సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2017, ఆదివారం

రాబిన్ సన్ క్రూసో ... ఆర్థికశాస్త్ర విశేషం

1719లో తొలి ప్రచురణ
క్కడో ఇంగ్లండ్ లో పుట్టి  దేశదేశాల పాఠకులకు చేరువయ్యాడు ..
రాబిన్ సన్ క్రూసో !


నా చిన్నప్పుడు మా అన్నయ్యల ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం ద్వారా  పరిచయమయ్యాడు.  
 
ఎటు చూసినా అంతు లేని సముద్రం... లోపల ప్రమాదాలకు ఆలవాలమైన చిన్న దీవి!
నర మానవుడు కనపడని ఆ నిర్జన ప్రాంతంలో ఒంటరిగా బతకాల్సిరావటం ఎంతటి భయానకం!
ఆశ లేశమైనా లేని పరిస్థితుల్లో గొప్ప నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో  అక్కడ 28 సంవత్సరాలు  జీవించి,
ఆ ద్వీపం నుంచి బయటపడ్డాడు రాబిన్ సన్ క్రూసో ! 

అప్పుడు కథ సారాంశం మాత్రమే తెలుసు.  వివరంగా తెలియదు. రాబిన్ సన్ నిర్భీతీ, తెలివితేటలూ, ప్రణాళిక ప్రకారం దీవిలో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తీరూ ..ఇవన్నీ ఇష్టపడ్డాను.

డిగ్రీ కోర్సులో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చిన క్రూసో.. ఆ తర్వాత  చదివిన  రంగనాయకమ్మ ‘ కాపిటల్ పరిచయం’లో మళ్ళీ తారసపడ్డాడు!

డేనియల్ డెఫో ఇంగ్లిష్ లో  రాసిన ఈ నవలను  సొదుం రామ్మోహన్ సంగ్రహంగా తెలుగులోకి అనువదించారు.  పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించారు.


ఈ మధ్య దీన్ని  మళ్ళీ  చదివాను.

దీని గురించి ఏదైనా  రాయాలనుకున్నపుడు  రాబిన్ సన్ క్రూసో ఒరిజినల్ తో పాటు రెండు వర్షన్ల  కామిక్స్, ఇంకా  వన్ సిలబల్ వర్డ్స్ తో రాసిన నవల... ఇవన్నీ పరామర్శించాను.




క్రూసో వివిధ చిత్రకారుల ఊహల్లో ఎలా ఉన్నాడో  చూశాను.

1719లో మొదటిసారి ఇంగ్లండ్ లో ప్రచురితమైందీ నవల.  రెండు శతాబ్దాల తర్వాత ఈ నవలకు బొమ్మలు వేసే అవకాశం  1920లో  ఎన్.సి. వయత్ కు దక్కింది.

 
దాన్ని ఆయన అపూర్వంగా సద్వినియోగం చేసుకున్నాడు.

‘Do my pictures add a little to the vividness of this story? Do I aid a little in the clearer vizualization of Robinson Crusoe as he moves about on his sunny island? That is the most I can hope for. ' 


ఇంత వినమ్రంగా చెప్పుకున్న వయత్ వేసిన బొమ్మలు కొన్ని చూడండి-













 ***

సొదుం రామ్మోహన్ చేసిన అనువాదం  బాగుంది. ముందుమాటలో ఆయన అంటారు-

 ‘‘ప్రకృతి విసిరిన ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చునో ఈ పాత్ర పిల్లలకే కాదు పెద్దలకూ బోధిస్తుంది....అన్వేషణా స్ఫూర్తి, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై చెరగని ఆశ- ఇవీ క్రూసో లోని ప్రధాన లక్షణాలు’’

తన దుస్థితి గురించి ఆలోచిస్తూ  క్రూసో   ప్రతికూల అనుకూల అంశాలను రాసుకుని విశ్లేషించుకోవటం  గొప్పగా అనిపిస్తుంది.

‘‘నేను జనావాసం లేని దీవిలోకి వచ్చి పడ్డాను. ఇక్కడ నుంచి బయటపడతానన్న  ఆశలు లేవు ’’ 

దీన్నిప్రతికూల పరిస్థితిగా రాసుకున్న క్రూసో...
దాని ఎదురుగా సానుకూల పరిస్థితిని కూడా ఇలా  రాస్తాడు-

 ‘‘మొత్తానికి సముద్రంలో మునిగి చావకుండా ఇంకా సజీవంగానే ఉన్నా’’

మనిషి  సంఘజీవి (man is by nature a social animal) అని  చెప్పిన సోక్రటీస్ (క్రీస్తు పూర్వం 470 - 399) మాటలు ఎంత నిజమో క్రూసో కథ స్పష్టం చేస్తుంది.

