సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, డిసెంబర్ 2012, ఆదివారం

దొరికిందోచ్... ‘బొట్టు కాటుక’ సినిమా లోగో!

ప్పుడెప్పుడో... 2010లో ఓ పోస్టు రాశాను-  తెలుగు సినిమా లోగోల గురించి (logo-  అక్షరాకృతి) .  అందులో  నాకెంతో నచ్చిన ‘బొట్టు- కాటుక’ లోగో ప్రత్యేకత వివరించాను కానీ, అప్పట్లో ఆ లోగో దొరక్క అది ఎలా ఉంటుందో  వర్ణించి సంతృప్తి పడ్డాను.

కానీ ఇన్నేళ్ళ తర్వాత అది  దొరికింది!

నా చిన్నప్పుడు ఆసక్తిగా గమనించిన సినిమా లోగో... 
చిత్రకారుడు  గంగాధర్ పేరు తల్చుకుంటే  నాకు గుర్తొచ్చే  లోగో!
33 సంవత్సరాల తర్వాత పునర్దర్శనమిచ్చింది!


అప్పుడు ఆ పోస్టులో రాసిన కొన్ని వాక్యాలు ఇక్కడ ఇస్తున్నాను...

‘‘ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో!

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో. మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!’’


ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పోస్టు లింకు చూడండి..  http://venuvu.blogspot.in/2010/07/blog-post.html

ఇప్పుడెలా దొరికింది?

నెట్ లో ఏదో వెతుకుంటే ... ఓ యూ ట్యూబ్   లింకులో  ‘బొట్టు- కాటుక’ సినిమా కనపడింది!

నా కుతూహలం ఒక్కసారిగా పెరిగిపోయింది. (ఎందుకంటే...  వాల్ పోస్టర్లలో వాడని ఆ  లోగోను  టైటిల్స్ లో వాడారని  1980ల్లో  ఆ  సినిమా చూసినపుడు గమనించాను.. అది గుర్తుంది! )

వెంటనే  ఉత్కంఠతో ఆ సినిమా ప్లే చేశాను.
సెన్సార్ సర్టిఫికెట్ కనపడింది. తర్వాత...  పంపిణీదారుల పేరు, కృతజ్ఞతలు, బ్యానర్ పేరు.. వరసగా  ఒకదాని తర్వాత మరొకటి కంప్యూటర్ తెరపై కనపడసాగాయి.

అప్పుడు...
నా  సంతోషాన్ని పెంచేస్తూ-
ఎప్పటినుంచో అన్వేషిస్తున్న లోగో-
కనపడింది...!


ఆ దృశ్యాన్ని  f...r..e..e..z..e... చేశాను .
స్నాప్ షాట్   తీసుకున్నాను!

ఇదిగోండి.... చూడండి- 


పెదాల ఆకారంలో  ‘ఈస్ట్ మన్ కలర్’  అనే అక్షరాలు గమనించారా?

తర్వాత  ఆ సినిమా పాటల పుస్తకం కూడా  దొరికింది .

వాల్ పోస్టర్లలో ఉపయోగించిన లోగో దానిలో ఉంది.   అది-



మరో  సంగతి...
ఈ ఆన్ లైన్  అన్వేషణలో మరో సంగతి కూడా బయటపడింది.

ఇందాక లింకు ఇచ్చానే.. ఆ పోస్టును  జులై 16,  2010లో రాశాను. అదే  పోస్టు  సెప్టెంబరు 16, 2011 నాటి  సూర్య పేపర్లో కథనంగా వచ్చింది- కానీ మరొకరి పేరుతో!

నేను చేసిన వర్ణన,  రాసిన వ్యక్తిగత స్పందన కూడా దానిలో యథాతథంగా వచ్చేశాయి.
చూడండి-
http://www.suryaa.com/archives/Article.asp?cat=4&subCat=3&ContentId=47455

ఇది ఆన్ లైన్లో పెట్టారు కాబట్టి  15 నెల్ల తర్వాతయినా ఈ ఘరానా వ్యవహారం బయటపడింది.  లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదేమో! 

గతంలో కూడా ఇలా కొందరు బ్లాగర్ల టపాలను యథేచ్ఛగా కథనాలుగా వాడేసుకున్న చరిత్ర సూర్య పత్రికది.
ఈ ధోరణి లో  మార్పేమీ రాలేదన్నమాట! 

ఇలా చేస్తుంటే...  ఇకపై  ‘సూర్య’ను  ‘చౌర్య’ అని పిలవాలేమో...
 
*****
 
తాజా చేర్పు... 21.9.2022 
నిన్న శ్యామ్ నారాయణ గారు గుంటూరు నుంచి  ఈ సినిమా లోగోను మెయిల్లో పంపించారు.   పాటల రికార్డులపై ఉండే కవర్ . 
 
దీనిలో  ఇదే లోగో  కాస్త భిన్నంగా ఉంది.   ‘ బొట్టు’, ఈస్ట్ మన్ కలర్ అక్షరాలూ..  ఇంకా మరికొన్ని సూక్ష్మమైన తేడాలతో.  అంటే గంగాధర్ ఈ విలక్షణమైన లోగోను పదేపదే మెరుగుపరచటానికి ప్రయత్నించారన్నమాట.   మీరే చూడండి!
 

 

28, నవంబర్ 2012, బుధవారం

‘వనితాజ్యోతి’ని వెలిగించిన బాపు బొమ్మ ... ఆ తొలి సంచిక ఆచూకీ తెలుసా?


చూశారా ఈ ముఖచిత్రం ? 

ఒక వారపత్రికకూ, ఒక మాసపత్రికకూ  ముఖచిత్రంగా అమరిన బొమ్మ ఇది. 

అంతే కాదు;

ఇద్దరు ప్రముఖ రచయితల  అక్షరాలకు  ప్రేరణ కలిగించిన బొమ్మ కూడా  ఇదే!

దీని వయసు  53 సంవత్సరాలు.

కానీ  బొమ్మల్లోని  మనుషులకు  వయసు పెరగదు కదా?

అందుకే ఈ చిత్ర కథానాయిక ఇప్పటికీ... ఎప్పటికీ  నవ వధువే. 

తొలి ప్రేమలేఖ  చదువుకుంటున్న  ఆమె ముఖంలో విచ్చుకుంటున్న  మందహాసం నిత్య నూతనమే!

ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో ‘ముఖపత్ర చిత్రం’ గురించి నండూరి రామ్మోహనరావు గారు ఎలా  రాశారో కొంచెం (మాత్రమే)  రుచి చూద్దాం!

------------------------- 
‘‘మెయిలు తొమ్మిదింటికి వస్తుందిట మన వూరికి. టపా బంట్రోతు లవ్ లెటర్సూ అవీ పట్టుకు బయల్దేరేసరికి- ’’

‘‘ఛప్ ఏమిటీ ఆ పోకిరీ మాటలూ నువ్వూను, నాన్నతో చెబుతా’’ అంది భానుమతి.

‘‘మిగతాది కూడా వినేసి అంతా ఒకసారే చెప్పెయ్యి- ఏం. వాడు బయల్దేరేసరికి పదిన్నరట. తరవాత దారిలో ఓ కప్పు కాఫీ తాగి రోడ్డెక్కేసరికి పదిమ్ముప్పావు. అంచేత బావ నిన్ను కాలేజీకి సెలవు పెట్టి- అబ్బ- నోరు నొక్కెస్తావేం- సెలవుపెట్టి గుమ్మంలో కూచోమన్నాడు- ఈ సావిట్లో నేట- వరండాలో అయితే నీ మీద ఎండపడి అతని బుగ్గలు కందిపోతాయట- అమ్మో! అమ్మా! ఇటు చూడు ఇది నన్ను రక్కి-
పుటింరోజు కానుక పంపిస్తున్నాట్ట. నువ్వు తప్పుకుండా టపా వేళకి ఇంటి దగ్గర ఉండాలని చెప్పమన్నాడు నాకేం’’ అంది ఇందిర.

పావుగంట తరవాత ఇల్లంతా రాజకీయవాదుల లోపాయకారి మీటింగులా గంద్రగోళం అయిపోయింది. అందరూ తలో రకంగా ఊహాగానసభలు చేసేస్తున్నారు- కానుక ఏమైవుంటుందీ అని.

‘‘కొంపదీసి తనే రైలు దిగి రాడు గదా-’’ అన్నాడు గృహ యజమాని ఇల్లాలి కేసి ఓరకంగా ఓరకంట చూసి.

భానుమతి, సందడి ఇవతలకు జరిగి మెల్లిగా అవతలకు జారుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుని పసిపిల్లలా ఏడ్చేసింది. ఇంట్లో జనం సభ చాలించారు.
 .
* ** **

ఇదీ ఆరంభం.  ఇక  అర్జెంటుగా క్లయిమాక్స్ కి వెళ్ళి చివర్లో ఏం జరిగిందో  ఆ దృశ్యం కూడా  చూసేద్దాం!  నండూరి రామ్మోహనరావు  గారి అక్షరాల్లోనే ...

* ** **

పోస్టుమన్ నోరెత్తి పిలవబోయేలోగానే ‘‘నేనే’’ అంటూ అతని చేతులో ఉన్నది లాక్కుని పరుగెత్తింది భానుమతి.

తలుపు వేసి, స్థిమితపడి ఆయాసం తీర్చుకుని నెమ్మదిగా శాస్త్రోక్తంగా కవరు చింపుతూ ఉండగా తల్లిమాట వినబడింది సావిట్లోంచి ‘‘నయమే ఇంకా, చిన్నది కాలేజీకి పోబట్టి బతికాం’’ అని.

కవరు చింపి ఉత్తరం తీసి మడతవిప్పిన తరవాత భానుమతి ఒళ్ళు ఝల్లుమంది. పుట్టినరోజు కానుకకి బంగీలేవీ రాలేదనీ, వచ్చినది ఉత్తరమనీ అప్పుడే గ్రహించింది సూక్ష్మబుద్ధి కాబట్టి.

అది ఆమెకు లేకలేక వచ్చిన మొదటి లేఖ. అంతకుమునుపు మాటాడ్డమే గాని ఆయన ఉత్తరాలు ఎన్నడూ రాయలేదు- పెళ్ళయి ఏడాది కావచ్చినా.

చదవబోయేముందు చుట్టూ ఓసారి చూసుకొని, నెమ్మదిగా భయంగా చూపులు మొదటివాక్యం మీద నిలిపింది...



 ఆమె చూపులు రెండో వాక్యం మీదికి సాగి మూడో పంక్తిలోకి జారిన తరువాత ఆమె చెంపలలో వెలగబోయే కెంపుల కాంతి రంగులలో ఇమడకపోవచ్చు; వాక్యాలలో అమరకపోవచ్చు. మనం ఒప్పుకున్నా మానినా భానుమతి భర్త నమ్మకం అదే.

అందుకే చిత్రకారుడు ‘బాపు’ ఓ క్షణం ముందరే, తొలి వాక్యం చూడగానే తొలి మందహాసం వెలిగే క్షణాన్నే బొమ్మ వేయడానికి శుభముహూర్తంగా నిర్ణయించుకున్నాడు.

----------------------------------------

ఎంత బాగా ఉందో కదా ఈ  వ్యాఖ్యానం!


ఇది చదివాక  బాపు బొమ్మను మరోసారి చూడండి! 


‘చెంపలలో వెలగబోయే కెంపుల కాంతి’ని చిత్రించకుండా బాపు తొలి మందహాసం వెలిగే క్షణాన్ని ఎంచుకుంటే; 

ఆ  లేఖలో ఏముందో  చెప్పకుండా ‘వాక్యాలలో అమరకపోవచ్చు’ అంటూ రామ్మోహనరావు గారు  కూడా తెలివిగా  తప్పించుకున్నారు.

