సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2014, బుధవారం

పాతికేళ్ళుగా నడుస్తున్న విలక్షణ పత్రిక!

రుక్మిణీ కల్యాణ ఘట్టానికి  చిత్రరూపం

చాలా ఏళ్ళ క్రితం ...

హైదరాబాద్ లోని ఒక పత్రికా కార్యాలయానికి  వచ్చిందో యువతి. ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని  ప్రొఫెసర్లు చెప్పారనీ, తన వ్యాసం ప్రచురించమనీ కోరింది.

ఆ  సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.    

ఆమె అందించిన కాగితాలు చూశారు. వాటిమీద పన్నెండు ప్రశ్నలు రాశారు. వాటికి అదే క్రమంలో స్పష్టంగా సమాధానాలు రాసివ్వమన్నారు. అలా చేస్తే వ్యాసం సరిగా తయారవుతుందనీ, అప్పుడు ప్రచురిస్తాననీ తెలిపారు.

అది తన శక్తికి మించిన పని అంటూ ఆమె వెనుదిరిగివెళ్ళిపోవటం వేరే విషయం!

ఆ పత్రికే  ‘మిసిమి’! 

దానిలో ప్రచురించే వ్యాసాల స్థాయి అది. ధన సంపాదన కంటే విజ్ఞాన వ్యాప్తి ప్రధానమనే ఉద్దేశంతో కొనసాగుతోందీ మాసపత్రిక.

కొన్ని సంచికల  కవర్ పేజీలూ,  చిత్రాలూ   చూడండి....   

ఇది తొలి సంచిక

బౌద్ధ ప్రాంగణ ద్వారం


కిరాతార్జునీయం
ఇది నవంబరు 2014 సంచిక
కళలూ, సాహిత్యాంశాలను ప్రచురించే  పత్రికలు ఉండటంలో  పెద్ద విశేషమేమీ లేదు.

కానీ, ఈ పత్రికలో  హేతువాదానికీ, తర్కానికీ, శాస్త్రీయ విశ్లేషణకూ కొంత ప్రాధాన్యం ఉంటుంది.  చిత్ర, శిల్పకళలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది.  అదీ చెప్పుకోదగ్గ విషయం.  ముఖచిత్రం  విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.  

‘మిసిమి’ మాసపత్రిక రజతోత్సవం  నవంబరు 4న హైదరాబాద్ లో జరిగింది. ఒక సాహిత్య సభ  ప్రేక్షకులతో  కిక్కిరిసి హాలంతా నిండుగా ఉండటం నేనదే చూడటం. 

ఈ పత్రిక గురించి  తెలుగు వెలుగు డిసెంబరు 2014 సంచికలో ఓ వ్యాసం - ‘మిసిమిలమిలలు’ రాశాను.


 ఈ లింకు లో ఆ వ్యాసం చూడవచ్చు.

‘తెలుగు వెలుగు’లో  వ్యాసం వచ్చాక...  పాఠకుల నుంచి వచ్చిన ఫోన్లలో  ‘మిసిమి అనే పత్రిక ఒకటి ఉందా? దీని గురించి వినటం ఇదే మొదటిసారి ’ అని చాలామంది  చెప్పారు.

ఆశ్చర్యం కలిగింది!


25 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న పత్రిక పరిస్థితి ఇది!  సినీ టీవీ రంగాల్లో  నిన్న గాక మొన్న ప్రవేశించినవాళ్ళ  గురించి  (ముఖ్యంగా నటులు )  మాత్రం  కోట్ల మందికి  ఇట్టే  తెలిసిపోతుంటుంది.


పాత సంచికలకు ఇదిగో లింక్.. 

 1990 తొలిసంచిక నుంచి 2010 మే సంచిక వరకూ మొత్తం 245  ‘మిసిమి’ సంచికలు  పత్రిక వెబ్ సైట్ లో ఉచితంగా లభ్యమవుతున్నాయి.  ఈ లింకు నుంచి PDF  ఫైళ్ళను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా!
   

4, డిసెంబర్ 2014, గురువారం

‘మహాభారతం’పై రంగనాయకమ్మ పుస్తకం!


‘కల్పవృక్షం’ అని సూతుడు పొగిడిన కథ...  మహా భారతం!

ఇది  లక్షకు పైగా సంస్కృత శ్లోకాల గ్రంథం.  క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటి రచన.

"ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" (యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్)  అనీ,  ‘‘పంచమ వేద’’మనీ ప్రశస్తి పొందింది.
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ,  
అధ్యాత్మవిదులు వేదాంతమనీ,  
నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, 
కవులు మహాకావ్యమనీ; 
లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, 
ఐతిహాసికులు ఇతిహాసమనీ, 
పౌరాణికులు బహుపురాణ సముచ్చయమనీ ...  

ప్రశంసలు కురిపిస్తారనే  పేరు ఈ మహాభారతానికి!

ద్రౌపదీ పాండవుల  మహాప్రస్థాన ఘట్టాన్ని తెలిపే ఈ చిత్రం 19వ శతాబ్ది నాటి  Barddhaman edition of Mahabharata లోనిది.
 
ఈ పొగడ్తల్లో నిజానిజాలెంత?