దూరాన ఆగివున్న ఓడను చూసిన క్రూసో మానసిక స్థితిని రచయిత డేనియల్ డెఫో బాగా వర్ణిస్తాడు-

‘‘ఎక్కువమంది వద్దు...ఒక్కరంటే ఒక్కరు, ఒకే ఒక వ్యక్తి ఇటు వస్తే నేనెంత సంబరపడిపోతానో! 

ఎన్నేళ్ళయింది మనుషులతో మాట్లాడక......మనుషులతో మాట్లాడాలని నేను ఇంతకుముందెన్నడూ ఇంత గాఢంగా కోరుకోలేదు. 

కనీసం ఒక్క వ్యక్తి కూడా తోడు లేనందుకు నా హృదయం దు:ఖంతో లోలోతులకు కుంగిపోతోంది...’’.

మానవ ప్రపంచానికి సుదూరంగా ఉన్న ద్వీపంలో ఒంటరి మనిషి మనుగడ ఎలా ఉంటుందో  పరిశోధన చేసి రాసినట్టు  ఉంటుందీ నవల.

రచయిత డేనియల్ డెఫో
 300 వందల ఏళ్ళక్రితం రాసిన ఈ  నవల  ఇప్పటికీ ఉత్కంఠభరితంగానే ఉంటుంది.


రాబిన్ సన్ క్రూసో  వాస్తవిక వ్యక్తి కాదు. అది రచయిత కల్పనే.  మరి క్రూసోకు నమూనా ఎవరైనా ఉన్నారా? 

పసిఫిక్ ద్వీపం లో నాలుగేళ్ళు ఒంటరిగా గడిపిన నావికుడు అలెగ్జాండర్ సెల్ కిర్క్ (1676- 1721).  అతడే రియల్ రాబిన్ సన్.



ఆ సెల్ కిర్క్ గురించి   విలియం కౌపర్ (1731-1800) అనే కవి The solitude of Alexander Selkirk  అనే పొయెం రాశాడు.

దానిలో ఓ చిన్న భాగం-

O Solitude! where are the charms
That sages have seen in thy face?
Better dwell in the midst of alarms,
Than reign in this horrible place.


మనుషులెవరూ కనపడని  ఒంటరితనం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పే ఈ పద్యాన్ని డిగ్రీ  పాఠ్యపుస్తకంలో  చదువుకున్నాను.

అప్పుడు కూడా క్రూసో గుర్తొచ్చాడు.

***

ధునిక కాలపు క్రూసో ఎవరంటే.. అడ్మిరల్ బర్డ్.

1934లో ఈ అన్వేషకుడు అంటార్కిటికాలో దక్షిణ ధ్రువాన్ని కప్పే విశాలమైన మంచుదిబ్బలో దాదాపు కూరుకుపోయిన గుడిసెలో ఐదు నెలల పాటు ఒంటరిగా గడిపాడు.  చుట్టు పక్కల వందమైళ్ళ దూరంలో ఎలాంటి ప్రాణీ లేని నిర్జన ప్రదేశమది. మైనస్ 80 డిగ్రీల విపరీతమైన చలి... కటిక చీకటి...లాంతరు మాత్రం ఉంది. 


Alone అనే తన రచనలో బర్డ్ తన అనుభవాలను రికార్డు చేశాడు. 


డేల్ కార్నెగీ 1948లో రాసిన - How to stop worrying and start living (తెలుగులో- ఆందోళన చెందకు ఆనందంగా జీవించు) లో  బర్డ్ ప్రస్తావన వస్తుంది.


***

స్తువులూ -విలువలూ -మారకాలకు సంబంధించి ఆర్థిక శాస్త్ర అంశాన్ని చెప్పటానికి  కార్ల్ మార్క్స్ ‘కాపిటల్’ లో  రాబిన్ సన్ క్రూసోను కోట్ చేస్తాడు.



రాబిన్ సన్ దీవిలో ఒక్కడే వేర్వేరు రకాల శ్రమలు చేశాడు. జంతువుల్ని వేటాడటం, చేపలు పట్టడం, ఇల్లు కట్టుకోవడం, వంట చేసుకోవడం, మేకల్ని పెంచడం...ఇలా.  వాటిని ఉపయోగించుకోవటంలో అతడికెలాంటి సమస్యా రాలేదు.  

ఆ దీవిలోకి రాబిన్ సన్ ఒక్కడే కాకుండా పగిలిపోయిన ఓడ నుంచి మరికొంత మంది మనుషులు కూడా వచ్చివుంటే? అందరూ తలో శ్రమా చేసి తయారుచేసుకున్న వస్తువుల్నీ, పదార్థాల్నీ అందరూ సమష్టిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది.

అలా కాకుండా ఎవరికి వాళ్ళే తాము తయారుచేసుకున్న వస్తువులకు సొంతదారులుగా ఉండి, వాటిని ఇతరుల వస్తువులతో ‘మారకాలు’ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది?

వాళ్ళంతా ‘విలువల గందరగోళం’లో  పడిపోతారని మార్క్స్ చెపుతాడు.