మరో  పదిహేడేళ్ళు గడిచాయి.

ఇదే బొమ్మ ‘వనితాజ్యోతి’ ప్రథమ సంచికను ముఖచిత్రంగా మరోసారి అలంకరించింది.  ఈసారి  శ్రీరమణ గారు ఈ ముఖపత్ర చిత్రం గురించి  రాశారు.

ఏమని?  

1976 లో వచ్చిన ఆ సంచిక దొరికితే కదా చెప్పటానికి !

శ్రీరమణ గారి దగ్గర కూడా ఆ వ్యాసం లేదిప్పుడు!  చాలా చోట్ల ప్రయత్నించినా ఇంకా  దొరకలేదు.


ఆ సంచిక ఆచూకీ మీకు  తెలిస్తే తప్పకుండా  తెలియజేయండి.


త్వరలో ‘రచన’ శాయి గారు  బాపు బొమ్మలు వేసిన వివిధ రచయితల కథలను (1957-1968) ఓ బృహత్ సంకలనంగా తీసుకురాబోతున్నారు. 100కు పైగా  ఆహ్లాదకరమైన  కథలుంటాయి దీనిలో.

ఈ పుస్తకంలో  శ్రీరమణ  వ్యాసం కూడా  చేర్చాలని  శాయి గారి  ఆకాంక్ష. 





‘వనితాజ్యోతి’  మొదటి  సంచిక మీ దగ్గర గానీ, మీ సాహితీ మిత్రులెవరి దగ్గరైనా గానీ ఉంటే  దానిలోని   శ్రీ రమణ వ్యాసం జిరాక్స్ తీసి, పంపినా చాలు.

శాయి గారి మెయిల్ ఐడీ: rachanapatrika@gmail.com.
ఫోన్ నంబరు: 99485 77517



మరో విశేషం ఏమిటంటే...  ఇదే థీమ్ తో వనితాజ్యోతికే  జూన్ 1978 లో బాపు  ముఖచిత్రం  వేశారు.


  1. (ఈ బొమ్మను సేకరించిన V3 రమణ గారి సౌజన్యంతో).  
 

31, అక్టోబర్ 2012, బుధవారం

రచయితలూ Vs పాఠకాభిమానులూ!


మర్షియల్ రచనలకూ, నాన్ కమర్షియల్ రచనలకూ తేడా- పాఠకుల అభిమానం నిలిచే  తీరులో తెలిసిపోతుంది. తొలి దశలో కమర్షియల్ రచనలను అభిమానించే పాఠకులు తమ ‘స్థాయి’ పెరగగానే వాటిని  పట్టించుకోవటం  మానేస్తుంటారు.   .

కానీ  నాన్ కమర్షియల్ రచనలపై పాఠకులకు ఉండే అభిమానం ఎప్పటికీ తగ్గిపోదు!

రంగనాయకమ్మ గారి రచనలను ఇష్టంగా చదివే పాఠకులకు   ‘శ్రామిక కోణం’  పుస్తకం ఓ రకంగా   ప్రత్యేకమైనది.  (ఈ మధ్యనే ఇది మార్కెట్లోకి వచ్చింది.  ఈ పుస్తకం లింకు-    http://kinige.com/kbook.php?id=1306&name=Sramika+Konam ).
 
 కారణం ‘నవ్య’ వారపత్రికలో ‘నేనూ- నా పాఠకులూ’ అనే పేరుతో వచ్చిన సీరియల్ ని  చేర్చింది  ఈ  పుస్తకంలోనే!

అయితే  శీర్షికను  ‘కొందరు పాఠకులతో,  నా పరిచయాలు’ గా మార్చారు. (‘అభిమానులు ’ అనే మాటను రంగనాయకమ్మ గారు ఉపయోగించరు.  ‘పాఠకులు’ అంటారంతే!)

పాఠకులకూ,  రచయితలకూ  మధ్య  తరచూ  ఉత్తర ప్రత్యుత్తరాలు  జరుగుతూనే ఉంటాయి.  రచయితల మీద అభిమానం చూపే పాఠకుల్లో రకరకాల స్థాయులవాళ్ళుంటారు.  అభిమానాన్ని సాధారణ స్థాయిలో ఉంచుకునేవారు కొందరైతే ... దాన్ని ప్రగాఢంగా పెంచుకునేవారు  కొందరు!

 ఏదైనా సందర్భంలో అభిమాని ప్రవర్తన గడుసుగానో, అపసవ్యంగానే ఉందనే అభిప్రాయం రచయితకు ఏర్పడవచ్చు.  ‘నేనింత అభిమానిస్తున్నాను కదా.. నా పట్ల కూడా  ఇంత నిర్మొహమాటంగా ఉండాలా?’అని అభిమాని అనుకోవచ్చు.  ఇలా  వారి సంబంధాల్లో ఎక్కడైనా అపశ్రుతి మొదలై,  అంతరం ఏర్పడి, అది పెద్దదయే అవకాశముంది.  

అభిమానించే  పాఠకులతో తన  సంబంధ బాంధవ్యాల  తీరును సవిమర్శకంగా ఒక తెలుగు రచయిత  అక్షరరూపంలో పెట్టటం ఇదే మొదటిసారి అనుకుంటాను. దీనిలో రకరకాల పాఠకులతో తనకెదురైన వింత,  ఆహ్లాదకర  అనుభవాలను రంగనాయకమ్మ గారు వివరిస్తారు. 

తనను ఇష్టపడే  పాఠకులైనా సరే, తనతో  సవ్యంగా ప్రవర్తించలేదని భావిస్తే...  వారిని  దూరం పెట్టటానికి సంశయించననీ, వారికి ఎలాంటి మినహాయింపులూ ఉండవనీ  ఆచరణ పూర్వకంగా  రుజువు చేస్తారు  రంగనాయకమ్మగారు. 

ముఖ్యంగా   ఓ పాఠకురాలి ఉదంతం  చెప్పుకోవాలి. 
ఆమెతో  రచయిత్రికి   కొన్ని సంఘటనల ఫలితంగా గ్యాప్ ఏర్పడుతుంది.  తనను క్షమించి,  పూర్వంలాగే ఫోన్లూ, లేఖలూ కొనసాగించాలంటూ  తన అభిమాన రచయిత్రితో ఆమె హొరాహోరీగా ఈ-మెయిల్స్ తో సంఘర్షించిన ఘట్టం అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.  చివరకు మారుపేరుతో  రంగనాయకమ్మ గారితో  లేఖా  సంబంధం పునరుద్ధరించుకోవడానికి కూడా ఆ పాఠకురాలు  ప్రయత్నిస్తారు.

(ఇదంతా తన ధారావాహికలో  రచయిత్రి  వివరంగా రాశారు)

అభిమానం అనేది డిమాండ్ చేయకుండా దానికదే  సహజసిద్ధంగా  ఏర్పడాలి  కానీ;   పోట్లాడీ,  బెదిరించీ ఎవరమూ దాన్ని తిరిగి  సాధించలేం  కదా?   ఈ సంగతి  ఆ  పాఠకురాలికి  అర్థం కాకపోవటం విచిత్రంగా  అనిపిస్తుంది. ఆ మొండి పట్టుదలకు విసుగూ, నివ్వెరపాటు కలుగుతూనే ఆమె పరిస్థితికి  జాలి కూడా వేస్తుంది.  ఇదంతా జరిగాక,  చివరిలో  ఆమె ( నిష్ఠూరాలతోనే )  ఆ విషయం  గ్రహించారనిపిస్తుంది.

‘అభిమానాలూ, గౌరవాలూ, స్నేహాలూ,  ప్రేమలూ,  ఆరాధనలూ- అంతంత మంచి మాటలుగా వినపడేవీ, కనపడేవీ , ప్రతీచోటా నటనలూ  కపటాలూ కాకపోయినా, చాలాచోట్ల అవి అంతంత నిజాలు కావు. వాటి నిండా ఆ మాటలు చెప్పే వాళ్ళకే అర్థం కాని మర్మాలూ, అజ్ఞానాలూ ఉంటాయి. కేవలం అజ్ఞానమే అయినది, నేరం కాదు. కానీ ఆ అజ్ఞానం , అనేక కపటత్వాలతో ఏకమైపోయి, దాన్ని వదిలించుకోవడం వాళ్ళకి కూడా సాధ్యం కానంత కలుషితమైపోయివుంటుంది’ 
అంటారు రంగనాయకమ్మ  ఈ వ్యాస పరంపరకు ముందు.

ఇవన్నీ ఆమె స్వానుభవాలు మరి!

భావాల్లో ఐక్యం, వ్యక్తిగత సంబంధాల్లో అంతరం/ఘర్షణ ఉన్న ఈ  పరిస్థితిని  చూస్తే-  స్థూలంగా ఇవన్నీ మిత్ర వైరుధ్యాలుగానే నాకు కనిపిస్తున్నాయి.
 
ఆమెను  చూడటానికి వచ్చి  ఆమె  తర్కానికి   కన్విన్స్ అయి...  ఆ క్షణంలోనే   తన  చేతికున్నదేవుడి  ఉంగరాన్ని తీసి బయటికి  గిరాటేసిన రైతు పాఠకుడు...

ఆమె  చెప్పారన్న  ఒక్క కారణంతో  క్షయరోగి  అయిన మరో పాఠకురాలిని  ఇంట్లో పెట్టుకుని ప్రేమగా  ఆదరించిన  శాంతకుమారి అనే పాఠకురాలు ....

వీళ్ళంతా మనకు ఈ రచనలో తారసపడతారు.

* *  *

పుస్తకం మొదట్లోనే  రెండు పెద్ద కథలున్నాయి.   ‘శోష! శోష!’ ,   ‘ఇంటర్నెట్ పెళ్ళిచూపులు’.

మొదటిది నవ్య  దీపావళి సంచికలోనూ,  రెండోది రచన మాసపత్రికలోనూ  వచ్చాయి.  కవి పుంగవుని  కీర్తి కాంక్ష ;   అత్యాధునిక పెళ్ళిచూపుల బండారం  వీటికి ఇతివృత్తాలు.   సహజంగానే  వీటిలో వ్యంగ్య హాస్యాల మేళవింపు  కనపడుతుంది.

* *  *

 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘జాహ్నవి’  మేధోమధన వ్యాసాలపై రంగనాయకమ్మ గారు విమర్శా వ్యాసాలు రాశారు.  వాటిని  పత్రికలో వచ్చినప్పటికంటే  ఎక్కువ వివరాలతో ఈ పుస్తకంలో  చదవొచ్చు. మార్క్సిజం మీద విమర్శలు కురిపించిన జాహ్నవి ప్రశ్నలకు సవివరంగా వీటిలో సమాధానాలిస్తూ ప్రతి విమర్శలు చేశారు.

తన వ్యాసాలపై సుదీర్ఘంగా వచ్చిన ఆ  విమర్శలకు స్పందించకుండా జాహ్నవి  ‘వ్యూహాత్మక మౌనం’ పాటించారు! .

వ్యాస పరంపరలో ఒక చోట-  కార్మిక జనాభా ఒక పూట సమ్మె చేస్తే సమస్త శ్రమలూ ఆగిపోయి  ఏమవుతుందో ఆమె చక్కగా వర్ణిస్తారు ఇలా-

‘యంత్రాలన్నీ   ఆగిపోతాయి. ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. రోడ్ల మీద, రైలు లైన్ల మీద, సముద్రాల మీద, మేఘాల మీద, నేల మీద, నింగి మీద, బస్సులూ- లారీలూ- రైళ్ళూ- ఓడలూ- విమానాలూః- రాకెట్లూ- సమస్త రవాణా సాధనాలూ, స్తంభించిపోతాయి.
 

