్రహించి రసానుభూతితో పాడటం కదా ముఖ్యం!

సంగీతం సమకూర్చిన జోశ్యభట్ల శర్మ  గారి నుంచి  ఆ పాట అర్థం  చెప్పమని అడిగి,  తెలుసుకున్నాకే  నేర్చుకుని పాడాడు  రాహుల్.    

అంత శ్రద్ధ ఉంది కాబట్టే..   తనకు  మాతృభాష కాని తెలుగులో 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య  రాసిన పాటల విషయంలో  తనకుండే  పరిమితులన్నిటినీ అలవోకగా దాటేశాడు. అనితర సాధ్యమన్న రీతిలో  పాడేశాడు!

‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  సిరీస్ లో రాహుల్ పాడిన -

* ‘అమ్మేదొకటియును..అసిమ లోని దొకటీ’
* ‘శోధించి చూడబోతే..’ 
*  ‘ఏమని నుతించవచ్చు..’

పాటలు కూడా బాగుంటాయి.
   

*     *     *  

సాన పెట్టిన  కులదీప్ పాయ్

రాహుల్   వయసు ఇప్పుడు   పన్నెండేళ్ళు.  అయితే  ఇతడి ప్రతిభ ప్రపంచానికి   మూడేళ్ళ క్రితమే పరిచయం.


రెండేళ్ళ పసి వయసులో రాహుల్   పాటను గుర్తించటం, హమ్ చేయటం చూసి సంగీతం పట్ల అతడి ఆసక్తిని గమనించారు తల్లిదండ్రులు.  అంత చిన్నవయసులో సంగీత ఉపాధ్యాయులెవరూ  నేర్పలేమంటే..  నాలుగేళ్ళ వయసు వచ్చాక,  శిక్షణలో ప్రవేశపెట్టారు. 

సంగీత పాఠశాల వార్షికోత్సవంలో ఆరేళ్ళకే అరగంటసేపు మొదటి సంగీత కచ్చేరీని ఇచ్చేశాడు.  మరో ఏడాదికి బెంగళూర్ లోని ఓ గుడిలో పాటల లిరిక్స్ కాగితాలేమీ చూడకుండా, వాద్యకళాకారులతో  రిహార్సల్స్ లేకుండానే గంటన్నర సేపు రెండో కచ్చేరీ చేశాడు. 

బెంగళూరులోనే ఉండే కళావతి అవధూత  అతడి సంగీత గురువు.

నాలుగేళ్ళ క్రితం  సూర్య గాయత్రిని  చిన్న వయసులోనే   డిస్కవరీ చేసి, సంప్రదాయ సంగీతంలో అద్భుత గాయనిగా   తీర్చిదిద్దిన  కులదీప్ ఎం. పాయ్  తెలుసుగా?  

రాహుల్   వెల్లాల్   ప్రతిభకు సానపెట్టి   చక్కని పాటలు పాడించి మనందరికీ తెలియజేసింది కూడా   కులదీప్ పాయే..!

 ముగ్గురు... గురు శిష్యుల ఆటవిడుపు

 ( రాహుల్ ని మహావిష్ణువుగా,  సూర్య గాయత్రిని  సోదరి పార్వతిగా,  ఎత్తుకుని మోస్తున్న తనను ఆదిశేషుడిగా పోల్చుకుంటూ కులదీప్  ఈ ఫొటోకు సరదా వ్యాఖ్య  రాశారు). 




సూర్య గాయత్రితో కలిసి... 

కులదీప్ పాయ్ నిర్దేశకత్వంలో... సూర్య గాయత్రితో కలిసి రాహుల్ వెల్లాల్  పాడిన  అన్నమయ్య తెలుగు సంకీర్తనలు యూ ట్యూబ్ లో విడుదలై   లక్షలమంది సంగీతాభిమానులను  పరవశులను చేస్తున్నాయి. 
  