ఆ వస్తువుల్లో శ్రమకాలాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి  వాటికి రకరకాలుగా మారకపు విలువలు ఏర్పడి వాటిని మార్చుకోవడంలో చిక్కులు మొదలయ్యేవి. పోట్లాటలూ, కొట్లాటలూ, నరుక్కోవడాలతో ఆ దీవి లో ప్రశాంతత భగ్నమయ్యేది.

ఆ వస్తువులన్నిటి సొంతదారు రాబిన్ సన్ ఒక్కడే కాబట్టి .. తన  వస్తువులను తన ఇతర వస్తువులతో  మారకం చేసుకోనక్కర్లేదు కాబట్టి... ఆ దీవిలో మారకపు విలువల తల నొప్పుల నుంచి తప్పించుకోగలిగాడు రాబిన్ సన్.

అంటే... మనుషులంతా శ్రమలు చేస్తూ ప్రణాళికతో వస్తువులు ఉత్పత్తి చేసుకుని, వాటిని సమష్టిగా (ఎవరి అవసరం మేరకు వారు) వాడుకోవటం మాత్రమే శాస్త్రీయమైన, ఉన్నతమైన మార్గం... అని చెపుతాడు మార్క్స్.

సమ సమాజపు ఈ ఊహ నిజమైతే.. ఎంతో బాగుంటుంది కదూ..!

30, నవంబర్ 2017, గురువారం

ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ ‘మ్యాజిక్!’



సినిమాల్లో  పాత్రధారుల సంభాషణల మధ్యా,  డైలాగులు లేని సన్నివేశాల్లోనూ  వినిపించేది... నేపథ్య సంగీతం-  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ( బీజీఎం).

దీన్ని సినిమా చూస్తూ  గమనించడం, బాగుంటే ఆస్వాదించటం నాకు ఇష్టం. 

ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా  ప్రాణం పోసి,   పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి,  చూసేవారికి  సన్నివేశం హత్తుకునేలా చేసే శక్తి ఈ బీజిఎంకు ఉంది కాబట్టే  దానిపై నాకు అంత  ఆసక్తి!  

అందుకే... ఈ బీజీఎం ల ప్రస్తావన  ఈ బ్లాగులో కనీసం రెండు పోస్టుల్లో ఇప్పటికే వచ్చేసింది  కూడా.  

సన్నివేశాన్ని ఒక్కసారి చూసి, దానికి సరిపోయే నేపథ్య సంగీతాన్ని ఎంతో వేగంగా అందించటం  ఇళయరాజాకు అలవాటు.  ఆ ప్రక్రియను గమనిస్తే  అదెంతో అబ్బురంగా అనిపిస్తుంది.

దీని గురించి  కిందటి సంవత్సరం మే నెల్లో ఓ పోస్టు రాశాను. ఆసక్తి ఉంటే ... ఇక్కడ క్లిక్ చేయండి.  
  
* * *


ళయరాజా బీజీఎంల ప్రత్యేకతను వివరించే వీడియోలు యూ ట్యూబ్ లో చాలానే ఉన్నాయి.  

వాటిలో  రెండు  వీడియోలను యూ ట్యూబ్ లో  ఈ మధ్య పదేపదే చూశాను.  వాటిని ఆ సినిమాల దర్శకులే స్వయంగా వివరించటం ఓ విశేషం.

ఆ ఇద్దరూ ఒకరు  భారతీరాజా.  రెండోవారు బాల్కి.  

భారతీ- రాజా 
ముదల్ మరియాదై అనే తమిళ సినిమా 1985లో వచ్చింది. దీన్ని తెలుగులో ఆత్మబంధువుగా అనువదించారు. ఆత్రేయ పాటలు, ఇళయరాజా సంగీతం చాలా బాగుంటాయి.

ఈ సినిమాలో ఓ సన్నివేశం.. దానికి  బీజీఎం జోడింపులో ప్రత్యేకతను ఆ చిత్ర దర్శకుడు భారతీరాజా ఈ వీడియోలో  బాగా వివరించారు. చెప్పింది తమిళంలో అయినప్పటికీ  భావం తేలిగ్గానే అర్థమవుతుంది. 



ఈ సన్నివేశంలో కనిపించే దుర్ఘటనా, ఆపై  చకచకా వచ్చే  వివిధ దృశ్యాలూ, ఆకాశం నుంచి కిందకు జారిపడుతున్న వేణువూ..ఆ దృశ్యాల గాఢతనూ, విషాదాన్నీ తెలిపేలా క్లుప్తమైన ఫ్లూట్ బిట్స్ తో  ఇళయరాజా  ఎంత బాగా బీజిఎం కూర్చారో కదా!


దర్శకుడు  బాల్కీ మాటల్లో...
ఇక 2009లో హిందీ సినిమా పా  వచ్చింది. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లు నటించిన ఈ చిత్రం దర్శకుడు బాల్కీ. ఆయన ఇళయరాజా బీజీఎంల ప్రత్యేకతను ఇంగ్లిష్ లో  చక్కగా వివరించిన వీడియో ఇది.