అవి మళ్ళీ కదలాలంటే,
 

అది పారిశ్రామిక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  అది వర్తక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  బ్యాంకు పెట్టుబడిదారుల వల్ల జరగదు. భూస్వాముల వల్ల జరగదు. 

గవర్నర్ల వల్లా, ప్రెసిడెంట్ల వల్లా జరగదు.  ఒబామాల వల్లా, మన్ మోహన్ల వల్లా జరగదు. రాముళ్ళ వల్లా, కృష్ణుళ్ళ వల్లా, జరగదు. యజ్ఞాల వల్లా, యాగాల వల్లా జరగదు.

మళ్ళీ శ్రామిక ప్రజలు కదలాలి. డ్రైవర్లూ, క్లీనర్లూ, టెక్నీషియన్లూ, ఇంజనీర్లూ, ఆ కార్మిక జనాభా అంతా మళ్ళీ పనుల్లోకి దిగాలి.
 

అప్పుడే మళ్లీ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి. యంత్రాలు నడుస్తాయి. బస్సులూ, రైళ్ళూ కదులుతాయి. ఉత్పత్తులు తయారవుతాయి. రవాణాలు సాగుతాయి.

మనుషులు బతకడానికి పనులు చేసేవాళ్ళ అవసరం ఏమిటో, యజమానుల అనవసరం ఏమిటో, ఉత్పత్తులకు కారణం ఏమిటో, అప్పుడు తెలుస్తుంది.’



పుస్తకంలో దళిత సమస్య, తెలంగాణా, విప్లవ కార్యాచరణల మీద కూడా  చర్చా వ్యాసాలున్నాయి. పత్రికలకు వివిధ సామాజిక అంశాల మీద రాసిన ఉత్తరాలున్నాయి.

చలం సమాధి ని రక్షించాలనే చర్చ జరిగినపుడు  రాసిన వ్యాసంలోని భాగం -  

 ‘సమాధులు వ్యక్తిపూజకు పరాకాష్ఠలు. అది మార్క్స్ సమాధి అయినా,  మార్క్సుని గుర్తించవలసింది, మార్క్స్ రచనల ద్వారానే గానీ, సమాధి ద్వారా కాదు.
 ....
 

జనాలు ఎగబడి చూసే తాజ్ మహల్ వంటి సమాధిని తీసిపారేసిన చలాన్ని, సమాధి కట్టి గౌరవిస్తారా?
....
 

రచయితను గౌరవించడం అంటే , ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆయనకి మూర్ఖత్వంగా కనపడే పనితో ఆయన్ని గౌరవించాలని చూస్తే, అది ఆయనకు అవమానమా, సన్మానమా? ఆ మనిషి లేచి రావడమే సాధ్యమైతే , ఆ సమాధిని కూలగొట్టడూ?’   

ఆ చివరి వాక్యం ఎంత పదునుగా,  శక్తిమంతంగా ఉందో గమనించారా?

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

గురజాడ ‘దేశభక్తి’ గేయం... అసలు రూపం ఇదీ!

సెప్టెంబరు 21న  మహాకవి గురజాడ అప్పారావు 150 వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని  పాఠశాలల్లో  ‘దేశభక్తి’ గేయం ఆలపించబోతున్నారు. 

ఇంతకీ...  గురజాడ రాసిన ప్రసిద్ధ ‘దేశభక్తి గేయం’ సరైన వర్షన్ ఏమిటి? 

ఇన్నేళ్ళ తర్వాత ...

ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే...

ఈ గేయం ప్రచురించిన 99 సంవత్సరాల్లో ప్రతిచోటా ఎన్నో మార్పులకు గురైంది. 

క్రియాంతాలు మారాయి. 

పద స్వరూపాలు వేరేవి  వచ్చాయి. 

విరామ చిహ్నాల్లో కూడా తేడాలే!

వి రాసింది రాసినట్టు  పాఠకులకు అందాలి.

అక్షరం కూడా మార్చకూడదు కదా?  

యథాతథంగానే మనం ఆ గేయాన్ని చదువుకోవాలి కదా?  

పాడుకోవాలి కదా?   

అందుకే...  గురజాడ  జీవితకాలంలోనే- తొలిసారిగా- ‘కృష్ణాపత్రిక’లో  ప్రచురితమైన ఈ గేయం ఎలా ఉందో చూడాలి.

తర్వాత ఈ గేయానికి ఆయన చేసిన మార్పులనూ గమనించాలి.

ఈ రెండూ ఇక్కడ చూడండి....

99 సంవత్సరాల క్రితం..

కృష్ణా పత్రికలో  వచ్చిన... 

 దేశభక్తి  గేయం  ఇక్కడ ఇస్తున్నా, చూడండి!


(ఈ ప్రతి కోసం చాలామంది ప్రయత్నించారు కానీ  లభించలేదు.

నాకు ‘శ్యామ్ నారాయణ’ గారి ద్వారా దొరికింది).




స్వదస్తూరితో గురజాడ మొదటి మూడు చరణాలకు  చేసిన మార్పులు...



ఆయన చేతిరాతతో  ఈ గేయంలోని  ప్రసిద్ధ పాదాలు...


యితే గురజాడ రాసిన దేశభక్తి గేయం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులతో  ప్రచురితమవుతూ వచ్చింది. పాఠశాల విద్యార్థులు చదువుకునే  ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే తీరు.   ప్రచురణకర్తల నిర్లక్ష్యమో,  అశ్రద్ధో,  ఉదాసీనతో... ఏదైతేనేం?  ఇన్నేళ్ళుగా  ఇలాగే  జరుగుతూ వచ్చింది.  దీన్ని ఎత్తిచూపుతూ నేను రాసిన వ్యాసమిది... 


ఈ వ్యాసం  ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో నిన్న  ప్రచురితమైంది!

10, సెప్టెంబర్ 2012, సోమవారం

లాయి లాయి లా ఇలా... ఇళయరాజా సుమా!

దో  ప్రేమ కథా చిత్రం.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీశారు.  సినిమా  పేరు - ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’.   త్వరలో విడుదల కాబోతోంది.


హీరో వరుణ్ - గాయకుడు.  హీరోయిన్ పాత్ర పేరు నిత్య (తమిళంలో).   హీరో ఆమెను మూడేళ్ళ తర్వాత కలుస్తాడు.  ఆ సందర్భంలో అతడు  ఇళయరాజా పాట పాడి, ఆయన సంగీత ప్రతిభను  ఆరాధనాపూర్వకంగా తల్చుకునే సన్నివేశం ఉంది.  ఇళయరాజా సంగీతం సమకూర్చిన   Ninaivellam Nithya (1982)  తమిళ సినిమా పాట పాడతాడు. తెలుగు వర్షన్ లో ఈ పాట  గుణ (1991) సినిమాలోని   ‘ప్రియతమా నీ వచట కుశలమా’ గా మారింది. దీనిక్కూడా ఇళయరాజానే సంగీత కర్త.

చూడండి ఈ సినిమాలోని ఓ  చిన్న సన్నివేశం. ..




చూశారు కదా? 

‘అందుకే- నువ్వు పాడటం మొదలుపెట్టగానే...’ అని హీరోయిన్ అన్న తర్వాత ఓ క్షణం నిశ్శబ్దం.. ఆ తర్వాత  వినిపించిన  నేపథ్య సంగీతం ఎంత సమ్మోహనంగా,  హాయిగా ఉందో గమనించారా?. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ని  హంగేరియన్ మ్యూజిషియన్స్ తో చేయించారు ఇళయరాజా.
 
విశేషమేంటంటే... ఈ సినిమా సగం తీసేదాకా సంగీత దర్శకుడు ఎవరనేది దర్శకుడు  గౌతమ్ మీనన్ నిర్ణయించుకోలేదు.  అందుకే  పాటల సన్నివేశాల చిత్రీకరణను  చివరకు  అట్టిపెట్టేశారు. 

ఆ తర్వాత ఆ సినిమాకు స్వరకర్త   ఇళయరాజాయే అయ్యాడు!  తన ప్రస్తావన వచ్చిన సన్నివేశానికి స్వయంగా నేపథ్యసంగీతం సమకూర్చుకున్నారన్నమాట. 

విచిత్రంగా లేదూ?



ఈ సినిమా సంగీతం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమన్నారో చదవండి-

‘‘ నాకు ఏ రకమైన సంగీతం కావాలని  మొదటిరోజు ఆయనతో చెప్పానో, అదంతా ఇళయరాజా సర్  పూర్తిగా  గుర్తుంచుకున్నారు. నా మనసులో ఏదైతే ఉందో అదే ఆయన తన సంగీత బృందానికి చెపుతుండేవారు.  బ్రేక్ బీట్స్, జాజ్/ బ్లూస్ స్టఫ్, ప్రతిదీ... !

ఇదంతా నా ఐఫోన్ లో చిత్రీకరించాను. అక్కడ గడిచిన ప్రతి క్షణాన్నీ ఒడిసిపట్టుకుని రికార్డు  చేయాలనిపించింది.

‘ఎందుకలా చేస్తున్నావ్?’ అని అడిగారు ఇళయరాజా.

‘ఇదంతా నాకోసం చేస్తున్నా’నని చెప్పాను. ’’   (హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో). 

పాటలు విడుదలయ్యాయి...
‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా పాటలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యాయి. వాటిలో ఓ పాట నాకు బాగా నచ్చింది.  ఇళయరాజా అరుదుగానే పాడుతుంటారు కదా? ఈ యుగళగీతాన్ని  ఆయన  బేల శండేతో కలిసి పాడారు.


చిన్న చిన్న పదాలతో చక్కగా రాశారు అనంత శ్రీరామ్.  ( అయితే  ‘వేళలో, ఈ వేళ, ఇవ్వాళ’ అంటూ ఒకే రకమైన పదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుండేది).  ఈ  పాట వినడానికి ముందు సాహిత్యం ఓసారి పరికించండి!

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా


లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

1. ఇంతలో  ఇలా ఎదిగిన  ఆ  తలపులో ఎవరికి ఈ  పిలుపులో
వింత వింతగా తిరిగిన  ఈ మలుపులో తన జతేమొ కలుపుకో

ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళ

జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి  ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి  లేనిపోనివేవో రేపిందా

లాయి లాయి లా ఇలా ఈ హాయి  నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
 
2. మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి  తరగదే ఈ  సందడి

చలాకి కంటి పూల తావేదొ  తాకిందిలాగా హా..
గులాబి లాంటి గుండె పూసేనా 

ఇలాంటి గారడీల జోరింక  చాలించదేలా హో..
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని  ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి  లేని పోనివేవో రేపిందా

 లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

 లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా 


ఈ పాట వినండి ...




ళయరాజా  గొంతులో ముగ్ధత్వం మిళితమైన మార్దవం ఉంటుంది. దీన్ని  ఈ పాటలో కూడా గమనించవచ్చు.  ఇళయరాజా మార్కు ‘కోరస్’తో మొదలయ్యే ఈ పాటలో గానం, నేపథ్యసంగీతం అవిభాజ్యమన్నట్టు పరస్పర ఆధారంగా అల్లుకుపోయి వీనుల విందు చేస్తాయి. 

చరణాల్లో బాణీ తీరు - ఒక వృత్తాన్ని చుట్టుముట్టి తిరుగుతున్న భావన కలిగిస్తుంది.  గాయని పాడిన భాగంలో ‘హాయి నీదే సుమా’ లో ‘నీదే’ అన్నచోట మాధుర్యం  ప్రత్యేకం!  ‘మనదే సరదా సరదా’ అనేమాటలు త్వరత్వరగా తరుముకొచ్చినట్టు  గమ్మత్తుగా వినిపిస్తాయి! 

22, ఆగస్టు 2012, బుధవారం

పాటగా జాలువారిన గురజాడ ‘కవిత్వపు కానుక’... వింటారా?