*    ‘బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే’ 

*    ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడే’



‘ గతియై మమ్ము గాచే కమలాక్షుడూ’  అని  స్థాయిని తగ్గించి పాడేటప్పుడు రాహుల్  కర విన్యాసం గమనించండి.  

కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఈ  బాల మేధావులు తమిళనాడులో స్థిరపడిన  కులదీప్ ఆధ్వర్యంలో తెలుగు పాటలను  శ్రవణపేయంగా  పాడటం  ముచ్చటగా అనిపిస్తుంది.  

రాహుల్ ఒక్కడే పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతో బాగున్నవాటిలో..

సదాశివ బ్రహ్మేంద్ర సంస్కృత రచన -
* ‘పిబరే రామరసం’



 మీరాబాయి హిందీ రాజస్థానీ భజన-

  *‘పాయో జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో’



ఈ పాటలో స్వర విన్యాసాలు చాలా బాగుంటాయి.  ముఖ్యంగా  వీడియోలో 5.02 నిమిషాల దగ్గర ‘మీ...రా.. కే ప్రభూ’ అనేచోట శ్రోతలను  సమ్మోహితులను చేస్తాడు.    


వైవిధ్యం.. మాధుర్యం
 
13వ శతాబ్దం నాటి సంత్  జ్ఞానేశ్వర్ అభంగ్ లూ, 
15వ శతాబ్ది నాటి అన్నమయ్య  సంకీర్తనలూ, 
వ్యాసరాయ తీర్థ  కన్నడ కృతులూ,
16 శతాబ్దపు మీరాబాయి  భజనలూ, 
17వ శతాబ్దానికి చెందిన రామదాసు కీర్తనలూ,
18-19 శతాబ్దాలకు చెందిన త్యాగయ్య కీర్తనలూ, 
సదాశివ బ్రహ్మేంద్ర  కీర్తనలూ...

రాహుల్ వెల్లాల్ గొంతులోని  వైవిధ్యాన్నీ, మాధుర్యాన్నీ వెలారుస్తున్నాయి. 

ముఖ్యంగా మన  తెలుగు పాటలను ఎంత చక్కని ఉచ్చారణతో  పాడుతున్నాడో!  ( సూర్య గాయత్రి దీ ఇదే తీరు).   

‘ద లయన్ కింగ్ ’ తెలుగు అనువాద చలన చిత్రంలో  రాహుల్  ‘నేనే రాజా ఎప్పుడౌతానూ ’ అనే హుషారు పాటను హరిప్రియ, రాములతో కలిసి పాడాడు.

సినీరంగంలో బహుశా తన తొలి అడుగు ఇదే.

మన బాలమురళీ కృష్ణ తనకు ఆదర్శం అని చెపుతాడు.

ఇలా మొత్తానికి రాహుల్ కీ తెలుగుకూ  చాలా అనుబంధం పెరుగుతున్నట్టే ఉంది. 

వెంటాడుతున్న అభంగ్ 

ఈ జనవరిలో విడుదలైంది  రాహుల్ పాడిన ‘యోగ యాగ విధీ.. యేణే నోహే సిద్ధి వాయాచి ఉపాధి దంభ ధర్మ'
 అనే  సంత్ జ్ఞానేశ్వర్ ‘ హరిపాఠ్ అభంగ్’. 

నేను విన్నది కొద్ది రోజుల క్రితమే. కులదీప్ ఎం. పాయ్  అద్భుతమైన  స్వరకల్పన, రాహుల్  తాదాత్మ్యతతో పాడిన విధానం గొప్పగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో నన్ను బాగా  హాంట్ చేసేసి, ఎక్కువ సార్లు వినేలా చేస్తున్న మరాఠీ  పాట ఇది. 

మీరూ ఆ వీడియో చూడండి-



అష్టాంగ యోగాలూ, యాగాలూ లాంటి తంతులు మనిషికి  ముఖ్యం కాదనీ,  అవి డాంబికానికే, అహంకారానికే పనికొస్తాయనీ ఈ అభంగ్  చెపుతుంది. అలాగని ఇది  హేతువాద రచనేమీ కాదు.  ఆధ్యాత్మిక  ‘సిద్ధి’ని ప్రబోధించేదే.  