 తను తీసిన  పా చిత్రంలో ఒకటిన్నర నిమిషం సన్నివేశాన్ని శబ్దం లేకుండా చూపించారాయన. తర్వాత ఆ సన్నివేశానికి  ఇళయరాజా కూర్చిన బీజీఎం ను  విడిగా వినిపించారు.  ఆ పైన..   నేపథ్య సంగీతంతో జతకూడి  ఆ సన్నివేశం ఎంత కళగా, ఎంత చక్కగా మారిపోయిందో చూపించారు. 

ఇళయరాజా కూర్చిన నేపథ్యసంగీతంలో .. ఆ వాద్యాల సమ్మేళనంలో మనసుకు హాయి కలిగించే  శ్రావ్యతను గమనించవచ్చు.  ఆ బీజీఎంలనుంచి చాలా పాటలకు బాణీలు వస్తాయని బాల్కీ అనటంలో అతిశయోక్తి ఏమీ కనపడదు మనకి.  నిజానికి  ఆయన బీజిఎంల నుంచి పుట్టిన ఆయన  పాటలు చాలామందికి తెలిసినవే! 

స్వర్ణ సీతను చూసినప్పుడు...
2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం వీనుల విందు చేస్తుంది. వనవాసం చేసే సీత ... వాల్మీకి అనుగ్రహంతో  అయోధ్య రాజమందిరం చేరుకుని- స్వర్ణసీత విగ్రహం చూస్తున్న సందర్భంలో ఆమె హావభావాలు, మనో సంఘర్షణ, చివరకు సంతోషం, మైమరపు .. వీటి నేపథ్యంలో  వచ్చే సంగీతం ఎంత బాగుంటుందో గమనించండి-
 


ఇళయరాజా బీజిఎంల ప్రత్యేకతలను తెలుగు సినిమాలకే పరిమితమై క్లుప్తంగా చెప్పాలన్నా అది ఒక పట్టాన తేలే పని కాదు. ఎందుకంటే..  సితార, గీతాంజలి, మౌనరాగం (అనువాద చిత్రం), శివ, సాగర సంగమం, స్వర్ణ కమలం... ఇలా ఎన్నో సినిమాల్లోని చాలా సన్నివేశాలను చూపించాల్సివుంటుంది మరి!

* * *
సంగీతాన్నీ, నేపథ్య సంగీతాన్నీ సందర్భోచితంగా, శ్రావ్యంగా,  మనసుకు హత్తుకునేలా సమకూర్చడంలో ఇళయరాజాకు దగ్గరగా వచ్చే సంగీత దర్శకులు ఉండేవుంటారు.  ఇళయరాజా  వెయ్యి సినిమాలకు సంగీతం సమకూర్చటం ఘనతే కానీ, అంతకంటే ముందే.. ఎమ్మెస్ విశ్వనాథన్ 1200 సినిమాలకు సంగీతం అందించారు!

పాటలూ, బీజిఎంలకు మించి ఇళయరాజాలో ఇంకా చాలా విషయాలు నాకు నచ్చుతాయి.

ఆయనలో, ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం.. నిరాడంబరత్వం.  అది తెచ్చిపెట్టుకున్న వినయంతో వచ్చినది కాదు.  ఆయన స్వభావమే అంత. 

వేదికలమీద తనపై పొగడ్తలు కురిపిస్తుంటే ఆయనకు నవ్వులాటగా ఉంటుందట.  వక్తలు తనను కీర్తిస్తుంటే తన  పూర్వ సంగీత దర్శకులైన  సి. రామచంద్ర, సీఆర్ సుబ్బరామన్, ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్, మదన్ మోహన్, ఎస్ డీ బర్మన్, ఎమ్మెస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళ పేర్లు చెపుతారు.  వాళ్లు ప్రయాణించిన బాటలోనే నేనూ ప్రయాణిస్తున్నాను అని  చెపుతారు.

ఆయన తరచూ చెప్పే కొన్ని మాటలు చూడండి- 
 
నాకు సంగీతం గురించి తెలియదు. కాబట్టే సంగీతం  చేస్తున్నాను. తెలిసుంటే హాయిగా ఇంట్లో కూర్చొనేవాణ్ణి.

ఒకరి భావాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర వ్యక్తీకరించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి. మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరించొచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదని చెబుతాను.


సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక ఆకాశం లాంటిది. ఒక భూమి లాంటిది. ఎంతో విస్తారమైనది సంగీత ప్రపంచం. సముద్రపుటొడ్డున కూర్చుని అక్కడ కనిపించే ఆల్చిప్పల్ని ఏరుకుని వాటిని మాలగా కూర్చి, దానికి మెరుగుపెట్టి అమ్మే పని చేస్తున్నాను నేను.  
  అయితే సంగీత సాగరంలో ఎక్కడెక్కడ ముత్యాలు దొరుకుతాయో, సంగీతాకాశంలో వీణ శ్రుతులెక్కడ ఆడుకుంటాయో, ఈ సంగీతం భూమిపై ఎక్కడెక్కడికి వ్యాపించి కళ్లకు కనిపించే దృశ్యాల రూపంలో ప్రభవిస్తుందో నాకు తెలుసు. 
 కానీ దీని గురించి ప్రజలకు వివరించే సందర్భాన్ని భగవంతుడు నాకు ప్రసాదించలేదు.’  (దైవం  మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ఇళయరాజా.  అలాగే.. రమణ మహర్షి తాత్విక చింతనను ఆయన అభిమానిస్తారు

బాల్కీ తీసిన మరో హిందీ సినిమా షమితాబ్(2015) విడుదల సందర్భంగా  హీరో ధనుష్  రాజా సర్ తన జీవితంపై ఎంత గాఢమైన ముద్ర వేశాడో వేదికపై ఇలా చెప్పాడు - " I draw my emotions from your music... all my happiness, my joys and sorrows, my love, my heart breakings, my pain, my lullaby...every thing is your music''. 
(‘‘నా  భావోద్వేగాలను మీ సంగీతం నుంచే పొందుతుంటాను.  నా  మొత్తం సంతోషం, నా  ఆనంద విషాదాలూ,  నా ప్రేమా,  నా హృదయ భగ్నతా,  నా పరివేదనా, నా  లాలి పాటా.. ప్రతిదీ మీ సంగీతమే’’)

ఇళయరాజా పాటలు వింటూ పెరిగిన కొన్ని తరాల  శ్రోతల మనసులోని మాటలు కదూ ఇవి!

29, అక్టోబర్ 2017, ఆదివారం

కలలో నీలిమ కని .... వేణువు విని!



సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం!

రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది.

ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రస హృదయులకు పంచుతోంది.

అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది. 

సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను - 
వినటానికి మాత్రం చాలా కాలం పట్టింది.  

ఆ పాట దొరికి,  విన్నాను -  కొద్ది రోజుల క్రితం! 

రేడియోకు సంబంధించి నాకు ఏదైనా సమాచారం  కావాలంటే...
మలపాక పూర్ణచంద్రరావు  గుర్తొస్తారు.

‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ గారి  ద్వారా ఆయన నాకు పరిచయం.  యువభారతి ఫౌండేషన్ కార్యదర్శి.    ఆ పాట కావాలని అడిగితే...  తన కలెక్షన్లోంచి వెతికి ఆయన  నాకు పంపించారు.

వినగానే  ఎంత  సంతోషమయిందో!

సంగీత తరంగాలపై  నన్ను తేలుస్తూ-  దశాబ్దాల వెనక్కి-  ‘ఆకాశవాణి  మంచి  రోజుల్లోకి’  నన్ను తీసుకువెళ్ళింది  ఆ పాట!

రేడియో కళాకారులూ, అనౌన్సర్లూ మన ఇంటి సభ్యులేనని భావించిన కాలమది.  వారి  రూపం ఎన్నడూ చూడకపోయినా వారు మనకు బాగా తెలుసనీ, మనకెంతో ఆత్మీయులనీ  అనిపించేది.

ఆ పాట  పాడినది  రేడియో కళాకారులూ,  సంగీత విద్వాంసులూ  మల్లాది సూరిబాబు.  

 ఆయన అమేయ సంగీత ప్రతిభకు ఈ లలిత సంగీతపు పాట గానీ,  మరొక పాట గానీ మాత్రమే  ప్రాతినిధ్యం వహించవు.   నాకు నచ్చిన ఆయన పాటలను స్మరించుకోవటం మాత్రమే ఇది.

 ఇదీ ఆ పాట-



కలలో నీలిమ కని
నీలిమలో...  కమల పత్ర చారిమ గని   //కలలో//


కమల పత్ర చారిమలో  సౌహృద మృదు రక్తిమ కని
అగరు ధూప లతిక వోలె
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు...  ఎంత వెర్రిదే   ఆ....  //కలలో //

కలలో మువ్వలు విని
మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని  //కలలో//


సిరి సిరి నవ్వులలో  మూగ వలపు సవ్వడి విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు-  ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే    ఆ....  //కలలో //

కలలో వేణువు విని
వేణువులో విరహ మధుర వేదన విని   //కలలో//


విరహ మధుర వేదనలో  ప్రణయ తత్వ వేదము విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే     //కలలో //


ఈ పాట  సంగీత కర్త  సూరిబాబు గారి గురువుల్లో ఒకరైన   ఓలేటి వేంకటేశ్వర్లు 


రాసిన వారు  ఎస్.వి. భుజంగ రాయ శర్మ

రంగుల రాట్నం (1966) లోని పాట  గుర్తుందా?

