సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

21, మే 2019, మంగళవారం

‘జాతక కథలు’ చదివారా?


 వేల సంవత్సరాల క్రితం నాటి కథలు చదవటమంటే ఆ కాలానికి ప్రయాణించి, ఆ వాతావరణంలోకి ప్రవేశించటమే. 

ప్రాచీన సాహిత్యంలో  ఉత్ప్రేక్షలూ, నమ్మశక్యంకాని  కల్పనలూ, మహిమలూ ఉండొచ్చు గాక.  శ్రామికులపై  చిన్నచూపూ,  రాజులపై వల్లమాలిన  భక్తిప్రపత్తులూ చికాకు పెట్టవచ్చు గాక.


ఆ పరిమితులను  వదిలేస్తే ... స్థూలంగా అనూహ్యమైన మలుపులుండే ఆ కథావీధుల్లో సంభ్రమంతో సాగించే సంచారం సంతోషాన్నిస్తుంది.  ఆహ్లాదపరుస్తుంది. 

ఆత్మ ఉనికిని అంగీకరించనిది బౌద్ధం.  కానీ దీని  సాహిత్యంలో పునర్జన్మ కథలు పుట్టటం ఒక విచిత్రం !


జాతక కథలు నాకు ‘చందమామ’తో పరిచయమయ్యాయి.  చందమామలోనే  వరసగా కాదు కానీ, అప్పుడప్పుడూ చాలా జాతక  కథలు చదివాను.  

బోధిసత్త్వుడు  జాతక కథల నాయకుడు.  

ఇతడు మనిషిగా,  జంతువుగా ఏ రూపంలో జన్మించినా గొప్ప వివేకంతో,  ముందుచూపుతో, కరుణతో , త్యాగబుద్ధితో  ప్రవర్తిస్తుంటాడు ఈ కథల్లో. తనతో పాటు తోటివారికి  కష్టాలొస్తే కుంగిపోడు.  అనూహ్యమైన  సమయస్ఫూర్తితో ఆ చిక్కులనుంచి  బయటపడేస్తుంటాడు.  

1953 మార్చి సంచికలో  ‘సఫల యాత్ర’  అనే కథతో  చందమామ జాతక కథల ప్రచురణని మొదలుపెట్టింది.  తర్వాత  చాలా కథలను నెలనెలా ప్రచురించింది.
 

  మళ్ళీ 1980 ఆగస్టు నెల సంచిక నుంచీ  ఈ కథలన్నిటినీ పున: ప్రచురించారు.

 తాము బొమ్మలతో ప్రచురించిన జాతక కథలను  చందమామ వారే   ఒక పుస్తకంగా కూడా వేశారని  చందమామ పరిశోధకుడూ, రచయితా అయిన దాసరి వెంకటరమణ గారు చెప్పారు.  అరుదైన ఆ పుస్తకం ఆయన దగ్గరుంది.

‘సఫల యాత్ర’  కథను ఇక్కడ చదువుకోవచ్చు- 

   jataka katha by Reader on Scribd


ఈ రోజు ఈనాడులో...


ఈ రోజు  ఈనాడు ‘చందమామ’లో  జాతక కథలను ఇలా  పిల్లల కోసం పరిచయం చేశాను.  

అక్కడ రాసిన  కథనం - 

‘పంచతంత్ర’ కథలు మీకు తెలిసే ఉంటాయి. వాటికంటే ప్రాచీనమైన ‘జాతక కథల’ గురించి విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఎంతో పేరు. ఎన్నో భాషల్లోకి ఈ కథలు వ్యాపించాయి. మీరెప్పుడైనా అజంతా గుహల సందర్శనకు వెళ్తే అక్కడ ఈ జాతక కథలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి. మంచి మంచి విషయాలను చెపుతూ మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథల విశేషాలను చెప్పుకొందామా?

‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో..’ అంటూ జాతక కథలు మొదలవుతాయి. గౌతమ బుద్ధుడి పూర్వజన్మల్లో జరిగిన గాథలే ఈ కథలు. బోధిసత్త్వుడు (బుద్ధుడి మరో పేరు) తపస్విగా, రాజకుమారుడిగా, సింహం, ఏనుగు, లేడి.. ఇలా రకరకాల జన్మలెత్తి తన తెలివితేటలతో చిక్కు సమస్యలను పరిష్కరిస్తుంటాడు. విశాల దృక్పథం, అహింస, కరుణలాంటి గొప్ప లక్షణాలతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంటాడు.

సిద్ధార్థుడు బుద్ధుడిగా మారేలోపు 547 జన్మలు ఎత్తాడని బౌద్ధ సాహిత్యం చెపుతుంది. అందుకే జాతక కథల సంఖ్య మొత్తం 547. ఇవి మొదట్లో సింహళ భాషలో ఉండేవి. ఐదో శతాబ్దంలో మన తెలుగువాడైన బుద్ధఘోషుడు ‘పాలీ’ భాషలోకి అనువదించాడు. ఆ పాలీ నుంచి నేరుగా తెలుగులోకి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి అనే రచయిత ఏడు సంపుటాలుగా అనువదించారు. వాటిని క్లుప్తంచేసి, వాడుక భాషలోకి మార్చి వివిధ ప్రచురణ సంస్థలు ఎన్నో పుస్తకాలను ప్రచురించాయి.