హాకవి గురజాడ అప్పారావు గారు 1910లో రాసిన  ‘దేశభక్తి’ గేయం స్కూలు రోజుల్లో చదువుకున్నదే. అయితే ప్రపంచసాహిత్యంలో ఇది ఆణిముత్యమని అప్పుడు తెలీదు.

తెలిశాక కూడా  ఈ గేయం/ గీతంలో గొప్పతనమేమిటో చాలాకాలం వరకూ అర్థం కాలేదు!

ఏ దేశభక్తి గేయమైనా దేశాన్ని గురించిన పొగడ్తలతో,  ఘనతను వర్ణిస్తూ భావుకత్వంతో  ఉంటుంది. కానీ గురజాడ గేయానికి  వాస్తవికతే  ప్రాణం! 

సంకుచిత పరిధులను అధిగమించి విశ్వవ్యాప్తంగా  ప్రపంచంలోని  ఏ దేశ ప్రజలకైనా  వర్తించగలిగే విలువైన విషయాలను తేలిక మాటల్లో తెలిపే  గేయమిది.

ముఖ్యంగా దీనిలోని  ‘దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి!’ బాగా ప్రాచుర్యం పొందింది.

సాటి మనుషులను పట్టించుకోకుండా భౌగోళిక సరిహద్దులకే  ప్రాధాన్యం ఇచ్చే ధోరణిపై  ఆధునిక కవితా వైతాళికుడి  త్రివిక్రమ ‘పాదం’ఇది!

మనుషులను ప్రేమించలేనిది నిజమైన  దేశభక్తి  కాదని ‘శషభిషలు’లేకుండా చెప్పారాయన.

మాటలు కాదు, చేతలు ముఖ్యమని సూటిగా, సులభంగా చెప్పిన ఈ పాదాలు ఎంత గొప్పవో కదా?
- ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయి!’, 

‘దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పకోకోయి - పూని యేదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి!’

‘మంచి గతమున కొంచెమేనోయి’ అని ఎవరైనా ఇంత ధీమాగా చెప్పారా?

‘మతం వేరైతేను యేమోయి? మనసు వొకటై మనుషులుంటే’ అనీ,

 ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి!’ అనీ  ఐకమత్య భావనను చిన్నచిన్న మాటల్లో కవిత్వీకరించారు.

ఇవన్నీ నీతులు  ప్రబోధించినట్టు కాకుండా నిజం గుర్తు చేస్తున్నట్టు ఉండటమే ఈ గేయం ప్రత్యేకత!

పావురమూ, సింహమూ!

‘గురజాడ రచనలన్నీ నష్టమై పోయి ఒక్క  ‘దేశభక్తి’ గీతం మిగిలినా చాలును. అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించ దగిన మహాక఼వి అని రుజువుకావడానికి . ఎందువల్లనంటే  ‘దేశ భక్తి’ గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయగీతం ’ అంటాడు శ్రీశ్రీ.

‘ఒక తెలుగు కవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక ఇది’ అని  ప్రశంసించాడు.

‘ఒక కాలానికీ ఒక స్థలానికీ పరిమితం కాని సందేశం ఇచ్చేది ఈ గీతం. పావురం లాగ ప్రశాంతంగా రవళిస్తూనే , సింహం  చేసే క్ష్వేళాధ్వనిని స్పురింపజేస్తుంది ఈ గీతం’ అని అభివర్ణించాడు శ్రీశ్రీ.

రాసిన మూడేళ్ళకు  ‘కృష్ణా పత్రిక’లో  ఆగష్టు 9, 1913 తేదీన ఈ గేయాన్ని తొలిసారిగా  ప్రచురించారు.

కవిత కోయిలల.. గానం
ఈ గీతానికి  వయొలిన్ విద్వాంసడు  ద్వారం వెంకటస్వామి నాయుడు గారు స్వరాలు సమకూర్చారు.

ఆ నొటేషన్ చూడండి-


మూడు బాణీలు...

ఈ దేశభక్తి గీతాన్ని మూడు  రకాల బాణీల్లో విందాం...

 1940లో   టంగుటూరి సూర్యకుమారి పాడిన బాణీ వినండి..


1954లో వచ్చిన ‘జ్యోతి’ సినిమాలో  జి. వరలక్ష్మి గానం... సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు.



బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరిచిన ఈ పాటను లలితా సాగరి పాడారు.
(ప్రసారభారతి తెలుగు ఆడియో సీడీ-20 సౌజన్యంతో... )


ఈ మూడు పాటల్లోనూ ఏది ఎక్కువ శ్రావ్యంగా అనిపిస్తోందో  చెప్పండి..!
 - - - -  -  -------------------------------------------- - -- -

 (అడిగిన మరుక్షణాల్లోనే ఏ పాటనైనా ఫోన్లో  వినిపించగల విద్యుద్వేగం;                            
కోరిన  ఆడియో- వీడియో- సమాచారం- ఏదైనా తక్షణమే  మెయిల్దారిని బయల్దేరదీసి,
 మరు నిమిషంలోనే  అవతలివారికి  చేర్చగల ప్రతిభా ఉన్న-
ఒకే ఒక్కడు ...
శ్యామ్ నారాయణ గారి  సహకారంతో.. .)


27, జులై 2012, శుక్రవారం

సినీ మా.గోఖలే... అపర శ్రీకృష్ణ సృష్టి!


‘మనసుంటే మార్గ’మే కాదు, ఆ మార్గం ఫలితాన్ని కూడా ఇస్తుందని నా విషయంలో చక్కగా రుజువైంది. మనం ఏ విషయంలోనైనా  ఆసక్తి పెంచుకుంటే దాని విశేషాలు  మనకే తారసపడతాయి!

కిందటి నెల మా.గోఖలే గురించి ఓ టపా  రాశాను.  ఆయన ప్రతిభా విశేషాల  గురించి   వివరంగా, మరింకేమైనా తెలిస్తే బాగుణ్ణనుకున్నాను.  

అంతే.. అప్పటినుంచీ ఆయన విశేషాలు తెలుస్తూనే వచ్చాయి. (ఇదేదో మాయో, మహిమో  కాదు. అంతకుముందు కూడా కనపడే వుంటాయి కానీ, నేనే వాటిని  పట్టించుకోలేదు).

ముఖ్యంగా గోఖలే  సృజనకు అద్దం పట్టే సెటింగ్ ల స్కెచ్ ల ప్రతిరూపాలూ, ఓ జానపద సీరియల్ కి  ఆయన వేసిన  బొమ్మలూ  దొరికాయి! 

మరి  వీటిని మీ అందరితో  పంచుకోవద్డూ? దీంతో- మా. గోఖలేపై  మరో టపా అనివార్యమైపోయింది.

* * * 

ఖైదుకు మారు పేరు శ్రీకృష్ణ జన్మస్థానం. 

‘వెన్న దొంగ- మా తొలిగురువు- తొలి నుంచీ మా కులగురువు’ అంటూ  ఖైదీలు కూడా (శ్రీశ్రీ కలం సాయంతో) ఆరాధించే పాత్ర శ్రీ కృష్ణుడు.

మరి అపర సినీ  శ్రీకృష్ణ  జన్మస్థానం  ఎక్కడో తెలుసా? ‘విజయా’వారి ఆస్థానం!

శ్రీకృష్ణుడంటే మన తెలుగువారికి  ఎన్టీ రామారావే!   తమిళంలోనూ ఆయనకు అంత పేరుందట.  అంతకుముందు సీఎస్సార్ లాంటివారు ఈ వేషం వేసినా అప్పట్లో కృష్ణుడి పాత్రకు ఈలపాట రఘురామయ్య  ప్రసిద్ధి. ఆయన్ను చూడ్డానికీ, ఈలపాట వినడానికీ (కృష్ణుడి వేషమైనా  ఈలపాడక తప్పేది కాదు పాపం ఆయనకి) అలవాటుపడ్డ ప్రేక్షకులు  మరొకర్ని ఆ పాత్రలో  జీర్ణించుకోలేరు కదా?

ఘంటసాల సొంత  చిత్రం ‘సొంత ఊరు’ (1956)లో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి  శ్రీకృష్ణుడిగా కనపడ్డారు. కానీ  ఆ పాత్రలో జనం ఆయన్ను ఆమోదించలేకపోయారు. థియేటర్లలో హేళనగా  ఈలలతో  గోలగోల చేశారు.

 ఈ సంగతి తెలిసి కూడా జంకకుండా, ఎన్టీఆర్ తోనే మాయాబజార్ (1957)లో శ్రీకృష్ణుడి పాత్ర వేయించిన కేవీ రెడ్డి గారి ధైర్యం, దూరదృష్టిని  మెచ్చుకుని తీరాలి. ఆయనకు కళాదర్శకుడు మా.గోఖలే  రూపంలో  అండ దొరికింది.


(తాజా కలం in August 2013 :  ఈ విషయం వాస్తవం కాదని  సినీ విమర్శకుడు   డా. వి.ఎ.కె.రంగారావు  ‘నవ్య’లో ఈ లేఖ రాశాక తెలిసింది-    ఎన్.టి.రామారావు మొట్టమొదటి కృష్ణరూపం ధరించింది సొంత వూరు’ (1956) లో కాదు; ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954)లో. ఆయన వేషాన్ని  ఎవరూ విమర్శించలేదు. ఆ సినిమాలు రెండూ బాగా ఆడలేదు. అంతే. తెలియనివారూహించటం, అనడం, తక్కినవారు గొర్రెదాటు వాటాన్ని అనుసరించడం అలవాటైపోయింది’ ) 

ఎన్టీఆర్ ని కృష్ణుడిగా ఒప్పించాలన్నది   సవాలుగా తీసుకున్న  గోఖలే  ఊహలు రెక్క విప్పుకున్నాయి.  సహచరుడు కళాధర్ సాయంతో  కిరీటం, నగలూ రూపొందించారు. వివిధ రూపురేఖలతో రకరకాల స్కెచ్చులూ, గెటప్ లూ వేశారు. ఫొటోలు తీశారు. 

అప్పటిదాకా పరిచితమైన  కృష్ణుడి రూపుకు పూర్తి భిన్నమైన ఆహార్యం కోసం కృషి చేశారు. సగం కిరీటం కాస్తా  పూర్తి కిరీటంగా మారింది. వీటన్నిటికీ  ఎన్టీఆర్ రూపం, నడక, కొంటెదనపు  చిరునవ్వు తోడై  సినీ శ్రీకృష్ణుడు అవతరించాడు.

ప్రేక్షకులను నొప్పించిన  కృష్ణుడిని.. చివరకు వారిచేత  ఒప్పించటమే కాదు, మెప్పించి.. అంతటిలో ఆగకుండా  అశేష నీరాజనాలు పలికే స్థాయిలో  విజయవంతమైన  ఈ ప్రయత్నం  అమోఘం!  

భక్తుల కలల్లోకి  శ్రీకృష్ణుడు  వచ్చాడంటే...అది నిశ్చయంగా  ఎన్టీఆర్ రూపంలోనే అనే  స్థితి  ఏర్పడిపోయింది! :) 

అలా శ్రీకృష్ణ పాత్రే తానుగా మారారు ఎన్టీఆర్. కాసేపున్నా చాలనిపించేలా, ఆఖరికి సాంఘిక సినిమాల్లోకి కూడా ఆ పాత్ర  చొరబడింది.  1973లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కథాపరంగా  ‘మరల రేపల్లె వాడలో మురళి మోగి’ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ సమ్మోహనరూపం  కళ్ళబడినపుడు తెలుగు ప్రేక్షకుల సంతోషం తనలో ప్రతిఫలించిందా అన్నట్టు-   ఎస్వీ రంగారావు  మొహంలో సంతోషం వెల్లివిరుస్తుంది! 

