సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, అక్టోబర్ 2017, ఆదివారం

కలలో నీలిమ కని .... వేణువు విని!



సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం!

రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది.

ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రస హృదయులకు పంచుతోంది.

అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది. 

సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను - 
వినటానికి మాత్రం చాలా కాలం పట్టింది.  

ఆ పాట దొరికి,  విన్నాను -  కొద్ది రోజుల క్రితం! 

రేడియోకు సంబంధించి నాకు ఏదైనా సమాచారం  కావాలంటే...
మలపాక పూర్ణచంద్రరావు  గుర్తొస్తారు.

‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ గారి  ద్వారా ఆయన నాకు పరిచయం.  యువభారతి ఫౌండేషన్ కార్యదర్శి.    ఆ పాట కావాలని అడిగితే...  తన కలెక్షన్లోంచి వెతికి ఆయన  నాకు పంపించారు.

వినగానే  ఎంత  సంతోషమయిందో!

సంగీత తరంగాలపై  నన్ను తేలుస్తూ-  దశాబ్దాల వెనక్కి-  ‘ఆకాశవాణి  మంచి  రోజుల్లోకి’  నన్ను తీసుకువెళ్ళింది  ఆ పాట!

రేడియో కళాకారులూ, అనౌన్సర్లూ మన ఇంటి సభ్యులేనని భావించిన కాలమది.  వారి  రూపం ఎన్నడూ చూడకపోయినా వారు మనకు బాగా తెలుసనీ, మనకెంతో ఆత్మీయులనీ  అనిపించేది.

ఆ పాట  పాడినది  రేడియో కళాకారులూ,  సంగీత విద్వాంసులూ  మల్లాది సూరిబాబు.  

 ఆయన అమేయ సంగీత ప్రతిభకు ఈ లలిత సంగీతపు పాట గానీ,  మరొక పాట గానీ మాత్రమే  ప్రాతినిధ్యం వహించవు.   నాకు నచ్చిన ఆయన పాటలను స్మరించుకోవటం మాత్రమే ఇది.

 ఇదీ ఆ పాట-



కలలో నీలిమ కని
నీలిమలో...  కమల పత్ర చారిమ గని   //కలలో//


కమల పత్ర చారిమలో  సౌహృద మృదు రక్తిమ కని
అగరు ధూప లతిక వోలె
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు...  ఎంత వెర్రిదే   ఆ....  //కలలో //

కలలో మువ్వలు విని
మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని  //కలలో//


సిరి సిరి నవ్వులలో  మూగ వలపు సవ్వడి విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు-  ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే    ఆ....  //కలలో //

కలలో వేణువు విని
వేణువులో విరహ మధుర వేదన విని   //కలలో//


విరహ మధుర వేదనలో  ప్రణయ తత్వ వేదము విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే     //కలలో //


ఈ పాట  సంగీత కర్త  సూరిబాబు గారి గురువుల్లో ఒకరైన   ఓలేటి వేంకటేశ్వర్లు 


రాసిన వారు  ఎస్.వి. భుజంగ రాయ శర్మ

రంగుల రాట్నం (1966) లోని పాట  గుర్తుందా?

- ‘కలిమి నిలవదు  లేమి మిగలదు-  కల కాలం ఒక రీతి గడవదు-  నవ్విన కళ్లే చెమ్మగిల్లవా?  వాడిన బ్రతుకే పచ్చగిల్లదా  ఇంతేరా ఈ జీవితం - తిరిగే రంగుల రాట్నమూ ’ రాసింది భుజంగ రాయశర్మే.  

సాహిత్యంలో  మెరుపులు
‘ముక్త పద గ్రస్తం’ అనే అలంకారం  తెలుసు  కదా?
ముందు రాసి  విడిచిన పదాన్నే  మళ్ళీ గ్రహించి రాయటం-   అది ఈ పాటలో  చూడవచ్చు.

కలలో నీలిమ- నీలిమలో కమల పత్ర చారిమ (సౌందర్యం) -  కమల పత్ర చారిమలో సౌహృద మృదు రక్తిమ

రెండో మూడో చరణాల్లో కూడా ఇలా  ఒక మాట రాసి,   దాన్ని మళ్ళీ  మరోదానికి  అందంగా లంకె  వేయటం కనిపిస్తుంది. 

‘అగరు ధూప లతిక’  అన్న ప్రయోగం చూడండి.   అగరు పొగ... తీగలాగా వంపులు తిరుగుతూ  పైకి సాగిపోవటం  కళ్ళ ముందు కనిపించదూ!