రాహుల్ గాన కళా చాతుర్యం
ఇంతగా వికసించటానికి స్వయం ప్రతిభతో పాటు  తల్లిదండ్రుల ప్రోత్సాహం తొలి కారణం. గురువుల,  పాటల సంగీత దర్శకుల, వాద్య బృందాల  సహకారమూ ఎంతో  ఉంది.  

ఇతణ్ణి  అభినవ బాలమురళీ కృష్ణ అనీ,  జూనియర్  శంకర్ మహదేవన్ అనీ  పోలికలు తెస్తున్నారు చాలామంది.   కానీ ఎవరితోనూ పోల్చనవసరం లేకుండా  సొంత ముద్రతో గానకళలో  ఎంతో ఎత్తుకు వెళ్ళగలిగే  సత్తా రాహుల్ కి ఉందనేది నిస్సందేహం.  

*     *     * 

భారతీయ సంప్రదాయ సంగీతమంటే  నాకు చాలా ఇష్టమూ, ఆసక్తీ !

కానీ  ఆ సంగీతంతో  అనుసంధానమై ఉండే ‘దైవ భక్తి’తో గానీ, ‘ఆధ్యాత్మికత’తో గానీ నాకే మాత్రమూ  ఏకీభావం లేదు,  ఉండదు. 

రాహుల్ ను గానీ, సాంప్రదాయిక సంగీతకారులు మరెవరినైనా గానీ అభిమానించటమంటే  సంగీత కళలో వారి విశిష్ట ప్రతిభను అభిమానించటం మాత్రమే. ఆ కళను  ఆస్వాదించటమే.  ఆ పాటల్లో పొదిగివున్న భక్తినీ, వాటిలోని  భావాలనూ  ఔదలదాల్చటం మాత్రం  కాదు !  

21, మే 2019, మంగళవారం

‘జాతక కథలు’ చదివారా?


 వేల సంవత్సరాల క్రితం నాటి కథలు చదవటమంటే ఆ కాలానికి ప్రయాణించి, ఆ వాతావరణంలోకి ప్రవేశించటమే. 

ప్రాచీన సాహిత్యంలో  ఉత్ప్రేక్షలూ, నమ్మశక్యంకాని  కల్పనలూ, మహిమలూ ఉండొచ్చు గాక.  శ్రామికులపై  చిన్నచూపూ,  రాజులపై వల్లమాలిన  భక్తిప్రపత్తులూ చికాకు పెట్టవచ్చు గాక.


ఆ పరిమితులను  వదిలేస్తే ... స్థూలంగా అనూహ్యమైన మలుపులుండే ఆ కథావీధుల్లో సంభ్రమంతో సాగించే సంచారం సంతోషాన్నిస్తుంది.  ఆహ్లాదపరుస్తుంది. 

ఆత్మ ఉనికిని అంగీకరించనిది బౌద్ధం.  కానీ దీని  సాహిత్యంలో పునర్జన్మ కథలు పుట్టటం ఒక విచిత్రం !


జాతక కథలు నాకు ‘చందమామ’తో పరిచయమయ్యాయి.  చందమామలోనే  వరసగా కాదు కానీ, అప్పుడప్పుడూ చాలా జాతక  కథలు చదివాను.  

బోధిసత్త్వుడు  జాతక కథల నాయకుడు.  

ఇతడు మనిషిగా,  జంతువుగా ఏ రూపంలో జన్మించినా గొప్ప వివేకంతో,  ముందుచూపుతో, కరుణతో , త్యాగబుద్ధితో  ప్రవర్తిస్తుంటాడు ఈ కథల్లో. తనతో పాటు తోటివారికి  కష్టాలొస్తే కుంగిపోడు.  అనూహ్యమైన  సమయస్ఫూర్తితో ఆ చిక్కులనుంచి  బయటపడేస్తుంటాడు.  