తన దర్శకుడి  నిర్ణయం ఎంత కచ్చితమైనదో ఈ కళా దర్శకుడు తిరుగులేనివిధంగా  అలా నిరూపించారు! 

 * * * 

హైహై నాయకా  
మాయాబజార్ లో  ఘటోత్కచుడి ఆహార్యం మా.గోఖలే మరో అద్భుత సృష్టి.
ఆయన ఆ పాత్ర ఎలా ఉండాలో ఊహించి స్కెచ్ వేశారు. 

ఆ స్కెచ్ నీ , దాని ఆధారంగా రూపొందిన పాత్రధారినీ   చూడండి.

కొండల్లో కోనల్లో తిరిగేవాడు కాబట్టి కిరీటంపై ఈకలు డిజైన్ చేశారు.  కర్ణాభరణాలు పెద్దగా వెంకటేశ్వరస్వామి నగల మల్లే ఉన్నాయి. పూసలూ, కంఠాభరణాలూ కూడా అటవీ సంస్కృతిని గుర్తుచేసేవే.

ఈ గెటప్ కు ఎస్వీ రంగారావు గారి నటన  తోడై, ఘటోత్కచుడి పాత్ర గొప్పగా పండింది!
* * * 

తీయని ఊహల పూలతోట  
 పాతాళభైరవి సినిమాలో కథానాయిక  చెలికత్తెలతో  ‘తీయని ఊహల హాయిని గొలిపే వసంత గానమె హాయీ’ పాట పాడుకుంటుంది కదా? ఆ తోట  నిజమైన ఉద్యానవనంలాగే  ఉంటుంది. కానీ అది సెట్. మా.గోఖలే చేసిన మాయాజాలం!


* * * 

క్కడ కొన్ని సెటింగ్స్, వాటికి ముందుగా వేసుకున్న స్కెచెస్ చూడండి.

తన డిజైన్  సంతృప్తికరంగా వచ్చి, గోఖలేకి నచ్చిన ఈ సెట్ ‘జగదేకవీరుని కథ’లోది.



ఇది మాయాబజార్ లో శశిరేఖ భవంతి .



చంద్రహారంలోనిది ఈ  కన్నులపండువైన ఈ సెట్.

సహజత్వం,  భారీతనం,  కథాస్థలంలోకీ, కథా కాలంలోకీ తీసుకువెళ్ళగలిగే  నేపథ్య కల్పన, పాత్రలకు సముచితమైన  ఆకట్టుకునే ఆహార్యం.... ఇవీ-  మా.గోఖలే కళాదర్శకత్వంలో కనపడే విశేషాలు.
 * * * 

వైముఖ్యం నుంచి  ప్రాముఖ్యం
గూడవల్లి రామబ్రహ్మం గారి ‘రైతుబిడ్డ’ (1939)  సినిమా ఆర్ట్ విభాగంలో పనిచేసిన గోఖలేకు ఆ పని అంత ఉత్సాహం కలిగించలేదు.  ఇక సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకూడదని నిశ్చయించుకుని పదేళ్ళ పాటు సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు.

అలాంటిది చక్రపాణి ప్రమేయంతో  షావుకారు (1950) కు కళా దర్శకుడి బాధ్యత స్వీకరించారు. తన పని విలువా,  ప్రాముఖ్యం తెలిసిన నిర్మాతలవటం వల్ల విజయా ఆస్థాన కళా దర్శకుడిగా కొనసాగారు.  అజరామర చిత్రాలకు పనిచేశారు.

* * * 
చిత్రకారునిగా...

మా.గోఖలే డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో రాజకీయ కార్టూన్లు వేశారు. చక్రపాణి  ఆయన్ని 1948లో మద్రాస్ పిలిపించుకుని తన సంపాదకత్వంలోని యువ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బొమ్మలు వేయించారు.

గోఖలే  ‘చందమామ’ తొలి సంచికల్లో కూడా  బొమ్మలు వేశారని కొత్తగా తెలిసింది. ఆయన బొమ్మలు వేసిన సీరియల్  ‘బాలనాగమ్మ’!

సమాచారం తెలిస్తే అలా ఊరుకోలేను కదా? ఆ సంచికలు సంపాదించి, ఆ  బొమ్మలను చూసి  ఆనందించాను.  కొన్ని చిత్రాలు   మీరూ చూడండి...





 8 సంచికలుగా విస్తరించిన ఆ సీరియల్ భాగాలను ఒకే pdf ఫైలుగా కంపైల్ చేశాను. ఈ సీరియల్ 66 పేజీలుంది.  50 mb.

మరి మన మిత్రులకు దీన్ని  ఎలా అందుబాటులోకి తేవడం? రాపిడ్ షేర్ లో అప్ లోడ్ చేశాను.

ఆసక్తి ఉన్నవారు కింది బొమ్మ మీద క్లిక్ చేసి,  ‘బాలనాగమ్మ’ సీరియల్ ని  డౌన్ లోడ్ చేసుకోవచ్చు
 
http://rapidshare.com/share/13AF3DFBD6F284057C27CC4A5504D90F


(‘సినిమా రంగం’ సంపాదకుడు కీ.శే. జి.వి.జి. గారు, ‘బ్లాక్ అండ్ వైట్’ రచయిత రావి కొండలరావు గారు,  ‘చందమామ’ సంస్థాపకుల సౌజన్యంతో ఈ టపాలో కొన్ని అంశాలూ, చిత్రాలూ ఉపయోగించుకున్నాను. వారికి  నా  కృతజ్ఞతలు).
 
3.12. 2020 
తాజా చేర్పు:  చందమామ 1948 జనవరి సంచికలో మా. గోఖలే వేసిన  దమయంతి రంగుల  చిత్రం
 

 
 
 

13, జూన్ 2012, బుధవారం

మాయాబజార్ చిత్రం ... మహాప్రస్థానం ముఖచిత్రం!

1950 లో ప్రచురితమైన  మహాప్రస్థానం, 1957 లో విడుదలైన మాయాబజార్ ... ఈ రెంటితో  సంబంధమున్న  కళాకారుడు మా.గోఖలే !

మొదటిది  తెలుగు కవిత్వ పటుత్వానికి  చిరునామా, సాహిత్య  శిఖరం!  రెండోది  తెలుగు సినిమా  స్థాయికి  పరాకాష్ఠ,  వెండితెర కావ్యం!

ఈ రెండిటి గురించి  ఇక  చెప్పాల్సిందేమీ లేనంతగా  విస్తారంగా  చర్చలు  జరిగాయి. అయినా... తరచూ ఉటంకింపులతో ప్రశంసలూ,   సమాలోచనలూ,  తలపోతలూ సాగుతూనే ఉన్నాయి. 


ఇక  మా.గోఖలే! (1917-1981). మాధవపెద్ది  గోపాల కృష్ణ గోఖలే. ఇంటి పేరు చూడకపోతే పేరును బట్టి  తెలుగువాడు కాదనిపిస్తుంది. ( స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి గుర్తుగా మనలో ఝాన్సీలక్ష్మీబాయిలూ ,  బాలగంగాధర తిలక్ లూ, గాంధీలూ చాలామందే ఉన్నారనుకోండీ.) 

ఆయన  రాసిన  కథలతో  ఓ సంకలనం  వచ్చింది. అయితే   చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా ఆయన  కృషిని   తెలిపే  సమాచారం అంతగా  అందుబాటులో  లేదు.

1949 ఆగస్టు 1న కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో ప్రజలను దిగంబరులుగా మార్చి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించారు పోలీసులు. దీనిపై గోఖలే గీసిన రేఖా చిత్రం అప్పట్లో చర్చనీయాంశమయిందట.  (చలసాని ప్రసాదరావు ‘ఇలా మిగిలేం’లో కూడా ఈ సంఘటన ప్రస్తావన ఉంటుంది).


గోఖలే చిత్రించిన  పలనాటి ‘బ్రహ్మన్న’కు  బాగా ప్రసిద్ధి వచ్చింది. ‘చాపకూడు’తో సమత కోసం ప్రయత్నించిన బ్రహ్మనాయడు చాప మీద  ఆలోచనా ముద్రలో  కూర్చుండగా ఎదురుగా ఖడ్గం.  సాంప్రదాయిక శైలిలో గీసిన  ఈ బొమ్మను చూస్తుంటే పల్లెటూళ్ళలోని  వ్యవసాయకుటుంబాల్లో ఆజానుబాహులైన రైతులు గుర్తొస్తారు. నీటి రంగుల్లో చిత్రించిన ఈ బొమ్మను ఏ పుస్తకంలో చూశానో గుర్తు లేదు కానీ ఆ వర్ణచిత్రం లభ్యం కాలేదు.

ప్రస్తుతానికి నలుపు తెలుపు చిత్రాన్నే చూద్దాం.



గోఖలే  మరో ప్రసిద్ధ చిత్రం  ‘పావురాళ్ళు’. నేనింతవరకూ  చూసినట్టు గుర్తులేదు. ఇది కూడా ఎక్కడా  దొరకలేదు.  

కళా దర్శకుడు
మాయాబజార్  సినిమాకు  కళా దర్శకుడిగా మా. గోఖలే  పనిచేశారు. ఘటోత్కచుడూ, శ్రీకృష్ణుడూ  .. ఈ   పాత్రల ఆహార్యం , పౌరాణిక వాతావరణం కళ్ళముందుకు తెచ్చిన  సెట్ల వెనక కృషి మా. గోఖలేదే.


ఈ సారి  ఆ సినిమా చూసేటపుడు... సెట్ల అందాలనూ,  పాత్రధారుల అలంకరణలనూ గమనించి  మా.గోఖలేను  కూడా  తల్చుకోండి ఓసారి! 

గోఖలే కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాలు పదకొండో, పన్నెండో ఉన్నాయి. షావుకారు  (1950)తో కెరియర్  ప్రారంభించి,  పాతాళభైరవి  (1951), మిస్సమ్మ (1955) ... అలా ఎదుగుతూ జగదేకవీరుని కథ (1961), ఆపై శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)  వరకూ విజయవంతంగా కొనసాగారు.

టైటిల్ డిజైనర్
 గత అరవయ్యేళ్ళలో  30కు పైగా  ముద్రణలు పొందిన విశేష  ప్రాచుర్యం  మహాప్రస్థానానిది.  దీనికి  ముఖచిత్రం  వేసింది మా.గోఖలేనే !

‘మహాప్రస్థానం’అనే అక్షరాలు  ఏటవాలుగా వంగి ఒక కదలికను స్ఫురింపజేస్తుంటాయి.  గుండ్రంగా, ఒద్దికగా ఒదిగివుండే సాంప్రదాయిక  తెలుగు అక్షరాలు కావివి.  కొత్త బాటలో  తిరుగుబాటును తలపించేలా , పుస్తక స్వభావం  వ్యక్తమయేలా  ఉంటాయవి. ‘భారతీయుడి’ గొలుసుకొట్టు రాతను పోలి అక్షరాలు విభిన్నంగా  కనపడతాయి. తలకట్టు గీయటంలో,  నిలువుగా నిలిచిన  అక్షర నిర్మాణంలో  అదో  ప్రత్యేకత.  ‘శ్రీశ్రీ’ చేతిరాత ఇలాగే ఉంటుంది!

తర్వాతి కాలంలో  మాదాల రంగారావు ‘మహాప్రస్థానం’ పేరుతో  సినిమా తీసినపుడు  ఇదే  టైటిల్ ని లోగో గా వాడుకున్నారు.



ముఖచిత్రంలో వివరాలు  అంత స్పష్టంగా ఉండవు. కానీ ఒక రకమైన impact కలగజేసేలా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన దృశ్యాలు ఇందులో చిత్రించారు.