 ఆ  ధూపాన్ని పట్టుకోవడం గానీ, ఆపటం గానీ  అసాధ్యం కదా? అందుకే  దాన్ని వశంలో లేని మనసుతో  పోల్చారు కవి.   

పాటలోని   పదాలూ, పదబంధాలూ కొత్తగా   అనిపిస్తాయి. 
నీలిమ , చారిమ, రక్తిమ, లతిక-  ఈ  తరహా ‘derived/ modified ’ పదాల్లో ఒక అందముంటుంది.

( నవలలు బాగా చదివిన అలవాటు ఉన్న పాఠకులకు  ఇలాంటి  మాటలు బాగానే పరిచయం ఉంటాయి.   అరుణిమ, రూపసి, వీణియ, నిష్కృతి... ఇలాంటివే.)  

*** 

 ఆలోచనామృతమైన  సాహిత్యం ... ‘ఆపాత మధుర’ సంగీతానికి  ఆలంబన కదా!

‘‘సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం ’’  అంటారు మల్లాది సూరిబాబు.

 ఈ మధ్య  ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉదయం వేళల్లో ఈ లలిత సంగీతపు పాటలను ప్రసారం చేస్తోందట.  గత ఏడాది నవంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన ఓ వ్యాసంలో  మల్లాది సూరిబాబు ఈ సంగతి చెప్పుకొచ్చారు.
 
‘‘ఓపికతో వినే ప్రయత్నం చేస్తే, రణగొణ ధ్వనుల కాలుష్యంతో నిండిపోయిన చౌకబారు పాటలకూ, వీటికీగల తేడా ఏమిటో  గమనించగలం’’ అంటారాయన.

***
సూరిబాబు మరో గురువు...  గాన రుషిగా పేరుపొందిన  శ్రీపాద పినాకపాణి . 


 ఆయన స్వర కల్పన చేసిన  అన్నమయ్య పాటల్లో ఒకటి-  ‘ చందమామ రావో ’. 
 
ఈ పాట తెలియని వాళ్ళుండరు కదా?

 ఈ పాటను   సూరిబాబు 2014లో  - మూడేళ్ళ క్రితం- సంగీత శిక్షణ కార్యక్రమంలో ఇలా  పాడారు.

బాణీ లోనూ.  గానంలోనూ  ముగ్ధులను చేసే  సంగతులను  విని తెలుసుకోవాల్సిందే !   ముఖ్యంగా ‘జాబిల్లి’ అన్నచోట ఆ బాణీలో ఎంత ఆప్యాయత,  లాలిత్యం!



చందమామ రావో
జాబిల్లి రావో   //చందమామ//

కుందనపు పైడి కోర
వెన్న పాలు తేవో  //చందమామ//

నగుమోము చక్కనయ్యకు
నలువ పుట్టించిన తండ్రికి  //నగుమోము//
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి  

జగమెల్ల నిండిన సామికి 
చక్కని ఇందిర మగనికి  //జగమెల్ల//
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల బాలునికి  //చందమామ//


ఇంకో రెండు చరణాలు కూడా ఉన్నాయి ఈ పాటలో.

వెన్న,  పాలు  రెండూ అని అర్థమా?  ఒకవేళ అది వెన్నపాలు అయితే- ఇప్పుడు మనం వాడే ప్యాకెట్ పాలలో  క్రీమ్ మిల్క్/ హోల్ మిల్క్ అన్నమాట !  :)

***

ళ్ళీ మొదటి పాట దగ్గరికి వెళ్దాం !

‘కలలో నీలిమ కని’ పాట   కృష్ణుడిని తల్చుకుంటూ  రాధికో, గోపికో  పాడుకున్న  విరహ గీతికేమో  అనిపిస్తుంది .

పాట  నిలువెల్లా  బృందావన  కృష్ణుడిని తలపించే  ప్రతీకలే ఉన్నాయి.
నీలిమ.  కమల పత్రాలు ( యమున ఒడ్డున ),  మువ్వలు,  నవ్వులు , వేణువు... విరహం,  ప్రణయ తత్వం-  

కానీ  ఈ పాటను గాయనితో కాకుండా  గాయకుడితో పాడించటానికి  కారణమేమైనా ఉందా?

ఏదేమైనా...  మల్లాది సూరిబాబు దీన్ని శ్రావ్యంగా, అనుపమానంగా  పాడి  ఎంతో  ప్రాచుర్యంలోకి  తెచ్చారు

ఆయన  పాడి  దశాబ్దాలు గడిచినా  ఇప్పటికీ  దాన్ని ఇష్టంగా  తల్చుకునేవాళ్ళుండటమే దీనికి తిరుగులేని రుజువు కదా!