వేద వ్యాస ముని రాసిన-  ఈ గ్రంథంపై రచయిత్రి  రంగనాయకమ్మ రాసిన క్లుప్త పరిచయం  ‘ఇదండీ మహా భారతం’ పేరుతో  పుస్తకంగా తాజాగా  విడుదలైంది.

వ్యాస మహాభారతానికి ఇంగ్లిష్ వచనానువాదం, కవిత్రయ భారతం , పురిపండా అప్పలస్వామి వ్యావహారికాంధ్ర మహాభారతం పుస్తకాల ఆధారంగా ఈ రచన సాగింది.

 ‘రామాయణ విషవృక్షం’ రాసిన దాదాపు నలబై ఏళ్ళ తర్వాత ‘మహా భారతం’ గురించి ఇప్పుడు  రాశారామె. 

‘‘భారతం కథని యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టే ఇచ్చాను. అసలు కథ ఎలా ఉంటుందో తెలియాలి పాఠకులకు. నా వ్యాఖ్యానాలు నేను వేరే చేసుకున్నాను. అంతేగానీ, అసలు కథలో నేను వేలు పెట్టలేదు.’’  అని ఈ పుస్తకం గురించి ఆమె చెప్పారు.

భారతం-  చరిత్ర అయినా కాకపోయినా ఆ రచనలో ఆ కాలంనాటి  సమాజ పరిస్థితులు ప్రతిబింబించకుండా ఉండవు.

అవెలా ఉన్నాయి?

భారతాన్ని ఇష్టపడి చదివే పాఠకులూ,  ఈ గ్రంథాన్ని  విమర్శనాత్మకంగా చదివే వారూ  కూడా  గమనించని కోణాల్లో..   మార్క్సిస్టు దృక్పథంతో  రంగనాయకమ్మ వ్యాఖ్యానం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు!

 * * * * * 

ఈ పుస్తకంలోని కొన్ని  వాక్యాలూ, వ్యాఖ్యానాలూ...

‘‘ భారతంలో వందలాది కథలు ఉన్నా , ఏ రెండు కథలు చెప్పే అంశాలకీ తేడా లేదు; చెప్పే ధర్మాలకీ తేడా లేదు. అన్నిటి గుణమూ, అన్నిటి సారాంశమూ , ఒకటే.  చాతుర్వర్ణాలూ, రాజుల ఈశ్వరత్వమూ, పురుషులకు భోగాలూ, స్త్రీలకు త్యాగాలూ, అన్ని చోట్లా  అవే.’’

‘‘ భారతం మొత్తంలో ఉన్నదంతా,  చాతుర్వర్ణ  వ్యవస్తా, రాజుల ఆధిపత్య పాలనా, కుప్పల తెప్పల మూఢ విశ్వాసాలూ,  పురుషాధిక్యతా-  ఇవన్నీ కలిసిన దోపిడీ వర్గ భావ జాలమే.’’

‘‘ కవిత్వ వర్ణనల్లో ఎన్ని సొగసులు ఉన్నా, ఆ సొగసులు, చదివేవాళ్ళకి ఏ జ్ఞానాన్నీ ఇవ్వవు. ఆ సొగసులు, చదువరుల్ని   భ్రమల్లోకి  లాక్కుపోతాయి. ఆ సొగసుల్లో వుండే సమాజం ఎటువంటిది- అనేదే చదివేవాళ్ళు గ్రహించాలి.’’

‘‘ మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ  విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా ,  ‘దుర్గ్రంధమే’.’’



‘‘ భారతం, ప్రకృతి  సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక  వందల ఏళ్ళ నాటిది. పైగా మూల మూలనా మూఢనమ్మకాలతో , శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణ గ్రంథాలకు చేతులు జోడిస్తున్నామంటే , మనం ఆధునిక మానవులం  కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం.’’

‘‘ తప్పులో  ఒప్పులో, ఆ నాటి రచన అది.  దాన్ని చదవాలి. చర్చించి చూడాలి. మాట్లాడుకోవాలి. లైబ్రరీలో  పెట్టి ఉంచాలి. అంతే. అది అంతకన్నా నిత్య  పారాయణానికి పనికి రాదు.’’

‘‘ ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో  ఆ సంగతి ఆ దేశంలో  జనాలకు నిజంగా తెలిస్తే , వాళ్ళు అదే రకం జీవితాల్లో వుండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా వుండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా వుండలేరు!’’



* * * * * 

488
పేజీలతో  రాయల్ సైజులో, హార్డు బౌండుతో. తయారైన ఈ పుస్తకం వాస్తవ ధర కనీసం  రూ.240 ఉండాలి.  కానీ పాఠకులందరికీ అందుబాటులో ఉండటం కోసం  దీని ధరను కేవలం  రూ.100గా  నిర్ణయించారు!

 హైదరాబాద్ లో నవోదయ బుక్ హౌస్ లో ఈ పుస్తకం దొరుకుతుంది. విజయవాడలో  అరుణా పబ్లిషింగ్ హౌస్ ( ఏలూరు రోడ్డు) దగ్గర ప్రతులు లభిస్తాయి. ఫోన్ నంబర్: 0866- 2431181.

 తాజా చేర్పు :  ఈ-బుక్ ఇక్కడ దొరుకుతుంది-   http://kinige.com/book/Idandi%20Maha%20Bharatam