 ఓ పక్క.  ఉరికొయ్యలకు వేలాడే  శిరస్సులు, కుంగిపోయి, వంగిపోయి కూలబడిపోయిన  వృద్ధులూ, పిల్లలూ. ‘అనేకులింకా అభాగ్యులంతా అనాధులంతా అశాంతులంతా ’!  మరోపక్క- విముక్తి కోసం ప్రతిఘటనకు సిద్ధమైన జనం!

ఇదంతా  నేపథ్యం.  

‘మీ కోసం కలం పట్టా’నని  భరోసా ఇస్తూ -

‘నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి’..


సమర్పణం చేస్తున్నానన్నట్టు  ఒక పక్కకు  తలపైకెత్తి స్థిరంగా,  ధీమాగా చూసే  శ్రీశ్రీ (అలనాటి) రూపం !

‘మహాప్రస్థానం’  టైటిల్ డిజైన్ రూపకల్పన అనుభవం  గురించి  మా. గోఖలే  ఎక్కడైనా చెప్పారో, రాశారో లేదో తెలీదు.

చలం రాసిన  ‘యోగ్యతా పత్రం’ శక్తిమంతమైన అక్షర నివాళి! 
గోఖలే గీసిన ముఖపత్రం- ఆ పుస్తక సారాన్ని చాటి చెప్పే చిత్రకళా కాహళి!!      

31, మే 2012, గురువారం

స్టీఫెన్ హాకింగ్ కాలజ్ఞానం... నిజమవుతుందా?

‘కాలం కథ’తో పాఠకులను విశ్వవిహారం చేయించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ .  ఆయన మరో రచన ‘కాల బిలాలూ పిల్ల విశ్వాలూ’ కూడా తెలుగు పాఠకులకు పరిచితమే.

 ఆధునిక కాలంలో్ ఐన్ స్టయిన్ స్థాయి శాస్త్రవేత్తగా పేరుపొందిన హాకింగ్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో విలువ ఉంటుంది. వాటిపై  భిన్న కోణాల్లో చర్చలు జరగటం చాలా సహజం.

ఈ టపా ఆ రకమైనదే!  

వచ్చే వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుంది కాబట్టి, మనుషులు ఇతర గ్రహాలకు వలస వెళ్ళక తప్పదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం.

ఈ భూమ్మీద బానిస వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలు  కొనసాగింది.  భూస్వామ్య వ్యవస్థ  వైభవం మాత్రం వందల సంవత్సరాలకే పరిమితమైంది. మరి ఇప్పటి  పెట్టుబడిదారీ వ్యవస్థ ? దీనికింకా వెయ్యేళ్ళ ఆయుర్దాయం వుంటుందా? అంతకాలం అది మనలేకపోతే ఈ వ్యవస్థ తాలూకు  చెడుగులు మాత్రం ఎందుకు నిలిచివుంటాయి?

హాకింగ్  వ్యాఖ్యలపై ఓ మార్క్సిస్టు రాసిన  స్పందన ఇది...


అసలు విషయం తెలియని హాకింగ్!

సైన్సుకి సంబంధించిన ఏ విషయాలయినా ప్రకృతి ధర్మాలకి లోబడే  పనిచేస్తూ వుంటాయి. ప్రకృతి సూత్రాలకి అతీతమైన సైన్సు సూత్రాలు ప్రకృతిలో- అంటే ఈ విశ్వంలో ఎక్కడా  వుండవు. గతకాలంలో ప్రారంభమైన మానవజాతి మనుగడ వర్తమానం గుండా భవిష్యత్కాలంలోకి కొనసాగుతుంది. తన మనుగడ కొనసాగింపు క్రమంలోనే మానవుడు కొత్త కొత్త సైన్సు సూత్రాల్ని ఆవిష్కరిస్తూ దాని ద్వారా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వున్నాడు.

కానీ మనిషికి ముఖ్యంగా ‘ఈస్తటిక్ ఎంజాయ్ మెంటు’, ‘ఎస్ట్రానమీ’లోనే వుంటుందనిపిస్తోంది. ‘కాళ్ళ కింద నరకం’ గురించి తెలుసుకోలేకపోయినా ‘నెత్తిమీద నరకం’ గురించి బాగానే అధ్యయనం చేస్తున్నాడు. భూగర్భంలోకి ప్రయాణం గట్టడం కన్నా అంతరిక్షంలోకి ప్రయాణం గట్టడమే సులువు కదా మరి!

గతకాలం నుంచీ ఇప్పటివరకూ కూడా జ్యోతిశ్శాస్త్ర  పండితులు యుగాంతాల గురించి హెచ్చరిస్తూనే వున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ... జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని మించిపోయిన పాండిత్యంతో మానవాళి భవిష్యత్తూ, భూమి భవిష్యత్తూ అంటూ శాస్త్రవేత్తలు రకరకాల కాలజ్ఞానాలు చెప్తూ వుండడం...

 
 ‘వందేళ్ళ తర్వాత మార్స్ మీదే కాలనీలు’ అనీ, ‘అంగారకుడే గతి’ అనీ (ఆంధ్రజ్యోతి దినపత్రిక 9-1-12)లో ప్రఖ్యాత అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్ తన 70వ పుట్టిన రోజు సందర్భంగా బీబీసీ రేడియో చేసిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు కావచ్చు, చేజేతులారా తెచ్చిపెట్టుకునే అణుయుద్ధం వల్లనైనా కావచ్చు. మరో వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుందని, కాబట్టి  మన పాలపుంతలోని ఇతర గ్రహాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుందని  హాకింగ్ అభిప్రాయం.

‘‘అంతరిక్షంలో కాలనీలు ఏర్పరచుకోవడం అత్యవసరం. ఎప్పటికైనా మనం అంగారకుడి పైనా, సౌరవ్యవస్థలోని ఇతర గ్రహాల పైనా కాలనీలు ఏర్పరుచుకుని స్వయం స్వావలంబన సాధిస్తామని నాకు గట్టి నమ్మకం. అయితే వచ్చే వందేళ్ళ లోపు ఇది జరిగే అవకాశం లేదు.’’ - ఇవీ హాకింగ్ అభిప్రాయాలు.

అయితే హాకింగ్ గానీ, హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఎవరైనా గానీ ఈ రకమైన అభిప్రాయాలు చెప్తే, ఈ రకమైన సూత్రీకరణలు చేస్తే  అవి తప్పు అభిప్రాయాలే; తప్పు సూత్రీకరణలే!

హిరోషిమా, నాగసాకిలపై వేసిన యురేనియం బాంబులు ఎంత విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. ఈనాడు  ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఆయుధాగారాల్లో  కొన్ని వందల టన్నుల యురేనియం బాంబులూ, హైడ్రొజన్ బాంబులూ పెట్టుక్కూచున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సయిల్స్ ... వార్ హెడ్స్ మోసుకుపోయి ఏ ఖండంలో అయితే ఆ ఖండంలో వేసెయ్యడమే. మనిషి గనక ఈ ఆయుధాల్ని వుపయోగిస్తే  మహా విధ్వంసం సంభవిస్తుంది. భూగోళం  తునాతునకలైపోతుంది. ఇంక ఈ ఆయుధాలు అన్నిటినీ గనక ప్రయోగిస్తే భూగోళం అనేకసార్లు ముక్కులు చెక్కలైపోతుంది.

హాకింగ్ జోస్యం చెప్పినట్టు మరో వెయ్యేళ్ళ వరకూ ఆగాల్సిన పనిలేదు. మరో ప్రపంచ యుద్ధం గనక మొదలైపోతే రేపే ప్రపంచానికి ఆఖరి ఘడియలు రావచ్చు. అణు విధ్వంసంతో భూగోళం అంతమైపోవచ్చు.

అయితే ఈ విషయాలు హాకింగ్ కి తెలియవా అంటే ఎందుకు తెలియవు? అంత మహా శాస్త్రవేత్త కి చక్కగానే తెలుస్తాయి. అవన్నీ తెలిసే హాకింగ్ ఈ రకమైన అంచనాలకి వచ్చారు. అవకాశాలంటే  వున్నాయి గానీ రేపంటే రేపే యుద్ధాలు ప్రారంభమైపోవు గదా!

ఇప్పుడున్న టెక్నాలజీని ఆధారం చేసుకుని దానివల్ల భౌగోళిక పరిస్థితుల్లోని మార్పులు గమనించుకుంటూ వెళితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ప్రమాదం రావచ్చు. లేకపోతే వెయ్యేళ్ళనాటికి మానవుడు తెలివైనవాడు కావచ్చు.

(మానవుడు ఇంకా తెలివైన వాడు కాదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. తెలివైన జాతులు తమని తామే పేల్చేసుకుంటాయని సైన్సులో ఓ లోకోక్తి ఉంది).

అందుకనే ఏ మార్స్  మీదో,  లేకపోతే వేరే నక్షత్ర కుటుంబంలోని గ్రహాల మీదో మానవులు వలసలు ఏర్పరచుకుంటే భూగోళానికి ఎలాంటి విధ్వంసం సంభవించినా మానవజాతి మనుగడ మరో లోకాల్లో కొనసాగుతుందని హాకింగ్ అభిప్రాయపడ్డారు.

హాకింగ్ మాటలు చదవకుండానే ఒక మిత్రుడు ఇలా అన్నాడు- ‘‘ఆఁ ! ఏముందీ. మనిషి భూమి మీద లేనప్పుడు భూమి చక్కగానే వుంది. మనిషి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతే భూమి చక్కగానే వుంటుంది. సమస్యల్లా మనిషి వల్లే! ’’

హాకింగ్ మాటలకీ, హాస్యంగా అన్న మిత్రుడి మాటలకీ పెద్దగా తేడా లేదనే చెప్పాలి.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం...

ఆ అసలు విషయం మానవ సమాజ పరిణామ క్రమం.. మోర్గన్ సమాజ పరిణామ క్రమాన్ని కొన్ని దశలుగా విభజించాడు.  ఆటవిక దశలో ప్రారంభమైన మానవ సమాజం అనాగరిక దశల గుండా ప్రయాణించి నాగరిక దశలోకి చేరుకుంది. మోర్గన్ నిర్దేశించిన సూత్రాలు మార్క్సిస్టు మౌలిక సూత్రాలకి అనుగుణంగానే వున్నాయి.

మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రకారం మానవ సమాజం నిమ్న దశల్లో ప్రారంభమై అంతకంతకూ అభివృద్ధి చెందుతూ వున్నత దశల వేపుగా ప్రయాణం చేస్తోంది. సమాజ పరిణామ  క్రమం ఈ రకంగా వుంది-

ఆటవిక సమాజం నుండి జీవితాన్ని ప్రారంభించిన మానవజాతి బానిస సమాజంలోకి,
దాన్నుండి భూస్వామ్య (ఫ్యూడల్)  సమాజంలోకి,
దాన్నుండి బూర్జువా ( పెట్టుబడిదారీ)  సమాజంలోకి ..  మార్పు చెందుతూ వస్తోంది.

ఒక సమాజం నుండి ఇంకో  సమాజంలోకి  మానవజాతి మార్పు చెందడానికి మహా విప్లవాలు జరిగినయ్. ఇప్పుడున్నది పెట్టుబడిదారీ సమాజం. ప్రపంచమంతా ఈ పెట్టుబడిదారీ ప్రభువుల గుప్పిట్లోనే వుంది. (ఇంతకంటే ఎక్కువ వివరించడానికి ఇక్కడ అవకాశం లేదు).

మానవజాతి అంతా రెండు మహా శిబిరాలుగా చీలిపోయి వుంది. ఆ రెండూ ఒకదానికొకటి శత్రు వర్గాలు. ప్రతీ సమాజంలోనూ దోపిడీ పీడనలకి గురైన వర్గం - దాని శత్రువర్గం మీద చేసే యుద్ధాల ద్వారా ఒక సమాజం నుంచి ఇంకో సమాజం ఆవిర్భవిస్తూ వచ్చింది. అలా మారడానికి వందల వేల సంవత్సరాల కాల పరిమితి బట్టింది. గత సమాజాల ఆయుర్దాయం కంటే ఈ పెట్టుబడిదారీ సమాజ ఆయుర్దాయం చాలా తక్కువ.