- ‘కలిమి నిలవదు  లేమి మిగలదు-  కల కాలం ఒక రీతి గడవదు-  నవ్విన కళ్లే చెమ్మగిల్లవా?  వాడిన బ్రతుకే పచ్చగిల్లదా  ఇంతేరా ఈ జీవితం - తిరిగే రంగుల రాట్నమూ ’ రాసింది భుజంగ రాయశర్మే.  

సాహిత్యంలో  మెరుపులు
‘ముక్త పద గ్రస్తం’ అనే అలంకారం  తెలుసు  కదా?
ముందు రాసి  విడిచిన పదాన్నే  మళ్ళీ గ్రహించి రాయటం-   అది ఈ పాటలో  చూడవచ్చు.

కలలో నీలిమ- నీలిమలో కమల పత్ర చారిమ (సౌందర్యం) -  కమల పత్ర చారిమలో సౌహృద మృదు రక్తిమ

రెండో మూడో చరణాల్లో కూడా ఇలా  ఒక మాట రాసి,   దాన్ని మళ్ళీ  మరోదానికి  అందంగా లంకె  వేయటం కనిపిస్తుంది. 

‘అగరు ధూప లతిక’  అన్న ప్రయోగం చూడండి.   అగరు పొగ... తీగలాగా వంపులు తిరుగుతూ  పైకి సాగిపోవటం  కళ్ళ ముందు కనిపించదూ!

 ఆ  ధూపాన్ని పట్టుకోవడం గానీ, ఆపటం గానీ  అసాధ్యం కదా? అందుకే  దాన్ని వశంలో లేని మనసుతో  పోల్చారు కవి.   

పాటలోని   పదాలూ, పదబంధాలూ కొత్తగా   అనిపిస్తాయి. 
నీలిమ , చారిమ, రక్తిమ, లతిక-  ఈ  తరహా ‘derived/ modified ’ పదాల్లో ఒక అందముంటుంది.

( నవలలు బాగా చదివిన అలవాటు ఉన్న పాఠకులకు  ఇలాంటి  మాటలు బాగానే పరిచయం ఉంటాయి.   అరుణిమ, రూపసి, వీణియ, నిష్కృతి... ఇలాంటివే.)  

*** 

 ఆలోచనామృతమైన  సాహిత్యం ... ‘ఆపాత మధుర’ సంగీతానికి  ఆలంబన కదా!

‘‘సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం ’’  అంటారు మల్లాది సూరిబాబు.

 ఈ మధ్య  ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉదయం వేళల్లో ఈ లలిత సంగీతపు పాటలను ప్రసారం చేస్తోందట.  గత ఏడాది నవంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన ఓ వ్యాసంలో  మల్లాది సూరిబాబు ఈ సంగతి చెప్పుకొచ్చారు.
 
‘‘ఓపికతో వినే ప్రయత్నం చేస్తే, రణగొణ ధ్వనుల కాలుష్యంతో నిండిపోయిన చౌకబారు పాటలకూ, వీటికీగల తేడా ఏమిటో  గమనించగలం’’ అంటారాయన.

***
సూరిబాబు మరో గురువు...  గాన రుషిగా పేరుపొందిన  శ్రీపాద పినాకపాణి . 


 ఆయన స్వర కల్పన చేసిన  అన్నమయ్య పాటల్లో ఒకటి-  ‘ చందమామ రావో ’. 
 
ఈ పాట తెలియని వాళ్ళుండరు కదా?

 ఈ పాటను   సూరిబాబు 2014లో  - మూడేళ్ళ క్రితం- సంగీత శిక్షణ కార్యక్రమంలో ఇలా  పాడారు.

బాణీ లోనూ.  గానంలోనూ  ముగ్ధులను చేసే  సంగతులను  విని తెలుసుకోవాల్సిందే !   ముఖ్యంగా ‘జాబిల్లి’ అన్నచోట ఆ బాణీలో ఎంత ఆప్యాయత,  లాలిత్యం!



చందమామ రావో
జాబిల్లి రావో   //చందమామ//

కుందనపు పైడి కోర
వెన్న పాలు తేవో  //చందమామ//

నగుమోము చక్కనయ్యకు
నలువ పుట్టించిన తండ్రికి  //నగుమోము//
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి  

జగమెల్ల నిండిన సామికి 
చక్కని ఇందిర మగనికి  //జగమెల్ల//
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల బాలునికి  //చందమామ//


ఇంకో రెండు చరణాలు కూడా ఉన్నాయి ఈ పాటలో.

వెన్న,  పాలు  రెండూ అని అర్థమా?  ఒకవేళ అది వెన్నపాలు అయితే- ఇప్పుడు మనం వాడే ప్యాకెట్ పాలలో  క్రీమ్ మిల్క్/ హోల్ మిల్క్ అన్నమాట !  :)

***

ళ్ళీ మొదటి పాట దగ్గరికి వెళ్దాం !