ఎందుకు చదవాలి?
వేల సంవత్సరాలుగా తరతరాలను అలరిస్తున్న కథలివి. వీటి ప్రాముఖ్యం ఎంతటిదంటే... వీటిలో కొన్ని ఈసప్‌ కథల్లో, పంచతంత్ర కథల్లో కూడా కనిపిస్తాయి. అద్భుతాలు, సాహసాలు, ఊహించని మలుపులు పెద్దలనూ, పిల్లలనూ ఆశ్చర్యపరుస్తాయి. ఆనందపరుస్తాయి. కథారూపంలో ఆహ్లాదపరుస్తూనే మానవుడు పాటించాల్సిన ధర్మాలు, నీతి నిజాయతీలను సూచిస్తాయి. పరోపకారం, త్యాగం మొదలైన గుణాలకు శాశ్వత విలువ ఉంటుందనీ, ముప్పు ముంచుకొచ్చినప్పుడు దుఃఖించకుండా తెలివితేటలు ప్రదర్శించాలనీ ప్రబోధిస్తాయి.


(ఇక్కడ రెండు కథలను క్లుప్తంగా ఇచ్చాను. వాటిలో ఇదొకటి)

రాతి కింద జల
వందల బళ్లతో వర్తకం చేసే సార్థవాహక వంశంలో పుట్టాడు బోధిసత్త్వుడు. ఒకసారి అతడి బిడారు అరవై యోజనాల నిడివి ఉన్న ఎడారి ప్రాంతం చేరింది. పగలంతా భగభగ మండే కుంపటిలా ఉండటంతో రాత్రివేళల్లోనే ప్రయాణించేవారు. నక్షత్రాల సాయంతో దారి గమనించి ముందుకు సాగేవారు. మరో యోజనం మాత్రమే ప్రయాణం మిగిలివుండగా బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుగ్గా సాగుతుందని వంటచెరకూ, నీరూ పారబోయించాడు బోధిసత్త్వుడు. అయితే దారి నిర్ణయించే వ్యక్తి బడలిక వల్ల నిద్రపోవటంతో ఎడ్లు అదుపుతప్పి, వచ్చినదారే పట్టాయి. సూర్యోదయం అవుతుండగా అతడు నిద్రలేచి, బళ్లు వచ్చిన దిక్కుకే పోతున్నట్టు గ్రహించి, బళ్లను వెనక్కి తిప్పమని కేక పెట్టాడు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయి, కిందటి సాయంకాలం బయలుదేరినచోటకే బిడారు చేరుకుంది. నీరు మాత్రం లేదు!

జరిగిన పొరపాటుకు విచారిస్తూ నిస్పృహతో అందరూ బళ్లకింద చతికిలబడ్డారు. తను కూడా వాళ్లలాగా అధైర్యపడితే అందరూ చచ్చిపోవటం తప్పదనుకున్నాడు బోధిసత్త్వుడు. అటూ ఇటూ తిరుగుతూ ఓ చోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బు చూశాడు. కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు కదా? వెంటనే పలుగు తెప్పించి అక్కడ తవ్వించాడు. అరవై మూరల లోతు తవ్వాక కంగుమని రాయి తగిలింది. అందరూ నిరాశపడిపోయారు. కానీ బోధిసత్త్వుడు కిందకు దిగి, రాతికి చెవి పెట్టి ఆలకించాడు. రాతికి దిగువగా పారుతున్న నీటి చప్పుడు వినిపించింది. ఇక రాతిని పగలగొట్టగానే తాటి చెట్టు ప్రమాణంలో ఉవ్వెత్తుగా నీరు పైకి చిమ్మింది. ప్రాణాలు లేచొచ్చి అందరూ దాహం తీర్చుకున్నారు. క్షేమంగా గమ్యం చేరుకున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో అధైర్య పడకుండా సమయ స్ఫూర్తిని ప్రదర్శించి బోధిసత్త్వుడు ఇలా అందరి ప్రాణాలూ కాపాడాడు.

ఐదు సంపుటాలూ నెట్ లో ...
సరళ గ్రాంథిక భాషలో శివశంకర శాస్ర్తి గారు రాసిన  జాతక కథలు  మొత్తం ఏడు సంపుటాలు.  వాటిలో ఐదు మాత్రం  నెట్ లో దొరుకున్నాయి. 

 ఆసక్తి ఉన్నవారు  వీటిని    గురుకుల్  సైట్  లింకులో  డౌన్ లోడ్ చేసుకుని, చదువుకోవచ్చు.    మొత్తం 1880కు పైగా పేజీలు.   ( గురుకుల్ అనే పదం మీద క్లిక్  చేస్తే సరి).