‘‘పెట్టుబడిదారీ వర్గ పతనమూ అనివార్యమే. కార్మిక వర్గ విజయమూ అనివార్యమే’’ అని కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో మార్క్స్ , ఎంగెల్సులు చెప్పారు. పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సో్షలిస్టు సమాజం,  దాని తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజం కూడా మానవాళికి తెలుసు.

ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజం పతనావస్థలో వుంది. తన గూట్లో తనే చిక్కుకున్న సాలీడులా మరణ సదృశమైన సంక్షోభాల్లో తనే చిక్కుకుపోతోంది.... పెట్టుబడిదారీ సమాజ స్థానాన్ని అనివార్యంగా సోషలిస్టు సమాజం ఆక్రమిస్తుంది.

గత సమాజాల పరిణామ క్రమాన్ని అంచనా వేస్తే రాబోయే వెయ్యేళ్ళ కాల పరిమితి అవసరం లేదనే తోస్తోంది. తక్కువ కాల వ్యవధిలోనే కమ్యూనిస్టు సమాజం ఆవిర్భవిస్తుందని ఊహించడం సంభవంగా తోస్తోంది.

కమ్యూనిస్టు సమాజం వుపయోగపు విలువ అనే కోణంలోనే వుత్పత్తులన్నిటినీ వుత్పత్తి చేస్తుంది. పనికిరాని చెత్తంతా అది ఈడ్చిపారేస్తుంది. ఆటంబాంబులేంటి, హైడ్రొజన్ బాంబులేంటి-   అలాంటి వాటినన్నటినీ పనికిరాకుండా నాశనం చేసేసి డస్ట్ బిన్ లో పడేస్తారు!

టెక్నాలజీ సమాజాన్ని ఇన్ ఫ్లుయెన్స్ చెయ్యదు. సమాజమే టెక్నాలజీని ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. అమల్లో వున్న సమాజ ప్రభావాన్ని బట్టే టెక్నాలజీ దాని పని అది చేస్తుంది.

గత కాలపు ప్రభువులంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఏరీ వాళ్ళిప్పుడు? ఈ పెట్టుబడిదారీ ప్రభువులేనా శాశ్వతం! పెట్టుబడిదారీ సమాజ చర్యల ఫలితంగానే భూగోళాన్ని సకల రుగ్మతలూ పట్టుకున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ లేంటి, ఏ వార్మింగులైనా రావచ్చు.

అల్పాయుష్కురాలైన ఈ పెట్టుబడిదారీ సమాజం రాబోయే వెయ్యేళ్ళ కాలం మనగలుగుతుందా అని ఇక్కడి  ప్రశ్న. అలా మనగలిగితేనే హాకింగ్ జోస్యం ఫలిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల గానీ, అణు విధ్వంసంవల్లగానీ భూగోళం నాశనమవుతుంది. మానవాళికి మరణం సంభవిస్తుంది!

అయితే మార్క్సిస్టు మహోపాధ్యాయుల్లో ఒకరైన ఎంగెల్సు ఏమన్నాడో ఇక్కడొకసారి చూద్దాం...  ‘‘మానవ కార్యకలాపాల పరిణామం మొత్తంగా భూమండలం లుప్తమైపోయినప్పుడు తప్ప లుప్తం కాదు’’. పై మాటలు ఏం చెప్తున్నాయి? పెట్టుబడిదారీ సమాజం శాశ్వతం కాదని చెప్పడమే, దాని చర్య ఫలితంగా జరిగే సకల విధ్వంసాలూ శాశ్వతం కాదని చెప్పడమే!

పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సోషలిస్టు సమాజం, ఆ తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజాల్లో మానవాళి సకల రుగ్మతలూ పోగొట్టుకుని సుఖశాంతులతో జీవిస్తుంది!

అందుచేత మన భూగ్రహానికొచ్చిన ఢోకా ఏమీ లేదు. వేరే గ్రహాలకి పలాయనం చిత్తగించాల్సిన పని అంతకన్నా లేదు.

గ్రహాల లెక్కలూ రాశుల లెక్కలూ వేసే జ్యోతిశ్శాస్త్ర పండితులు సైన్సు సూత్రాల కచ్చితత్వాన్ని ఏ రకంగా అయితే అర్థం చేసుకోకుండా వదిలేస్తారో, భూమి భవిష్యత్తూ మానవజాతి భవిష్యత్తూ అంటూ జ్యోతిషుల్ని తలదన్నే పాండిత్యంతో మాటలాడుతున్న శాస్త్రవేత్తలు కూడా సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూవున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే- విశ్వాంతరాళంలోకి తొంగిచూసిన హాకింగ్ మేధస్సుకి... ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ మేధస్సుకి ... అసలు విషయం తెలియకుండా పోయింది!

- కోటిలింక  త్రిమూర్తులు  (తుని)
 
 

26, ఏప్రిల్ 2012, గురువారం

‘రేడియో హీరోయిన్’ ఆడియో సీడీ విన్నారా?

 తెలుగులో నేరుగా శ్రవ్య (ఆడియో) పుస్తకాలు వచ్చినట్టు లేదు.  ఏదైనా పుస్తకం విడుదలయ్యాక దాని ఆడియో రూపం రావటం కూడా తక్కువే.

సి. నరసింహారావు గారి  ‘వ్యక్తిత్వ వికాసం’ పుస్తకం ఆడియోగా  వచ్చినట్టుంది.

ముళ్ళపూడి వెంకట రమణగారి ‘కోతికొమ్మచ్చి’ పుస్తకం ఆడియో అమెరికాలాంటి దేశాల్లో  బాగా ఆదరణ పొందిందని విన్నాం.  ఆ పుస్తకంలోని పద విన్యాసాలూ, విరుపులూ, అక్షర చమక్కులూ  వేరెవరో చదువుతూవుంటే .. వింటే ఆ స్వారస్యం అనుభవంలోకి వస్తుందా? అది పఠనానుభవం దరిదాపుల్లోకైనా వస్తుందా? అనుమానమే !

 క్యాసెట్ల రోజుల్లో  యద్దనపూడి సులోచనారాణిగారు శ్రవ్య పత్రికను కొద్దికాలం తీసుకువచ్చారు కానీ, ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు.

నాకైతే పుస్తకాన్ని ‘చదువుకోవటమే’ ఇష్టంగా ఉంటుంది. దాన్ని ‘విని’ తెలుసుకోవాలనిపించదు-  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినా సరే...!

చలం పురూరవలో ఊర్వశికీ,  తిలక్ సుప్తశిలలో అహల్యకూ తన వాగమృతంతో ప్రాణం పోసిన ‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ .

 ఆమె  ‘నా రేడియో అనుభవాలు- జ్ఞాపకాలు’ పుస్తకం రాసిన సంగతి చాలామందికి తెలుసు.  తన ఘనత ప్రసక్తి వచ్చినపుడు కూడా నమ్రతగా,  ఒద్దికగా  చెపుతూ రేడియో మహామహుల ప్రతిభా విశేషాలను గుర్తు చేసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు శారద. ఆకాశవాణి  వైభవ చరిత్రకు వైయక్తిక కోణంలో  ఘన నివాళి పట్టారు.

ఆమె ‘మనసులో  మాట’ గురించి సుజాత గారు ఓ  టపా రాశారు.  అది ఇక్కడ చూడొచ్చు.

ఈ పుస్తకం ఈ -బుక్ గా చదవాలనుకుంటే ఈ లింక్  చూడండి.  ( http://kinige.com/kbook.php?id=373&name=Naa+Radio+Anubhavalu+Gnapakalu )

2011 జులైలో విడుదలైన ఈ పుస్తకాన్ని అప్పుడే ఆసక్తికరంగా చదివాను.  ఇక ఈ పుస్తకం సీడీగా వస్తోందని తెలిసినా ..  దానిపై  అంతగా ఆసక్తి చూపించలేదు. పుస్తకం ఎంత బాగా ఉన్నా.. అదే కంటెంట్ మళ్ళీ ‘వినటం’అవసరం లేదు కదా అనేది నా ఆలోచన.


కొద్ది రోజుల క్రితం ఈ ఆడియో సీడీ నా దగ్గరకొచ్చింది. ఎలా ఉంటుందో చూద్దామని (విందామని) శారద గారి  పుస్తకాన్ని చూస్తూ ఆమె గళం వినటం మొదలుపెట్టిన కొద్ది సేపటికే నా అంచనా తప్పని చక్కగా రుజువైపోయింది!

అసలు ఈ పుస్తకమే మాట్లాడుతున్న ధోరణిలో ఉంటుంది. దాన్ని చదివేటప్పుడు శారద గారు అవసరమైనచోట చక్కని ఇంప్రవైజేషన్స్ చేస్తూ... పెద్ద పదాలను విడదీస్తూ, సందర్భం వచ్చినపుడు సంభాషణ శైలిలోకి మారుతూ, చిరుహాసాలను రువ్వుతూ సాగిపోయారు. ఎప్పటెప్పటి జ్ఞాపకాలనో తడుముకుంటూ, అనుభూతులను స్మరించుకుంటూ  ముచ్చటగా, అందంగా అలనాటి అనుభవాలను  మననం చేసుకుంటూ తాపీగా, సాఫీగా చదివారామె. 

దీంతో  ఆమె మన ఎదురుగా కూర్చుని ఆత్మీయంగా, సహజంగా  కబుర్లు చెప్పిన అనుభూతి  ఏర్పడింది. ఇక పుస్తకం పక్కనపెట్టేశాను. కళ్ళు మూసుసుకుని ఆ శ్రవణానందంలో మునినిగిపోయాను.

వందకు పైగా  లలిత, జానపద, దేశభక్తి, ప్రబోధ గేయాలనూ, పాటలనూ గుర్తు చేసుకున్నారీ  పుస్తకంలో.  పల్లవులు చూస్తే వాటి ట్యూన్ ఎలా ఉండేదో తెలీదు కదా?  ఆ బాణీలేమిటో తెలియకుండానే వాటి సాహిత్యం గమనిస్తూ చదువుతూ పోయానప్పుడు. ఇప్పుడీ సీడీలో ఆ బాణీలను శారద గారే  మధురంగా గానం చేస్తూంటే వినసొంపుగా అనిపించింది. ఇన్ స్ట్రుమెంట్ల సాయం ఏదీ లేకుండా- ఇంట్లో మనం పాడుకుంటున్నట్టుగా హాయిగా పాడేశారు.

మాటల నుంచి పాటకు ఎంత అలవో్కగా మారిపోతారో, పాట తర్వాత మాటల్లోకి అంతే సహజంగా మరలిరావటం .. అబ్బురంగా తోస్తుంది.

ఈ పుస్తకంలో/సీడీలో శారద గారు ఇలా అంటారు- ‘సంగీతానికే కాదు, మాటలకీ ఉంటాయి శ్రుతి లయలు. అది పట్టుకునేందుకు ప్రయత్నించాలి.’ ఆ శ్రుతి లయల పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న శారద గారు ఈ సీడీలో తన స్మృతుల పరిమళాన్ని పాఠక శ్రోతలకు హృద్యంగా, మనోహరంగా పంచిపెట్టారు.

శారద గారి గళం వినిపించకపోతే ఈ టపా అసంపూర్ణమే అని నా నమ్మకం. అందుకే  ఈ సీడీ రూపకర్తల సౌజన్యంతో ఓ మూడు శ్రవ్య శకలాలను  ఇక్కడ ఇస్తున్నాను.  