1953 మార్చి సంచికలో  ‘సఫల యాత్ర’  అనే కథతో  చందమామ జాతక కథల ప్రచురణని మొదలుపెట్టింది.  తర్వాత  చాలా కథలను నెలనెలా ప్రచురించింది.
 

  మళ్ళీ 1980 ఆగస్టు నెల సంచిక నుంచీ  ఈ కథలన్నిటినీ పున: ప్రచురించారు.

 తాము బొమ్మలతో ప్రచురించిన జాతక కథలను  చందమామ వారే   ఒక పుస్తకంగా కూడా వేశారని  చందమామ పరిశోధకుడూ, రచయితా అయిన దాసరి వెంకటరమణ గారు చెప్పారు.  అరుదైన ఆ పుస్తకం ఆయన దగ్గరుంది.

‘సఫల యాత్ర’  కథను ఇక్కడ చదువుకోవచ్చు- 

   jataka katha by Reader on Scribd


ఈ రోజు ఈనాడులో...


ఈ రోజు  ఈనాడు ‘చందమామ’లో  జాతక కథలను ఇలా  పిల్లల కోసం పరిచయం చేశాను.  

అక్కడ రాసిన  కథనం - 

‘పంచతంత్ర’ కథలు మీకు తెలిసే ఉంటాయి. వాటికంటే ప్రాచీనమైన ‘జాతక కథల’ గురించి విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఎంతో పేరు. ఎన్నో భాషల్లోకి ఈ కథలు వ్యాపించాయి. మీరెప్పుడైనా అజంతా గుహల సందర్శనకు వెళ్తే అక్కడ ఈ జాతక కథలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి. మంచి మంచి విషయాలను చెపుతూ మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథల విశేషాలను చెప్పుకొందామా?

‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో..’ అంటూ జాతక కథలు మొదలవుతాయి. గౌతమ బుద్ధుడి పూర్వజన్మల్లో జరిగిన గాథలే ఈ కథలు. బోధిసత్త్వుడు (బుద్ధుడి మరో పేరు) తపస్విగా, రాజకుమారుడిగా, సింహం, ఏనుగు, లేడి.. ఇలా రకరకాల జన్మలెత్తి తన తెలివితేటలతో చిక్కు సమస్యలను పరిష్కరిస్తుంటాడు. విశాల దృక్పథం, అహింస, కరుణలాంటి గొప్ప లక్షణాలతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంటాడు.

సిద్ధార్థుడు బుద్ధుడిగా మారేలోపు 547 జన్మలు ఎత్తాడని బౌద్ధ సాహిత్యం చెపుతుంది. అందుకే జాతక కథల సంఖ్య మొత్తం 547. ఇవి మొదట్లో సింహళ భాషలో ఉండేవి. ఐదో శతాబ్దంలో మన తెలుగువాడైన బుద్ధఘోషుడు ‘పాలీ’ భాషలోకి అనువదించాడు. ఆ పాలీ నుంచి నేరుగా తెలుగులోకి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి అనే రచయిత ఏడు సంపుటాలుగా అనువదించారు. వాటిని క్లుప్తంచేసి, వాడుక భాషలోకి మార్చి వివిధ ప్రచురణ సంస్థలు ఎన్నో పుస్తకాలను ప్రచురించాయి.

ఎందుకు చదవాలి?
వేల సంవత్సరాలుగా తరతరాలను అలరిస్తున్న కథలివి. వీటి ప్రాముఖ్యం ఎంతటిదంటే... వీటిలో కొన్ని ఈసప్‌ కథల్లో, పంచతంత్ర కథల్లో కూడా కనిపిస్తాయి. అద్భుతాలు, సాహసాలు, ఊహించని మలుపులు పెద్దలనూ, పిల్లలనూ ఆశ్చర్యపరుస్తాయి. ఆనందపరుస్తాయి. కథారూపంలో ఆహ్లాదపరుస్తూనే మానవుడు పాటించాల్సిన ధర్మాలు, నీతి నిజాయతీలను సూచిస్తాయి. పరోపకారం, త్యాగం మొదలైన గుణాలకు శాశ్వత విలువ ఉంటుందనీ, ముప్పు ముంచుకొచ్చినప్పుడు దుఃఖించకుండా తెలివితేటలు ప్రదర్శించాలనీ ప్రబోధిస్తాయి.