‘కలలో నీలిమ కని’ పాట   కృష్ణుడిని తల్చుకుంటూ  రాధికో, గోపికో  పాడుకున్న  విరహ గీతికేమో  అనిపిస్తుంది .

పాట  నిలువెల్లా  బృందావన  కృష్ణుడిని తలపించే  ప్రతీకలే ఉన్నాయి.
నీలిమ.  కమల పత్రాలు ( యమున ఒడ్డున ),  మువ్వలు,  నవ్వులు , వేణువు... విరహం,  ప్రణయ తత్వం-  

కానీ  ఈ పాటను గాయనితో కాకుండా  గాయకుడితో పాడించటానికి  కారణమేమైనా ఉందా?

ఏదేమైనా...  మల్లాది సూరిబాబు దీన్ని శ్రావ్యంగా, అనుపమానంగా  పాడి  ఎంతో  ప్రాచుర్యంలోకి  తెచ్చారు

ఆయన  పాడి  దశాబ్దాలు గడిచినా  ఇప్పటికీ  దాన్ని ఇష్టంగా  తల్చుకునేవాళ్ళుండటమే దీనికి తిరుగులేని రుజువు కదా! 

30, సెప్టెంబర్ 2017, శనివారం

రాతల్లో- గీతల్లో పొదుపూ అదుపూ !


‘బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్’  అని ఓ పాత్ర చేత అనిపిస్తాడు  షేక్ స్పియర్ ‘హేమ్లెట్’ నాటకంలో.

 క్లుప్తంగా  ఉంటేనే  జోక్ కి  విలువా,  సార్థకతా!

 సాగదీస్తూ చెప్తేనో,  వివరించే ప్రయత్నం చేస్తేనో  .. ఆ జోకు  దారుణంగా విఫలమైనట్టే.


చాలా కాలం క్రితం  ‘రసాయన మూలకాల రహస్యాలు’ అనే రష్యన్ అనువాద పుస్తకం చదివాను.

పీఠికలో  ఓ  పిట్ట కథ ఆకట్టుకుంటుంది. అదేంటంటే..

ప్రాచ్యదేశంలో ఓ మేధావి అయిన రాజు  ప్రపంచంలోని అన్ని జాతుల చరిత్ర పుస్తకంగా రాయమని మేధావులకు చెప్పి  ఐదు సంవత్సరాల గడువు ఇస్తాడు.  వాళ్ళు  వందల వేల పుస్తకాలు రాసి తీసుకొస్తారు.

‘వీటిలో పదో వంతు చదవటానికైనా  జీవితకాలం సరిపోదూ,  సంగ్రహంగా కావాలి’ అని మరో ఏడాది గడువిస్తాడు.  అలా ఓ రెండొందల పుస్తకాలు తీసుకొస్తే ... సర్వజాతుల్లో  సర్వకాలాల్లో జరిగిన  అతి ముఖ్య సంఘటనలు  ఇంకా సంగ్రహంగా కావాలంటాడు.

అప్పుడో  వృద్ధ మేధావి ‘ రేపటికి మీ కోరిక నెరవేరుతుంది’ అని  చెప్తాడు.

మర్నాడు  తీసుకొస్తాడో  పెట్టె. దానిలో  చిన్న పత్రం. దానిలో ఒకే ఒక వాక్యం -
     
‘వారు పుట్టారు, జీవించారు, గిట్టారు’



లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ రాసిన చిన్న ఎలిజీ (విషాద కవిత) అందరికీ తెలిసిందే.

‘పుటక నీది
చావు నీది
బతుకుంతా దేశానిది’ 


ఎన్నెన్ని సుదీర్ఘ వ్యాసాలైనా సరే, దీనిముందు వెలవెలపోవలసిందే కదా?

అల్పాక్షరాల్లో అనల్పార్థం  సాధించటం అంత తేలికేమీ కాదు.  పొదుపుగా, సమర్థంగా  చెప్పాలంటే విషయంపై  పట్టూ,  వ్యక్తీకరణపై  అదుపూ ఉండితీరాలి. 


శ్రీశ్రీ ‘మహాప్రస్థానాని’కి రాసిన ముందుమాట- ‘యోగ్యతాపత్రం’లో చలం ఇద్దరు తెలుగు కవుల కవిత్వతత్వాన్ని ఇలా  చెప్తాడు-

‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’. 

ఈ  వ్యాఖ్యను  ఇంతకంటే మించి  సరళంగా,  అద్భుతంగా చెప్పటం  అసాధ్యమనిపిస్తుంది.


17-18 శతాబ్దాల్లో జీవించిన మన  వేమన  జీవిత సత్యాలను అలతి పదాల్లో ఎంత చిక్కగా చెప్పాడో  మనందరికీ తెలుసు.