(సీడీని పంపిణీ చేస్తున్నవారు SR Communications, Vidya nagar, Hyderabad. ఫోన్ నంబర్. 040- 65153327. ఈ -మెయిల్ : srmaiah@yahoo.com)

1. రేడియో నాటకం ప్రాశస్థ్యం గురించి శారద గారు ఎంత బాగా రాశారో.. అంత బాగా చదివారు...

2. శారద గారు తొలిసారిగా ప్రొడ్యూస్ చేసిన సీరియల్ నాటకం - రంగనాయకమ్మ గారి బలిపీఠం. దీని నాటకీకరణ గొల్లపూడి మారుతిరావు గారైతే, తార పాత్రను యద్దనపూడి సులోచనారాణి గారు పోషించటం విశేషం. ఈ నాటకం గురించి....

  3. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ‘బావొస్తే’ సంగీత రూపకం గురించి..




 ఇంత రాశాక   పురూరవ లో  తెరతెరలుగా సాగే ఊర్వశి నవ్వును వినిపించకపోతే పెద్ద లోటే కదా? ఆ పాత్ర సృష్టికర్త  చలాన్నే సమ్మోహనపరిచిన ఆ ఊర్వశి హాసం కొద్ది క్షణాలు ఆస్వాదించండి...




15, మార్చి 2012, గురువారం

షేక్ స్పియర్... సీజర్.. జ్యోతిషం!

వాళ మార్చి 15.
అంటే  The ides of March! 

క్రీ.పూ. 44లో రోమన్ జనరల్  జూలియస్ సీజర్ రాజకీయ కుట్రకు బలై  నేలకొరిగింది ఈ రోజే. 

అయితే ఏమిటట... అంటారా?

డిగ్రీ చదివే రోజుల్లో   షేక్ స్పియర్ నాటకం ‘జూలియస్ సీజర్’ మాకు  పాఠ్యాంశంగా ఉండేది.

ఆ నాటకంలో చాలా ఘట్టాలు ఆసక్తికరం!

వ్యాసుడి భారతంలోని శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని కాళిదాసు మార్పులు చేసి అభిజ్ఞాన శాకుంతలంగా తీర్చిదిద్దాడు కదా?

 అలాగే ప్లుటార్క్ రాసిన  Parallel Lives లోని సీజర్ గాథను షేక్ స్పియర్ నాటకంగా మలిచి,  అద్భుతమైన నాటకీయతను రంగరించాడు.

మన గతం, వర్తమానం,  భవిష్యత్తు అంతా ముందుగానే  రికార్డు చేసివుంటుందనీ, ఆ ప్రోగ్రాం ప్రకారమే సంఘటనలు జరుగుతాయని అంటే  హేతువాదులెవరూ నమ్మరు; నేనూ నమ్మను. 

జ్యోతిషం అంటే  షేక్ స్పియర్ కి  నమ్మకం ఉందో లేదో గానీ  నాటకీయతను సృష్టించటంలో అది ఎంతో బాగా ఉపకరిస్తుందని ఆ మహా రచయితకు బాగానే తెలుసు. 

అందుకే ...

చాలా సన్నివేశాల్లో శకునాలనీ, కలలనూ, సంకేతాలనూ  ప్రవేశపెడతాడు. కాల్పనిక సన్నివేశారణ్యంలో ‘ఉత్కంఠీరవు’డై  వీర విహారం చేస్తాడు!

 
జూలియస్ సీజర్ సంగతికొద్దాం..
 
మార్చి 15న  సీజర్ కి ఆపద రాబోతోందని sooth sayer  (జ్యోతిషవేత్త)  సీజర్ ని  హెచ్చరిస్తాడు.

ఆ  భవిష్య పురాణాన్ని  ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఆ జోస్యుడు కలలు కంటున్నా’డంటూ  కొట్టి పారేసిన  ధీరుడు సీజర్.

జూలియస్ సీజర్  నాటకం మొదటి అంకం, రెండో సన్నివేశంలోని  ఈ సంభాషణలు చూడండి...

      Soothsayer: (రెండోసారి)  Beware the ides of March.

     CAESAR : He is a dreamer; let us leave him  


అపశకునాల  దుస్స్వప్నాలు వచ్చాయంటూ  కలవరపడుతున్న భార్య Calpurnia తో సీజర్ చెప్పిన మాటలు  ఎంతో ధీరోదాత్తంగా ఉంటాయి.

     Caesar:  "Cowards die many times before their deaths,  The valiant never taste of death but once."
 
పిరికివాళ్ళు  చావుకు ముందే  ఎన్నోసార్లు చనిపోతారు. కానీ ధైర్యశాలి ఒకే ఒక్కసారే మరణిస్తాడనే ఈ మాటలు శతాబ్దాలుగా  కోటబుల్ కోట్ గా  ప్రచారంలో ఉన్నాయి.

విషాదాన్ని ఊహిస్తూ, దానికి భయపడుతూ విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే సందేశం సీజర్ మాటల్లో ఉంది.

ఈ ఘట్టం చదువుతుంటే  దానమివ్వొద్దంటూ శుక్రాచార్యుడు అభ్యంతరపెట్టినపుడు మరణానికి భయపడకుండా
బలిచక్రవర్తి చెప్పిన పలుకులు... (భాగవతంలోని పోతన పద్యం) గుర్తొస్తాయి. 

“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? 
వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై 
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!”

రే, కథ ప్రకారం జ్యోతిషం  నిజమవుతుంది.  ‘ఐడ్స్ ఆఫ్ మార్చి’  సీజర్ కు  మరణశాసనం రాస్తుంది.

ఈ సన్నివేశంలో షేక్ స్పియర్ రాసిన సంభాషణలు నాటకీయతతో ఆకట్టుకుంటాయి.

జోస్యుడు మార్చి 15న తనకెదురైనపుడు సీజర్ హేళనా స్వరంతో ఇలా  అంటాడు...

        CAESAR : [To the Soothsayer] The ides of March are come.

ప్రమాదం తొలిగిపోలేదనీ, ఇంకా పొంచే ఉందంటూ జోస్యుడు ధీమాగా చెప్పిన మాటలు...

        Soothsayer: Ay, Caesar; but not gone.




చివరకు కత్తిపోట్లతో సీజర్ చనిపోయేటప్పుడు సీజర్ బ్రూటస్ తో ‘నువ్వు కూడానా?’ అంటూ బాధాతప్తంగా పలికిన చివరి మాట-     

Et tu, Brute! Then fall, Caesar  ...

అత్యంత ప్రాచుర్యం పొందింది!
  

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కాళిదాసూ... చందమామా !

ప్పుడో 61 సంవత్సరాల క్రితం ఎంటీవీ ఆచార్య గారు  ‘చందమామ’కు వేసిన ముఖచిత్రం ఈ ఫిబ్రవరి సంచికలో పునర్ముద్రించారు. ఏకకాలంలో విభిన్నరూపులతో వేర్వేరుచోట్ల కనపడే కృష్ణ లీలలను నారదుడు ఆశ్చర్యంతో  చూసే దృశ్యమిది. 

అప్పటి సంచిక  చూడకపోయినా  ఇంటర్నెట్  పుణ్యమా అని ఆ సంచిక  పీడీఎఫ్ కాపీ రెండు మూడేళ్ళ  క్రితమే  చూడగలిగాను. మళ్ళీ ఫిబ్రవరి సంచికలో ఆ ముఖచిత్రం   దర్శనమిచ్చింది.

ఈ రెండు ముఖచిత్రాలూ ఇక్కడ చూడండి.



నదీ తీరంలో చెట్టుకింద  మైమరిచి వేణుగానం చేస్తున్న కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది. 

దాన్ని విడిగా...





పాత బొమ్మలను  రంగుల పరంగా, స్పష్టత కోణంలో  ‘ఇంప్రొవైజ్ ’ చేయటం  అభినందనీయం.  అయితే పాత బొమ్మల ఒరిజినాలిటీ,  యాంటీక్ వాల్యూ ని  విస్మరించలేం.

అలనాటి  వెన్నెల
చందమామ  వైభవం  అంతా గతంలోనే  కాబట్టి  పాత కథలను చిత్రా, శంకర్ ల బొమ్మలతో  పునర్ముద్రించటం  నాలాంటి పాఠకులకు సంతోషం  కలిగిస్తుంటుంది.

పాత కథలను అప్పట్లో చదివినా చదవకపోయినా  బొమ్మల్లోని వాతావరణం, అలనాటి ఇళ్ళూ, వాకిళ్ళ , అలంకరణల  నేపథ్యం అందమైన గతంలోకి   ప్రయాణించేలా చేస్తుంది.

అందుకే ఇప్పుడు కొత్త చందమామను మిస్సయితే మంచి పాత కథలనూ, కనువిందు చేసే  బొమ్మలనూ మిస్సవాల్సివస్తుందని కొంటున్నాను!

ఫిబ్రవరి సంచికలోనే  ‘ఎవరు జూదగాడు?’ అనే కథ చిత్రా బొమ్మతో వచ్చింది.


దీన్ని చూడగానే ఇది ‘మాయా సరోవరం’ ఆరంభ సంచికకు వేసిన తొలి బొమ్మ అని అర్థమైపోయింది.

ఈ కథకు కొత్త బొమ్మను వేయించకుండా ఎప్పుడో  36 ఏళ్ళక్రితం ప్రచురించిన  సీరియల్ కు  చిత్రా  వేసిన  బొమ్మ గుర్తొచ్చి, దాన్ని  ఉపయోగించవచ్చనే  ఆలోచన ఎవరికి వచ్చిందో ! అలా గుర్తుకురావటం మెచ్చుకోదగిందే.



కానీ మెచ్చుకోలేని విషయం ఏమిటంటే... బహుళ పాఠకాదరణ పొందిన సీరియల్స్ లోని బొమ్మలను ఇలా  సందర్భం కుదిరింది కదా అని    ఎడాపెడా వాడేసెయ్యటం! ఆ సీరియల్ తో, నాటి చిత్రాలతో   పెనవేసుకునివున్న  అందమైన పాత జ్ఞాపకాలను  ఇది మసకబారుస్తుంది.


మాయా సరోవరం నాయకుడు జయశీలుడు మొదట్లో జూదరి కావొచ్చు కానీ,  జూదరుల కథ దొరికింది కదా అని ఆ బొమ్మను వెతికి పట్టుకుని,  వాడేసెయ్యటం ఏం బాగుందీ? 

చందమామలో వచ్చే ప్రతి బేతాళ కథలోనూ  చివరి బొమ్మ తెలిసిందే కదా? ‘శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కే’ బేతాళుడూ, మౌనభంగం తర్వాత జరిగిన ఈ పరిణామానికి  అవాక్కై చూసే విక్రమార్కుడూ , శ్మశానం, ఒక పక్కకు వంగిన పురాతనమైన చెట్టూ .. వీటితో  ఉండే  బొమ్మను  వందలాదిగా ఎప్పటికప్పుడు  కొత్తవి వేయించిన చరిత్ర ‘చందమామ’ది.

 ఆ పత్రికలో  ఇలా జరగటం ఆశ్చర్యంగానే ఉంది.

అయితే  ఒక్క స్వల్పలోపం లోపమే  కాదు, పట్టించుకోదగ్గది కాదని ‘కుమార సంభవం’లో కాళిదాసు  చందమామను (పోలిక చెపుతూ) వెనకేసుకొస్తాడు. ఎలా అంటే... ‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’ (చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య  మచ్చ ఉన్నంతమాత్రాన  నింద రాలేదు కదా ).

ఆ రకంగా  చందమామ పత్రికకు కూడా ఇదేమంత  లోపం కాదని  ‘చంపి’ల్లో కొందరైనా  సమర్థించుకోవచ్చనుకోండీ!