(ఇక్కడ రెండు కథలను క్లుప్తంగా ఇచ్చాను. వాటిలో ఇదొకటి)

రాతి కింద జల
వందల బళ్లతో వర్తకం చేసే సార్థవాహక వంశంలో పుట్టాడు బోధిసత్త్వుడు. ఒకసారి అతడి బిడారు అరవై యోజనాల నిడివి ఉన్న ఎడారి ప్రాంతం చేరింది. పగలంతా భగభగ మండే కుంపటిలా ఉండటంతో రాత్రివేళల్లోనే ప్రయాణించేవారు. నక్షత్రాల సాయంతో దారి గమనించి ముందుకు సాగేవారు. మరో యోజనం మాత్రమే ప్రయాణం మిగిలివుండగా బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుగ్గా సాగుతుందని వంటచెరకూ, నీరూ పారబోయించాడు బోధిసత్త్వుడు. అయితే దారి నిర్ణయించే వ్యక్తి బడలిక వల్ల నిద్రపోవటంతో ఎడ్లు అదుపుతప్పి, వచ్చినదారే పట్టాయి. సూర్యోదయం అవుతుండగా అతడు నిద్రలేచి, బళ్లు వచ్చిన దిక్కుకే పోతున్నట్టు గ్రహించి, బళ్లను వెనక్కి తిప్పమని కేక పెట్టాడు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయి, కిందటి సాయంకాలం బయలుదేరినచోటకే బిడారు చేరుకుంది. నీరు మాత్రం లేదు!

జరిగిన పొరపాటుకు విచారిస్తూ నిస్పృహతో అందరూ బళ్లకింద చతికిలబడ్డారు. తను కూడా వాళ్లలాగా అధైర్యపడితే అందరూ చచ్చిపోవటం తప్పదనుకున్నాడు బోధిసత్త్వుడు. అటూ ఇటూ తిరుగుతూ ఓ చోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బు చూశాడు. కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు కదా? వెంటనే పలుగు తెప్పించి అక్కడ తవ్వించాడు. అరవై మూరల లోతు తవ్వాక కంగుమని రాయి తగిలింది. అందరూ నిరాశపడిపోయారు. కానీ బోధిసత్త్వుడు కిందకు దిగి, రాతికి చెవి పెట్టి ఆలకించాడు. రాతికి దిగువగా పారుతున్న నీటి చప్పుడు వినిపించింది. ఇక రాతిని పగలగొట్టగానే తాటి చెట్టు ప్రమాణంలో ఉవ్వెత్తుగా నీరు పైకి చిమ్మింది. ప్రాణాలు లేచొచ్చి అందరూ దాహం తీర్చుకున్నారు. క్షేమంగా గమ్యం చేరుకున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో అధైర్య పడకుండా సమయ స్ఫూర్తిని ప్రదర్శించి బోధిసత్త్వుడు ఇలా అందరి ప్రాణాలూ కాపాడాడు.

ఐదు సంపుటాలూ నెట్ లో ...
సరళ గ్రాంథిక భాషలో శివశంకర శాస్ర్తి గారు రాసిన  జాతక కథలు  మొత్తం ఏడు సంపుటాలు.  వాటిలో ఐదు మాత్రం  నెట్ లో దొరుకున్నాయి. 

 ఆసక్తి ఉన్నవారు  వీటిని    గురుకుల్  సైట్  లింకులో  డౌన్ లోడ్ చేసుకుని, చదువుకోవచ్చు.    మొత్తం 1880కు పైగా పేజీలు.   ( గురుకుల్ అనే పదం మీద క్లిక్  చేస్తే సరి).