‘నిక్కమైన నీలమొక్కటైన చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల? ’
***

 చిత్రకళ పదును దేరిన కొద్దీ  గీతలను  పొదుపుగా వాడటం చిత్రకారుడికి అలవాటవుతుంది.  బాపు లాంటి వారి  బొమ్మలను చూస్తే ఇది తెలుస్తుంది.

బాపు సంతకం కూడా ఈ పరిణామాన్ని ఎంచక్కా రుజువు చేస్తుంది.




బొమ్మల్లో / కారికేచర్లలో  క్లుప్తత, సరళతల గురించి ఆలోచించినపుడు వెంటనే నాకు తట్టే పేరు కార్టూనిస్టు రంగా (1924-2002).
 

స్టేట్స్ మన్,  ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ద ట్రిబ్యూన్ లలో  పనిచేసిన  ఈయన  పూర్తి పేరు ఎన్.కె. రంగనాథ్ .

ముందుకు వంగి కర్ర సాయంతో నడిచివెళ్ళే  గాంధీని  రెండు మూడు గీతల్లో -  ఇలా  అలవోకగా రూపు కట్టిస్తాడు రంగా. 





ఇదే పంథాలో ...  నెహ్రూతో పాటు నడిచివెళ్తుండే గాంధీని  ఆయన  చిత్రించాడు.  




శాంతి కపోతంగా...



దేశపటం రూపంలో... 
 ***
క్కువ లైన్లలో బొమ్మను వేయటం  ‘మినిమలిజం ఇన్ డిజైన్ ’.   సింగిల్ స్ట్రోక్ - వన్ లైన్ ఇలస్ట్రేషన్స్ కు పేరుపొందిన  యు.కె. ఆర్టిస్ట్  క్రిస్ థార్న్ లీ.  


‘మినిమల్ ఈజ్ గుడ్’   పేరుతో ఆయన వేసిన రేఖాచిత్రాలు ఇవి.  అన్నీ స్త్రీ మూర్తులవే. 









ఒక్కోటి వేయటానికి ఆయనకు పట్టిన సమయం నిమిషం కన్నా తక్కువే.



***

సింగిల్ లైన్ ఇలస్ట్రేషన్లతో మెప్పించే మరో కళాకారుడు  ఫ్రెంచి ఆర్టిస్టు  క్రిస్టఫీ లూయిస్ క్విబ్. ఆయన గీసిన చిత్రాలు చూడండి.




 వివిధ భంగిమల్లో,  కోణాల్లో  గీసిన  ముఖాలు-





ఒకే గీత  ఎక్కడా ఆగకుండా...  ఎన్నెన్ని  చిత్ర  విన్యాసాలు చేసిందో చూడండి-  





ఒంటి గీతతో ఈయన వేసిన ఐన్ స్టెయిన్ బొమ్మ  ఇది- 

దీన్ని న్యూ సైంటిస్ట్ ముఖచిత్రంగా ఉపయోగించారు.



ఒకే  గీతతో  వినాయకుడి బొమ్మను కూడా ఆయన వేశారు.



‘వన్ లైన్ గణేశ్’  అని దీనికి పేరు పెట్టారీ ఫ్రెంచి చిత్రకారుడు.


సెర్జ్  అనే వ్యక్తి రూపచిత్రాన్ని  క్విబ్  ఇలా ఒంటి గీతతో వేశారు. 




అంతటితో ఊరుకోకుండా ఆయన పేరు ఇంగ్లిష్ స్పెలింగ్  SERGE నే ఆయన బొమ్మగా మలిచిన చమత్కారి  క్విబ్.

ఆ అక్షరాలు  బొమ్మ రూపంలోకి  వచ్చి చేరటాన్ని తమాషాగా ఇలా  వరసగా  చూపించారాయన.

ఇన్ని చమక్కులు చేసే ఈ చిత్రకారుడు  ఒకే గీతతో  తన రూప చిత్రాన్ని వేసుకోకుండా ఎలా ఉంటారు?

అది  ఇదిగో...


విత్వంలో క్లుప్తత ఉంటుంది కానీ... వచనంలో ఉండదు కదా! ఆలోచనా పరిధిని  పెంచే   పుస్తకాల మాటేమిటి?

సూక్ష్మ వివరాలతో  అసంఖ్యాకమైన  రేఖలతో   శ్రద్ధగా  నగిషీలు   చెక్కే బొమ్మల సంగతేమిటి?

వాటి  విలువ  వాటిదే!

అయితే  ఆ గీతలూ, రాతలూ సూక్ష్మంగా, సరళంగా ఉంటే  ఆ  ప్రభావం ఎక్కువ... చాలా సందర్భాల్లో!

‘కొండ అద్దమందు కొంచెమై’ ఉండేలా చేయగలగటం కళా చాతుర్యమే కదా?

ఎందుకంటే... వేమనే చెప్పినట్టు- ‘కొంచెముండుటెల్ల కొదువ గాదు’!