సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

5, ఆగస్టు 2010, గురువారం

రంగనాయకమ్మ గారు మాట తప్పారు!

శ్చర్యంగా ఉంది కదూ? నిజమే!

ఎందరో పాఠకులు ఏళ్ళ తరబడి ఎంక్వయిరీలు చేస్తూ చదవాలని ఎదురుచూస్తున్న నవల.. ‘కృష్ణవేణి’  కొత్త ముద్రణ 38 ఏళ్ళ తర్వాత   ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది!

మాట తప్పటం ఏమిటంటారా?

ఈ నవల ప్రచురణ నిలిపివేసి, ‘కృష్ణవేణి ఇక రాదు’ అని గతంలో ఆమె  ప్రకటించిన సంగతి చాలామందికి తెలుసు!

‘‘కృప్ణవేణి నవల మళ్ళీ చదివితే, దాన్ని మళ్ళీ, మళ్ళీ ప్రచురించవలసిన  అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చాను. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ- ఇదే అందులో కథా వస్తువు అయినా, ఆ వస్తువును చిత్రించడంలో, అందులో చాలా పొరపాట్లు జరిగాయి. చాలా తప్పు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

.. పాఠకులకు ఉపయోగకరంగా లేని రచనని ప్రచురించకుండా ఉండటమే చాలా న్యాయం. ఈసారి ‘కృష్ణవేణి’ చదివి, దాని ప్రచురణ ఆపాలనే అభిప్రాయానికి వచ్చాను.’’
‘కృష్ణవేణి’ రచనా కాలం నాటి రచయిత్రి ఫొటో

ఇలా ఆమె 1982లో ‘స్వీట్ హోమ్’ నవల ముందుమాటలో రాసిన దగ్గర్నుంచీ పాఠకుల అసంతృప్తులు మొదలయ్యాయి. ‘ఇదేం పని’ అంటూ పాఠకులు వాళ్ళ కోణంలో ఇన్నేళ్ళుగా ఆమెను అడుగుతూనే ఉన్నారు.  

‘ప్రభ’లో సీరియల్ వచ్చిన కాలంలో నేను పుట్టనే లేదు. 16 ఏళ్ళు వచ్చేవరకూ  ఆమె పుస్తకాలతో పరిచయం లేదు. ఈలోగా  ‘కృష్ణవేణి’ ప్రచురణ ఆపేశారు. అలా ఆ పుస్తకం మిస్సయ్యాను. కానీ, ఆ పుస్తకంలో ఏం ఉందో చదవాలని ఉత్సుకత. ఎలా?  మొత్తానికి విజయవాడ లెనిన్ సెంటర్లోని పాత పుస్తకాల షాపులోనే ఈ నవల సంపాదించి, చదివేశాను.

కానీ, ఎక్కడెక్కడో  ఉన్న  మిగతా పాఠకుల సంగతి?  ‘కొత్త ముందుమాటలు’ రాసి అయినా సరే, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయమని వాళ్ళు తరచూ అడగటం మానలేదు.  ఇక పుస్తకాల ఎగ్జిబిషన్లలో అయితే, ప్రతి సంవత్సరం కొందరు పాఠకులైనా ‘కృష్ణవేణి’ నవల గురించి ఎంక్వయిరీ చేయకుండా  ఉండరు.

అయినా సరే, రంగనాయకమ్మ గారు  తన చెప్పిన మాట మీదే నిలబడ్డారు...ఇన్నేళ్ళూ!

చివరికి-  38 సంవత్సరాల  తర్వాత.. పాఠకుల వాదనే, వారి  అభీష్టమే నెగ్గింది! ‘కృష్ణవేణి’ పునర్ముద్రణకు సమ్మతించారామె.

అందుకే ... ‘మాట తప్పాను’  అని తాజా పుస్తకం కవర్ పేజీ పైనే ప్రకటించారు.

‘‘.. కానీ  ఇప్పుడు  ఇందులో (తాజా ముద్రణలో ) అనేక విమర్శలు చేర్చాను కాబట్టి, దీనివల్ల పాఠకులకు మేలే గానీ హాని లేదు. ఈ కథలో, పరిశీలించి నేర్చుకోవలసిన విషయాలు, చాలా ఉన్నాయి. ఆ అవసరం కోసమే నా మాట తప్పాను’’  అని ముందుమాటలో వివరించారామె.


1964లో వచ్చిన ఎడిషన్  ముఖచిత్రం


తొలి నవల ఇదే!

రంగనాయకమ్మ గారు రాసిన తొలి నవల ‘కృష్ణవేణి’. పందొమ్మిది ఏళ్ళ వయసులో 1959లో ఆమె ఈ నవల   రాశారు. 1960లో  ఆంధ్రప్రభ వారపత్రికలో ఇది సీరియల్ గా వచ్చినపుడు ఎంతో ఆదరణ పొందింది. వారం వారం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసి మరీ  చదివారు.







ఇది 1974 నాటి ముఖచిత్రం


1979లో వచ్చిన ఎడిషన్   ముఖచిత్రం

  
  ‘కృష్ణవేణి నవల ప్రచురితమవుతున్న రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థులు పత్రిక కాపీల కోసం వాల్తేరు స్టేషన్ కి పరుగెత్తేవార’ని  పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఓచోట రాశారు.

1961లో ఈ నవల తొలిసారి  పుస్తకంగా వచ్చింది. తర్వాత ఆపేసేవరకూ రెండు మూడేళ్ళ కోసారి పునర్ముద్రణ అవుతూ వచ్చింది.

‘‘ఈ కథ అంటే నాకు మొదటి నించీ ఇష్టమూ, భయమూ కూడా’’ అన్న రంగనాయకమ్మ గారే  ‘‘.. ఈ పుస్తకం అంటే ఇప్పుడు భయం తగ్గింది’’  అని కూడా  అంటున్నారు.

ఎందుకంటే...

నేనెందుకులెండి  చెప్పటం! పుస్తకం చదివేటప్పుడు మీకెటూ  తెలుస్తుందిగా!:)

ఈ  నవలను ఈ-బుక్ గా కినిగెలో చదవాలంటే...  లింకు-
 http://kinige.com/kbook.php?id=933&name=Krishnaveni

తాజా కలం: (30.8.10) 
ఈ నవల గురించి నిన్నటి ఈనాడు ఆదివారం మ్యాగజీన్లో సమీక్ష వచ్చింది. చూడండి...